MohanPublications Print Books Online store clik Here Devullu.com

కె.జె.ఏసుదాసు_K.J.Yesudas




సంగీతం ఓ మహాసాగరం
అందులో కొంత ప్రయాణమే చేశా
-కేజే ఏసుదాస్‌

చెవులు వినే పాటలు అందరూ పాడితే... మనసు వినే పాటల్ని కొందరే పాడతారు... అలాంటివారిలో ఏసుదాస్‌ ఒకరు. స్వరం ఆయన గొంతులో సుతిమెత్తనై, మృదుమధురమై మదిలో చెరగని ముద్ర వేస్తుంది. ‘ఈనాడు సినిమా’కు ఆయన ఇచ్చిన ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ నుంచి ఆయన మనోభావాల సుమమాల ఇది...
తొలి పాట అనుభవం...: చెన్నైలోని భరణి స్టూడియోలో 1961లో తొలి పాట పాడిన అనుభవం నా మదిలో ఇంకా తాజాగానే ఉంది. ‘కాల్‌ పాడుదల్‌’ అనే మలయాళ చిత్రం కోసం ‘కానంబు... నానో కారెరుంబు..’ పాటను పాడాలి. గాయకుడు కావాలనే తపన, తొలి పాట అనే భయం... రెండూ నాలో పోటీపడుతున్నాయి. అందులోనూ ఆరోజు నాకు జ్వరం కూడా... అయినా నా స్వరం వినిపించా. మొదట వాళ్లకు నచ్చలేదు. ఆ విషయాన్ని గ్రహించాను. ఏం చేయాలి? ఎన్నో కష్టాలు పడి చదువుకుని స్వరాలు నేర్చుకున్నవాడిని. ఫీజు కట్టడానికి సైతం డబ్బులు లేని పరిస్థితులను దాటుకుని ఎలాగో విద్వాన్‌ కోర్సు పూర్తి చేసినవాణ్ని. ఆ క్షణంలో ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో దర్శకుడికి కావల్సినట్టు పాడా. అదే నాకు తొలి విజయాన్ని అందించింది. నా తొలి పాట ప్రముఖ పాటల రచయిత నారాయణ గురుస్వామి రాసిన తత్వం. జాతి, మత భేదం, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు... ఇలాంటివి ఉండకూడదని చాటే పాట అది. భిన్నత్వంలో ఏకత్వానికి దర్పణం పట్టే ఆ పాటను పాడడం నా అదృష్టం అనుకుంటా. సాధించింది కొంతే...: ఇన్నేళ్ల నా స్వర ప్రయాణంలో ఏదో సాధించానని అంటున్నారు. కానీ సంగీతం ఓ మహా సాగరం. అందులో కొంత దూరమే ప్రయాణం చేశా. ఈ గుర్తింపు దేవుని అనుగ్రహం. ఆ అదృష్టం నాకు దక్కడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నా గురువులు, దేవుళ్లు, అవకాశాలు ఇచ్చిన సంగీత దర్శకులే ఈ ఘనతకు కారకులు. వారందరికీ ధన్యవాదాలు.
అనుభవాలే పాఠాలు...: కష్టసుఖాలను జీర్ణించుకోవడం దేవుడు నాకిచ్చిన వరం. కష్టాలు ప్రతి ఒక్కరికీ తప్పవు. వాటన్నింటినీ సమానంగా చూసేవాడిని. అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయి.
శైలి ముఖ్యం...: ప్రతి గాయకుడికీ ఒక్కో శైలి తప్పకుండా ఉండాలి. శీర్గాలి గోవిందరాజన్‌, టీఎం సౌందరరాజన్‌, ఘంటసాల... ఇలా ఎవరిని తల్చుకున్నా వారి పాటలు కూడా గుర్తుకు వస్తాయి. నేను మహ్మద్‌ రఫీ శిష్యుడిని. ఆయన నుంచి ఎన్నో అంశాలు నేర్చుకున్నా. కానీ అనుకరించలేదు.
ఇప్పటికీ విద్యార్థినే!
ఇప్పటికీ తాను ఓ విద్యార్థినేనని, ఏదో ఒక కీర్తన, రాగం గురించి మళ్లీ మళ్లీ నేర్చుకుంటూనే ఉంటానని ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ తెలిపారు. పద్మ విభూషణ్‌ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మవిభూషణ్‌ దేవుడి కృపతో వచ్చిందని బలంగా నమ్ముతున్నానని తెలిపారు. ఈ తరహా అవార్డులను తాను ఏనాడూ ఆశించలేదని, రావాలంటూ ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. ‘మూడ మూడ రోగం.. పాడ పాడ రాగం’ (దాచేకొద్ది రోగం.. పాడేకొద్ది రాగం) అని పెద్దలు చెప్పారని, అది అక్షరసత్యమని పేర్కొన్నార


ఆయన పాట ‘స్వరరాగ గంగా ప్రవాహం’
ఇంటర్నెట్‌డెస్క్‌: గాయ‌కుడు.. మ‌హా గాయ‌కుడు..మ‌హా మ‌ధుర‌గాయ‌కుడు.. అనితర సాధ్య‌మైన గాయ‌కుడు. ఆయ‌న క‌దిలి వ‌స్తుంటే రాగాల‌ స‌వ్వ‌డి వినిపిస్తుంది. 17 భాష‌ల్లో 50వేల‌కు పైగా పాట‌ల‌ను పాడిన ప‌ద్మ‌భూష‌ణుడు కె.జె.ఏసుదాసు. ఇప్పుడు మ‌రో అరుదైన పుర‌స్కారం ఆయ‌న‌ను వ‌రించింది. భార‌త అత్యున్న‌త పుర‌స్కారాల్లో ఒక‌టైన ప‌ద్మ‌విభూష‌ణ్‌ అవార్డుకు ప్ర‌భుత్వం ఆయ‌న పేరును ప‌క్ర‌టించింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌పై ప్ర‌త్యేక క‌థ‌నం
అవమానాలు.. ఆయన్ని రాటుదేల్చాయి. పేదరికపు పరిహాసాలు.. ఆయనకు లక్ష్యనిర్దేశం చేశాయి. ఆ అనుభవ పాఠాలతోనే ఆయన ‘స్వర చక్రవర్తి’ అయ్యారు. ‘నీ గొంతు.. పాటకు పనికిరాద’న్న వాళ్లకు పాటతోనే సమాధానం చెప్పారు. ఆయనే.. భక్తి పాట, సినిమా పాట.. ఏ పాటకైనా ప్రాణం పోసే ఏసుదాసు. ఏ భాషలో పాడినా అది ఆయన మాతృభాషేమో అన్నంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. జీవితాన్ని సంగీతానికి అంకితమిచ్చిన గాన గంధర్వుడు ఆయన. ఇటు శాస్త్రీయ సంగీతం.. అటు సినీ సంగీతం.. ఏదైనా ఎదలోతుల్లో మధురమైన ముద్ర వేయడం ఆ స్వరం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
‘నిరీక్షణ’లో ‘చుక్కల్లో..’, ‘మేఘసందేశం’లో ‘ఆకాశదేశాన..’, ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో ‘అందమైన వెన్నెలలోన..’, ‘అల్లుడుగారు’లో ‘ముద్దబంతి పూవులో..’, ‘పెదరాయుడు’లో ‘కదిలే కాలమా..’ ఇలా ఆయన పాడిన పాటలు ఎన్నివిన్నా ఆ కంఠంలోని మాధుర్యం ఇట్టే ఆకట్టుకుంటుంది. ‘హరివరాసనం’ అంటూ ఆయన పాట పాడిన తర్వాతే హరిహరసుతుడు అయ్యప్పస్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. అంతటి గొప్ప గౌరవం దక్కించుకున్నారు ఏసుదాసు.
ఏసుదాసు 1940 జనవరి 10న అగస్టీన్‌ జొసెఫ్‌, ఆలిస్‌ కుట్టి అనే రోమెన్‌ కేథలిక్‌ దంపతులకు కేరళ రాష్ట్రంలో ఫోర్ట్‌ కొచి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, కళాకారులు కూడా. దీంతో ఏసుదాసు బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ అదే తన జీవిత గమ్యంగా చేసుకుని ఆర్‌.ఎల్‌.వి మ్యూజిక్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత స్వాతి తిరునాళ్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ తిరువనంతపురంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు, శ్రీ కె.ఆర్‌. కుమారస్వామి దగ్గర శిష్యరికం చేస్తూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆ కాలేజీలో శిక్షణ సగంలో ఆగిపోయినా చెంబై వైద్యనాథ భాగవతార్‌ వద్ద శిక్షణ పొందుతూ ఉండేవారు. తర్వాత ఆర్‌.ఎల్‌.వి మ్యూజిక్‌ అకాడమీలో గానభూషణం కోర్సును పూర్తి చేశారు.
తర్వాత వూర్లల్లో సంగీత కచేరీలు పెట్టేవారు. 1961 నవంబర్‌ 14న ఏసుదాసు మొదటి ప్లే బ్యాక్‌ రికార్డింగ్‌ మలయాళంలో జరిగింది. ఆ పాట బాగా ప్రాచుర్యం పొంది.. అప్పటి నుంచి శాస్త్రీయ సంగీత కళాకారుడిగా ఎంత ప్రతిభ కనబరుస్తూ ఎదిగారు. అంతేకాకుండా సినీ సంగీత జగత్తులో కూడా తన మధురమైన గాత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో పాటలు పాడారు. మనదేశ భాషల్లోనే కాక మలేషియన్‌, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఆంగ్ల భాషలలో కూడా పాడి శ్రోతలను మెప్పించారు.
ఏసుదాసు ప్రతిభకుగానూ పలు అవార్డులు లభించాయి. 1975లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, 2002లో ప‌ద్మ భూష‌ణ్‌‌ బిరుదుతో ఆయ‌న్ను గౌర‌వించింది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆయన పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులతో సత్కరాలు అందుకున్నారు. జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అత్యధికంగా ఏడుసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి ఆయనే. కేరళ ప్రభుత్వం నుంచి 24 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదీ ఓ రికార్డు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 8 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 6 సార్లు, పశ్చిమ్‌బంగా ప్రభుత్వం నుంచి ఒకసారి ఆయన ఉత్తమ గాయకుడి అవార్డులు పొందారు. పలు చిత్రాల్లోనూ నటించారు. ‘ప్రస్తుతం సినిమా పాటల స్పీడూ పెరిగింది, స్టైలూ మారింది’ అంటారు ఏసుదాసు. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్నా.. ఆయన కంఠం నుంచి జాలు వారిన ఆ ‘స్వరరాగ గంగా ప్రవాహం’ ఎప్పటికీ పొంగిపొర్లుతూనే ఉంటుంది.
ఆయన పాట స్వరరాగ గంగా ప్రవాహం..ఆయన పాడితే భక్తిభావ సమ్మోహనం..శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం పాటేదైన ఆయన గొంతులో చేరితే అమృతమంత మధురం. ఆ పాటలు వింటే ఎదలనిండా అనందతాండవం. కర్ణాటక, సీని సంగీతాన్ని ఎల్లలు దాటించి హిమగిరులంతఎత్తులో నిలిపిన స్వర చక్రవర్తి.పాటను ప్రేమించి, పాటనుశ్వాసించి, పాటనే శాసించగలస్థాయికి ఎదిగిన గాన గంధర్వుడు యేసుదాసు. 

యేసుదాసు అసలు పేరు కట్టశ్శేరి జోసఫ్ యేసుదాసు. 1940 జనవరి 10న ఆగస్టీన్ జోసెఫ్, ఆలిస్‌కుట్టి అనే రోమన్ కేథలిక్ కుటుంబంలో కేరళ రాష్ట్రంలోని పోర్ట్ కొచి అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసులు. నటులు కూడా. తల్లి కూడా చర్చిలో పాటలు పాడేది. దీంతో యేసుదాసు బాల్యం నుంచే సంగీతం నేర్చుకున్నారు. ఆర్.ఎల్.వి మ్యూజిక్ అకాడమీ, స్వాతి తిరునాళ్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో శిక్షణ తీసుకున్నారు. తిరువనంతపురంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు, కె.ఆర్. కుమారస్వామి దగ్గర శిష్యరికం చేసి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. గానభూషణం కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆయన గ్రామాల్లో అనేక కచేరీలు నిర్వహించారు.
1961 నవంబర్ 14న యేసుదాసు మొదటి ప్లేబ్యాక్ రికార్డింగ్ మలయాళంలో జరిగింది. ఆయన పాడిన తొలిపాటనే ఎంతో ప్రాచుర్యం పొందడంతో శాస్త్రీయ సంగీత కళాకారుడిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత సినీ సంగీత సామ్రాజ్యంలోకి అడుగిడి తన మధురగాత్రంతో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలతో పాటు మలేషియన్, రష్యన్, అరబిక్, లాటిన్, ఆంగ్లం ఇలా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత యేసుదాసుది.
నీ గొంతు పాటకు పనికిరాదన్న అవమానాలు, పేదరికం ఆర్థిక ఇబ్బందుల మూలంగా కాలేజీ శిక్షణ మధ్యలో ఆగిపోయినా ఆయన పాట మాత్రం ఆపలేదు. అనుభవం నేర్పిన పాఠాలు పాటల పూదోటలో స్వరానికి స్వర్ణకంకణం తొడిగేలా చేశాయి.

ఆకాశదేశాన, ఆశాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం అంటూ ప్రియురాలు దూరమైన వేళ ప్రియుడు విరహాన్ని తన చెలికి చేరవేయమంటూ మబ్బుని వేడుకుంటూ మేఘాలతో సందేశాన్ని పంపుతున్నానంటాడు. మేఘసందేశం సినిమా కోసం వేటూరి రాసిన గీతానికి తన స్వరంతో ప్రాణప్రతిష్ట చేసిన గాయకుడు యేసుదాసు.

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుకా కళ్లార చూడవమ్మా
పెదరాయుడు సినిమాలోని ఈ పాట ప్రతి మహిళతో కన్నీరు పెట్టించింది. అందరికీ దూరంగా ఉంటున్న పెదరాయుడి భార్యకు శ్రీమంతం సమయంలో పాడే పాట. ఎంతో ఘనంగా జరగాల్సిన శ్రీమంతం ఒంటరిగా జరుగుతున్నా ఆ లోటు భార్యకు తెలియకుండా ఉండడం కోసం లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీకన్నీ అంటూ ఓదార్చుతాడు. నిగూడమైన భావంతో కూడిన ఈ పాట యేసుదాసు గొంతులో చేరి మరింత మధురంగా మారిందంటే అతిశయోక్తికాదు.
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచి రావే సరిగమలా అంటూ అసెంబ్లీ రౌడి చిత్రం కోసం యేసుదాసు పాడిన పాట. ప్రేయసిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ ప్రియుడు పాడుకునే సందర్భంలోనిది.
1991లో వచ్చిన రౌడీగారి పెళ్లాం చిత్రం కోసం ఆయన పాడిన కుంతీకుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం అంటూ భావోద్వేకంగా పాడారాయన. 

ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది


ఎవరాపిన ఆగని సంధ్యారాగమిది అంటూ కుంతీపుత్రుడు (1993) చిత్రం కోసం ఆయన పాడిన పాటకూడా శ్రోతల అభిమానాన్ని చూరగొన్నది. మోహన్‌బాబు తన లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించి తను నటించే ప్రతి చిత్రంలో కనీసం ఒక్కపాటన్నా యేసుదాసుతో పాడించుకునేవారు.

సొగసు చూడ తరమా 
సొగసు చూడతరమా నీ సొగసు చూడ తరమా!
సొగసు చూడతరమా సినిమా కోసం పాడిన పాట. అమ్మాయి నడుమును విల్లు (బాణం)కు కట్టే నారి (దారం)తో పోలుస్తూ నారి వంగినట్లు అందంగా ఉందంటూ సిరివెన్నెల రాసిన గీతాన్ని యేసుదాసు అంతే అద్భుతంగా పాడి మెప్పించారు.
యేసుదాసు ప్రతి ఏడాది మార్చి 1న కేరళలోని సెయింట్ జోసెఫ్ చర్చికి తప్పకుండా వెళ్తారు. యేసుదాసు చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి ఆయన తండ్రి మార్చి 31న ఆ చర్చిలో పాటలు పాడేవారట. అందుకే తన తండ్రి పరంపరను కొనసాగించడం కోసం ఆయన ఎక్కడ ఉనా మార్చి 31న మాత్రం తప్పకుండా ఆ చర్చికి వెళ్లి పాటలు పాడుతారు. అలాగే ఆయన పుట్టిన రోజైన జనవరి 10న మూకాంబికా తల్లి దగ్గర కచేరీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆడంబరాలకు పోకుండా ఆ రోజు తప్పకుండా కచ్చేరీ చేయడం ఆయనకు అలవాటు. అలాగే తిరువాయ్యురు ఉత్సవాలు, చెంబైస్వామి ఉత్సవాలకు తప్పకుండా కచేరిచేయడాన్ని అనేక సంవత్సరాలుగా పాటిస్తున్నారు. తన భార్య ప్రభ తొలికాన్పు సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మూకాంబికాదేవిని దర్శించుకున్నట్లు ఆప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుని కచేరి నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక సందర్భంలో చెప్పారు.
సంగీత చక్రవర్తులైన మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భాగవతార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణలను యేసుదాసు బాగా అభిమానిస్తారు. యేసుదాసు రోమన్ కేథలిక్ అయినప్పటికీ నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని గాఢంగా విశ్వసిస్తాడు. అందుకే చిన్నతనం నుంచి కూడా తన తోటివారితో అలాగే మెలిగేవారు. అందుకే ఉడుపి, శృంగేరి, రాఘవేంద్ర మఠాలకు ఆస్థాన విద్వాన్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు షిరిడీసాయి, అయ్యప్పస్వాములకు గీతాలు ఆలపించి తన సర్వమత సమానత్వాన్ని చాటుకున్నారు.

హే పాండురంగా! హే పండరి నాథా!
శరణం శరణం శరణం
సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం అంటూ ఆయన స్వరమెత్తితే కనులముందు బాబా సాక్షాత్కారించినంత హాయిగా ఉంటుందంటే అతిశయోక్తికాదు. 
యేసుదాసు పాటలు ఎన్ని విన్నా ఆ కంఠంలోని మాధుర్యం ఆకట్టుకుంటూనే ఉంటుంది.
యేసుదాసు ప్రతిభకుగానూ పలు అవార్డులు లభించాయి. 1975లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్‌లతో గౌరవించారు.

పురస్కారాలు, బిరుదులు


డాక్టరేట్ : అన్నామలై 
విశ్వవిద్యాలయం:1989
డి.లిట్-కేరళ 
విశ్వవిద్యాలయం: 2003
ఆస్థాన గాయక : కేరళప్రభుత్వం
సంగీత సాగరము: 1989
సంగీత చక్రవర్తి: 1988
సంగీతరాజా: 1974
సంగీత రత్న: స్వాతిరత్నము
సప్తగిరి సంగీత విద్వాన్మని: 2002
భక్తి సంగీత గీతా శిరోమణి: 2002
జాతీయ పురస్కారాలు
1972 అచనుమ్ బప్పయుమ్ మలయాళం
1973 గాయత్రి మలయాళం
1976 చిత్‌చోర్ హిందీ
1982 మేఘసందేశం తెలుగు
1987 ఉన్నికలె ఒరు కథా ప్రాయం 
మలయాళం
1991 భారతం మలయాళం
1993 సోపానం మలయాళం
ఉత్తమ నేపథ్య గాయకుడు (నంది)
2006 గంగ వెళ్లిపోతున్నావా
1990 అల్లుడుగారు ముద్దబంతి నవ్వులో
1988 జీవనజ్యోతి
1982 మేఘసందేశం సిగలో 

చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే ఎతికానే
పూసిందే ఆ పూల మాను నీ దీపంలో 
కాగిందే నా పేద గుండె నీ తాపంలో.....
1981లో వచ్చిన నిరీక్షణ చిత్రం కోసం యేసుదాసు గానం చేసిన అద్భుత గీతం. ఆయన ఏ భాషలో పాడినా అది ఆయన మాతృభాషేమో అన్నంత స్వచ్ఛంగా, స్పష్టంగా, మధురంగా పాడడం యేసుదాసుకే చెల్లింది.

ముద్దబంతి నవ్వులో మూగభాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు మరో అద్భుతమైన పాట. తను ప్రేమించిన అమ్మాయి మూగది అని తెలిసినా ప్రేమకు అవేమి అడ్డుకావంటూ ప్రేమికుడు పాడేపాట. యేసుదాసు గొంతులో చేరి ప్రేమలు కురిపించింది. ఇదే చిత్రంలో 
నగుమోము గనలేని నా జాలి దెలిసి
నన్ను బ్రోవగ రాద శ్రీ రఘువర తో పాటు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు అనే రెండు త్యాగరాజ కృతులను కూడా యేసుదాసే పాడారు.

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
హరిహరాసనం స్వామి విశ్వమోహనం
హరితదీశ్వరం స్వామి ఆరాధ్యపాదుకం
హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం
హరిహరాసనం స్వామి దేవమాశ్రయే 

అంటూ ఆయన పాడిన తర్వాతే అయ్యప్పస్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. అంతటి గొప్ప గౌరవం దక్కించుకున్నారు యేసుదాసు. యేసుదాసుకు భార్య ప్రభ, ముగ్గురు పిల్లలు వినోద్, విజయ్, విశాల్‌లు ఉన్నారు. విజయ్ యేసుదాసు కూడా మంచి సంగీత దర్శకుడు. ఆయన ఇప్పటికే కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నేపథ్య గాయకునిగా ఆవార్డు అందుకున్నారు.



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list