MohanPublications Print Books Online store clik Here Devullu.com

విజయవాడ కనకదుర్గమ్మ_Vijayawada Kanaka Durgamma


విజయవాడ కనకదుర్గమ్మ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.

ఇంద్రకీలాద్రి స్థలపురాణం

త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది.
పరిసరాల్లోని ఉపాలయాలు: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.
దర్శన సమయాలు
* వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోగం సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.
* ఆలయంలో చేసే ప్రధాన పూజలు: ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
* ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు.
* మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు.
* రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.
దేవస్థానంలో నిర్వహించే పూజలు: ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు.
అన్నప్రసాద వితరణ: 1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
రవాణా సౌకర్యాలు: విజయవాడ.. రైలు.. రోడ్డు.. విమాన మార్గాల్లో అనుసంధానమై వుంది. కోల్‌కతా- చెన్నై జాతీయరహదారిపై ఉన్న నేపథ్యంలో విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గంలో చేరడం చాలా సులభం. ఆపై ఇక్కడి పండిట్‌ నెహ్రూ సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇంద్రకీలాద్రిపైకి ప్రతి 10 నిమిషాలకో సిటీ/ మెట్రో బస్సు చొప్పున ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు విస్తృతంగా లభిస్తాయి. గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సుదూర ప్రాంతాల వారు సులభంగా విజయవాడ-ఇంద్రకీలాద్రిని చేరవచ్చు.
వసతి సౌకర్యం: ఇంద్రకీలాద్రిపై మేడపాటి గెస్ట్‌హౌస్‌.. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం (ఏసీ.. నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో కేటాయిస్తారు. ఇవి కాకుండా విజయవాడ నగరంలో పలు ప్రభుత్వ.. ప్రైవేటు వసతిగృహాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వసతి గురించి భక్తులు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

దుర్గమ్మ మాయమ్మా...
శ్రీ శక్తి పీఠంగా పేరుగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ గుడి దేశంలోని మహిమాన్విత దుర్గమ్మ ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర కృష్ణానదీ తీరంలో కొలువై ఉన్న ఆ తల్లిని దర్శించినంతనే దుర్గతులన్నీ దూరమవుతాయని నమ్ముతారు భక్తులు.
దుర్గమ్మ పేరులో ‘ద’ కారం దైత్యనాశకం. ‘ఉ’ కారం విఘ్న నాశకం. ‘ర్‌’ కారం రోగ నాశకం. ‘గ’ కారం పాప నాశకం. ‘ఆ’ భయనాశక వాచకం. అందుకే, ఆ అమ్మ నామాన్ని పలికినా స్మరించినా సర్వపాపాలూ నశిస్తాయనేది సాక్షాత్తూ పరమ శివుడు చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.
పూర్వం పర్వత రూపుడైన కీలుడు అనే యక్షుడు దుర్గమ్మ కృప కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చిన అమ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మంది. జగదంబను ఎప్పుడూ తన హృదయ కుహరంలో కొలువుండమని కోరాడు కీలుడు. తర్వాతి కాలంలో దుర్గమాసురుడిని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం కీలాద్రిపై స్వయంభూగా వెలసింది. అప్పుడు ఇంద్రాది దేవతలు శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాచరించి, స్వర్ణమణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారిని శాంతించమని ప్రణమిల్లారు. నాటి నుంచి కీలాద్రి ఇంద్ర కీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించి అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండడంతో కనకదుర్గమ్మగా పేరుగాంచింది.
మల్లేశ్వర సమేత దుర్గమ్మ 
అమ్మవారి ఆలయం పక్కనే పరమేశ్వరుడిని కూడా కొలువుంచాలని భావించిన బ్రహ్మాది దేవతలు శతాశ్వమేధయాగం చేసి శివుడిని మెప్పించారు. వారి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో స్వయంభూగా ఇంద్రకీలాద్రిపై వెలిశాడు. బ్రహ్మాదిదేవతలు పరమేశ్వరుడిని మల్లి, కదంబ పుష్పాలతో పూజించడంతో అప్పట్నుంచి మల్లేశ్వరుడిగా వెలుగొందుతున్నాడు.
తర్వాతి కాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆది శంకరాచార్యులు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేసేందుకు మహోగ్ర శక్తులను శ్రీ చక్రంలో నిక్షిప్తం చేసి, అమ్మవారి పాదాల చెంత స్థాపన చేశారు. అప్పట్నుంచి దుర్గమ్మ శాంతి స్వరూపిణిగా మారి భక్తులకు దర్శనమిస్తోంది. పరమేశ్వరుని జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండడాన్ని గుర్తించిన ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఆలయానికి ఉత్తరభాగంలో పునఃప్రతిష్ఠించారు. అప్పట్నుంచి ఇంద్ర కీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధిచెందింది. ఇంద్రకీలాద్రిపై ఉన్న నవ దుర్గల విగ్రహాలు ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను చేకూరుస్తాయి. కొండమీద ఉన్న అనేక రకాల వృక్షాలను కూడా దేవతా స్వరూపాలుగా కొలుస్తారు.
ఫల్గుణ క్షేత్రం ఇదే 
అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడిని మెప్పించేందుకు ఇంద్రకీలాద్రిపై ఘోర తపస్సు చేశాడు. అతడిని పరీక్షించేందుకు పరమేశ్వరుడు కిరాతుడి రూపంలో వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేశాడు. అనంతరం అతడి భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇవ్వడంతో అర్జునుడు కురుక్షేత్రంలో విజయుడయ్యాడు. అందుకే, ఈ క్షేత్రానికి ఫల్గుణ క్షేత్రం, విజయపురి అనే పేర్లు కూడా వచ్చాయనేది పురాణ కథనం. ఇంద్రకీలాద్రిపై అర్జునుడు తపస్సు చేసినట్టుగా చెబుతున్న స్థలం నేటికీ కనిపిస్తుంది. తాజాగా ఇంద్రకీలాద్రి బృహత్తర ప్రణాళికలో భాగంగా ఇక్కడికీ భక్తులు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం వల్ల విజయవాడ అనే పేరొచ్చిందన్నది మరో ఇతిహాసం.
పంచ ప్రకృతి మహా స్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. ఇక, ఆ అమ్మవారు కృష్ణుడూ పరమేశ్వరుడి అంశలతో ప్రవహించే పవిత్ర కృష్ణవేణీ నది ఒడ్డున వెలసింది కనుక ఈ క్షేత్రాన్ని దర్శించినంతనే కష్టాలు తీరతాయనేది పురాణ ప్రవచనం. ముగ్గురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతోన్న విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకునేందుకు ఏటా రెండు కోట్ల మందికి పైగా భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. దసరా సమయంలో వైభవంగా నిర్వహించే శరన్నవరాత్రోత్సవాలకు 15లక్షల మంది వరకూ భక్తులు వస్తుంటారు. భవానీ దీక్షల సమయంలోనూ పది లక్షలమంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. నమ్ముకున్న భక్తుల కోర్కెలు తీర్చే ఆశ్రిత మందారవల్లిగా కనక దుర్గమ్మను కొలుస్తారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు, మల్లేశ్వర స్వామి ఆలయాలతో పాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయాలున్నాయి.
అన్న ప్రసాదం... 
1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇక్కడికొచ్చిన భక్తులు భోజనం చెయ్యొచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list