MohanPublications Print Books Online store clik Here Devullu.com

శయన ఏకాదశి_Vaikuntha Ekadash



తొలి ఏకాదశి ప్రత్యేకత

వ‌ర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల త‌డిసి, చెరువులు నిండే కాలాన్ని మ‌న పెద్దలు పొలం ప‌నుల‌కు అనువైన స‌మ‌యంగా భావించారు. అందుక‌ని ఆషాఢ‌మాసంలో వ‌చ్చే మొద‌టి ఏకాద‌శిని `తొలి ఏకాద‌శి`గా పేర్కొన్నారు. ఆ రోజున పాలేళ్లని పిలిచి, పొలం పనులని మొదలుపెట్టించేవారు. మ‌రి ఏద‌న్నా సంద‌ర్భాన్ని తీపితో ఆరంభించడం మ‌న అల‌వాటు క‌దా! అందుక‌ని ఆ కాలంలో తేలిక‌గా దొరికే పేలాల‌పిండిని బెల్లంతో క‌లుపుకుని తింటారు. పైగా పేలాలపిండి తినడం వల్ల, ఈ కాలంలో దాడిచేసే కఫసంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతారు.

ఈ ఏకాద‌శిని తొలి అన‌డంలో మ‌రో విశేషం ఉంది. తొలి ఏకాద‌శినుంచే హిందువుల పండుగ‌ల‌న్నీ ప్రారంభం అవుతాయి. వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం, శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, వినాయ‌క‌చ‌వితి.... ఇలా ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కీ ఏదో ఒక ముఖ్యపండుగ వ‌స్తూనే ఉంటుంది. అసలు తొలిఏకాదశినే తొలిపండుగ‌గా కూడా చెప్పుకోవ్చు. సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు.
ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాలపాటు పాలకడలిపై యోగనిద్రలోకి జారుకుంటాడని నమ్మకం. అందుకనే ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి రాత్రివేళలు మరింత పెరుగుతాయి కాబట్టి, వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించడ సబబే! ఇలా నిదురించిన విష్ణుమూర్తి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు వచ్చే ఉత్థాన ఏకాదశి నాడు మేలుకుని తన భక్తులకు దర్శనమిస్తాడట. ఈ నాలుగుమాసాల పాటూ కొందరు చాతుర్మాస వ్రతం అనే దీక్షను పాటిస్తారు.
ఇక ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకురాక మానదు. ఆషాఢమాసంలో వచ్చిపడే వర్షాలతోనూ, పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది. ఇక రాత్రివేళలు పెరిగిపోవడం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో అటు మనసునీ, ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే ఉపవాసం. కనీసం పక్షం రోజులకి ఒకసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. కాబట్టి ప్రతి పదిహేను రోజులకి ఓసారి ఉపావాసం చేసే అలవాటుని మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశే సరైన సమయం! మనం ఏదో సాధారణమైన పండుగగా తీసిపారేసే తొలి ఏకాదశి వెనుక ఇన్ని విశేషాలున్నాయన్నమాట!!!


ముక్కోటిఏకాదశి

తొలి ఏకాదశి
  ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.
సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.
పురాణగాథ ప్రకారం- యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.
కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకారపూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో, ‘సింహవతి’ అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ని సంహరించింది. అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకొమ్మన్నాడు. ఆమె- ఏకాదశి తిథిగా, విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.
దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు.
అలాగే ‘సతీ సక్కుబాయి’ తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి, మహావిష్ణువులో ఐక్యం చెందిందట.
దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు.
‘రుక్మాంగదుడు’ స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

++++++++++++++++++++++++

ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం.
ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని ‘స్మృతి పురాణం’ చెబుతోంది.
ఈ వర్షరుతువు ఆరంభంలో, సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నదీ పండుగ సంకేతమే.
ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరిస్తుంది. అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది.
ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.
ప్రసన్నత, శాంతి, సాత్విక చింతన, దానధర్మాలు, జ్ఞాన పిపాసలకు తొలి ఏకాదశి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. భగవన్నామస్మరణ ద్వారా మోక్షాసక్తిని పెంపొందింపజేస్తుంది.  
 మంచి పని తలపెట్టగానే, దగ్గర్లో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించడం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా ఇరవై నాలుగు ఏకాదశి తిథులుంటే, అన్నీ పుణ్య తిథులే కావడం విశేషం! ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత.

    హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో, ఏకాదశిని ‘హరి వాసరం’గా వ్యవహరిస్తారు. ప్రతి హరి వాసరానికీ ఒక్కో ప్రత్యేక వ్యవహార నామం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ‘ప్రథమ ఏకాదశి’ అని పేరు. దానికే ‘శయన ఏకాదశి’ అనే మరో పేరు పురాణ గాథ అనుసరించి ఏర్పడింది. ఆషాఢ బహుళ ఏకాదశి- కామిక ఏకాదశి. శ్రావణ మాసంలో మొదటిది పుత్ర ఏకాదశి (లలిత ఏకాదశి అంటారు). రెండోది, అజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి.

   ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని పిలుస్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం మోక్ష ద్వారమని ప్రతీతి. అది ఆ ఒక్క రోజే తెరుచుకుంటుంది. దాన్ని ‘వైకుంఠ ద్వారం’ అంటారు. తిరుమలలో వైకుంఠద్వార ప్రవేశానికి భక్తులు ఉవ్విళ్లూరుతారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఏకాదశి కనుక, దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది.

   వైకుంఠ ద్వారం నుంచి దర్శనానికి- భక్తులే కాదు, మూడు కోట్లమంది దేవతలూ తహతహలాడతారని చెబుతారు. అందువల్ల దీనికి ‘ముక్కోటి’ అనే పేరు సార్థకమైంది. ముక్కోటి ఏకాదశినాటి విధివిధానాలను, ఏకాదశి వ్రత నియమాలను పాటించినవారికి స్వర్గసుఖప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం కారణంగా దీనికి ‘సౌఖ్యద ఏకాదశి’గా పేరుంది. మోక్షప్రాప్తినిస్తుందనే అర్థంలో మోక్ష‘ద’ ఏకాదశిగానూ సార్థక నామాలు ఏర్పడ్డాయి.

   వైఖానసుడు అనే రాజుకు తన తండ్రి నరకంలో యాతన పడుతున్న దృశ్యం కలలో కనిపించిందట. ముక్కోటి ఏకాదశినాడు ఆ రాజు దీక్ష స్వీకరించి, వ్రతం, ఉపవాసాది నియమాలు పాటించడం వల్ల ఆయన తండ్రికి మోక్షప్రాప్తి కలిగిందని పురాణ గాథ. ఆ కారణంగా దీనికి ‘మోక్ష్తెకాదశి’ అనే పేరు స్థిరపడిందంటారు.

   బ్రహ్మ నుదుటి నుంచి అకస్మాత్తుగా ఓ చెమటబొట్టు రాలి పడిందట. దాని నుంచి రాక్షసుడు జన్మించి, తనకో చోటు కల్పించాలని బ్రహ్మను కోరాడట. ఏకాదశినాటి అన్నం మెతుకుల్లో అతడికి బ్రహ్మ చోటు కల్పించాడంటారు. ఆనాటి నుంచి ఏకాదశి తిధిలో ఉపవాస నియమం ఏర్పడిందని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

  మానవుల కాలమానం లెక్కల్లోని మన ఆరునెలల కాలం, దేవతలకు ఒక పగలుతో సమానం. తక్కిన ఆరు నెలలూ దేవతలకు ఒక రాత్రి. ఆషాఢ మాసంలో, అంటే దక్షిణాయనంతో మొదలయ్యే చీకట్ల నుంచి దేవతలు విముక్తులై ఈ ఏకాదశితో వెలుతురులోకి ప్రవేశిస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలానికి దీన్ని శుభారంభ తిథిగా భావిస్తారు.

   ఏకాదశులన్నీ ప్రత్యేకమైనవే అయినా- విధివిధానాలు, పురాణ గాథలను అనుసరించి కొన్ని ఏకాదశులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాతుర్మాస్య దీక్షలకు ఆరంభదినం కాబట్టి, ఆషాఢమాస ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. యోగనిద్ర ముగించి శ్రీమహావిష్ణువు మేలుకుంటాడన్న గాథ ప్రకారం ‘కార్తికమాస ఉత్థాన ఏకాదశి’గా భావిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ధనుర్మాస ముక్కోటి ఏకాదశిని- ‘నిర్ణయ సింధువు’ వంటి గ్రంథాలు మరీ విశేషమైనవిగా వర్ణిస్తున్నాయి.

  ఇంతటి ఘనత వహించిన వైకుంఠ హరివాసరాన్ని ఉపవాస నియమంతో సాకారం చేసుకోవాలి. దాన్ని శ్రీవారి దివ్య పాదారవింద ‘చింతనామృత పాన విశేష శుద్ధ చిత్తం’తో సద్వినియోగం చేసుకోవడం మన వంతు!                                                                                                   - ఎర్రాప్రగడ రామకృష్ణ


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list