MohanPublications Print Books Online store clik Here Devullu.com

చెడును వాయిదా వెయ్యాలి- Bad, Decision, Transformation

చెడును వాయిదా వెయ్యాలి...
ఆత్మీయం
కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా పర్వదినాలలో చాలామంది కొత్త పనులకి శ్రీకారం చుడతారు. ‘ఇవాళ్టి నుంచి నేను అన్నీ నిజాలే చెప్పాలి’, ‘ఇతరులకు మంచి చేయలేకపోయినా, కనీసం చెడు చేయకూడదు’, ‘నా చెడు అలవాట్లన్నీ మానుకోవాలి...’ ఇలా చాలా నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని నిలబెట్టుకోవాలని ప్రమాణాలు చేస్తారు, మొక్కులు మొక్కుకుంటారు. అయితే, నిర్ణయాలు ఎంత ఆవేశంతో, తొందరపాటుగా తీసుకుంటారో... వాటిని మరచిపోవడంలోనూ అంతే ఆవేశం, తొందరపాటు చూపుతారు. ఒక నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడమంటే ఎంత కష్టమో అర్థం అయిన తరవాత నిర్ణయాలను గాలికి వదిలేస్తారు. తమ తమ అలవాట్లను, పంథాను మార్చుకోవడంలో విఫలమవుతుంటారు.
తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ఉండాలి. అప్పుడే అనుకున్న నిర్ణయం ఆచరణలో పెట్టగలుగుతాం. ‘మంచి చేయాలనుకున్నప్పుడు వెంటనే ప్రారంభించాలి, చెడు చేయాలనుకుంటే వాయిదా వేయాలి’ అని పౌరాణికులు ప్రవచిస్తున్నారు. ఎందుకంటే, రావణాసురుడు సముద్రంపై వార ధిని నిర్మించాలనుకున్నాడు కానీ వాయిదా వేశాడు. సీతమ్మను అపహరించాలనుకున్నాడు, వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు. అందుకే భ్రష్టుపట్టిపోయాడు. కాబట్టి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? మంచిని ఆ క్షణంలో ప్రారంభించడం వల్ల అందరూ సుఖశాంతులతో ఉంటారు. చెడును వాయిదా వేసుకోవటం వల్ల మనిషిలో రోజురోజుకీ చెడు ప్రభావం కొంతయినా తగ్గుముఖం పట్టి కొంతకాలానికి పరివర్తన వచ్చి చెడు చేయటం మానుకుంటారు. అందుకే నిర్ణయాలు చెడ్డవయినప్పుడు వాటిని వాయిదా వేయాలి.

ఇంటిప్స్‌
టొమాటో పేస్ట్‌ లేదా ఇంట్లో తయారుచేసుకునే సాస్‌లు మిగిలిపోతే పడేస్తుంటారు. ఇలా పదార్థాలను వృథా చేయకుండా ఐస్‌ట్రేలో సాస్‌ పోసి ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. వంటకాలలో కావల్సినప్పుడు వీటిని వాడుకోవచ్చు. (మరీ ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు) దూది ఉండను అరోమా ఆయిల్‌లో ముంచి గది షెల్ఫ్‌ మూలలో ఉంచాలి. సుగంధ పరిమళాలు గదిలో వ్యాపిస్తాయి.


ఒంటరి మహిళ ఒడిలో వరాల మూట
సర్వే
జీవితం.. మనిషిని ఒంటరిగా ఉంచదు.
ఉదయాన్నే సూర్యుడొచ్చి లేపుతాడు.
రాత్రవగానే నక్షత్రాలు పలకరిస్తాయి.
పక్షుల పరవశ రాగాలొచ్చి వాలిపోతాయి.
పూల పరిమళాలు మెత్తగా హత్తుకుంటాయి.
ఇవి మాత్రమే కాదు..
అనాథ బాలల నవ్వులూ ఉన్నాయి!
ఆ నవ్వులకు ఒడిపడుతున్న వారిలో ఇప్పుడు
మహిళలదే ముందడుగు.
‘ఒంటరి మహిళ ఈ సమాజంలో బతకడమే కష్టం.’ ఇటీవల సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే ఈ అభిప్రాయం మెల్లమెల్లగా దూరమవుతోందనిపిస్తోంది. ఒంటరి మహిళ తాను జీవించడంతోపాటు మరో అనాథ బిడ్డను దత్తు తీసుకొని ఆ బిడ్డకు తల్లిలా ప్రేమను పంచుతోంది. మంచి భవిష్యత్తును ఇవ్వగలదని నిరూపిస్తోంది. సమాజంలో వస్తున్న మార్పులకు ఇదో మంచి సూచిక. ఇటీవల భారత ప్రభుత్వ దత్తత గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.
రెండేళ్ల క్రితం అంటే 2015 ఆగస్టు నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా దత్తత కోరే తల్లిదండ్రుల వివరాల నమోదు తప్పనిసరి చేశారు. దీంట్లో భాగంగా 412 మంది ఒంటరి మహిళలు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీకి,, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ శాఖవారికి తమ వివరాలను పొందుపరుస్తూ నమోదు చేసుకున్నారు. 2015లో 75 మంది ఒంటరి మహిళలు పిల్లలను దత్తత తీసుకోగా వీరి సంఖ్య కిందటేడాది అంటే 2016లో 93కి పెరిగింది. భారతదేశం మొత్తం మీద 2015 – 2016 సంవత్సరంలో 2,903 మంది పిల్లలు దత్తత వెళ్లారు. 2011 జనాభా గణన సంఖ్యను పరిశీలిస్తే ఒంటరిగా ఉండే మహిళలు (పెళ్లికానివారు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు) 71 లక్షల పైచిలుకు ఉన్నారు. సమాజంలో ఎదుగుదల, ఒత్తిడి పరిగణనలోకి తీసుకుంటే ఇటీవల వీరిలో ఎంతో అవగాహన, ఆత్మవిశ్వాసం పెరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అవగాహన కల్గి ఉండే ఒంటరి మహిళల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
మగువలే ముందడుగు..
ఒంటరి మహిళలతో పోల్చితే ఒంటరి మగవారు పిల్లలను దత్తత తీసుకోవడంలో వెనుకబడే ఉన్నారు. 2015–2016లో ఒంటరి మగవారు దత్తత కోసం తమ పేర్లను నమోదుచేసుకున్నవారి సంఖ్య 25 ఉండగా కేవలం ఐదుగురు పిల్లలను మాత్రమే దత్తత స్వీకరించారు. దత్తత నమోదు పట్టికలో ఒంటరిగా ఉండే మహిళలు లేదా మగవారికీ కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. అయితే, ఒంటరిగా ఉండే మగవారు అమ్మాయిలను దత్తత తీసుకునే సౌలభ్యం లేదు. 55 ఏళ్లు వస్తే ఒంటరి మగవాడు దత్తత తీసుకునే అర్హతనూ కోల్పోతాడు.
వివక్షకు వీడ్కోలు
‘‘ఒంటరి మహిళ పిల్లలను దత్తత తీసుకోవడానికి సాంఘిక వైఖరిలో వస్తున్న మార్పులు సహకరిస్తున్నాయి. అదేవిధంగా పారదర్శక విధానాలూ ఇందుకు సహాయపడుతున్నాయి’’ అంటున్నారు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ సెక్రటరీ కొలొనెల్‌ దీపక్‌ కుమార్‌. మాతృహక్కు అర్హత ప్రమాణాలను నెరవేర్చితే సమాజంలో వివక్ష తగ్గిపోతోందని, అయితే, ఒంటరి మహిళలకు దత్తత ఇవ్వడానికి దత్తతసంస్థలు ఇంకా అంత సుముఖంగా లేవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులంటున్నారు.
అయినప్పటికీ నిరాకరణ...
అక్టోబర్‌ 2015 నుంచి ఒంటరి మహిళకు బిడ్డను దత్తత ఇవ్వడానికి మదర్‌ థెరిస్సా మిషనరీస్‌ స్వచ్ఛంద సంస్థలు నిరాకరిస్తున్నాయి. కొత్త స్వీకరణ మార్గదర్శకాలను పాటించడానికి వీరు నిరాకరిస్తున్నారు. సైద్ధాంతిక కారణాల వలన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ ఆధ్వర్యంలోని అనాథ శరణాలయాల్లో ఈ దత్తత స్వీకరణను నిలిపివేసింది. అయినప్పటికీ దేశం మొత్తమ్మీద 2016–2017 (మార్చి వరకు) పిల్లల దత్తతు సంఖ్య 2,671గా ఉంది. సర్వే ప్రకార ంగా దేశం మొత్తం మీద చూస్తే వివిధ స్వచ్ఛంద సంస్థలలో 50 వేలకు పైగా అనాథలు ఉన్నారు. వీరి నుంచి కూడా డేటా సేకరిస్తే దత్తత సంఖ్యలో మార్పు ఉండవచ్చు.
చట్టబద్ధత లేని దత్తత... సమస్యే...
చట్టబద్ధంగా దత్తత తీసుకునే తల్లితండ్రుల నమోదు సంఖ్య 14,000 మంది ఉన్నారు. దత్తతు ఇచ్చే పిల్లల సంఖ్య మాత్రం 1,800 మంది ఉన్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలు అనాథ పిల్లల పూర్తి వివరాలను నమోదు చేయడం లేదు. ఈ విషయమే ప్రస్తావిస్తూ స్త్రీ శిశు శాఖా మంత్రి మనేకా గాంధీ ఇటీవల యూనియన్‌ హెల్త్‌ మినిస్టర్‌కు కొన్ని సూచనలు ఇచ్చారు. యోగ్యతలేని నర్సింగ్‌హోమ్‌లు, ఆసుపత్రులలో పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేరు నమోదు చేయరని, ఇక్కడి నుంచే దత్తత కార్యక్రమాలు అనధికారికంగా జరుగుతుంటాయని తెలియజేసేవారు. ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టసమ్మతికాని దత్తత ఎప్పటికైనా సమస్యలకు కారణమే అవుతుందని, దీనిపట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
– ఎన్‌.ఆర్‌

అందానికి గోధుమ పూత..

గోధుమలు ఆరోగ్యానికే కాదు... అందానికీ మేలు చేస్తాయి. ముఖంలో జిడ్డు తొలగిపోవడానికీ, నల్ల మచ్చలూ, నలుపు పోవడానికీ గోధుమపిండితో వేసే పూత చక్కని ఫలితాలనిస్తుంది.. 
* మూడు చెంచాల గోరువెచ్చని పాలల్లో చెంచా గులాబీనీరూ, కొద్దిగా తేనె, రెండు చెంచాల గోధుమపిండిని వేసి ఉండ కట్టకుండా కలపాలి. దీన్ని ముఖానికి వేసుకుని ఆరిన తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్‌ రాయాలి. తేమతో చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. 
* రెండు చెంచాల పాలమీగడకు దీనికి గోధుమపిండి కలిపి చక్కని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ పూతకి చర్మంలోని మెలనిన్‌ని నియంత్రించి నల్లమచ్చలు రాకుండా చేసే శక్తి ఉంది. 
* నాలుగుచెంచాల గోధుమపిండికి తగినన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు... జిడ్డుపోయి ముఖం కాంతితో నిగారిస్తుంది. ఛాయపెరుగుతుంది. 
* ఒక కప్పు వేడినీటిలో గుప్పెడు గులాబీ రేకలూ, కొద్దిగా తేనె, చెంచా నిమ్మతొక్కల పొడీ వేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇది ముఖంలోని ముడతలని తగ్గించి గరుకుగా ఉండే చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

క్యాల్షియం లోపిస్తే...
ఎముకలూ, పళ్లూ ఆరోగ్యంగా ఉండటానికే కాదు.. మరెన్నో విధాలుగా కూడా క్యాల్షియం మేలు చేస్తుంది. అసలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే.. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చూద్దాం. 
* కంటినిండా నిద్ర కరవవుతుందనీ, కలత నిద్ర పడుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఎక్కువ ఒత్తిడి లేకుండా మామూలుగా నడుస్తున్నప్పుడు కూడా కండరాల నొప్పి మొదలవుతుంది. ముఖ్యంగా భుజాల్లోనూ నొప్పి తప్పదు. 
* క్యాల్షియం లోపం గుండెకు కూడా చేటు చేస్తుంది. హృదయ స్పందనలోనూ మార్పు కనిపిస్తుంది. గుండె వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవడం.. వంటి సమస్యలూ ఎదురయ్యే ప్రమాదమూ ఉంది. 
* నెలసరి సరిగా రాకపోవడం, అధిక రక్తస్రావం లాంటి సమస్యలూ ఈ పోషకం లోపం వల్ల ఎదురయ్యేవే. 
* మరి ఈ సమస్యను నివారించాలంటే.. ఆహారంలో పాలూ, పాల పదార్థాలు తీసుకోవడమే కాదు.. అవసరాన్ని బట్టి క్యాల్షియం మాత్రల్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్ని మిల్లీగ్రాములు అనేది వైద్యులు వయసును బట్టి సిఫారసు చేస్తారు.



















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list