MohanPublications Print Books Online store clik Here Devullu.com

గాయత్రీ జయంతి, Gayatri Jayanthi

గాయత్రీ జయంతి
 Gayatri Jayanthi

+++++++++++గాయత్రీ జయంతి++++++++++
వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజు కనుక ఈ రోజుని గాయత్రీ జయంతి గా పేర్కొంటారు. జ్యేష్ట శుక్ల ఏకాదశినాడు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
అన్ని మంత్రాలకు మూల శక్తివి నీవు
సకల వేద స్వరూపిణివి నీవు!
పంచ ముఖములతో ప్రకాశిస్తూ..
శంఖ, చక్ర, గద అంకుశాదులు,
ధరించి ..దివ్యమైన దర్శనమిస్తూ..
అభయమొసగే వేదమాతవు నీవు!
నిన్ను నిష్టతో ధ్యానించిన వారిని..
అనంత మంత్ర శక్తి ప్రదాతవై అనుగ్రహించేవు!
గాయత్రీ మంత్ర జపంతో..
చతుర్వేద పారాయణ ఫలమునిచ్చేవు!
నిత్యమూ నిన్ను ఉపాసించే వారి..
బుద్ధి తేజోవంతమయ్యేలా..కృపజూపేవు!
భక్తితో నిన్ను పూజించిన వారి..
కష్టాలు ఉపద్రవాలు శాంతింప జేసి కరుణించేవు!!
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list