MohanPublications Print Books Online store clik Here Devullu.com

అత్తా కోడళ్లను కలిపే గుండాలు Atta Kodallu

అత్తా కోడళ్లను కలిపే గుండాలు
Atta Kodallu

అత్తా కోడళ్లను కలిపే గుండాలు!
సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో అన్నపూర్ణా సమేతంగా కొలువయ్యాడు పాపహరేశ్వరుడు. రోగ, పాప నాశకాలైన నీటిగుండాలూ అక్కడే వెలిశాయి. వాటిలో రెండింటిని అత్తా కోడళ్లను కలిపే వాటిగానూ చెబుతారు. పరమేశ్వరుడు కోరిన భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ప్రాంతమే ఆదిలాబాద్‌ జిల్లాలోని కదిలి.
అంతా అటవీ ప్రాంతం. ఎటుచూసినా చెట్లు. ఎత్తైన కొండలు. ఆకుపచ్చని లోయలు. పిల్ల తెమ్మెరల ఝుంకారాలు కూడా మహాశివుడి ఓంకార నాదంలా వినిపించే సహ్యాద్రి పర్వత సానువుల్లో నెలవైంది పాపహరేశ్వరాలయం. ఆ పక్కగా ఓ గుండంలోకి కరవూ కాటకాలతో సంబంధం లేకుండా నిరంతరం ఓ జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. అదే అక్కడి 500 ఎకరాల పంటలను సస్యశ్యామలం చేసే జీవధారగా మారింది. అక్కడ వెలసిన ఒక్కో గుండానిదీ ఒక్కో ప్రత్యేకత. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దాదాపు 100 అడుగుల లోతున ఉన్న లోయలో భక్తుల పాపాలను పారదోలే స్వామిగా పాపహరేశ్వర నామంతో కొలువయ్యాడు పరమేశ్వరుడు.
పాపనాశకుడిగా...
పరమశివుడు పాపనాశకుడు. హరహర మహదేవ అంటూ భక్తితో ప్రార్థించగానే కనికరించి కరుణిస్తాడు. అందుకే పురాణ కాలం నుంచీ నేటి వరకూ రుషులు మొదలు సాధారణ మానవుల దాకా అంతా పాపపరిహారార్థం శివుడినే వేడుకుంటారు. ఈ దేవాలయ ఆవిర్భావం వెనుకా దోషపరిహారానికి సంబంధించిన కథే ఉంది. పూర్వం... తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు కన్నతల్లైన రేణుకామాత తలను తెగనరికాడు పరశురాముడు. తర్వాత మాతృహత్యా పాతకానికి ఒడిగట్టానన్న అపరాధ భావన పీడించడంతో దాని నుంచి విముక్తిని కోరుతూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఇందులో భాగంగానే దేశం మొత్తం తిరిగి 32 లింగాలను ప్రతిష్ఠించి పూజిస్తాననీ, తనకు పాపవిమోచనం కలిగించాలనీ శంకరుడిని వేడుకున్నాడు. ఆ ప్రకారమే వివిధ పవిత్ర ప్రదేశాల్లో 31 లింగాలను ప్రతిష్ఠించి చివరగా దిలావర్‌పూర్‌లోని ఎల్లమ్మను దర్శించి అమ్మవారి గుడికి ఉత్తరదిశలో ఉన్న కొండలపైకి ఎక్కి లోయలోకి దిగి అక్కడ 32వ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అతడి పట్టుదలనూ, దీక్షనూ మెచ్చిన పరమశివుడు ఆ 32వ లింగంలో ‘కదిలా’డు. ఆ దృశ్యాన్ని చూసి పరుశురాముడు ‘శివుడు కదిలే.. శివుడు కదిలే’ అంటూ స్తుతిస్తూ తన్మయత్వంతో నర్తించాడట. అప్పటినుంచే ఈ ఆలయాన్ని కదిలే పాపన్న ఆలయంగా పిలిచేవారు. కాలక్రమేణా అదే, కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రఖ్యాతి గాంచింది.
విశేషాలు...
సాధారణంగా దేవాలయాలు తూర్పు, ఉత్తర ముఖాలు కలిగి ఉంటాయి. ఈ ఆలయం అందుకు భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటల తరవాత అన్ని శివాలయాల్లో నిశిపూజలు చేస్తారు. ఈ ఆలయంలో మహాశివరాత్రితోపాటూ సోమవారం, అమావాస్యలతో కలిపి వచ్చే మాసశివరాత్రి దినానా ఈ పూజలు జరుగుతాయి. ఈ సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. శివాలయపు గర్భగుడికి వెనుక భాగంలో దక్షిణ దిశగా పార్వతీమాత అన్నపూర్ణేశ్వరి అవతారంగా వెలిసింది. అమ్మవారిని మొక్కేవారు ధాన్యరాశులూ, సిరి సంపదలతో తులతూగుతారని ప్రతీతి. అమ్మవారి పేరిట ఇక్కడ నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని వటవృక్షంలో మర్రి, వేప, రావి, జీడి, మద్ది, టేకు తదితర 18రకాల వృక్షాలన్నీ ఒకే కాండంలో మిళితమై ఉన్నాయి. ఈ వృక్షంమీద వెయ్యేళ్ల వయస్సు ఉన్న నాగుపాము ప్రతి అమావాస్య, పౌర్ణమి ఘడియల్లో దర్శనమిచ్చేదని గ్రామస్థులు చెబుతారు. అంతేకాదు యాగంటిలో నందీశ్వరుడు ప్రతి ఏడాదీ పెరిగిన రోజున కదిలి ఆలయంలోని నంది నుంచి ఏవో శ్వాసపరమైన శబ్దాలు వెలువడతాయనీ ఓ నమ్మకం.
మహిమాన్విత గుండాలు
ఆలయ ప్రాంగణంలో పలుచోట్ల నీటిగుండాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది రుషిగుండం. అన్ని కాలాల్లోనూ ఇక్కడ నీటిమట్టం ఒకేలా ఉంటుంది. ఇక్కడ స్నానమాచరిస్తే వ్యాధులు నయమవుతాయనీ, ఇందులోని నీటిని పంటపొలాలపై చల్లితే చీడపీడలు తొలిగిపోతాయనీ భక్తుల నమ్మకం. ఆవు మూతిగా పిలిచే ఓ చోటి నుంచి సన్నని ధారగా నిరంతరం ఇందులోకి నీరు వస్తూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ నీటిలో మేడి వృక్షం నీడ కనిపిస్తుంది. ఈ నీడలో స్నానమాచరించినవారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ వూరుతున్న ధారే పాపన్న చెరువుగా పిలుచుకునే ఓ చెరువులోకి వెళ్లి అక్కడి 500 ఎకరాల పొలాలకి నీళ్లను అందిస్తోంది. ఆలయానికి తూర్పున శివార్చన కోసం పాల గుండం ఉంది. ఉత్తర ఈశాన్యంలో శివతీర్థ గుండం, దానికి ఉత్తరాన సూర్యచంద్ర గుండాలు ఉన్నాయి. ఉత్తరాన తీర్థ గుండం, జీడిగుండాలున్నాయి. వీటిని అత్తా కోడళ్ల గుండాలుగా పిలుస్తారు. అత్తా కోడళ్లు ఈ రెండు గుండాల్లో స్నానమాచరిస్తే అన్యోన్యంగా ఉంటారని నమ్మకం. దాదాపు ఒకే చోట ఉన్నా వివిధ గుండాల్లోని నీరు చూసేందుకు వివిధ రకాలుగా కనిపించడం ఓ ప్రత్యేకత. అంతేకాదు ఇక్కడి సూర్య గుండంలోని నీళ్లు వేడిగానూ, చంద్రగుండంలోని నీళ్లు చల్లగానూ ఉంటాయి. ఆదిలాబాద్‌జిల్లా నిర్మల్‌-భైంసా రహదారిలో, దిలావర్‌పూర్‌ వెళ్లి అక్కడి నుంచి మాడేగాం ఘాట్‌రోడ్డు మీదుగా ఏడు కిలోమీటర్లు ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు.
- దూస సంజీవ్‌ కుమార్‌,


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list