MohanPublications Print Books Online store clik Here Devullu.com

చందనమూర్తికి...వందనం ChandhanaMurthiki Vandhanam

చందనమూర్తికి...వందనం
ChandhanaMurthiki Vandhanam

చందనమూర్తికి...వందనం
విష్ణుమూర్తి...తత్వం అనంతం, రూపాలు రెండు, విగ్రహం ఒకటి. సింహాద్రి అప్పన్న వైభవం ఇప్పటిది కాదు. ప్రహ్లాదుడు పూజలు చేశాడు. ముక్కోటి దేవతలూ వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. చందనోత్సవం నాడైతే (మే 9)...సింహాద్రి వైకుంఠాన్ని తలపిస్తుంది.తూర్పు కనుమలలోని సుందరగిరి సింహగిరి. ఆ కొండ మీద కొలువైన కొండంత దేవుడు సింహాద్రి అప్పన్న. భక్తజన వల్లభుడైన శ్రీహరి ప్రహ్లాదుడి కోరికను మన్నించి...హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారమూ, హిరణ్య కశిపుడిని దునుమాడిన నృసింహావతారమూ మేళవించి...ద్వయరూప ఏక విగ్రహంగా, వరాహ లక్ష్మీనృసింహస్వామిగా అవతరించాడు. నిత్యం చందనావృతమైన లింగాకృతిలో కనిపించే స్వామి నిజ మంగళరూపాన్ని ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే...అదీ చందనోత్సవం నాడే భక్తులు కళ్లారా దర్శించుకోవచ్చు. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజున తెల్లారక ముందే సింహగిరికి జనం పోటెత్తుతారు.
అంతా నారాయణమయం...
సింహగిరిలో అణువణువూ నారాయణ స్వరూపమే. ఏ రాతిని చూసినా, ఏ చెట్టును తాకినా స్వామి స్పర్శానుభూతే. సముద్ర మట్టానికి ఎనిమిది వందల అడుగుల ఎత్తులో కొలువైన సింహరూపుడిని చేరుకోవాలంటే వేయికిపైగా మెట్లెక్కాలి. ప్రతి మెట్టూ పవిత్రమే, ఆధ్యాత్మికోన్నతికి సోపానమే. భక్తులు పాదయాత్రగా కొండపైకి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు మోకాళ్లపై, కొందరు దీపాల్ని వెలిగిస్తూ, కొందరు మెట్టు మెట్టుకూ బొట్టుపెడుతూ...ఈ మార్గంలో ధర్మదర్శనానికి వరుసలు కడతారు. అలసట మరచిపోడానికి...
ఆపద మొక్కులవాడా అప్పన్న..
మా ఇంటి చందురుడా అప్పన్న..
కోడె దూడలు తెచ్చాం అప్పన్న..
కరుణించి మమ్మేలు అప్పన్న... అంటూ జానపద గీతాలతో గీతోద్ధారకుడిని కీర్తిస్తారు.పురాణాల్లో...
స్థలపురాణం ప్రకారం...స్వయంభూమూర్తిగా వెలసిన వరాహ లక్ష్మీనృసింహుడిని తొలుత పరమభక్తుడైన ప్రహ్లాదుడు ఆరాధించాడు. ప్రహ్లాదుడి శకం ముగిసిన తర్వాత దీప ధూప నైవేద్యాలు కరవయ్యాయి. విగ్రహం మట్టిపాలు అయ్యింది. పుట్టలో కూరుకుపోయింది. అనంతర కాలంలో, చంద్రవంశానికి చెందిన పురూరవుడు తూర్పు కనుమలలో విహరిస్తూ ఓ చోట సేదదీరాడు. ఆ సమయంలో నృసింహదేవుడు స్వప్నంలో సాక్షాత్కరించి, సింహగిరి మీద ఓ పుట్టలో ఉన్నట్టు ఆనవాలు చెప్పాడు. క్షణమైనా ఆలస్యం చేయకుండా...పురూరవుడు కొండపైకి చేరుకుని పుట్టను తవ్వించాడు...ఆ మట్టిలో లక్ష్మీనారసింహుడి స్వయంభూమూర్తి! స్వామి ఆదేశం ప్రకారం...వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే చందనం లేకుండా ప్రజలకు నిజరూప దర్శనం కల్పించాలి, మిగిలిన అన్ని రోజులూ విగ్రహం నుంచి వెలువడే వేడిని చల్లార్చేందుకు చందనంతో కప్పి ఉంచాలి. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది. చందనోత్సవం రోజు సాయంత్రం నుంచే కస్తూరి, జవ్వాది, పునుగు, కర్పూరం, తదితర సుగంధ పరిమళాలతో కూడిన శ్రీచందనాన్ని పూస్తారు. పూర్వం స్వామి చుట్టూ ఉన్న పుట్టమన్నుకు సమానంగా...సుమారు 12 మణుగుల చందనంతో విగ్రహాన్ని కప్పడం సంప్రదాయం. ఆ లింగాకృతిలోనే దేవదేవుడు ఏడాది పొడవునా భక్తులను అనుగ్రహిస్తాడు.సంతాన స్తంభం...
గర్భగుడి ప్రవేశద్వారం పక్కన, ఆలయ ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఇది సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమైనట్టు తెలుస్తోంది. కాబట్టే, కప్పస్తంభానికి అంత శక్తి! సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తారు. పండంటి బిడ్డనివ్వమని ప్రార్థించుకుంటారు. దంపతులిద్దరూ రెండువైపుల నుంచీ స్తంభాన్ని కౌగిలించుకుని మనసులో వరాహ నారసింహుడిని ప్రార్థిస్తే, తప్పక సంతానం కలుగుతుందని బలమైన నమ్మకం.
సింహగిరి జల సమృద్ధిగల ప్రాంతం. ఈ కొండల మీద ప్రకృతి సిద్ధమైన గంగధార, ఆకాశధార, చాకిధార, పిచికిధార తదితర జలమార్గాలున్నాయి. మండు వేసవిలోనూ నిండు ప్రవాహం కనువిందు చేస్తుంది. కొండ దిగువన...అడివివరంలో వరాహ పుష్కరిణి కూడా అంతే! జలకళతో పాలకడలిని తలపిస్తుంది. పూర్వం భక్తులు ఇక్కడ స్నానం చేసి, స్వామివారిని దర్శించుకునేందుకు మెట్లమార్గంలో కొండపైకి చేరుకునేవారు. విజయాలను అందించే దేవుడిగానూ అప్పన్నను ఆరాధిస్తారు. గజపతి ప్రతాపరుద్రుడిని ఓడించిన తరువాత శ్రీకృష్ణదేవరాయలు సింహాచల క్షేత్రాన్ని దర్శించుకున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. కళింగ దిగ్విజయ యాత్ర తర్వాత ఇక్కడ విజయ ధ్వజ శిలాశాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రాశులకొద్దీ వజ్రవైఢూర్యాల్నీ రత్నాభరణాల్నీ స్వామికి సమర్పించారు. వాటిలో ఓ పచ్చలహారం ఇప్పటికీ ఉంది. విశాఖపట్నం నుంచి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో సింహాచల క్షేత్రం ఉంది. ద్వారకా బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, గాజువాక, ఎన్‌ఏడీ ప్రాంతాల నుంచి ప్రతి పది నిమిషాలకూ ఓ బస్సు ఉంటుంది.
- అల్లం నాగేశ్వరరావు,
++++++++++++++++++++++++++
------సింహాచలం
చందన రూపుడు..
సింహాచలేశుడు:--------------
దేశంలోని అన్ని నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం అతి ప్రాచీనమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు. సింహాచలం ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా ఉంది. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే వరాహ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.
ఆలయ చరిత్ర-స్థల పురాణం
స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి ఇక్కడ 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయంలో పలు చారిత్రక సందర్భాల్లో వేసిన శిలా శాసనాలు చారిత్రక పరిశోధకులను ఆకర్షిస్తాయి. సత్యకాలంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హరి ద్వేషంతో.. భక్తులను హింసించిన హిరణ్యకశిపుని వధించిన నృసింహావతారాల కలయికగా.. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వ్యక్తమయ్యారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణ చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (రూ.52 కోట్లు)కలిగిన దేవాలయమిదే. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో వుండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చే లక్షల మంది భక్తులతో మరింత రద్దీగా మారుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్జిత సేవలు ఉంటాయి. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేది భక్తుల విశ్వాసం.
ప్రధాన పూజలు
1. స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
ఇతర సేవల ధరలు
* సహస్రనామార్చన: రూ.200
* అష్టోత్తర శతనామార్చన: రూ.100
* లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
* గరుడ సేవ: రూ.300
* కప్పస్తంభ ఆలింగనం: రూ.25
* లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
* గోపూజ: రూ.50
* గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
* పశువుకట్టు: రూ.15
* అన్నప్రాశన, అక్షరాభ్యాసం: రూ.50
* ద్విచక్రవాహన పూజ: రూ.100
* కారు పూజ: రూ.200
* కేశఖండన: రూ.10
టిక్కెట్లు దొరికే స్థలాలు: అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.20 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
ప్రసాదాల ధరలు
* లడ్డూ(80గ్రాములు): రూ.5
* పులిహోర : రూ.5
* చక్కెర పొంగలి: రూ.3
* రవ్వ లడ్డూ : రూ.2
దర్శన వేళలు
* ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
* మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం
* మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
* సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
* రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
* రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
* రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
* మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.
దర్శనం టిక్కెట్ల ధరలు
* రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
* రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
* రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.
రవాణా సౌకర్యం
సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్‌ స్టేషన్‌ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా వుంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్‌ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.
వసతి వివరాలు
కొండపై సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు సత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చందన టూరిస్టు రెస్ట్‌ హౌస్‌, తితిదే సత్రాలు ఉన్నాయి. కొండ కింద పలు ప్రైవేటు వసతి గదులు అందుబాటులో వున్నాయి.
ఇతర దర్శనీయ స్థలాలు
ఆండాళ్‌ సన్నిధి(గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
పరిసరాల్లోని దర్శనీయ స్థలాలు
ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్‌, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడమూ సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list