MohanPublications Print Books Online store clik Here Devullu.com

సింహరూపంలో శ్రీహరి పాదముద్ర, Simharupamlo SriHari Padhamudra

సింహరూపంలో శ్రీహరి పాదముద్ర
Simharupamlo SriHari Padhamudra


సింహరూపంలో శ్రీహరి పాదముద్ర!
ఆ కొండ ఏడుకొండలంత పవిత్రమని విశ్వాసం. అక్కడ, నారసింహుడు నడయాడాడని నమ్మకం, విష్ణుమూర్తి గోమాత రూపంలో సంచరించాడనీ ఐతిహ్యం. రాజమహేంద్రికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ తంటికొండ దివ్యక్షేత్రం.
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు...అంటాడు అన్నమాచార్యుడు, విష్ణుమూర్తి అవతారమైన వేంకటేశ్వరుడిని ప్రస్తుతిస్తూ. తిరుమల దేవుడు...ఎన్నో ప్రాంతాల్లో వెలిశాడు, ఎన్నో రూపాల్లో పూజలు అందుకుంటున్నాడు. రాజమహేంద్రవరానికి నలభై కిలోమీటర్ల దూరంలోని తంటికొండ గ్రామంలోనూ ఓ ఎత్తయిన కొండ మీద అవతరించాడు.
స్థల పురాణమిది...
స్థానిక ఐతిహ్యం ప్రకారం, పూర్వం గ్రామంలోని ఓ కొండ మీద దివ్యతేజస్సు కనిపించేదట. అక్కడికి వెళ్లాలంటే జనానికి జంకు. ఆ కాంతి తమను భస్మం చేస్తుందేమో అన్న భయం. దీంతో, దూరం నుంచీ చూసి దండం పెట్టుకునేవారు. తర్వాతి కాలంలో కొందరు యువకులు ధైర్యం చేశారు. నిత్యం కనిపించే తేజస్సు కోసం కొండంతా గాలించారు. వెతగ్గా వెతగ్గా...దివ్యకాంతితో అలరారుతున్న పాదముద్ర దర్శనమిచ్చింది. నిర్మానుష్యమైన కొండమీద కాలిగుర్తు కనిపించడం దైవసంకల్పమని భావించారు. పూజలు చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ భక్తుడి కలలో కనిపించి ‘నారసింహుని అవతారంలో నేనీ కొండ మీద సంచరించాను. అప్పుడే ఆ పాదముద్ర పడింది. ఈ ప్రాంతం భవిష్యత్తులో మహిమాన్విత క్షేత్రం అవుతుంది. ఇక్కడే వేంకటేశ్వరుడి ఆలయాన్ని నిర్మించండి’ అని ఆదేశించాడట.
ప్రహ్లాదుడి మొరను ఆలకించిన శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహ అవతారం ధరించాడు. స్తంభంలోంచి బయటికొచ్చి, వాడిగోళ్లతో ఆ హరిద్వేషిని అంతమొందించాక...మహారౌద్ర రూపంలో కొండలూ కోనలూ తిరిగాడు. ఆ సమయంలోనే తంటికొండను పావనం చేసి ఉండవచ్చని భక్తుల నమ్మకం. మరో చోట...ఆవు కాలి ముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి గోరూపంలో సంచరిస్తుండగా... ఆ గుర్తులు పడ్డాయని భక్తుల భావన. ఇక్కడో ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ నిర్మాణం...
ఐదున్నర దశాబ్దాల క్రితం...తంటికొండ ప్రజలంతా కొండమీద స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని తీర్మానించారు. ముందుగా పరిసర ప్రాంతాల్ని శుభ్రం చేశారు. అంతెత్తున ఉన్న కొండ మీదికి ఇటుకలూ నీళ్లూ మోసుకెళ్లారు. తలో చేయీ వేసి గుడికట్టారు. తిరుపతి నుంచి వేంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి మూర్తులను తీసుకొచ్చి వేదపండితులతో ప్రతిష్ఠాపన చేయించారు. అప్పట్లో, ఆ బండరాళ్లను దాటుకుని వెళ్లి, స్వామిని దర్శించుకోవడం వయోధికులకూ పిల్లలకూ అసాధ్యమయ్యేది. దీంతో, మరొక్కసారి గ్రామమంతా ఏకమై 274 మెట్లను నిర్మించింది. ఆతర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది.
దివ్యమూర్తులు...
ఆలయానికి పశ్చిమ దిశలో శ్రీవారి పాదముద్రకు ప్రత్యేకంగా గోపురాన్ని నిర్మించారు. ఎదురుగా ఆంజనేయుడిని ప్రతిష్ఠించారు. తూర్పు వైపున కట్టిన దేవాలయంలో శ్రీవేంకటేశ్వరుడు హృదయలక్ష్మీ సమేతంగా కొలువుదీరడం ఈ క్షేత్ర ప్రత్యేకత. తిరుమలలో తప్పించి, మరెక్కడా ఇంత అరుదైన మూర్తి కనిపించదంటారు.నరసింహుడిగా వచ్చిన ఆదివిష్ణువు కొండ దిగి వెళ్తున్నప్పుడు మాత్రం సర్ప రూపాన్ని ధరించాడని ఓ కథనం. అందుకు గుర్తుగా, సర్పం జరజరా పాకుతూ వెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తాయి. విఘ్నేశ్వరుడు, గరుడాళ్వార్‌, గోవిందరాజస్వామి ఉపాలయాల్లో నిత్యపూజలు జరుగుతాయి. ఆలయానికి ముందుభాగంలో చిన్న జీయరుస్వామి శిష్యబృందం నిర్మించిన శ్రీరామస్తూపం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు.
ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత, భక్తులకు శ్రీవారి నిజరూప దర్శనభాగ్యం కల్పిస్తారు. లక్ష్మీదేవికి కుంకుమ పూజలూ నిర్వహిస్తారు. ప్రతి శనివారం వేలాది భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందిస్తారు. మాఘశుద్ధ పంచమి మొదలు ఐదు రోజుల పాటూ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వైశాఖశుద్ధ ఏకాదశి నాడు శ్రీనివాసుడి కల్యాణ వైభోగాన్ని చూసి తరించాల్సిందే. సంవత్సరంలో ఆరుసార్లు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులు నడిచే మెట్లమార్గంగుండా కాకుండా... ప్రత్యేకంగా స్వామివారి కోసమే తూర్పుదిశగా సోపానాల్ని నిర్మించారు. గ్రామోత్సవం సందర్భంగా మాత్రమే ఆ మార్గాన్ని తెరుస్తారు. వేయి మీటర్ల ఎత్తులో ఉండే కొండ మీది నుంచి ఉత్సవ విగ్రహాలను తూర్పు మెట్ల మార్గంలో కిందికి తీసుకొచ్చి...తిరిగి అదేమార్గంలో కొండకు చేరుస్తారు. ఆ కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంది.
‘స్వాతిముత్యం’లో...
కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తంటికొండ ప్రాశస్త్యం తెలుసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన తీసిన ‘స్వాతిముత్యం’ చిత్రంలో కథానాయిక రాధిక గుడిమెట్లను కడిగి పసుపు కుంకుమలతో పూజలు చేసే దృశ్యం...ఇక్కడ చిత్రీకరించిందే. రాజమహేంద్రవరం రైల్వేస్టేషను నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి, అక్కడి నుంచి బస్సులో తంటికొండకు వెళ్లవచ్చు. కాంప్లెక్స్‌ నుంచి గోకవరం చేరుకున్నా, అక్కడి నుంచి ఆటోలో అయిదు కిలోమీటర్ల ప్రయాణం.
- సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమండ్రి సాంస్కృతికం


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list