MohanPublications Print Books Online store clik Here Devullu.com

వేమన యోగి, VEMANA YOGI

వేమన యోగి
VEMANA YOGI

VEMANA YOGI.....
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు


వేమన వెలుగు దారిలో నడుద్దాం

              ఒక కొత్త ఆలోచనా విధానం గాని భావజాలంగాని మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు, దానిమూలాలు గతంలో ఏమైనా ఉన్నాయా అని ఆలోచించడం మనకు అలవాటు. అది అవసరం కూడా. మంచిగతము కొంచెమేనోమ్‌ అన్నట్లు, గతంలో వర్తమానానికి పనికొచ్చే భావనల్ని, చింతనల్ని స్వీకరించడానికే ఈ ప్రయత్నం చేయాలి. మార్క్సిజం అందుబాటులోకి వచ్చినప్పుడు, గురజాడలోని భౌతిక తాత్వికతను మనం గుర్తించాం. అంబేద్కరిజం అందుబాటులోకి వచ్చినప్పుడు గుర్రం జాషువాను సొంతం చేసుకొని చర్చించాం. స్త్రీవాదం అందుబాటులోకి వచ్చినప్పుడు గురజాడ మొదలైన వారిని, ప్రధానంగా చలాన్ని ఆవాహన చేసుకున్నాం. ఇలాంటి ఆధునిక రచయితల కోవకు చెందిన ప్రాచీన కవి వేమన మనకు అనేక విషయాలకు ఇవాళ పనికివస్తాడు. ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయార్థిక సాంఘిక పరిస్థితులను గురించి ఆలోచించి చూసుకున్నపుడు, ప్రగతిశీలవాదులు సామాజిక పరివర్తనను గురించి చర్చించేటప్పుడు వేమన కొంతవరకైనా మనకు పనికివస్తాడు.
మనం నన్నయ్య, తిక్కన వంటి రాజాస్థాన కవులను చదవడంలో చాలాముందున్నాం గాని వేమనను చదవడంలో మాత్రం వెనక బడిపోయాం. ఇందుకు కారణం వేమన నడిచిన బాటలో మనం నడవలేదు. వేమన మనల్ని జోకొట్టలేదు. తట్టిలేపాడు. కొత్తదారి సృష్టించాడు. ఆయన గాలివాటు కవికాదు. ప్రవాహానికి ఎదురీదిన కవి. అప్పటికి స్థిరపడి ఉన్న సకల వ్యవస్థల మీద విమర్శ పెట్టి మన మెదళ్లకు ఆలోచించే పని పెట్టాడు. అందువల్ల తెలుగు వాళ్ళం వేమనను చదవడంలో వెనకబడిపోయాం. సిపి బ్రౌన్‌ 1829లో వేమనను వెలికి తీసినా, 1928లో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అనంతపురంలో వేమన మీద ఏడు ప్రసంగాలు చేసేదాకా, నూరేళ్ల ఆయనను తెలుగువాళ్లు అంతగా పట్టించుకోలేదు. కొందరు సాహస చరిత్రకారులు తప్ప 1928 ప్రాంతాల్లోనే విశ్వవిద్యాలయాల్లో తెలుగులో పరిశోధనలు మొదలైనా, 1970ల దాకా వేమన అస్పృశ్యుడిగానే మిగిలిపోయాడు.
వేమన క్రీస్తుశకం 17వ శతాబ్దం నాటి కవి. భారతదేశ చరిత్రలో మధ్యయుగంలో ఉత్తర భాగానికి చెందిన కవి. అప్పటికి వేల ఏళ్లుగా వేళ్ళు దించుకొని ఉన్న రాచరిక భూస్వామ్య వర్ణ హైందవ వ్యవస్థ శిథిలదశకు చేరుకుంటోంది. వ్యక్తి నుంచి వ్యవస్థ దాకా ఉండవల్సిన ఆర్థిక రాజకీయ సాంఘిక నైతిక ధార్మిక మానవ విలువలు నశించిపోతున్నాయి. సామాజిక బలాలు నీరసించి బలహీనతలు ప్రబలుతున్నాయి. మనిషిని విస్మరించి మానవేతర కార్యకలాపాల విజృంభణ పెరిగింది. ప్రతి వ్యవస్థా తలకిందులుగా ఉంది. భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దానిని పడగొట్టి దాని స్థానంలో కొత్త భవనాన్ని కట్టుకోవడం అవసరం. వేమన చేసిన పని ఇదే! పాత వ్యవస్థలోని దుర్మార్గాలను ఎత్తిచూపి విమర్శకు పెట్టి, దాని స్థానంలో కొత్త వ్యవస్థను నిర్మించవల్సిన అవసరాన్ని సూచించాడు. వేమన నాలుగొందల ఏళ్ళనాడు ఏ పరిస్థితులను, ఏ సామాజికాంశాలను రుగ్మతలుగా విమర్శించాడో అవి ఈనాటికీ మన సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి - యథాతథంగా గాని, రూపం మార్చుకొని గానీ. ఈ అవశేషాలను నిర్మూలించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. అనేక ఉద్యమాలు నడిచాయి. అనేక భావజాలాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా ఆ పాత రుగ్మతలు సమసిపోలేదు. అందువల్ల మరొకసారి ఇవాళ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు వేమన కవిత్వంలోఎలా ప్రతిబింబిస్తున్నాయో, వాటిని వేమన ఎలా విమర్శించాడో అర్థం చేసుకుంటే మన కాలానికి వేమనకు గల ప్రాసంగికత తెలిసి వస్తోంది.
వేమన సంచార కవిగా పేరు పొందాడు. ఆయన రాజవంశం వాడన్నది నిజమైతే, ఆయన మరొక గౌతమబుద్ధుడే అనవచ్చు. వేమన సమాజంలో బాగా సంచరించాడు. మనుషులను దగ్గరగా పరిశీలించాడు. కులాలను, మతాలను ఆర్థిక వైరుధ్యాలను, శ్రామిక విశ్రాంత వర్గాలను, ప్రజల అలవాట్లను ఆలోచనలను అన్నిటినీ గమనించాడు. చూసిన ప్రతి అంశాన్ని కవితాత్మకంగా వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలలో కొన్ని నేటికీ వర్తిస్తున్నాయి. ప్రపంచమంతా వర్గ సమాజముంటే భారతదేశం వర్గ, వర్ణ సమాజంగా ఉంది. భారతదేశంలో ధనిక, పేద వర్గాలతో పాటు, కొన్ని వేల కులాలు ఏర్పడ్డాయి. ఇది నిచ్చెన మెట్ల సమాజం. ప్రతికులమూ పై కులాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తూనే, కింది కులాన్ని ఉన్నచోటనే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ వర్గవైరుధ్యాన్ని, కులవివక్షను వేమన నిశితంగా పరిశీలించాడు. కులానికి సంపదకు గల సంబంధాన్ని బాగా పరిశీలించాడు. కాలం మారింది. వలస పాలన ద్వారా భారతదేశంలోకి కొత్త ఆలోచనలు ప్రవేశించాయి. వలస పాలకులు తమ సంస్కరణల ద్వారా భారతదేశంలో ఉండే వర్గ, వర్ణ వైరుధ్యాలను నిర్మూలించే ప్రయత్నం చేయలేదు. తమ పాలనకు అనుకూలంగా భారతీయులను మలచుకోడానికే ప్రయత్నించారు. వాళ్లు వెళ్ళారు. దేశానికి స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం రాసుకున్నాం. అందులో లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, సార్వభౌమాధికార రాజ్యాంగంగా నిర్వచించుకున్నాం. రాతల్లో, మాటల్లో అంతా బాగుంటుంది. చేతల్లో మాత్రం అంతా తలకిందులు. అందుకే వర్గ, వర్ణ వైరుధ్యాలు ఇలా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుల ధనాలకు గల సంబంధాన్ని గురించి వేమన వ్యాఖ్యలు చూద్దాం.
కులము గలుగువారు గోత్రం గలవారు
విద్య చేత విర్రవీగువారు
పసిడిగల్గువాని బానిస కొడుకులు ||విశ్వ||

కులములేనివాడు కలిమిచే వెలమును
కలిమిలేనివాని కులము దిగును
కులము కన్న మిగుల కలిమి ప్రధానంబు ||విశ్వ||
సంపదకు కులానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వేమన నిశితంగా పరిశీలించి చెప్పిన పద్యాలివి. ఈ వైరుధ్యాలను నిర్మూలించడానికి మార్క్శిజం, అంబేద్కరిజం కృషి చేస్తున్నాయి. లాల్‌నీల్‌ సలాములనే మాటిప్పుడు మనం చెపుతున్నాం.
కుల, వర్గ సమస్యలకు కులనిర్మూలన, సంపద పంపకం పరిష్కారాలని ఇవాళ మనం భావిస్తున్నాం. వేమన ప్రణాళికలో కులనిర్మూలన ఉందని చెప్పలేం గాని కుల సమానత్వ భావన ఉంది. శ్రమవిభజన కోసం పుట్టిన విభాగాలు కులాలుగా రూపొందాయి. శ్రామిక కులాలను ఆధిపత్య కులాలు నీచంగా చూడటాన్ని చూసి వేమన మెత్తగాను, గట్టిగాను మొత్తాడు. ఆయన కున్న విజ్ఞత ఈనాటి వాళ్లలో అనేకులకు లేదు.
కులవ్యవస్థ సృష్టించిన దుర్మార్గం అస్పశ్యత. శ్రామిక కులాల ప్రజల్ని అమానవీయంగా ఊరికి దూరంగా పెట్టి అంటరానివాళ్లుగా ముద్రవేసి పెత్తనం చేసే సాంఘిక న్యాయం మన దేశంలో ఉంది. ఈ దుర్మార్గాన్ని వేమన ఖండించాడు.
మాలవాని నేల మహిమీద నిందింప
ఒడల రక్తమాంస మొకటగాదె
వానిలోన మెలుగు, వాని కులం బేది ||విశ్వ||
ఇది ఆధిపత్య వాదులకు వేమన వేసిన సూటి ప్రశ్న. దీనికి మానవులు ఇంకా సమాధానం చెప్పవలసి ఉంది.
కులము పొలయ జేసి పొత్తుగుడిపి
తలను చెయ్యివెట్టి తగనమ్మ జెప్పరా ||విశ్వ||
అనే పదం చదివినప్పుడు వేమన కులనిర్మూలనను సహకరించే ఆలోచన కూడా చేశారా అనిపిస్తుంది. పొత్తును గవట మాటే కలిసి నడవడం. తగనమ్మ జెప్పరా అంటే కులానికి వీడ్కోలు చెప్పమని.
ఆర్థికంగా సంపద ఒకచోట పోగుపడటాన్ని వేమన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆర్థిక కేంద్రీకరణ వర్గ సమాజానికి ప్రాణం పోసినట్లు వేమన గ్రహించాడు. అందువల్ల సంపద అందరికీ కోరుకున్నాడు. సొంత ఆస్తి నిర్మూలన కూడా వేమన ఆలోచనలో ఉందా అని కొన్ని పద్యాలు చదివితే అనిపిస్తుంది. వేమన శ్రమశక్తిని గుర్తించాడు. అదృష్టాన్నీ, పూర్వజన్మ సుకృతాన్ని నమ్మలేదు.
భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను ||విశ్వ||
మార్క్సిజం శ్రమ గురించి మాట్లాడింది. అయితే శ్రమ అనేది మానవజాతిలో పుట్టింది గాబట్టి శ్రమశక్తి, శ్రమవిలువ ప్రాచీన సమాజాలకు తెలుసు. మార్క్సిజం సిద్ధాంతం చేసి సమాజానికి అన్వయించింది. మనిషి సృష్టించిన సంపద సృష్టికర్తలందరికీ చెందాలన్నది వేమన అభిప్రాయం. అందుకే ఆయన సంపద వికేంద్రీకరణను ప్రతిపాదించాడు. వేమన వర్గరహిత సమాజాన్నే ఆకాంక్షించినట్లు ఆయన కవిత్వం తెలియజేస్తుంది.
కలిమినాడు నరుడు కానడు మదమున
లేమినాడు, మొదలె లేదు పెట్ట
కలిమిలేమి లేని కాలంబు గలుగునా ||విశ్వ||
ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని కాంక్షించడం ఇప్పటికీి కొత్త కదా! వేమన మనకెంత దగ్గరగా ఉన్నారో ఇలాంటి భావాలు తెలియ జేస్తాయి. ఇలాంటి సమాజం ఏర్పడాలంటే నిలవనీటి మురుగును ప్రవాహంగా మార్చాలని వేమన బోధించాడు. దానం చేయమన్నాడు. పిసినారితనాన్ని నిందించాడు. సంపాదనా వ్యామోహాన్ని విమర్శించాడు. పుట్టిన వాళ్లందరూ పోయే వాళ్ళన్నారు. ఎవరూ శాశ్వతంగా ఉండరు అన్నాడు. దేహం మీద వ్యామోహం వద్దన్నాడు.
ధనము గూడబెట్టి ధర్మంబుసేయక
తాను దినకలెస్స దాచుగాన
తేనెటీగగూర్చి తెరవరి వియ్యదా ||విశ్వ||
పెట్టిపోయ్య లేని వట్టినరులు భూమి
పుట్టనేమివారు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా ||విశ్వ||
ఇలాంటి పద్యాలు కొల్లలుగా ఉన్నాయి.
సంపద కొంతమంది చేతిలో ఉంటే అది అసమ సమాజమవుతుంది. వేమన గ్రామాల వెంట తిరుగుతూ కఠినమైన ఆర్థిక అంతరాలను గమనించాడు. దారిద్య్రం దరిద్రులనే కాదు అందరినీ నాశనం చేస్తుందన్నాడు.
ధనములేమి యనేది దావానలంబును
తన్ను జెరుచును దరిదాపుజెరుచు
ధనము లేమి చూడ దలపను పాపంబు ||విశ్వ||
దారిద్య్రం వలన కలిగే దుష్పరిణామాన్నీ వేమన ఆనాడే గుర్తుచేసి చర్చించాడు. మన సమాజంలో సాంఘిక అసమానతలతోపాటు ఆర్థిక అసమానతలూ దినదినాభివృద్ధి చెందుతున్నాయి. అందుకే ఈనాటికీ మనకు వేమన దీపధారి. వేమన నాటితో పోలిస్తే ఇవాళ - సాంకేతిక విప్లవాల యుగంలో విగ్రహారాధన కలసిపోయిది. గుళ్లు చుట్టూ వ్యాపార వర్గాల వలయాలు తిరుగుతున్నాయి. దొంగ స్వాములు అవతార పురుషులుగా వెలుగొందుతున్నారు. విగ్రహారాధన ఇవాళ కార్పొరేటీకరింపబడుతున్నది. ఆధ్యాత్మిక కేంద్రాలను టూరిస్ట్‌ క్షేత్రాలుగా మార్చివేస్తున్నారు. లౌకికంగా ఉండే అన్ని ప్రభుత్వాలు స్వయంగా మత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మతోన్మాదం పాలకదశకు చేరుస్తుంది. ఈ పరిణామాల మధ్య వేమనను చదువుతుంటే ఆయన ఈనాటి ఛాందసులకన్నా ఎంతముందున్నాడో అర్థమౌతుంది.
శిలను ప్రతిమ జేసి చీకటింటను బెట్టి
మొక్క వలదు వెర్రి మూర్ఖులార
ఉల్లమందు బ్రహ్మయుండుట దెలియరు ||విశ్వ||
తాత్వికంగా పతనమవుతున్న మనిషి తిరిగి ఔన్నత్యం సాధించాలంటే వేమన బాగా ఉపకరిస్తాడు. అందుకే ఈనాటికీ వేమన మనకు అవసరం. 104 ఉపగ్రహాలు ఒక్కసారిగా ప్రయోగించగలిగే వైజ్ఞానిక విప్లవం సాధిస్తూనే, ఆ ఉపగ్రహ నమూనాలను, దేవుళ్ల గుడులకు తీసుకుపోయి పూజలు చేయించి, ఆ వైజ్ఞానిక మత్తుతో జోగుతున్న మన జాతికి వేమన చాలా అవసరం.
- డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list