MohanPublications Print Books Online store clik Here Devullu.com

శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా చేయాలంటే..!?Shivaratri

శివరాత్రి రోజున శివునికి అభిషేకం ఎలా 

చేయాలంటే..!?






శివరాత్రి రోజున
 శివునికి అభిషేకం 
ఎలా చేయాలంటే..!?

శ్లో|| పుర్రె చేసిన పుణ్యమేమో! పంచ చేరి నీకు కంచమాయే !
వల్లకాటి భాగ్యమేమో ! తనకు తానే నీకు మంచమాయే !

అన్నట్లు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు.


ఈ క్రమంలో మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతో శివునిని అభిషేకిస్తే ఎటువంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. పలురకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండిధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది.


నవధాన్యములతో శివాభిషేకం చేసినట్లయితే ధన, భార్యా, పుత్రలాభం, పటికబెల్లపు పలుకులతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉప్పుతో అభిషేకించితే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదితో చేసే అభిషేకం వలన సర్వకార్యాలు లాభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో జయము కలుగుతుంది.


వెదరు చిగుళ్ళతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, పాలాభిషేకం వలన కీర్తి, సిరి, సుఖములు కలుగును. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో చేస్తే దారిద్రనాశనమవుతుంది.


ఇక పలురకాల పండ్లతో చేసే అభిషేకం జయాన్నిస్తుంది. ఉసిరికాయలతో చేస్తే మోక్షము, బంగారుపొడితే అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తుంది. అష్టదాతువులతో చేసే అభిషేకం వలన సిద్ధి, మణులతో, వాటి పొడులతో అభిషేకించితే అహంకారం తొలగిపోతుంది. పాదరసముతో అభిషేకించితే అష్టైశ్వర్యములు లభిస్తాయి. ఆవునెయ్యి, ఆరు పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే ఆయుర్ వృద్ధి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.


శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత!


మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, పూజామందిరం, గృహాన్ని శుభ్రం చేసి.. పసుపు కుంకుమలు, రంగవల్లికలు. తోరణాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.


"శివరాత్రి"లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.

ఒకటి: "ఉపవాసం", రెండు: "జాగరణ".


ఇక ఉపవాసం సంగతికొస్తే.. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది. ఇక జాగారం ఎలా చేయాలంటే..? శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది.


జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.


ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే...? లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని, ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్లపూలమాల.. నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి.


జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు.


ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి.


ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే







++++++++పంచారామాలు.++++++++

1.దాక్షారామము -

పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.


2.అమరారామము -

పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.

గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు.


3.క్షీరారామము -

క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు.

ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది.


4.సోమారామము -

పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.

ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.


5.కుమార భీమారామము -

పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు.

ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.










-------------------




శివోద్భవ రాత్రి 


శివుడు లింగాకృతిలో స్వర్గ మర్త్య పాతాళాల్లో ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. ఇది ప్రతి ఏడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశినాడు అర్ధరాత్రివేళ సంభవిస్తుంది. ఈ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట. అంతులేని సిరుల మూట. ఉపాసనలకు నెలవు. పూజలకు కొలువు. శివుడు లింగాకృతిలో ఆవిర్భవించడానికి ఒక నేపథ్యం ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువులు ఆధిపత్యాల గురించి వాదించుకున్నారట. ఇంతలో వారి ఎదుట ఒక శివలింగం ఉద్భవిస్తుంది. వారు ఆశ్చర్యంతో చూస్తుండగానే, అది పెరగడం ప్రారంభిస్తుంది. క్రమంగా భూమిని చీల్చుకొని పాతాళానికి, నింగిని ఛేదించుకుంటూ వూర్ధ్వలోకాలకు విస్తరిస్తుంది. అప్పుడు బ్రహ్మవిష్ణువులిద్దరూ ఆ శివలింగం ఆద్యంతాలు చూడటానికి సిద్ధమవుతారు.

బ్రహ్మదేవుడు హంసలా మారిపోయి, ఆకాశంలోకి ఎగిరి వెళతాడు. విష్ణువు వరాహంగా మారి, నేలను చీల్చుకుంటూ పాతాళానికి చేరతాడు. వారిద్దరూ అలుపూ సొలుపూ లేకుండా ఎంత దూరం వెళ్లినా, శివలింగం అంతాన్ని చూడలేకపోతారు. తిరిగి యథాపూర్వ స్థానానికే చేరుకుంటారు.అప్పుడు వారి ఎదుట పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. తాను శివలింగం అంతాన్ని చూశానని బ్రహ్మదేవుడు అసత్యం పలికాడట. విష్ణువు సత్యం పలుకుతాడు. అసత్యం మాట్లాడిన బ్రహ్మకు లోకంలో పూజార్హత ఉండదని శివుడు శపిస్తాడు. బ్రహ్మదేవుడు నిరసించడంతో, ఆ శివ దూషణను కాలభైరవుడు సహించలేకపోతాడు. శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించి, బ్రహ్మ అయిదో తలను ఖండిస్తాడట. ఆనాటి నుంచి ఆయన నాలుగు తలలవాడయ్యాడని, అనంతరం బ్రహ్మవిష్ణువులిద్దరూ శివమహిమను అంగీకరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.

శివపూజారంభంలో భక్తుడు తనలో శివుణ్ని భావించుకుంటాడు. తనతో పాటు ఈ సమస్త ప్రపంచం శివమయం అని విశ్వసించి పూజించే పద్ధతినే ‘ఆత్మపూజ’ అంటారు. శంకర భగవత్పాదులు ‘శివానంద లహరి’లో ఈ పూజా విధానాన్ని వర్ణించారు. ‘ఓ పరమేశ్వరా! నా ఆత్మ నీవు. నా బుద్ధి పార్వతీదేవి. నా ప్రాణాలే మిత్రులు. నా శరీరమే ఇల్లు. నేను అనుభవిస్తున్న సౌఖ్యాలే నీ పూజలు. నా నిద్రే తపస్సు. నా సంచారమే నీకు ప్రదక్షిణం. నేను పలికే మాటలే నీ స్తోత్రాలు. నేను చేస్తున్న పనులన్నీ నీ ఆరాధనలే!’- ఈ మాటల్లో ఎంతో పరమార్థం ఉంది.

మనిషి శివుణ్ని నిష్కల్మషంగా పూజించాలనుకుంటే, తన ఆత్మ అంతా శివుడే నిండి ఉన్నట్లు భావించాలి. మనిషి శివారాధనలో చతుర్విధ ముక్తులూ పొందుతాడని శంకర భగవత్పాదుల ఉపదేశం. భక్తుడు తానే శివుడై చేసే పూజలో శివుడి ‘సారూప్యం’ (సమాన రూపం) ఉంటుంది. అందుకే ఇది సారూప్య ముక్తి. శివభక్తులతో సాహచర్యం చేస్తూ శివాలయాల్ని సందర్శించడం వల్ల ఆయన సమీపానికి చేరుకున్నట్లు అవుతుంది కనుక ఇది సామీప్య ముక్తి. ఈ ప్రపంచం అంతా శివమయమే కాబట్టి, ఈ లోకంలో తానూ ఉన్నందుకు మనిషికి ‘సాలోక్య ముక్తి’ లభిస్తుంది. శివుడితో మానసికమైన అనుసంధానం ఉంటుంది. ఆ కారణంగా ‘సాయుజ్య ముక్తి’ లభించినట్లే. ఇలా శివుడి పూజ వల్ల చతుర్విధ ముక్తులనూ ఇహలోకంలోనే పొందుతున్న మనిషి ధన్యుడు.

శివుడి అర్చనలోని వస్తువులన్నీ ఆయన ప్రసాదించినవే. శివ జటాజూటంలోని గంగానది నీళ్లను అనుగ్రహిస్తుంది. శివుడి నేత్రమైన సూర్య కిరణాల వల్ల పూలు లభిస్తున్నాయి. శివుడి తలపైన గల చంద్రుడి దయతో పండ్లు లభిస్తున్నాయి. బిల్వదళాలు చేతికి అందుతున్నాయి. అవన్నీ శివ ప్రసాదాలే!

ఇలా శివుడు ఇచ్చిన సంపదలన్నింటినీ ఆయనకే అర్పించడం శివార్చన. దాని పరమార్థం- ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదని, అవి సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవని గ్రహించడం. మానవ జీవనం భోగమయం కారాదని, త్యాగమయం కావాలని తెలియజేసేదే మహాశివరాత్రి!

అనునిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంలా రూపొందించాలి. తనలో అందరిని, అందరిలో తనను చూసుకొని ఈ ప్రపంచాన్ని శివుడిగా భావించడమే అతడి కర్తవ్యం. మహాశివరాత్రి పర్వదినం అందజేసే సందేశం ఇదే! ఈ శివభావనతో పరమశివుణ్ని ఆరాధిస్తేనే, లోకమంతా శివ(మంగళ)మయం అవుతుంది!



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list