MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆధ్యాత్మికత.. ఒక కళా రూపం!_ Spirituality .. an art form!

ఆధ్యాత్మికత.. ఒక కళా రూపం

తానెవరన్న ప్రశ్నతో మొదలు పెట్టి ఈ జీవులు, సృష్టి అంటూ ఆలోచనలు సాగిస్తుంటాడు. అన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ సృష్టిలోని అందాలన్నింటిని అనుభవిస్తాడు. పూల గుసగుసలు, గాలి పాడే పాట వినగలిగే స్థితికి చేరుకుంటాడు. ఈ మొత్తం సృష్టిని ఒక విచిత్రమైన, అద్భుతమైన కళారూపంగా దర్శించుకుంటాడు.
ఆధ్యాత్మికత.. ఒక కళా రూపం!_ Spirituality .. an art form!
ఆధ్యాత్మికత అనగానే దేవుడిని నమ్మటం అనుకుంటారు. నాస్తికులమని అనేవారు దేవుడు లేడని వాదిస్తూ ఆధ్యాత్మికత వ్యర్థం అంటుంటారు. అసలు ఆధ్యాత్మికతకి దేవుడున్నాడా లేడా అనే వాదానికి సంబంధం లేదు. ఆధ్యాత్మికత అనేది ఈ విషయాలకు చాలా అతీతమైంది. ఆధ్యాత్మికత ఒక కళ వంటిది. కళ ఒక శారీరక మానసిక కౌశలం. కళ మనలోపలి అంశం. సాధన ద్వారా కళ మెరుగుపడి ఔన్నత్యాన్ని పొందుతుంది. కళ ద్వారా భావనాత్మక ఆనందం పుడుతుంది. కళ ఒక ఆనందపు గని. ఆనందించడానికి ఉపయోగపడే పరికరం లాంటిది. కళ పరమావధి ఆనందం. తనలోపల ఉన్న ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించి, దాన్ని శాస్త్రబద్ధంగా అభ్యసించి, నిరంతరం సాధన చేసి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఔన్నత్యాన్ని అందుకొని మనిషి కళాకారుడుగా పరిణతి చెందుతాడు. కళాకారుడు గొప్ప వాడు కావలంటే తాను సాధన చేస్తున్న కళను లోతుగా తాను ఆనందిస్తూ, అదే కళ ద్వారా ఇతరులకు ఆనందాన్ని పంచాలి. ఒక సంగీతకారుడు తాను పాడుతూ ఏవో దివ్యలోకాల్లో విహరిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఆ పాట వినేవాళ్లు కూడా తప్పకుండా ఆనందిస్తారు. కాస్తోకూస్తో ప్రవేశం ఉన్నవారైతే అతని తాదాత్మ్యతలోని గాఢతను కూడా అర్థం చేసుకోగలుగుతారు కూడా. ఆధ్యాత్మికత కూడా అలాంటిదే. కళను సాధన చేసినట్టుగానే ఆధ్యాత్మికతను కూడా సాధన చెయ్యాలి. మన అందరిలోనూ ఆధ్యాత్మికత ఏదో ఒక మూల ఉండే ఉంటుంది. అది పూర్తిస్థాయిలో వికసించి మన ఆనందానికి కారణం కావాలంటే నిరంతర సాధన చెయ్యడం అవసరం. ఆప్పుడే అందులోని పూర్తి ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. 


భక్తి - ఆధ్యాత్మికత

భక్తి అనేది ఒక భావోద్వేగం. అపారమైన గౌరవం. అనిర్వచనీయమైన ప్రేమ, త్యాగ శీలతవంటి రకరకాల భావోద్వేగాల మేళవింపును భక్తిగా చెప్పుకోవచ్చు. డబ్బు, సమయం లెక్కచేయని ఒక సమ్మోహన స్థితి. ఇలాంటి భావోద్వేగాన్ని ఎవరి మీద చూపగలం?! అలాంటి భావోద్వేగాలను వ్యక్తపరచడానికి మనకు ఏదో ఒక సాధనం కావాలి. ఎవరినైనా పూజించాలి. సేవించాలి. తరించాలి. మన చుట్టూ ఉన్న మనుషుల పైన అలాంటి అనిర్వచనీయమైన భావోద్వేగాలను చూపలేం. ఎందుకంటే వారిలో లోపాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకే పురాణ పురుషులను, అరూప్య భావనలను ఆదర్శ మూర్తులుగా చిత్రీకరించుకొని, భావించుకొని వాళ్ల విగ్రహాలు, పటాలను పూజిస్తూ భక్తిని ప్రదర్శిస్తాము. భక్తిలో సంతోషం ఉంది. భక్తి అనే భావోద్వేగం కలిగినపుడు దాన్ని బయటకు ప్రదర్శించినప్పుడు మాత్రమే దానివల్ల సంతోషం కలుగుతుంది. అయితే నిరంతరం భక్తిలో ఉండడం సాధ్యమైతే సంతోషం బానే ఉంటుంది. కానీ అది సాధ్యపడదు. దైనందిన జీవితాన్ని గడపడంలో మనం మరో భావోద్వేగంలోకి వెళ్లిపోతాం, అందువల్ల ఇక ఆ అనుభూతి దూరమై మరో రకమైన భావనలో పడిపోతాం. 

ఆధ్యాత్మికతకి సింహద్వారమే భక్తి. ఇది ఆధ్యాత్మికతలోకి మనతో ప్రయాణం చేయిస్తుంది. చాలా మంది భక్తిలో ఉంటుంటారు. కానీ తర్వాత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించరు. అసలు తర్వాత స్థాయి ఉందన్న అవగాహన కూడా ఉండదు. భక్తి ద్వారా దొరుకుతున్న సంతోషమే చివరిదని భావిస్తారు. కొంత మందికి తర్వాత స్థాయి గురించి ఎరుక ఉన్నప్పటికీ ఇంతకంటే ముందుకు వెళ్తే ఏమౌతుందో, భార్యాపిల్లలకు దూరమైపోతామేమో అనే భయం ఒక మూలన ఉంటూ ఉంటుంది. తమ భక్తి ద్వారా చేసే పూజలు, వ్రతాల ద్వారా చాలా సంతోషంగా ఉన్నామని చెప్తుంటారు చాలామంది. కాని ఈ పయనం ఇక్కడితోనే ఆగకూడదు. తర్వాత స్థాయి ఏమిటి అనేది తెలుసుకోగలగాలి. ఆ స్థాయికి చేరగలగాలి. ఇంకొందరు ఆచారాన్నే భక్తిగా భావిస్తుంటారు. మడి, తడి, అంటూ పాటించడమే భక్తి అనే భ్రమలో ఉంటారు. కానీ అవి కేవలం బాహ్యపరమైన విషయాలే. ఒక నాట్యకళారూప ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆహార్యం, అలంకరణల వంటివి ఈ అంశాలు. కాగా నాట్యం భక్తి. అలంకరణలు గొప్పగా ఉండి, నాట్యం పేలవంగా ఉంటే ఉపయోగం ఉండదు. ఆచార సంప్రదాయలు కూడా అలాంటివే. ఆచార సంప్రదాయాలకంటే కూడా మనసులో ఉండే భక్తి భావన ముఖ్యం. దీనికి పనికి చవ్చే సాధానాల వంటివి మాత్రమే ఆచారసంప్రదాయాలు. 


బ్రహ్మానందానికి మార్గం...

ఇక ఆధ్యాత్మిక కళా సాధనకు వస్తే ప్రాణాయామం, ధ్యానం వంటి అనేక రకాల సాధానాలను ఉపయోగించి వ్యక్తి తనలోకి తాను చూసుకునే ప్రయత్నం చేస్తాడు. తన అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటాడు. తానెవరన్న ప్రశ్నతో మొదలు పెట్టి ఈ జీవులు, సృష్టి అంటూ ఆలోచనలు సాగిస్తుంటాడు. అన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ సృష్టిలోని అందాలన్నింటిని అనుభవిస్తాడు. పూల గుసగుసలు, గాలి పాడే పాట వినగలిగే స్థితికి చేరుకుంటాడు. ఈ మొత్తం సృష్టిని ఒక విచిత్రమైన, అద్భుతమైన కళారూపంగా దర్శించుకుంటాడు. సృష్టిలోని రహస్యాలను ఎరుకలోకి తెచ్చుకుంటాడు. చివరికి తనే సృష్టిగా.... సృష్టికర్తననే భావనని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. మనసులో ఉత్పన్నమైన అనుమానాలకు సమాధానం వెతుక్కుని తృప్తి చెందే స్థితి... ఆ తర్వాత ఆలోచనలే రాని స్థితికి వెళతాడు. అంతా అర్థమైతే ఇక మిగిలేది ఆనందమే. 

ఎప్పుడైనా ఒక ప్రశ్నకు సమాధానం దొరికితే లేదా మనసు సమాధాన పడితే తృప్తి కలుగుతుంది. అలా మన ప్రశ్నలన్నింటికి సమాధానం దొరికాక ప్రశ్నలే లేని స్థితిలో మిగిలేది తృప్తి మాత్రమే. ఆ తృప్తే బ్రహ్మానందం. తియ్యగా ఉంటుంది అన్నంత మాత్రాన తీపి రుచి అర్థం కాదు. తీపి తిని చూడాలి. అలాగే సాధన చేసి బ్రహ్మానందాన్ని అనుభవించాలి. సాధన చేసి అటువంటి అనుభవాన్ని పొందిన వ్యక్తి ప్రాపంచిక విషయాల్లో ఉంటున్నప్పటికీ వాటికి అతీతంగా నిరంతరం ఆనందంలో ఉండడం సాధ్యపడుతుంది. ప్రపంచానికి సంబంధించిన దిగులు పెద్దగా బాధించదు. ప్రశాంత వదనుడై సృష్టి ఆటని గమనిస్తుంటాడు తరగని చిరునవ్వుతో!
- చక్రధర్‌రావు

పారాయణ_Parayana GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పారాయణ Parayana bhakthi

పారాయణం 

రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత- ఇలా ఏదో ఒక గ్రంథ భాగాన్ని కొందరు రోజూ పఠిస్తుంటారు. తమ భక్తిశ్రద్ధలు అనుసరించి లేదా పెద్దల సూచన పాటించి వాటిని చదువుతుంటారు. వాటితో పాటు సహస్ర నామాలు, స్తోత్రాలు, చాలీసాలు ఎన్నింటినో పఠిస్తుండటం పరిపాటి. స్త్రీ పురుష భేదాలకు, బాలలు వృద్ధులు అనే తేడాలకు తావు లేకుండా అందరూ కలిసి పారాయణం చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటారు. దినచర్యలో భాగంగా ఇళ్లలో, ప్రార్థనా మందిరాల్లో, ఇతర ప్రదేశాల్లో నియమ నిష్ఠలతో పఠించడమే వారికి ఆనందదాయకం.

‘ఆధ్యాత్మిక గ్రంథాల్ని ఏళ్లతరబడి పారాయణ చేస్తే సరిపోతుందా’ అని ప్రశ్నించేవారున్నారు. ఎటువంటి మానవ ప్రయత్నమూ చేయకుండా, అన్నీ దేవుడే చూసుకుంటాడంటూ పఠిస్తూ కూర్చోవడం సరైనదేనా అని వారు అడుగుతుంటారు. పురాణాల్ని పారాయణం చేయడంవల్ల మానసిక శాంతి కలుగుతుందని అనుభవజ్ఞుల మాట. ఆ గ్రంథాల పఠనం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. చక్కని భాష వస్తుంది. పౌరాణిక, ఇతిహాస కథలు కంఠస్థమవుతాయి. ఉమ్మడి పారాయణం ఐక్యభావాలకు మూలమవుతుంది.

సృష్టిలోని శాశ్వత సత్యాల్ని తరచుగా గుర్తుచేసుకోవడానికి పారాయణమే దోహదకారి. పండిత పామరులకు, సాధువులు సాధకులకు, సర్వులకూ ప్రయోజనకరం. అది ఒక నిరంతర సాధన. మనసును భగవంతుడి వైపు మళ్లిస్తుంది. ధ్యానం, యజ్ఞం, అర్చన, జపం, యోగం- అన్నీ సాధనకు ఉపయోగపడతాయి.

ఏ పనినైనా చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, చూసి సంతోషించేవాడు- అందరూ ఫలితం రీత్యా భాగస్థులవుతారు. అవి లౌకిక, అలౌకిక ఫలితాలని రెండు విధాలుగా ఉంటాయి. భగవద్గీత, సహస్ర నామ పారాయణం వంటివి అమృత తుల్యాలు. అందుకే వాటిని గీతామృతం, నామామృతం అని పిలుస్తారు. ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు. దాన్ని రావణాసురుడితో యుద్ధానికి దిగేముందు రాముడు పఠించడమే ఉత్తమ ఫలితమిచ్చిందంటారు.

స్తోత్రాల్ని ఆత్మవిశ్వాసంతో పఠించాలి. భగవద్గీతను రోజూ భక్తితో పారాయణ చేయడం, జీవితంలో ప్రశాంతతకు కారణమవుతుంది. భాగవతాన్ని మించిన మానసిక ఔషధం లేదంటారు విజ్ఞులు. భాగవతం అంటే- కేవలం కృష్ణుడి కథలు కావు. మహాభక్తుల చరిత్రలెన్నో అందులో ఉన్నాయి. వాటిని పఠించడం స్ఫూర్తిదాయకం.

ఆరాధ్య దైవాలకు ఉన్నంత శక్తి మహాభక్తులకూ ఉంటుంది. ఆంజనేయుడు రామభక్తుడు. ‘మీ అభిమతాలు నేనూ తీరుస్తాను’ అని రామభక్తులతో ఆయన పలు సందర్భాల్లో అంటాడు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు వంటి భక్తుల చరితలు ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. అందుకే అవి నిత్యపారాయణ గ్రంథాలుగా నిలిచి ఉన్నాయి. పారాయణం చేసే భారతీయుల్లో, అందులోనూ తెలుగువారిలో అనేక ప్రగాఢ విశ్వాసాలున్నాయి. రుక్మిణీ కల్యాణం, శ్రీకృష్ణ జనన ఘట్టం, అంబరీష ఉపాఖ్యానం, విరాటపర్వ పారాయణాలే వీటికి ఉదాహరణలు. రామాయణంలోని సుందర కాండ, లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర స్తోత్రం, విష్ణు-పార్వతీదేవి సహస్ర నామాలు, శివ పంచాక్షరి-నారాయణ మంత్రం పఠనాలూ భక్తుల నమ్మకాలకు ప్రతీకలు.

నరమూర్తిని కీర్తించే బదులు హరిమూర్తిని స్తుతించడం ఎంతో మేలు అంటారు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చన కారణంగా భక్తులు కృతకృత్యులయ్యారు. కలియుగంలో నామ సంకీర్తనమూ అదే ఫలితమిస్తుందని విశ్వాసం. భగవంతుడి నామస్మరణతో మానవుడు భవసాగరం దాటగలడన్నదే పురాణగాథల సారాంశం!                           - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

జాతకచక్రంలో రోగ పరిశీలన_Diagnosis in the horoscope

జాతకచక్రంలో రోగ పరిశీలన, Diagnosis in the horoscope, jatakam jyotisam




జాతకచక్రంలో రోగ పరిశీలన

జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం, షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని, ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది.వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నవ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.

రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన,వాతావరణం,నీరు మార్చటం వలన, రత్నధారణ వలన,జప దాన హోమాదుల వలన,ఔషదాల వలన, మంత్రోచ్ఛారణ వలన,కాస్మిక్ కిరణాల ద్వారా,కలర్ ధెరపీ ద్వారా, అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును,ముఖ్యంగా ఆదిత్య హృదయం, విష్ణు సహస్త్ర పారాయణం, దుర్గాసప్తశ్లోకి,సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.


అగ్నితత్వ రాశులైన మేషం,సింహం,ధనస్సు లగ్నాలై 6 వ భావంతో సంభందం ఉన్న రోగం వచ్చిన తట్టుకోగలరు.రోగనిరోదక శక్తి కలిగి ఉంటారు.

భూతత్వ రాసులైన వృషభం,కన్య,మకరం లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు.వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది.

వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న కుంభ రాశి మినహా మిగతా రెండు రాశుల వారికి రోగం తొందరగా నయమవ్వదు.

జలతత్వ రాశులైన కర్కాటకం,వృశ్చికం,మీన లగ్నాలై 6 భావంతో సంబంధం ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది.సులభంగా రోగాలకు లొంగిపోతారు.

లగ్నం శరీరం, 6 వ భావం రోగ స్ధానం, 6 వ భావానికి వ్యయ స్ధానం పంచమం. పంచమం 6 వ భావానికి వ్యయం కాబట్టి రోగాన్ని నాశనం చేస్తుంది.4 వ భావం రోగాన్ని వృద్ది చేస్తుంది. 6 వ భావంతో ఏర్పడిన రోగం 5 వ భావంతో రోగాలను వదిలించుకోచ్చును. లగ్నభావం 5,6 భావాలతో సంబందం ఉంటే రోగం వచ్చిన తగ్గించుకోవచ్చు.

లగ్నం 6 వ భావం కంటే 5 వ భావంతో బలంగా ఉంటే రోగాలు దరిచేరవు. లగ్నం,5 వ భావం బలంగా ఉంటే రోగం వచ్చిన పరిహార క్రియల ద్వారా రోగ నివారణ చేసుకోవచ్చు.మేషాదిగా రవి 5 వ రాశియైన సింహా రాశికి అధిపతి కనుక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం ముందు “ఆదిత్య హృదయం”సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే రోగ నివారణ జరిగి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది.

లగ్నభావం 4 వ భావంతో సంబంధం ఉంటే రోగం నయమవటం కష్టం.ఎందుకంటే 6 వ భావానికి 4 వ భావం 11 వ భావం ఉపచయం కాబట్టి.ఉపచయం అంటే అబివృద్ధి.రోగాన్ని వృద్ధి చేస్తుంది.

శని,కుజ,రాహువులు రోగాన్ని పెంచితే ,రవి,గురువు లు రోగాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి.

శుక్ర మూఢమి లేదా మౌఢ్యమి_SukraMoudyami


శుక్ర మూఢమి లేదా మౌఢ్యమి...


శుక్ర మూఢమి 28-11-2017 న శుక్ర మూఢమి ప్రారంభమై
 19-02-2018 న శుక్ర మూఢమి త్యాగం జరుగును.

బుధుడు,శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడు భూమిపైన ఉన్న మనకు బుధ,శుక్రులు కనిపించారు.అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం,శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.


శుక్రుడు సూర్యునికి అవతలివైపునకు వెళ్ళినప్పుడు “ప్రాక్ అస్తంగత్వం” అని,శుక్రుడు సూర్యునికి భూమికి మద్య అస్తంగత్వం అయినప్పుడు పశ్చాద అస్తంగత్వం అంటారు. మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు.అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి.గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.మౌఢ్యమిని మూఢమిగా వాడుకభాషలో పిలుస్తారు.ఈమూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.మూఢమి అంటే చీకటి.శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ,వెనుక 10 డిగ్రీ ల దూరము లోపు శుక్రుడన్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును.అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును.అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్రబలం ఉండదు కాబట్టి శుభకార్యాలు చేయరాదు.కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు.అలాగే ముఖ్యముగా పెళ్ళిచూపులు, వివాహం, చేయరాదు, వాహన కొనుగోలు చేయరాదు.

శుక్ర మౌఢ్యమి ఏర్పడినప్పుడు సమస్త జీవకోటి శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం,పటుత్వం ఉండదు. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రసవం జరిగినప్పుడు శుక్ర గ్రహ,రవిగ్రహ శాంతి చేయాలి. శుక్రదశ మహా దశ మరియు శుక్రుని అంతర్దశ నడుస్తున్నవాళ్ళు చాలా జాగరూకులై ఉండాలి. శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది.సముద్రం ఆటు,పోటులలో మార్పులు వస్తాయి.

శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి –శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు.ఈజన్మకు ఇంతేనని సరి పెట్టుకోవాలి. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి. మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు,శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది.ఈ మూడమిలో జప,హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.

గీతాజయంతి_GeethaJayanti

మార్గశుద్ధ ఏకాదశి, 
గీతాజయంతి....


ఈ ఏకాదశిని ‘మోక్షద’ ఏకాదశి అని పిలుస్తున్నాము. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది.

ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఇది గీతాజయంతి. ‘మోక్షద’ ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది.


వైఖానసుడు అన్నరాజు తన తండ్రి ‘నరమం’లో బాధలను పొందుతున్నట్లు కల గంటాడు. రుషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట.

ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన – విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి.

ఏకాదశి ముందు రోజు ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి. ద్వాదశినాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణచేయాలి.

ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని!
భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత!! అని మంత్రము ఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.



కర్మయోగం గీతాసారం
మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, సంశయంలో మునిగినప్పుడు, ఘర్షణ పడుతున్నప్పుడు, నైరాశ్యంలోకి వెళ్లినప్పుడు... ఇలా వెళ్లు - అని దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తుల్నే మనం గురువులుగా పిలుస్తాం. అచ్చంగా ఇలాంటి లక్షణాలన్నీ భగవద్గీతలోనూ ఉన్నాయి. విషయమేదైనా సందర్భమేదైనా ఒక సమస్యకు ఆత్మసంతృప్తి కలిగేలా చక్కటి పరిష్కారమివ్వగల సత్తా ఈ గ్రంథానికి ఉంది. అందుకే ఏ ఒక్క మనిషికో బృందానికో కాదు ఒక జాతికే దిశానిర్దేశం చేయగల మహోన్నత గ్రంథంగా శోభిల్లుతోంది. (నవంబరు 30 గీతా జయంతి)

భారతం ఓ అద్భుత ఇతిహాసం. అందులోని పాత్రలూ ఒకదానికొకటి సరితూచలేనంత మహోన్నతమైనవి. బుద్ధిపరంగా, బలం పరంగా, జ్ఞానం పరంగా ఎందరో ధీరులు ఇందులో మనకు తారసపడతారు. అయితే వారిలోని గుణదోష భేదాల కారణంగా కొందరు కౌరవుల పక్షానా మరికొందరు పాండవుల పక్షానా నిలబడ్డారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఆ కావ్యంలోని అద్భుత ఘట్టం. ఒక పక్క పాండవులూ, మరో పక్క కౌరవులూ... అక్షౌహిణుల కొద్దీ సైన్యం... గుర్రపుడెక్కల చప్పుళ్లూ... మదగజాల ఘీంకారాల మధ్య గంభీరవాతావరణం అది. అవతలి పక్క తనకు గురువులూ, మిత్రులూ, మేనమామలూ, మనవలనూ చూసిన అర్జునుడి మనసు వాళ్లతో యుద్ధం చేయడానికి అంగీకరించదు. తనను చంపడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిసినా సరే, అంతమందినీ ఎదుర్కొనగల సమర్థుడైనా సరే... పాశాన్ని వీడలేకపోతాడు. అందుకే,
న కాంక్షే విజయం కృష్ణ 
న చ రాజ్యం సుఖాని చ 
కిం నో రాజ్యేన గోవిన్ద 
కిం భోగైర్జీవితేన వా... అంటాడు.
కృష్ణా... ఆ యుద్ధంలో కలిగే విజయం కానీ, రాజ్యం కానీ, దాని ద్వారా వచ్చే సుఖాల పట్ల కానీ నాకు కోరికలేదు... అలాంటి రాజ్యం, ఆ భోగ జీవితం ఎందుకు... అనేది ఆ సమయంలో అర్జునుడి మాట. రక్త సంబంధీకులను చంపడమెలా అన్నది పార్థుడి ధర్మసంకటం. ఆ సందర్భంలో యుద్ధం చేయవలసిన ఆవశ్యకతను ధర్మబద్ధంగా చెబుతాడు శ్రీకృష్ణుడు. ఇందులో అర్జునుడికి వచ్చిన అనేకానేక అనుమానాలూ, దానికి శ్రీకృష్ణుడు చెప్పిన వివరణలూ మనం నిత్యజీవితంలో అనుసరించదగ్గ ధర్మబద్ధమైన మార్గాన్ని బోధించేవిగా ఉంటాయి. ఒక్కో సంకటం ఏర్పడ్డప్పుడు దానికి పరిష్కారాలు వెతుక్కునేందుకు దోహదపడతాయి.

గీతోపనిషత్తు 
నిజానికి గీత మహాభారత ఇతిహాసంలో ఉంది. కానీ దాన్ని గీతోపనిషత్తుగా పిలుస్తారు. ఇతిహాసాన్ని ఎవరమైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు, అవి అలా చదువుకున్నా అర్థమవుతాయి. కానీ, ఉపనిషత్తులు ఎవరికి వారు చదువుకోలేరు. వాటిని అర్థం చేసుకునేందుకు గురువు సహాయం తీసుకోవాల్సిందే. గురువు అందులోని విషయాల్ని తాను అర్థం చేసుకుని, ఆచరించి ఆయా విషయాలకు ఉదాహరణలను జోడిస్తూ శిష్యుడికి అర్థమయ్యేలా బోధిస్తాడు. అలాంటి విషయాలు ఆచరణీయాలుగా మారతాయి. గీతను చెప్పడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువుగా మారాడు. ఆయన చెప్పిన ఆ వాక్యాలను ఎందరో మహనీయులూ, గురువులూ పారాయణం చేశారు. అందులోనే అద్వైతాన్నీ, ద్వైతాన్నీ, విశిష్టాద్వైతాన్నీ దర్శించుకున్నారు. శంకారాచార్యుల వారు భజగోవిందంలో గీత గొప్పదనాన్ని చెబుతారు. భగవద్గీతలోని ఒక్కశ్లోక భావాన్ని అర్థం చేసుకుని దాన్ని మననం చేసుకుంటూ, ఆచరణలో పెడుతూ జీవిస్తే చాలు... అటువంటి వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. మరణ సమయంలో ఆ జీవికి యమదూతలతో చర్చే అవసరం ఉండదు అంటారు శంకరులు. ఎంతటి మహత్తర గ్రంథం కాకపోతే ఏక శ్లోకం ప్రాణికోటికి ఉత్కృష్టమైన మోక్షమార్గాన్ని చూపగలదు! అలాగని గీతాచార్యులు సాధారణ మానవులకు అర్థం కాని భాషలో, రుషితుల్యులకు మాత్రమే సాధ్యమయ్యే కర్మలు చేయమంటూ నీతివాక్యాల్ని వల్లించడు. అరటిపండు వలిచి పెట్టినట్టు చేయాల్సిన పనిని కళ్లకు కడతారు. ఎంతో లోతైన సముద్రం మీదా గాలిబుడగలా తేలుతూ ప్రయాణం చేయడమెలాగో విశదీకరిస్తాడు. పనిచేయమంటాడు...ఎంతలా అంటే... మనకు మనమే యజమానులం అన్నట్టూ... ఆ పని చేయడంలో అంతకు మించిన నిష్ణాతులెవ్వరూ ప్రపంచంలో లేరు అన్నట్టూ. అయితే, ఫలితాన్ని మాత్రం తనకే వదిలేయమంటాడు.
కర్మణ్యే వాధికారస్తే 
మాఫలేషు కదాచన 
మాకర్మఫలహేతుర్భూః 
మాతే సంగోస్త్వకర్మణి
కర్మ చేయడానికే నీకు అర్హత ఉంది. కానీ, ఆ కర్మ ఫలం మీద నీకు ఎలాంటి అధికారమూ లేదు. కర్మలకు నువ్వే హేతువువని ఎప్పుడూ భావించకు. ధర్మాన్ని నిర్వహించడం పట్ల ఎప్పుడూ అనాసక్తుడవుగా ఉండకు... అని దీని అర్థం. మనిషికి మనశ్శాంతిని కలిగించే గొప్ప శ్లోకం ఇది. తనకు సంక్రమించిన పనిపట్ల ప్రేమతో తప్ప దాని మీద ఆశతో చేసే పని మనిషిని స్థితప్రజ్ఞుడిగా ఉండనీయదు మరి! ఆ సంతోషానికీ దుఃఖానికీ దూరంగా భగవంతుడి యందు మనసుని లగ్నం చేసి జ్ఞానంతో జీవితాన్ని గడపమని గీతాచార్యులు అర్జునుడి పేరిట మానవాళికి బోధించింది ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే!


భగవద్గీత మహాత్మ్యం

మార్గశిర శుద్ధ ఏకాదశి - శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ని నిమిత్తంగా చేసుకొని సకల మానవాళికి ‘గీత’ బోధించిన రోజు. ఎవరైనా సరే, తాము అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే అదృష్టమనీ, అన్నింటిలోనూ అపజయాలు ఎదురవుతుంటే తలరాత బాగోలేదని అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నైజం. అయితే మన తలరాత ఎక్కడో లేదు, ‘గీత’లోనే ఉంది. అదే భగవద్గీత. అది తెలుసుకుంటే ఎవరూ ఏ ఆందోళనకూ గురికావలసిన అవసరం ఉండదు.

గీత అంధకారంలో ఉన్నప్పుడు ఒక వెలుగురేఖ కోసం వెతుకుతాం. దుఃఖసాగరంలో మునిగి ఉన్నప్పుడు ఒడ్డుకు చేర్చగల ఒక అమృతహస్తం కోసం ఎదురుచూస్తాం. సరిగ్గా అలాంటి సమయంలోనే భగవద్గీత అవసరం అవుతుంది. గీతలో.. నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు. గీతాశ్రవణ పఠనలు జరిగేచోట నేను సర్వదా వసింపగలను అని శ్రీమహావిష్ణువు అర్జునునితో చెప్తున్న దానిని బట్టి గీతను చదివేచోట, వినేచోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది. ఒక్కమాటలో... భగవద్గీత... మనందరికీ బతుకుబాట.

ఉపనిషత్తుల సారాంశం: సకల జ్ఞానస్వరూపాలైన ఉపనిషత్తులను గోవులుగానూ, అర్జునుణ్ణి దూడగానూ చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత. ఉపనిషత్తులంటే సర్వకాల సర్వజనులకు వర్తించేవి అని అర్థం. మనిషికి కలిగే ఎటువంటి సందేహానికైనా వాటిలో సమాధానం లభిస్తుంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధసమయంలో పార్థుడికి కలిగిన రకరకాల సందేహాలను తీర్చేందుకు బోధించిన గీత సాక్షాత్తూ భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతకు 18 అధ్యాయాలున్నట్లే 18 పేర్లున్నాయి. అవి 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12. చిదానంద 13. భవఘ్ని 14. భయనాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞానమంజరి.

ఏం చదువుకున్న తర్వాత ఇంకా చదవడానికి మిగిలే ఉంటుందో - అది విజ్ఞానం! ఏం తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో - అది ఆధ్యాత్మ జ్ఞానం!

ఆధ్యాత్మ జ్ఞానం లేకుండా మిగతా లౌకిక జ్ఞానాలన్నీ స్వార్థాన్నే ప్రేరేపిస్తాయి. మనదేశం ఈ స్వార్థంలోనే కొట్టుకుపోవడానికి కారణం - ప్రస్తుతం మన విద్యావ్యవస్థలో ఆధ్యాత్మ జ్ఞాన బోధన లేకపోవడమే!

ఈ జ్ఞానం అవసరాన్ని గుర్తించడం వల్లే, న్యూజెర్సీ (యూఎస్‌ఏ)లోని ‘సెటన్ హాల్ యూనివర్సిటీ’ లో చేరే ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా భగవద్గీత చదవాలనే నిబంధన పెడుతూ, ఈ కోర్సుకు ‘ద జర్నీ ఆఫ్ ట్రాన్స్‌ఫామేషన్’ అని పేరుపెట్టారు. మరి ‘గీత’ పుట్టిన భారతదేశంలో మాత్రం ‘సెక్యులర్’ పేరుతో దీన్ని దగ్గరికే రానివ్వకపోవడం దురదృష్టకరం. పక్కింట్లో ‘గీత’ వినిపిస్తుంటే ఎవరో టపా కట్టేసుంటారనే స్థితి నుంచి, ‘తెల్లారింది... పక్కింటివాళ్లు లేచి పనులు చేసుకుంటున్నారు’ అనే స్థితికి సంకేతంగా ఒక ఉద్యమ స్థాయిలో గీతా ప్రచారం జరగవలసి ఉంది!

అందుకే గీత నేర్చుకుందాం. రాత మార్చుకుందాం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం. భగవద్గీత... ఉత్తమ జీవన విధాన మార్గం! మానవులకు ఆశాదీపం! సాధకులకు కల్పవృక్షం!

మనలోని కోరికలను, బాధలను నశింప చేయడానికి, సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగానూ, ఔషధ గుళికగానూ వాడుకోవచ్చు. కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవద్గీతను పఠించాలి లేదా వినాలి.

నిత్యం ఇంద్రియాల ద్వారా తెలిసీ తెలియక చేసే పాపాలన్నీ గీతాపఠనం వల్ల నశించిపోతాయని గీతా మాహాత్మ్యం తెలుపుతోంది. గీతామకరందాన్ని సేవించడమేకాదు, అందులోని మంచిని ఆచరిద్దాం. కష్టాల కడలినుంచి సుఖాల తీరానికి చేరుదాం. ఈ గీతాజయంతి నాడైనా కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం.

భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు.

భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

గురువు సదాశివుడు_gurusadasiva

గురువు సదాశివుడు_gurusadasiva

గురువు సదాశివుడు


సాధనలో అనేక వైక్లబ్యాలుంటాయి. ‘నేను మంచి మార్గంలో వెడుతున్నా’ అనుకుంటూ శిష్యుడు దారితప్పి ధర్మానుష్ఠానంలో వైక్లబ్యాన్ని పొందుతాడు. వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతుంటాడు. ధర్మం అత్యంత ప్రధానం.  పరమ సున్నితమైన విషయమది. అంత సున్నితమైన ధర్మాన్ని ఆచరింపచేయడంలో గురువు దిద్దుతుంటాడు శిష్యుణ్ణి.గురువుగారితో బాగా అంటకాగి తిరగడం అలవాటయింది. గురుబోధలు వింటూ తన సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. గురువుగారికి అనుమానమొచ్చింది. పిలిచి – ’ఏమిరా, నేను గృహస్థాశ్రమంలో లేనా! నా భార్యాబిడ్డల్ని చూడ్డం లేదా ! ధర్మం ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వారి బాగోగులను చూడడం.’’ అని హెచ్చరించి దిద్దుతాడు.
’కర్తవ్యం’ అని ఒక మాట ఉంది. గురువు గొప్పదనమంతా కర్తవ్యనిష్ఠలో ఉంది. గురువు ఒకసారి చెప్తాడు.. వినలేదు, రెండుసార్లు, మూడుసార్లు చెప్తాడు.. వినలేదు. తను బతికున్నంత వరకు చెపుతుంటాడు తప్ప ‘నీ ఖర్మ’ అనడు. అది కర్తవ్యం. అంటే చేయవలసిన పని తాను చేయడం. ఫలితం–ఈశ్వరానుగ్రహం. కొడుకును కన్న తరువాత వాడికి విద్యాబుద్ధులు నేర్పించడం, వాడికి సరైన ఆదర్శంగా నిలబడడం, వాడు మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా తాను జీవించడం గృహస్థు ధర్మం. కొడుకు అలాగే ఉంటే సంతోషం. అలా ఉండకపోతే? బెంగపెట్టేసుకుని గృహస్థు అనుష్ఠానం మానేయకూడదు. తన అనుష్ఠానం తాను చేసి వెళ్ళిపోవాలి. అది కర్తవ్యం.
ఈశ్వరునిపట్ల నమ్మకం వేరు, ఆశ్రమధర్మం వేరు. ఆశ్రమధర్మాన్ని ఆశ్రమ ధర్మంగానే పట్టుకోవాలి, నీవు పండేవరకు. నీ కర్తవ్యం పూర్తయ్యేవరకు నీవలాగే పట్టుకోవాలి.
శిష్యుని పొరబాట్లను గురువు దిద్దుతాడు. ఉత్థానపతనాలలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు. గురువు ఒక్కొక్కసారి తీవ్రస్వరంతో మాట్లాడతాడు. కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్కబెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది ఎలా మాట్లాడినా లక్ష్యం ఒక్కటే. శిష్యుణ్ణి కాపాడుకోవాలి. ధర్మంనుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునే ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. అలా గురువు బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా తన కర్తవ్యాన్ని పాలిస్తాడు. వెరసి గురువు పరబ్రహ్మ.
Tags: 
guru
student

సంతానం (1955)కనుమూసినా కనిపించే నిజమిదేరా!_SANTANAM

పాటతత్వం  
భువనచంద్ర గీత రచయిత
చిత్రం: సంతానం (1955) 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
రచన: అనిసెట్టి 
గానం: ఘంటసాల
‘సంతానం చిత్రంలో, చిన్న పిల్లలు తప్పిపోయిన సన్నివేశంలో చిత్రీకరించిన ఈ పాట అంటే నాకు ప్రాణం.  కనుమూసినా కనిపించే నిజమిదేరా! ఇల లేదురా నీతి! ఇంతేనురా లోకరీతి!అంటూ మానవత్వాన్ని నిద్రలేపుతున్న పాట ఇది. ఈ మేలుకొలుపు పాటను నా చిన్నతనంలో మా అమ్మగారు నాకు నేర్పారు. ఇది పాడినప్పుడల్లా నాన్నగారు నన్ను మెచ్చుకునేవారు. మా నాన్నగారు గతించిన దుఃఖంలో నుంచి బయటపడేలా నన్ను ఓదార్చిన పాట. నా బాల్యంలో చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితి మాది. కష్టపడటం తెలిసినవాడు ఎన్నిసార్లు కిందపడ్డా లేస్తాడు.‘మానవులంతా నీతి నియమాలు లేకుండా జీవిస్తున్నారు. అది సరి కాదు. మానవులంతా జ్ఞానమార్గంలో పయనించాలి’ అంటూ ఉత్తేజపరిచే మేలుకొలుపు పాట ఇది.నిద్ర నుంచి జాగరూకతలోకి ఒక మేలుకొలుపు. నిద్ర అనే అజ్ఞానం, చీకటుల నుంచి మెలకువ అనే వెలుగు, జ్ఞానాలలోకి పయనించమని బోధించడమే ఈ పాట అనిపిస్తుంది నాకు. సుఖదుఃఖాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు. ఒకనాడు సుఖంగా ఉంటే, మరొకనాడు దుఃఖానికి లోనవుతాం. ఒకనాడు దుఃఖంగా ఉంటే మరొకనాడు సుఖసంతోషాలతో జీవిస్తాం. రెండు దుఃఖాల మధ్య వచ్చే సుఖం.. మనిషికి కావలసినంత సుఖాన్నిస్తుంది. రెండు సుఖాల మధ్య వచ్చే దుఃఖం... మనిషిని కుంగతీసేంత దుఃఖాన్నిస్తుంది. ‘కనుమూసినా కనిపించే నిజమిదేరా’ అంటూ ‘అనిసెట్టి’ చెప్పిన వేదాంతం ఇదే.కలకాలం ఈ కాళరాత్రి నిలువదోయి మేలుకో...అనే వాక్యంలో ఈ విషయాన్నే విశదపరిచారు రచయిత. ‘సుఖం వలన కలిగే సుఖం విలువ’ తెలియాలంటే దుఃఖాలు అనుభవించాలి. మానవ జీవితంలో కష్టసుఖాలు పగలు, రాత్రి లాగ ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. సమతుల్యత పాటించాలి.
ఉదయకాంతి... మదికి శాంతి...రాత్రి విరజిమ్మిన చిమ్మచీకట్లు, ఉదయం సూర్యుడు ఉదయించగానే మటుమాయమవుతాయి. జీవితంలో అందరికీ ఒక ‘మేలుకొలుపు’ కావాలి. మనం కులమతాల పేరు మీద దెబ్బలాడుకుంటున్నాం, ఎన్ని లక్షలమందో పుడుతున్నారు, ఎంతోమంది శరీరాన్ని వదులుతున్నారు. మనం ఈ లోకానికి అతిథిగా వచ్చాం, అలాగే వెళ్లిపోతాం. జీవితంలోని ఆశలు అనేవి మెరుపుల్లాంటివి.. చావు అనివార్యం. చిట్టచివరి క్షణంలో నా వాళ్లకి ఇంత ఇవ్వాలి అని ఆలోచించకుండా ఉండాలి.భ్రమలు గొలిపే మెరుపులేరా జగతిలో ఆశలు...మనమందరం ఇద్దరు తల్లుల ఒడిలో పెరుగుతాం. మొదటిది కన్నతల్లి కడుపులో. అందులో నుంచి బయటకు వచ్చాక ఇక లోపలకు Ðð ళ్లలేం. ఆ తరువాత మనం భూమి తల్లి ఒడిలో పడతాం. ఆ తల్లి ఒడిలో నడయాడుతాం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ భూమి తల్లి ఒడిలోనే. చివరగా ఆ తల్లి ఒడిలోకి వెళ్లాక ఇక బయటకు రాలేం. ఈ పాటలోని ఒక్కో అక్షరం ఆణిముత్యం. జీవిత సత్యం. ప్రతి ఒక్కరూ జీవితం గురించి అర్థం చేసుకోవాలని పలికే పాట ఇది.
– సంభాషణ: డా. వైజయంతి
సంతానం సాంగ్స్ | కను మూసినా కనిపించే సినిమా: సంతానం తారాగణం: సావిత్రి శ్రీ రంజని, కుసుమ, నాగేశ్వర్ రావు, రేలంగి, రంగారావు, చలం, అమర్నాథ్, మిక్కిలినెని, రమణ రెడ్డి, కుటుంబ రావు దర్శకుడు: సి.వి.రంగనథ్ దాస్ సంగీత దర్శకుడు: యస్.దక్షిన మూర్తి. విడుదల: 1955 పాటలు: కను మూసి అమ్మ మాయమ్మ చల్లని వెన్నెలలొ దేవి శ్రీ దేవి మురలిగానమిదెన నిదురపొర తమ్ముడ తొలివలపుల

కాలభైరవం_KalabhairavaGuuru

దేవరాజ సేవ్యమానం... 

కాలభైరవం

    ‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి మృత్యుదేవతను సైతం భయపెట్టగల మహిమాన్వితుడు శ్రీ కాలభైరవుడు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం.
తిరుమలలో ఏవిధంగా అయితే ముందుగా వరాహస్వామిని సందర్శించుకున్న తర్వాతే వేంకటేశ్వరుని పూజిస్తారో, కాశీనగరంలో కూడా అదేవిధంగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని సేవించకుండా చేసిన కాశీయాత్ర నిష్ఫలమని సాక్షాత్తూ శివుడే కాలభైరవుడికి వరమిచ్చినట్లు పురాణోక్తి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రపటానికి షోడశోపచార పూజలు చేసి, మినప గారెలను, కల్లును (మిరియాల పొడి వేయని బెల్లం పానకం కల్లుతో సమానమని శాస్త్రోక్తి) నివేదిస్తే కాలభైరవుడు ప్రసన్నుడై, గ్రహదోషాలను రూపుమాపుతాడని, కోరిన వరాలనిస్తాడని ప్రతీతి. కాలభైరవుడి పటం లభించకపోతే శివలింగం ముందు కూర్చుని, కాలభైరవ అష్టకం పఠించవచ్చు. (10-12-2017 కాలాష్టమి)

బాహుబలి_Bahubali

బాహుబలి Bahubali prabhas
     
మహేంద్ర బాహుబలి పాలనలో మాహిష్మతి రాజ్య  ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. కొంతకాలం గడిచాక మాత్రం  రాజ్యంలో దోపిడీలు, దొమ్మీలు ఎక్కువయ్యాయి. ఇదంతా ఒక ఎత్తయితే ప్రజలు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించడం మరో ఎత్తు. ‘డెమోక్రసీ మూమెంట్‌’లో ప్రజలు  చురుగ్గా పాల్గొంటున్నారు. సకల జనుల సమ్మెతో మాహిష్మతి పాలనా యంత్రాంగం స్తంభించిపోయింది. ఈ ఉద్యమాలకు సింగమలై అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు ఇంటెలీజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
‘‘ఎన్నాళ్లీ  రాజుల పాలన? అమరేంద్ర బాహుబలి పోతే మహేంద్ర బాహుబలి, అతడు పోతే సురేంద్ర బహుబలి అతడు  పోతే వీరేంద్ర బాహుబలి...ఇదేనా వరుస? కామన్‌ మెన్‌ కామన్‌ మెన్‌గానే ఉండాలా? మన ఎల్లయ్యో, పుల్లయ్యో ఈ మాహిష్మతికి ఎందుకు రాజు కాకూడదు? సిక్స్‌ప్యాక్‌ ఉన్నవాళ్లు మాత్రమే సీటు మీద కూర్చోవాలని  ఏ  శాసనం చెబుతుంది?’’ అంటూ నిప్పులు చెరుగుతున్నాడు సింగమలై. ‘రాజుల పాలన అంతరించాలి. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి’ అంటూ ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు ఇస్తున్నారు. ‘‘ఈ సింగమలై ఎవడు? అసలు ఈ పేరు మన రాజ్యప్రజలు పెట్టుకునే పేరులా లేదే? అతను ఎవరో,  అతని పుట్టుపూర్వోత్తారాలు ఏమిటో నాకు తక్షణం తెలియాలి’’ అని ఇంటెలీజెన్స్‌  డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించాడు మహేంద్రబాహుబలి. కానీ నెలరోజులు గడిచినా ఈ ‘సింగమలై’ గురించి సింగిల్‌ వర్డ్‌ కూడా కనిపెట్టలేకపోయింది ఇంటెలీజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌. ఒకరోజు...
‘‘మీ దర్శనం కోసం ఎవరో యువకుడు వేచి చూస్తున్నాడు. లోనికి రమ్మంటారా?’’ మహేంద్ర బాహుబలిని అనుమతి కోరాడు  భటుడు.‘‘నా మూడ్‌ ఏమీ బాగలేదు. అయినా సరే రమ్మను. ఎవడి బుర్రలో ఏ ఐడియా ఉందో’’ ఆదేశించాడు రాజు. ఆ యువకుడు వచ్చి  మహేంద్ర బాహుబలి ముందు నిలుచున్నాడు.‘‘ఎవరు నువ్వు?’’ ఉక్కు స్వరంతో అడిగాడు మహేంద్ర బాహుబలి.‘‘రాజా...బాహుబలి–1 ఏ ప్రశ్నతో ముగిసింది?’’ రాజును సూటిగా అడిగాడు ఆ యువకుడు.‘‘ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. అయినా సరే నీ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాను... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నతో ‘బాహుబలి–1’ ముగుస్తుంది. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు?’’ అడిగాడు రాజు. అప్పుడు స్వరం పెంచిన ఆ యువకుడు ఇలా అన్నాడు...
‘‘బాహుబలి–2 మాత్రం ఏ ప్రశ్నతోనూ ముగియలేదు. పైగా కన్‌క్లూజన్‌ అని కూడా చెబుతుంది. కానీ అది నిజం కాదు మహారాజా...ఒక సంచలన రహస్యం చెప్పకుండానే బాహుబలి–2 ముగిసింది. ఇది రాజమౌళి కుట్ర అని నేను అనుకోవడం లేదు. కచ్చితంగా కరణ్‌ జోహార్‌ కుట్రే’’ ‘‘సరే, ఆ కుట్ర గురించి  సుత్తి లేకుండా సూటిగా చెప్పు’’ ఆదేశించాడు మహేంద్ర బాహుబలి.‘‘అలాగే చెబుతాను మహారాజా... ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు మట్టప్ప’’ అన్నాడు యువకుడు.‘‘కొంపదీసి మా కట్టప్పకు దూరపు చుట్టం కాదు కదా?’’ ఆశ్చర్యంగా ఆరా తీశాడు  మహేంద్ర బాహుబలి.‘‘దూరపు బంధువుని కాదు... దగ్గరి బంధువుని కాదు... స్వయానా కట్టప్ప  కన్న కొడుకును. నాకు మట్టప్ప అని ఆయనే పేరు పెట్టారు. నా బుర్రలో  ఉందంతా మట్టేనని ఈ పేరు పెట్టలేదు మహారాజా... ఎదురొచ్చిన శత్రువులను ధైర్యంగా మట్టుపెట్టాలని మట్టప్ప అని పేరు పెట్టారు’’ వివరించాడు మట్టప్ప.
‘‘నీ బ్రెయిన్‌ దొబ్బినట్లుంది. కట్టప్పకు మ్యారేజ్‌ కాలేదన్న విషయం మాహిష్మతికే కాదు...యావత్‌ ప్రపంచానికి  తెలుసు’’ విసుగ్గా అన్నాడు రాజు.‘‘అదే పొరపాటు. కట్టప్పగారు సుట్టమ్మ అనే యువతిని ప్రేమించాడు. ఈ విషయం  రమ్యకృష్ణకు తెలిస్తే బాగుండదని రహస్య వివాహం చేసుకున్నాడు. కట్టప్ప–సుట్టమ్మలకు పుట్టిన సంతానమే నేను. మీకు డౌటు ఉంటే డీఎన్‌ఏ టెస్ట్‌ కూడా చేసుకోవచ్చు మహారాజా’’ సవాలు విసిరాడు మట్టప్ప.‘‘హండ్రెడ్‌ పర్సంట్‌ నమ్ముతున్నాను. అది సరే, ఇలా సడన్‌గా ఊడిపడ్డావేమిటి?’’ అడిగాడు బాహుబలి.‘‘ ఇంట్లో  ఖాళీగా కూర్చునే బదులు  ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా! అని అమ్మ తిడుతుంటే ఉద్యోగం వెదుక్కోవడానికి  ఇలా వచ్చాను. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి మహారాజా’’ దీనంగా వేడుకున్నాడు మట్టప్ప.
‘‘నీకు ‘ప్ర.ర.అ’ అనే పదవి ఇస్తున్నాను’’ అన్నాడు బాహుబలి.‘‘అదేం పోస్ట్‌ మహారాజా... ప్ర.ర.అ అంటే పాగల్‌గా అన్నట్లుగా వినిపిస్తోంది’’ సందేహంగా అడిగాడు మట్టప్ప. ‘‘ప్ర.ర.అ అంటే ప్రజా రక్షణ అధికారి అని. ఇది క్యాబినెట్‌ ర్యాంక్‌ పోస్ట్‌. పండుగచేస్కో’’ అని మట్టప్ప భుజం తట్టాడు బాహుబలి. ఆనందభాష్పాలతో రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు మట్టప్ప.‘‘నువ్వు అర్జంటుగా చేయాల్సిన పని ఆ సింగమలై ఎవడో  కనిపెట్టడం. ఆ పనిలోనే ఉండు. వెళ్లు’’ అని ఆదేశించాడు మహేంద్ర బాహుబలి. రెండో రోజు బాహుబలి దగ్గరకు వచ్చిన మట్టప్ప ‘‘ఆ సింగమలై ఎవడో కనిపెట్టేశా మహారాజా’’ అన్నాడు ఆనందంగా.
‘‘తండ్రికి తగ్గ కొడుకువు అనిపించావు మట్టప్పా. ఇంతకీ ఆ సింగమలై ఎవరు?’’ ఆసక్తిగా అడిగాడు బాహుబలి.‘‘బాహుబలి–2 గురించి తెలుసుకదా మీకు. అందులో భల్లాలదేవకు పెళ్లికాకుండానే భద్ర అనే కొడుకు ఉంటాడు. ఇదేలా సాధ్యం? అని అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. భద్ర అనేవాడు ఫేక్‌ సన్‌. అనగా నకిలీ కుమారుడు. నిజానికి భల్లాలదేవకు పెళ్లి అయింది. అది కూడా మా నాన్నలాగే సీక్రెట్‌ మ్యారేజ్‌. ఎమీ జాక్సనీ అనే యువతిని భల్లాలదేవ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన సంతానమే ఈ సింగమలై. వీడి అసలు పేరు...ప్రభుదేవా! యుద్ధంలో ఎలాగు మీతో గెలవలేడు కాబట్టి, ప్రజలను ఆయుధంగా మలుచుకొని సింగమలై పేరుతో ముందుకు వచ్చాడు.
 వీడిని చంపడం మాట అలా ఉంచండి... చిన్న మాట అన్నాసరే... మనోభావాలు దెబ్బతింటాయి. ప్రజలు ఆగ్రహోదగ్రులవుతారు. రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే మహారాజా’’ తాను చెప్పాల్సింది చెప్పాడు మట్టప్ప.మహేంద్ర బాహుబలి కళ్లు అగ్నిగుండాల య్యాయి. పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి. 
‘అశుభం’ అనే కార్డు తెర మీద పడడంతో ‘బాహుబలి–3’  సినిమా ముగిసింది.
– యాకూబ్‌ పాషా

గురువుకోసం జగద్గురువు రామానుజుడు_Ramanuja

Ramanuja guru, jagdguru


     రామానుజుడు దినదిన ప్రవర్థమానమవు తున్నాడు. చిన్ననాడే ఆ చిన్నవాడికి పెద్ద విషయాలు అంతుపడుతున్నాయి. ఎవరైనా వేదాంత విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ బాలుడు కనులతోనే వింటాడట. పాలసంగతేమో గాని, గాలి అంటే చాలా ఇష్టం. గాలి సోకితే చాలు ఏడుపు రాదు. వాయుభక్షకుడా? ఇవన్నీ సర్పలక్షణాలు కదా అని తల్లిదండ్రులు ఆలోచించే వారు. అన్నప్రాశన నాడు రామానుజుడు బంగారం పట్టుకుంటాడా లేక పుస్తకం తాకుతాడా అని అందరూ చూస్తూ ఉంటే, బాలుడు గబగబా పాకుతూ వెళ్లి కేశవసోమయాజి తిరువారాధన మందిరానికి చేరుకుని అక్కడ నారాయణ విగ్రహాన్ని తదేకంగా చూస్తున్నాడట. 

ఓనమాలు 
అక్షరాభ్యాసం నాడు, తండ్రి ఓం నమః అని రాసి దిద్దమంటే అదేమిటని దాని అర్థమేమిటని అడిగాడట. అర్థం చెప్పేదాకా దిద్దలేదు. అర్థం చెప్పిన తరువాత తానే స్వతంత్రంగా ఓం నమః అని రాసి చదివేసరికి కేశవసోమయాజి ఆశ్చర్యపోయాడు. విన్నది విన్నట్టు చెప్పగలవాడు, ఒక సారి బోధిస్తే మళ్లీ చెప్పనవసరం లేని వాడు ఇతడు ఏక సంథాగ్రాహి అని గమనించాడు. రామానుజుని సమక్షంలో వేదాంత చర్చలు చేస్తే చాలు ఆ మాటలు ఆ విధంగానే చెప్పి తండ్రిని అదేమిటని అడిగేవాడట. ఒక్కరోజులో అక్షరాలు, మరోరోజున గుణింతము, ఆ తరువాత రోజు వర్ణక్రమము, మరునాడు పేర్లు వ్రాయడం, బాలశిక్ష అత్యంతవేగంగా ముగిసింది. రెండో మారు చెబితే ఎందుకు చెప్పిందే మరలా చెబుతారు అని అడిగేవాడట. పుట్టగానే పరిమళించిన నిగమ సుమము రామానుజుడు. బాలుడు పెరుగుతున్నాడు. ఆజానుబాహువవుతున్నాడు. మహాపురుష లక్షణాలు పొడగడుతున్నాయి. 

యుక్తవయసులో రామానుజునికి ఉపనయన సంస్కారం చేసినారు. వేదవిద్య ప్రారంభించారు. మూలము, క్రమము, జట, ఘన పాఠములు బోధిస్తున్నారు, అతను శరవేగంగా గ్రహిస్తున్నాడు. అప్పటినుండి త్రికాల సంధ్యావందనములు తప్పడం లేదు. సంస్కృత తమిళ భాషలను శరవేగంగా నేర్చుకుంటున్నాడు. 
తండ్రి చదివే మంత్రాలు, స్తోత్రాలు వెంట వెంట చెప్పగలుగుతున్నాడు. నాలాయిర పాశురాల పఠనం కూడా మొదలైంది. అదేమిటి, దీని అర్థమేమిటి, ఇలానే ఎందుకు అంటారు వంటి ప్రశ్నలతో తండ్రిని ముంచెత్తుతున్నాడు. గోదాదేవి తిరుప్పావు పాశురాలు ఒక్కసారి తల్లి పాడితే చాలు తనయుడికి కంఠతా వస్తున్నది. ఎన్ని పాశురాలు చదివినా రామానుజుడికి ఎందుకో గోదాదేవి రచించి గానంచేసిన తిరుప్పావై పాశురాలంటే ప్రీతి. ఓ వైపు వేద, వేదాంత, వేదాంగ రహస్యాలను బోధించగల గురువు గురించి తండ్రి వెదుకుతూనే పదహారేళ్ల కౌమార యవ్వన ప్రాయాలలోకి అడుగుపెడుతున్న రామానుజుడికి వివాహం చేయాలని సంకల్పించారు తండ్రి. 

తంజమాంబా రామానుజుల వివాహం

తల్లిదండ్రులు చూచి నిర్ణయించిన కన్య తంజమాంబ (రక్షమాంబ)తో వివాహానికి రామానుజుడు అంగీకరించడం జరిగిపోయింది. శాస్తోక్త్రంగా వైభవంగా వివాహం జరిపించారు. వివాహానంతరజీవనం సాగుతున్నదశలో, తండ్రి ఆసూరి కేశవుని ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. మధ్యమధ్య తీవ్రంగా అస్వస్థుడవుతున్నాడు. రామానుజుడు ఆందోళన చెందుతున్నాడు. తల్లి కాంతిమతి దివారాత్రములు భర్తవెంట ఉండి పరిచర్యలు చేస్తున్నది. కేశవసూరి ఔషధం తీసుకొనడానికి అంగీకరించడు. ఆరాధన తరువాత తీర్థమే ఆయనకు ఔషధం. 

ఒకనాడు స్వప్నంలో అతనికి శఠగోపముని (నమ్మాళ్వార్‌) కనిపించి నీ కుమారుడు మహాజ్ఞాని, జ్ఞానంతో భవబంధాలను పటాపంచలు చేసే బంధముక్తుడిని చేసే మహాయోగి. నీవు నిశ్చింతగా ఉండవచ్చునని ఉపదేశిస్తాడు. మరునాడు రామానుజుని పిలిచి, చెంత కూర్చుండబెట్టి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించాడు. ‘‘తెల్లవారుజాము స్వప్నములు సత్యములే నాయనా, నీవే ఆచార్యుడవు. నీ పాదాలే నాకు శరణు నాయనా..’’ అన్నారు.‘‘తండ్రీ ఏమిటీ వింత. మీరు నా పాదాలను కోరడమా? మీరు నాకు గురువులు, ఆచార్యులు, జనకులు. ఇది విపరీత చర్య తండ్రీ..’’ అని రామానుజుడు వేడుకున్నారు. నీ వలన నాకు పరమపదయోగము ప్రాప్తమవుతున్నది. అదిగో అదే విరజానది, అదే వైకుంఠం... నారాయణా నీ చరణాలే శరణు, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, రామానుజ చరణౌ శరణం ప్రపద్యే.. ’’ అంటున్నట్టు పెదాలు కదులుతున్నాయి. అదిగో పరవాసుదేవుడు... పీతాంబరధారి, అంతర్యామి, అంటూ... కన్నుమూశారాయన. 

కన్నీరు తుడిచిన కన్నతల్లి
రామానుజుడు హతాశుడైనాడు. చాలాకాలం విషాదంలో మునిగిపోయినాడు. తండ్రివియోగంతో ఆయననే తలచుకుంటూ దుఃఖిస్తున్న కొడుకును చూసి తల్లి కాంతిమతి అతనికి ధైర్యం చెప్పడం అవసరం అని నిశ్చయించుకుంది. కొడుకును చేరబిలిచి ‘‘నాయనా ఎవరిని తలచుకుని ఏడుస్తున్నావు. ‘జాతస్యహి ధృవో మృత్యుః «ధృవం జన్మ మృతస్యచః’ అని వినలేదా? నీ తండ్రి దేహం గురించా బాధ? ‘‘అంతవంత ఇమే దేహాః’’ (దేహం శాశ్వతం కాదు) శిధిలమై నిర్జీవమైన ఆ దేహాన్ని నీవే కదా చితి ముట్టించి ముగించినావు. పోనీ నాన్నగారి ఆత్మగురించి బాధపడుతున్నావా? అది శరీరబంధమునుంచి విముక్తమయి హరిని చేరినదని నమ్ముతున్నావా లేదా? నమ్మితే ఇంక దేనికి బాధ. అనిత్యమైన దేహమును విడిచి ముక్తుడై పరమపదము చేరిన నీ పితృదేవుల గురించి ఎందుకు నాయనా తపిస్తున్నావు, అని జ్ఞాన బోధ చేసిన మాతృమూర్తిని చూసి అవును నిజమే నేనెందుకు ఏడుస్తున్నాను? అనుకున్నాడు. తల్లిమాటలలో రామానుజునికి కనిపించని గురువు వినిపించినాడు. తల్లిదండ్రులే కదా తొలిగురువులు. శాస్త్రం చెప్పగల గురువులకోసం కంచికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు రామానుజుడు, తల్లి ఆనందంగా అనుమతించింది. 

గురువు కోసం అన్వేషణ
వేదాంత విద్య నేర్చుకుందామని అనుకుంటున్నాడే కాని నాలుగు కాసులు సంపాదించి సంసారాన్ని నడపాలన్న ఆలోచనే లేదు. ఈయన అసలు నాతో కాపురం చేస్తాడా అని తంజమ్మ అనుమానించసాగింది. వేదాంతపు వెర్రి తలకెక్కితే ఇక సంసారం మీద వ్యామోహం ఏముంటుందన్నది ఆమె ప్రశ్న. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణ త్రయములపై వ్యామోహం వదులుకోవాలని వేదాలు బోధిస్తున్నాయి. ఇక నా సంసారం ఎటుపోతుందో, ఏమవుతుందో. ఆ ఆలోచనతో ఆమె చేసే పనులలో రామానుజునికి ఏదో లోపం కనిపిస్తూనే ఉంది. భర్త కంచికి వెళ్లి వేదాంత జ్ఞానార్జన ఆరంభిస్తే దారేషణ తగ్గిపోవడం తప్పదని ఆమెకు అనిపిస్తున్నది. నాకు ప్రపంచంపై విరక్తి రావడం లేదు. ఆయన అడుగులు వైరాగ్యంవైపు పడుతున్నాయి. ‘‘భగవంతుడిని ధ్యానించడానికి వేదాంత శాస్త్ర అధ్యయనం అవసరమా, వేదాలు నేర్వని మానవులకు భగవంతుడు పట్టుబడడా? అట్లా అయితే నావంటి వారి గతేమిటి?’’ భార్య ప్రశ్నించింది.

‘‘పరమాత్ముడిని చేరడానికి వేదాంత విద్యతో పనే లేదు. స్వామి కల్యాణ గుణానుభవము చాలు. సులభమైన తరుణోపాయాలు చాలా ఉన్నాయి’’ అన్నారు రామానుజులు.‘‘అయితే మీరెందుకు సులభోపాయాలు వదిలి కఠినమైన వేదాంత విద్యాభ్యాసానికి ఎందుకు కష్టపడాలనుకుంటున్నారు.’’ తంజమ్మ అడిగింది.‘‘ఈ సమాజంలో వేదాలను వ్యతిరేకించే దుర్మతములు ప్రబలుతున్నాయి. వీరికి సరైన సమాధానం చెప్పడానికి నేను ఎంతో నేర్చుకోవలసి ఉంది. వీరిని వాదాల్లో ఓడించకపోతే వారన్నదే నిజమని జనం భ్రమించే ప్రమాదం ఉంది. కనుక కొన్ని సంవత్సరాలు నేను వేదాంత రహస్యాలను అధ్యయనం చేయవలసి ఉంది. కంచిలో యాదవప్రకాశులనే పండిత ప్రకాండులున్నారు. వారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను’’ అని రామానుజులు వివరించారు. 

‘‘ఈ మతాలేమిటి దుర్మతాలేమిటి?’’ అని అమాయకంగా అడిగింది తంజమ్మ.మతాలంటే అభిప్రాయాలు. జగత్తుకు కారణం ఏమిటి అనే ప్రశ్నకు పరిపరివిధాలుగా సమాధానాలు చెబుతున్నారు. కొందరు వేదాల్లో సమాధానం ఉందని నమ్ముతున్నారు. కొందరు అంగీకరించడం లేదు. చార్వాకము, జైనము, సౌత్రాంతికము, వైభాషికము, యోగాచారము, మాధ్యమికము అనే ఆరు వేదబాహ్యమతములు. వీరిలో చార్వాకము నాస్తిక మతం. వీరికి ప్రత్యక్షమే ప్రమాణము. కనిపించే భూమి, అగ్ని, నీరు, వాయువులనే వీరు ఉన్నట్టు నమ్ముతారు. ఇంతకు మించి ఏదీ లేదంటారు. శరీరమెంత ఉంటుందో ఆత్మ అంత ఉంటుందని జైన సిద్ధాంతం. జగత్తు కర్యాకారణ రూపంలో నిత్యానిత్యంగా ఉంటుంది.

ఏనుగుకు ఏనుగంత ఆత్మ ఉంటుందంటారు. వైభాషికుడు, సౌత్రాంతికుడు, యోగాచారుడు, మాధ్యమికుడు .. వీరు బౌద్ధమతస్తులు.వీరు ఆత్మను అంగీకరించరు. జగత్తు పరమాణు సంఘటితమై ఉంటుందని దీనియందు క్షణిక బుధ్ధియే మోక్షమని అంటారు. ఇంకా కొద్ది విభేదాలతో మరికొన్ని మతాలు ఉన్నాయి. సన్మతమేమిటో చెప్పవలసిన బాధ్యత మనపై ఉన్నది. యాదవ ప్రకాశుల వారు అద్వైత మతస్తులని అంటున్నారు. అదేమిటో వారిని ఆశ్రయించి వారి బోధలు వింటే తప్ప తెలియదు. అందుకే కంచికి వెళ్లాలని ఆలోచిస్తున్నాను. (సత్కథాకాలక్షేపము పేరుతో పరమపదవాసులు కవిరత్న గుదిమెళ్ల రామానుజాచార్యస్వామి వారు (నడిగడ్డపాలెం) రచించిన భగవద్రామానుజుల చరిత్ర అనే పుస్తకంలో వివరమైన వ్యాఖ్యానం ఉంది. రామానుజుని బాల్య యవ్వన వివాహ జీవనం గురించి చాలా వివరంగా ఆ పుస్తకంలో ఉంది. కొన్ని సంఘటనలు అంశాలు ఈ అద్భుతపుస్తకం ఆధారంగా రూపొందినవి)

ఇక రామానుజుని వేదాంత శాస్త్ర జిజ్ఞాసను ఆపడం ఎవరితరమూ కాదని తంజమ్మ మనసులో నిశ్చయించుకున్నది. తత్వవిషయంలో నిమగ్నమై ఉన్న రామానుజుడికి నేనవసరమే లేదు. ఈయన మహాపురుషుడు. వీరు సాధించవలసిన విజయములు వేరే ఉన్నవి. ఇల్లు సంసారములకు మించిన బాధ్యతలు వీరు తలకెత్తుకొనుచున్నారు. నేను అల్పురాలిని, నాజ్ఞానం ఏమాత్రం సరిపోదు. నేను స్వార్థ చింతన గలదానిని. వారేమో పరార్థ చింతన పరమార్థ చింతన మరమాత్మ చింతనలో మునిగిపోతున్నారు. వారు అద్భుతమైన వెలుగువైపు సాగుతున్నారు. నాది సాధారణ జీవన విధానం. వారితో పొసగడం సాధ్యమో కాదో. కాదు కాదు సాధ్యం కాదు. అని ఆలోచిస్తున్న తంజమ్మను బుట్ట ఇమ్మని అడుగుతున్నాడు రామానుజుడు. ఆమెకు వినిపించడం లేదు. కంచికి కదులతున్న భర్త తన పరధ్యానాన్ని గమనించి, తానే బుట్టను తీసుకున్నాడు. తంజమ్మ కథ కంచికి చేరుతున్నట్టనిపించింది. 

కాలినడకతో కంచికి బయలుదేరిన రామానుజుని వాకిట నిలబడి కాంతిమతి, తంజమ్మ సాగనంపుతున్నారు. గూడబుట్ట ఇంత బరువుగా ఉందేమని అడిగాడు రామానుజుడు. భూభారాన్ని మోయడానికి సిధ్ధంగా ఉన్న మీకు ఇదొక బరువా అని చమత్కరించింది తంజమ్మ. నేను భూభారం మోయడమేమిటి తంజా అన్నాడు రామానుజుడు. సంసారబంధాలు వదులుకొని జనులను ఉద్ధరించే భారం మోయడానికే కదా తమరి ప్రయాణం అందామె. ఓహో అదా నీ అభిప్రాయం అని నవ్వుకున్నారు. మీరేమనుకున్నారు మరి? నీమనసులో ఉన్న బరువంతా బుట్టలోకి నెట్టావేమోననుకున్నాను. ఓచూపు చూసిందామె. రామానుజుడు గంభీరంగా అడుగులు వేస్తూ కంచివైపు నడుస్తుంటే తల్లి అతనిలో ఆదిశేషుని జాడను గమనించింది. పుణ్యపురుషుడొకడు కదిలి వెళుతున్నట్టు కనిపిస్తున్నది. తంజమ్మ మనోహరుడైన భర్త గమన సౌందర్యాన్ని చూస్తూ ఉంటే తన అదృష్టరేఖ తరలిపోయినట్టు అనిపిస్తున్నది. కొంగు చాటున ముఖం, కన్నీటి తెరల చాటున చూపులు...అంతా అస్పష్టంగా ఉంది. ఈ ప్రయాణం ఎటు? 

రామానుజుడెవరు? 
జననం శ్రీపెరుంబుదూర్‌: జీవనకాలం (1017–1137): నాథముని, యామునా చార్యుల తరువాత శ్రీవైష్ణవ విశిష్ఠాద్వైతాన్ని ప్రసిద్ధం చేసిన సిద్ధాంత కర్త, భక్తి ఉద్యమకారుడు, బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం – శ్రీ భాష్యం, భగవద్గీతాభాష్యం, వేదాంత సంగ్రహ అనేవి ప్రధాన ప్రామాణిక సైద్ధాంతిక గ్రంథాలు, శరణాతి, శ్రీరంగ, శ్రీ వైకుంఠ గద్యాలు (గద్యత్రయం), నిత్య గ్రంథం రచన. రామానుజుని రచనల పైన హారోల్డ్‌ కోవార్డ్, థామస్‌ అక్వినాస్, ఎ బి వాన్‌ బ్యూటెనెన్‌ పరిశోధనలు జరిపి ఇవి చాలా ప్రభావం కలిగించిన గ్రం«థాలని తమ పరిశోధనా సైద్ధాంతిక గ్రం«థాలలో నిరూపించారు. మహ్మదీయ రాజుల దాడులలో ధ్వంసమైన అనేక ఆలయాలను పునరుద్ధరించి, ఆ మత పాలకులతో వాదం జరిపి వారు ఎత్తుకుపోయిన విగ్రహాలను తిరిగి సాధించి ఆలయాల్లో నెలకొల్పిన ధీరుడు. ఆలయాలలో అన్నికులాలవారికి ప్రవేశం జరిపించి, అందరికోసం చెరువులు తవ్వించి, విజ్ఞానం మంత్రోపదేశం అందరూ పొందాలనే సర్వసమతా సూత్రాన్ని బోధించి పాటించిన జగద్గురువు రామానుజులు. 120 సంవత్సరాలు జీవించిన రామానుజుని తిరుమేని (శరీరం) కూర్చున్న భంగిమలో శ్రీరంగనాథుని ఆలయ సముదాయంలో 880 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ చెక్కుచెదరకుండా పూజలందుకుంటున్నది. ఈ ఫొటోలోనిదే ఆ విగ్రహం.

ఆగ్రహాన్ని నిగ్రహిస్తే ఆనందకర దాంపత్యం! Happy shy of anger!

Happy anger marrege



నరసింహం ఎప్పుడూ రుద్రతాండవం చేస్తుంటాడు. ‘పెన్‌ ఎక్కడ పెట్టి చచ్చావురా?’ అని కొడుకును, ‘లంచ్‌బాక్స్‌ ఎక్కడ పెట్టి తగలబడ్డావు?’ అని భార్యని, ‘బండి తుడవడం ఇలాగేనా?’ అని నౌకరుని కసురుకుంటుంటాడు. అనుక్షణం ఇలా ఎవరో ఒకరిమీద మండిపడుతుంటాడు. కొన్నిసార్లు అతను పనిచేసే చోట కూడా దురుసుగా మాట్లాడి ఇబ్బందుల్లో పడుతుంటాడు.

దంపతుల మధ్య కోపతాపాలు సహజం. కానీ మితిమీరిన కోపం సంసారాన్ని నరకం చేస్తుంది. అది విడాకుల వరకూ తీసుకెళ్లకపోయినా దంపతుల మధ్య దూరం పెంచుతుంది. పైగా కోపిష్ఠులకే దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. కోపం వల్ల గుండెజబ్బులు వస్తాయి. తరచూ విపరీతమైన కోపతాపాలకు గురవుతుంటే శరీరతత్వం మారిపోతుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఆగ్రహానికి గురయ్యేవారిలో గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయట. రక్తం గడ్డలు కట్టే ముప్పు కూడా ఎక్కువవుతుంది. కాబట్టి మితిమీరిన ఆగ్రహావేశాలకు గురవ్వకుండా దంపతులు జాగ్రత్తగా ఉండాలి. సుమతీ శతకకారుడు ‘తన కోపమే తనకు శత్రువు/ తన శాంతమే తనకు రక్ష ’ అని ఏనాడో చెప్పాడు.

భార్యాభర్తలిరువురూ అన్నివిషయాల్లోనూ ఒకేలా ఉండరు. ఎందుకంటే ప్రతిమనిషి ప్రవర్తన, పనిచేసే రీతులు, మాట్లాడేతత్వం అన్నీ భిన్నంగానే ఉంటాయి. దంపతుల అభిరుచులు కొన్నింట్లో కలుస్తున్నా, ఇరువురి మధ్య అనేక వైరుధ్యాలుంటాయి. భాగస్వామి తన మాదిరే ఎందుకు చేయలేకపోతున్నారనే భావన వల్ల సహజంగా కోపం వస్తుంది. అలాగే ‘నాది.. నాకే చెందాలి’ అనే భావన వల్ల కూడా ఆగ్రహం వస్తుంది. ఇతరులతో భాగస్వామి చనువుగా ప్రవర్తిస్తే కోపం ముంచుకొస్తుంది. ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక ‘ఈ కూర ఎందుకిలా మాడిపోయింది?’ అనో, ‘దానికెందుకంత ఖర్చు పెట్టావు?’ అనో ఏదో వంకతో కోప్పడుతుంటారు. పైగా కోపం అంటువ్యాధిలాంటింది. దీని ప్రభావం మొత్తం కుటుంబంపై ఉంటుంది. పిల్లలు కూడా పెద్దల హావభావాల్ని, మాటల్ని అనుకరిస్తుంటారు.
ఇలా చేయొచ్చు..
యోగ, ధ్యానం, ప్రాణాయామం ద్వారా కోపాన్ని అరికట్టవచ్చు.

ప్రతిరోజూ కనీసం ఓ అరగంటసేపైనా నిశ్శబ్దాన్ని పాటించాలి. వీలైనప్పుడల్లా మంచి సంగీతాన్ని ఆస్వాదించాలి.

చిన్నారులతో ఆడుకోవడం, ఇంటిల్లిపాదితో పచ్చటి ప్రకృతి మధ్య గడపటం వల్ల ఆగ్రహావేశాల నుంచి బయటపడవచ్చు.

మనసంతా ఆగ్రహం, అసహనంతో చీకాగ్గా ఉన్నప్పుడు చన్నీటితో తలస్నానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందంటారు.

కోపానికి కారణమైన విషయాల గురించి పదేపదే ఆలోచించక ఇతర పనుల్లో నిమగ్నమవ్వాలి.

ఆహ్లాదకరమైన దృశ్యాల్ని మనసులో ­హించుకోవాలి. గంభీరమైన పరిస్థితిని తేలిక చేసేందుకు జోక్స్‌ పేల్చడం, చతుర సంభాషణలు సాయం చేస్తాయి.

గుప్పిటను బలంగా మూసి, నెమ్మదిగా తెరవాలి. ఇలా ఓ యాభైసార్లు చేయాలి.

క్రీడలు, వ్యాయామం, పుస్తకపఠనం, సైక్లింగ్‌, లాంగ్‌డ్రైవ్‌ లాంటివాటిలో నిమగ్నమవ్వాలి.

సానుకూలంగా మాట్లాడటం అలవర్చుకోవాలి.

కోపానికి కారణమైన అంశాలు, ప్రవర్తన గురించి భాగస్వామితో చర్చించాలి. తద్వారా అలాంటి పరిస్థితులు ముందు ముందు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్త పడటానికి అవకాశం కలుగుతుంది.


కోపిష్ఠులతో కుటుంబసభ్యులు మనస్సు విప్పి మాట్లాడలేరు. దూర దూరంగా మసలుకుంటారు. వారెప్పుడూ తమ కోణంలోనే ఆలోచిస్తుండటం వల్ల భాగస్వామి చేసేదంతా తప్పుల తడకగా కనిపిస్తుంటుంది. తమ అసౌకర్యాల గురించే ఎక్కువ రచ్చ చేస్తూ, కుటుంబ సభ్యుల బాధలను, ఇబ్బందులను గ్రహించలేకపోతారు. ఒకరిలో తప్పులెంచడం చాలా సులువు. కానీ క్షమించి దగ్గరకు తీసుకోవడంలోనే సుఖం, శాంతం, ఆరోగ్యం, అనందమూ లభిస్తాయి.
- కె. రఘు






ఆవు పాలకీ, గేదె పాలకీ తేడా_CowMilk


 
ఆవు పాలకీ, 
గేదె పాలకీ తేడా తెలుసా?
ప్రాచీన భారతీయ సంప్రదాయం… గోవుకు అడుగడుగునా ప్రాధాన్యతనిచ్చింది..! మనిషికన్నా తక్కువస్థాయిలో ఉన్న సమస్త ప్రాణుల ప్రతినిధి గోవుని గాంధీజీ అంటారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో గో ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆవు పాలలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద మందుల్లో పంచగవ్యాలను వాడుతారు. 


ఆవుపాలు పసుపుపచ్చగా వుంటాయి. గేదె పాలు తెల్లగా ఉంటాయి. అందువల్ల వీటిని బంగారం, వెండి అంటారు. ఆవు మూపురంలో స్వర్ణనాడి ఉంటుంది. అందుకే ఈ ఆవుపాలలో స్వభావసిద్ధంగానే బంగారపు తత్వం ఇమిడి ఉంది. ఈ తత్వం మానవులకు అత్యంత మేలు కూర్చే అంశం. 


ఆవు దూడ పుట్టిన మూడు రోజులకే గంతులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడి ఉంటుంది. ఈ కారణంగానే ఆవు పాలు తో శరీరంలో ఉషారు..స్పూర్ఫ్తి వస్తుందని చెప్పవచ్చు. అదే గేదె పాలవల్ల అలసత్వం వస్తుంది. 500 పశువుల మధ్యలో విడిచిపెట్టిన ఆవు దూడ తన తల్లి వద్దకు అవలీలగా చేరుకుంటుంది. అదే గేదె దూడ 10-15 గేదెల మధ్యలోనైనా తన తల్లిని గుర్తించలేదు. దీన్ని బట్టి మనం ఆవుపాలు బుద్దిబలం పెంచుతాయని అర్థం చేసుకొనవచ్చు. ఆవులకు గాని, వాటి దూడలకు గాని మనం ఏదైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే అవి ప్రతిస్పందించి పిలుస్తున్నవారి వద్దకు వస్తాయి. గేదెలకు, వాటి దూడలకు ఈ జ్ఞానం శున్యం. ఆవులు ఎక్కడ విడిచిన పెట్టిన సమయానికి మళ్లీ అవి తమ స్వస్థలానికి చేరుకొంటాయి. గేదెలకు స్థలము, సమయము, గుంపు అన్న గుర్తింపు ఉండదు. 


భారతీయ గోవు తీవ్రమైన ఎండను కూడా సహిస్తుంది. అందుకే దీని పాలు రోగరహితము, ఆరోగ్యప్రదము, పౌష్టికమైనవిగా ఉంటాయి. కాని గేదెలు , విదేశీ జాతి జెర్సీ..ఇతర సంకరజాతి ఆవులు ఎండవేడిమిని సహించలేవు. ఆవు పాలు గుండె జబ్బు రోగులకు ప్రత్యేకించి ఉపయోగపడతాయి. గేదె పాలలోని క్రొవ్వు పదార్థం రక్తనాడుల్లో చేరి క్రమంగా హృద్రోగానికి కారణం అవుతాయి. ఆవు పాలలోని పసుపచ్చని పదార్థం కళ్ళలోని జ్యోతిని వృద్ధి పరుస్తుంది. కళ్ళకలక వస్తే పాలలో తడిసిన గుడ్డుపట్టి కడితే నయం అవుతుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఆవులను పెద్దసంఖ్యలో పెంచుతున్నారు. ఆయా దేశాల్లో గేదెలు ఎక్కువగా జంతు ప్రదర్శనశాలలోనే కనిపిస్తాయి. చరక సంహిత ప్రకారం జీవన శక్తి అందించే ద్రవ్యాలలో ఆవు పాలు అన్నిటికంటే శ్రేష్ఠమైనవని తెలుస్తుంది. ధన్వంతరి నిఘంటువు ప్రకారం ఆవుపాలలో రసాయనము, పథ్యము, బలవర్ధకము, హృదయానికి హితం చేకూర్చేది. మేధస్సును పెంచేది. ఆయుర్యృద్ధి, పుంసత్వం కలిగించేవి. ఇంకా వాత-పిత్త-కఫాలను రూపుమాపే గుణాలు ఆవుపాలలో ఉన్నాయి. 


తెల్ల ఆవుపాలు వాతాన్ని నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని , ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరించివేస్తాయి. కపిల గోవు ఈ దృష్టిలో ఎంతో ఉపయోగకరమైనది. ఆవుపాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు. అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. గ్రామాల్లో ఆవు పాలు తాగే 80 ఏళ్ల వృద్ధులు చాలా మంది కళ్ళద్దాలు ఎరుగరు. ఎందుకంటే వారు చిన్నతనం నుంచి ఆవు పాలు మాత్రమే తాగుతూ వస్తున్నారు. ఈ విషయం నాడెప్ కాకా అనే పెద్దయాన స్వయంగా చెప్పారు. 





మన దేశీయ ఆవులకు సరియైన మేత, పాలను వృద్ధి చేసే విధానమను శ్రద్ధగా పాటించాల్సిన అవసరం ఉంది. గుజరాత్ లోని గీర్ జాతి ఆవులను ఈ విధంగా శ్రద్ధతో పోషించడంతో…అవి 25 నుంచి 50 లీటర్ల వరకు ప్రతి రోజు పాలు ఇవ్వడం జరుగుతోంది. ఇతర అన్ని పశువుల పాలకంటే ఆవుపాలు అత్యంత శ్రేష్ఠమైనవి. శరీరానికి పుట్టిని కలిగిస్తాయి. బుద్ధి బలము, రసరక్తాది ధాతువులన్నింటిని పోషిస్తాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో అనేక వ్యాధులను నయం చేయవచ్చును.! ఇది ఆయుర్వేద వైద్యులే కాదు…ఆధునిక వైద్యుల మాట కూడా…! ఆవు యొక్క రంగును బట్టి..ఈతలను బట్టి , మేతలను బట్టి ఆవు పాలలో ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయని వైద్యశాస్ర్తం చెబుతోంది.

సీతమ్మ జాడ తెలిసిన తీరు_sita




కూడలి శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం _Ramalingeswaraswamy_kudali GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


నిండుగా నీటితో పారే వాగు, దాని పక్కనే ఆలయాల సమూహం, ప్రశాంత వాతావరణం, కార్తీక మాసంలో కావాల్సినవి ఇవ్వే కదండీ. అందుకే మా స్నేహ కిట్టీ పార్టీ మిత్రులం మొన్న సోమవారం ఉదయం 7 గంటలకల్లా బయల్దేరి మినీ బస్ లో అలా మెదక్ జిల్లా లోని కూడలి దాకా వెళ్ళి వచ్చాము. ఇదివరకు ముక్కోటి దేవతలు ఇక్కడ కూడి, వెళ్ళారుట. అందుకని కూడవెల్లి అనే పేరు వచ్చింది అంటారు. అలాగే రెండు వాగులు ఇక్కడ కలుస్తాయిగనుక కూడలి అంటారు.



ఈ ఆలయాలను మేము ఇంతకు ముందు సందర్శించాము. అప్పుడా వాతావరణం నన్ను చాలా ఆకర్షించింది. అందుకే మా వాళ్ళు కార్తీక మాసం, వన భోజనాలంటే అక్కడికి బయల్దేరదీశాను. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అక్కడ పూజారి శ్రీ సంకేత్ శర్మ (చిన్న వాడు..ఇంకా విద్యార్ధే. ప్రస్తుతం జ్యోతిష్యంలో పి.జి. చేస్తున్నారు) నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్నాను. తర్వాత ఈయన నాకు ఫేస్ బుక్ ఫ్రెండ్ అయ్యారు. ఈ వయసులో ఇంత తిరుగటమేకాక, ఆ ఆలయాల విశేషాలు అందరికీ అందజేస్తున్నానని చిన్న అభిమానం నేనంటే. ఈ మారు ఆయనకి ఫోన్ చేశాను, రావాలనుకుంటున్నాము, స్నానాలు చెయ్యటానికి వాగులో నీళ్ళు వున్నాయా అని. వున్నాయి రండి అన్నారు.





మేము వెళ్ళేసరికి 10-50 అయింది. మా మిత్రులు బస్ దిగగానే ఎదురుగా వున్న వాగు దగ్గరకెళ్ళి స్నానాలు ముగించుకుని, ఒడ్డునే వున్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు.

వాగు విశేషాలు:
ఇక్కడ రెండు వాగులు కలుస్తాయి. వీటిలో ఒకటి తూర్పునుంచి, ఇంకొకటి దక్షిణంనుంచి వచ్చి రెండూ కలిసి పడమరకి ప్రవహిస్తాయి. రెండు వాగులు కలుస్తాయికనుక కూడలి అని పేరు. పూర్వం మాండవ్య మహర్షి అక్కడ తపస్సు చేశారు కనుక ఒక వాగుకి ఆయన పేరుతో మాండవీ నది అంటారు. శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం.

ఇందులో పానవట్టం మీద రెండు శివ లింగాలతోబాటు విఘ్నేశ్వరుని విగ్రహం కూడా వున్నది. అందులో పక్కన వున్న లింగం కాశీనుంచి తేబడ్డది. ఇంకొకటి సైకత లింగం. శ్రీరామచంద్రుడు రావణ సంహారం అయిన తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్తూ బ్రహ్మ హత్యా దోష నివారణార్ధం శివ లింగాలని ప్రతిష్టించి, వాటిని అర్చించి వెళ్ళారుట. వాటిలో ఈ సైకత లింగం కూడా ఒకటి. మరి ఇసుక లింగానికి అభిషేకాలెలా చేస్తారంటే జీడి గింజల చూర్ణం కవచంలా పెట్టం వల్ల అభిషేకం చెయ్యటం కుదురుతోందన్నారు.

కార్తీక సోమవారం కదా, భక్తుల రద్దీ ఎక్కువగా వున్నది. పైగా అంతా చుట్టు పక్కల ఊళ్ళనుంచి వచ్చేవాళ్ళే ఎక్కువట. ఆ రద్దీలోనే సంకేత్ శర్మ గారి ఆధ్వర్యంలో మా మిత్రులమంతా శివునికి అభిషేకం చేశాము. శివాలయంలో దీపాలు వెలిగించాము. కార్తీక మాసంలో దీపదానం చేస్తే మంచిదట. అవి కూడా చేశాము.





దీపాలు అంటే గుర్తొచ్చింది. అక్కడ మేము చూసిన స్పెషల్ ఏమిటంటే అనంత కోటి దీపం. బీగం బజార్ లో అమ్ముతారుట. అది వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినట్లట. ఆలయంలో ఎవరో వెలిగించారు. దాని గురించి మొదటిసారి విన్నాము మేము. మాలాంటి వారికోసం ఫోటో తెచ్చాను.
ఈ ఆలయంలో శివుడి గర్భగుడి ముందు మూడు నందులు వుంటాయి.

అందులో మధ్యన వున్నది పెద్దది. ఇలా మూడు నందులు ఎందుకు వున్నాయి వివరం తెలియదుగానీ, శుక్లపక్ష త్రయోదశినాడు ప్రదోష సమయంలో వీటికి అభిషేకాలు జరుగుతాయిట. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు ఈ అభిషేకాలు చేస్తారుట. ఆలయం సింహద్వారం వెలుపల కూడా ఒక నంది వున్నది. ఆ విగ్రహం అక్కడక్కడ శిధిలమయి వున్నది. రజాకార్ల సమయంలో ఆ విధ్వంసం జరిగిందన్నారు.





పార్వతీ దేవి:
శివాలయంలోనే పార్వతీ దేవికి ఉపాలయం వున్నది. అక్కడ పార్వతీ దేవికి ఒడి బియ్యం పోశారు అలవాటు వున్న కొందరు. మా కాలనీలో వున్న రచయిత్రినని, ఆలయాల గురించి వారికి తెలియజేసి కార్తీక మాసంలో వన భోజనాలకి సలహాలిస్తానని, మా వాళ్ళు అక్కడ నాకు శాలువా కప్పి దేవుడి పూలు, పళ్ళు చేతికిచ్చి, శ్రీ సాకేత్ శర్మగారిచేత ఆశీర్వచనం చెప్పించారు. నాకిది సర్ప్రైజ్.

నా యాత్రా దీపిక – 7 మెదక్ - పరిసర ప్రాంతాలు శ్రీ శర్మగారికిచ్చాను. ఇంతకు ముందే ఆయనకి ఆ పుస్తకం మిత్రులెవరో బుక్స్ ఎగ్జిబిషన్ లో కొనుక్కొచ్చి ఇచ్చారుట. ఇవ్వన్నీ అయ్యే సరికి మధ్యాహ్నం రెండు. పూజలు అయినాయికదా. అందరికీ ఆత్మారాముడి గోల మొదలయింది. ఆలయ ఆవరణలోనే మేము తెచ్చుకున్న భోజనాలు చేశాము. మాతోబాటు ఆలయానికి వచ్చిన నలుగురయిదుగురిని పిలిచి భోజనం పెట్టాము. తర్వాత నెమ్మదిగా అక్కడ వున్న ఆలయాలు చూశాము. అవేమిటంటే....





ఆంజనేయస్వామి ఆలయం:
శివాలయానికి ఎదురుగానే క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం వున్నది. శ్రీ శివ పంచాయతన ఆలయం ఇక్కడ వున్న ఆలయాలలో మరొకటి శ్రీ శివ పంచాయతన ఆలయం. దీనిలో మధ్యలో శివుడు, చుట్టూ ఉపాలయాలలో నాలుగు పక్కల ఉపాలయాలలో పార్వతీ దేవి, కుమార స్వామి, వినాయకుడు, వీరభద్రుడు, వున్నారు. ఇక్కడ కుమార స్వామి ప్రత్యేకత ఆరు ముఖాలతో, నెమలి వాహనం మీద ఆసీనుడై వుంటాడు. ఇలాంటి శిల్పం అరుదట. ఇంకొక శివాలయం కూడా వున్నదిగానీ శిధిలావస్తలో వున్నది.

శ్రీ వీరభద్రస్వామి ఆలయం:
ఒకసారి పక్క వాగు పొంగి వీరన్న (వీరభద్రస్వామి) గొంతుదాకా నీళ్ళొస్తే ఆయన కోపంతో ఆడదానివి నన్ను తాకే అర్హత నీకు లేదు అని బొబ్బలు పెడుతూ (అరుస్తూ) శపించాడుట. అందుకే ఆయన్ని బొబ్బల వీరన్న అంటారు. తర్వాతెప్పుడూ ఆ వాగు ఆలయాలను సమీపించలేదుట.

శ్రీ రాధా రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఈ ఆలయాలు ప్రైవేటు యాజమాన్యంలోనే వున్నాయిట. మమ్మల్ని చూసి పక్క ఇంట్లోనే వున్న శ్రీమతి లోకేశ్వరి గారు వచ్చారు. ఆవిడ అత్యంత శ్రావ్యంగా పాడిన పొడగంటిమయ్యా మిమ్ము, వగైరా పాటలను వింటుంటే మాకెవరికీ అక్కడనుంచీ రాబుధ్ధి కాలేదు. తర్వాత ఆవిడే స్వామికి హారతి ఇచ్చారు. సాధారణంగా కృష్ణుడి ఆలయాలు రుక్మిణీ, సత్యభామా సమేతంగా వుంటాయి. కానీ ఇక్కడ వేణుగోపాలుడు రాధా రుక్మిణీ సమేతుడు.





శ్రీ సంకేత్ శర్మగారు చక్కగా అభిషేకం చేయించటమేగాక వివరాలన్నీ ఓపికగా చెప్పారు. ఈ మధ్య చాలా ఆలయాలలో వివరాలు చెప్పేవారే లేరు. మాకు తెలియదు, మా తాతల నాటిది అంటారు. తాతల కన్నా అనేక తరాల ముందునుంచీ వున్న ఆలయాల గురించి కూడా. అందుకనే తెలిసినంత మటుకూ వివరాలు కనుక్కుని అందరికీ తెలియజేద్దామని నా తపన. శ్రీ సంకేత్ శర్మగారికి ధన్యవాదాలు చెప్పి సాయంకాలం 4-30కి తిరుగు ప్రయాణమయ్యి 8 గం. లకి ఇల్లు చేరుకున్నాము.. జనాల గందరగోళం లేని ప్రశాంత ప్రదేశంలో, కాలువ ఒడ్డున కొంతసేపు గడపాలనుకునే వాళ్ళు, కాలువ స్నానం చెయ్యాలనుకునేవాళ్ళు దర్శించవలసిన ప్రదేశం ఇది. ఆహారం, మంచినీళ్ళు తీసుకు వెళ్ళటం మరచి పోవద్దు. అక్కడేమీ దొరకవు. దర్శన సమయాలు ఉదయం 5 గం. ల నుంచి 12 గం.లదాకా, తిరిగి మధ్యాహ్నం 2 గం. లనుంచి 9 గం.ల దాకా.

మార్గం:
సిద్దిపేటనుంచి మెదక్ వెళ్ళే దోవలో భోంపల్లి క్రాస్ రోడ్స్ తర్వాత కుడివైపు కనబడే కమాన్ లోంచి వెళ్తే కూడలి చేరుకోవచ్చు.

వివరాలకి శ్రీ సంకేత్ శర్మ సెల్ నెంబరు 9963092952
sankethsharma@india.com















పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

mohan publications price list