MohanPublications Print Books Online store clik Here Devullu.com

కె.జె.ఏసుదాసు_K.J.Yesudas




సంగీతం ఓ మహాసాగరం
అందులో కొంత ప్రయాణమే చేశా
-కేజే ఏసుదాస్‌

చెవులు వినే పాటలు అందరూ పాడితే... మనసు వినే పాటల్ని కొందరే పాడతారు... అలాంటివారిలో ఏసుదాస్‌ ఒకరు. స్వరం ఆయన గొంతులో సుతిమెత్తనై, మృదుమధురమై మదిలో చెరగని ముద్ర వేస్తుంది. ‘ఈనాడు సినిమా’కు ఆయన ఇచ్చిన ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ నుంచి ఆయన మనోభావాల సుమమాల ఇది...
తొలి పాట అనుభవం...: చెన్నైలోని భరణి స్టూడియోలో 1961లో తొలి పాట పాడిన అనుభవం నా మదిలో ఇంకా తాజాగానే ఉంది. ‘కాల్‌ పాడుదల్‌’ అనే మలయాళ చిత్రం కోసం ‘కానంబు... నానో కారెరుంబు..’ పాటను పాడాలి. గాయకుడు కావాలనే తపన, తొలి పాట అనే భయం... రెండూ నాలో పోటీపడుతున్నాయి. అందులోనూ ఆరోజు నాకు జ్వరం కూడా... అయినా నా స్వరం వినిపించా. మొదట వాళ్లకు నచ్చలేదు. ఆ విషయాన్ని గ్రహించాను. ఏం చేయాలి? ఎన్నో కష్టాలు పడి చదువుకుని స్వరాలు నేర్చుకున్నవాడిని. ఫీజు కట్టడానికి సైతం డబ్బులు లేని పరిస్థితులను దాటుకుని ఎలాగో విద్వాన్‌ కోర్సు పూర్తి చేసినవాణ్ని. ఆ క్షణంలో ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో దర్శకుడికి కావల్సినట్టు పాడా. అదే నాకు తొలి విజయాన్ని అందించింది. నా తొలి పాట ప్రముఖ పాటల రచయిత నారాయణ గురుస్వామి రాసిన తత్వం. జాతి, మత భేదం, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు... ఇలాంటివి ఉండకూడదని చాటే పాట అది. భిన్నత్వంలో ఏకత్వానికి దర్పణం పట్టే ఆ పాటను పాడడం నా అదృష్టం అనుకుంటా. సాధించింది కొంతే...: ఇన్నేళ్ల నా స్వర ప్రయాణంలో ఏదో సాధించానని అంటున్నారు. కానీ సంగీతం ఓ మహా సాగరం. అందులో కొంత దూరమే ప్రయాణం చేశా. ఈ గుర్తింపు దేవుని అనుగ్రహం. ఆ అదృష్టం నాకు దక్కడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నా గురువులు, దేవుళ్లు, అవకాశాలు ఇచ్చిన సంగీత దర్శకులే ఈ ఘనతకు కారకులు. వారందరికీ ధన్యవాదాలు.
అనుభవాలే పాఠాలు...: కష్టసుఖాలను జీర్ణించుకోవడం దేవుడు నాకిచ్చిన వరం. కష్టాలు ప్రతి ఒక్కరికీ తప్పవు. వాటన్నింటినీ సమానంగా చూసేవాడిని. అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయి.
శైలి ముఖ్యం...: ప్రతి గాయకుడికీ ఒక్కో శైలి తప్పకుండా ఉండాలి. శీర్గాలి గోవిందరాజన్‌, టీఎం సౌందరరాజన్‌, ఘంటసాల... ఇలా ఎవరిని తల్చుకున్నా వారి పాటలు కూడా గుర్తుకు వస్తాయి. నేను మహ్మద్‌ రఫీ శిష్యుడిని. ఆయన నుంచి ఎన్నో అంశాలు నేర్చుకున్నా. కానీ అనుకరించలేదు.
ఇప్పటికీ విద్యార్థినే!
ఇప్పటికీ తాను ఓ విద్యార్థినేనని, ఏదో ఒక కీర్తన, రాగం గురించి మళ్లీ మళ్లీ నేర్చుకుంటూనే ఉంటానని ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ తెలిపారు. పద్మ విభూషణ్‌ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మవిభూషణ్‌ దేవుడి కృపతో వచ్చిందని బలంగా నమ్ముతున్నానని తెలిపారు. ఈ తరహా అవార్డులను తాను ఏనాడూ ఆశించలేదని, రావాలంటూ ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. ‘మూడ మూడ రోగం.. పాడ పాడ రాగం’ (దాచేకొద్ది రోగం.. పాడేకొద్ది రాగం) అని పెద్దలు చెప్పారని, అది అక్షరసత్యమని పేర్కొన్నార


ఆయన పాట ‘స్వరరాగ గంగా ప్రవాహం’
ఇంటర్నెట్‌డెస్క్‌: గాయ‌కుడు.. మ‌హా గాయ‌కుడు..మ‌హా మ‌ధుర‌గాయ‌కుడు.. అనితర సాధ్య‌మైన గాయ‌కుడు. ఆయ‌న క‌దిలి వ‌స్తుంటే రాగాల‌ స‌వ్వ‌డి వినిపిస్తుంది. 17 భాష‌ల్లో 50వేల‌కు పైగా పాట‌ల‌ను పాడిన ప‌ద్మ‌భూష‌ణుడు కె.జె.ఏసుదాసు. ఇప్పుడు మ‌రో అరుదైన పుర‌స్కారం ఆయ‌న‌ను వ‌రించింది. భార‌త అత్యున్న‌త పుర‌స్కారాల్లో ఒక‌టైన ప‌ద్మ‌విభూష‌ణ్‌ అవార్డుకు ప్ర‌భుత్వం ఆయ‌న పేరును ప‌క్ర‌టించింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌పై ప్ర‌త్యేక క‌థ‌నం
అవమానాలు.. ఆయన్ని రాటుదేల్చాయి. పేదరికపు పరిహాసాలు.. ఆయనకు లక్ష్యనిర్దేశం చేశాయి. ఆ అనుభవ పాఠాలతోనే ఆయన ‘స్వర చక్రవర్తి’ అయ్యారు. ‘నీ గొంతు.. పాటకు పనికిరాద’న్న వాళ్లకు పాటతోనే సమాధానం చెప్పారు. ఆయనే.. భక్తి పాట, సినిమా పాట.. ఏ పాటకైనా ప్రాణం పోసే ఏసుదాసు. ఏ భాషలో పాడినా అది ఆయన మాతృభాషేమో అన్నంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. జీవితాన్ని సంగీతానికి అంకితమిచ్చిన గాన గంధర్వుడు ఆయన. ఇటు శాస్త్రీయ సంగీతం.. అటు సినీ సంగీతం.. ఏదైనా ఎదలోతుల్లో మధురమైన ముద్ర వేయడం ఆ స్వరం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
‘నిరీక్షణ’లో ‘చుక్కల్లో..’, ‘మేఘసందేశం’లో ‘ఆకాశదేశాన..’, ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో ‘అందమైన వెన్నెలలోన..’, ‘అల్లుడుగారు’లో ‘ముద్దబంతి పూవులో..’, ‘పెదరాయుడు’లో ‘కదిలే కాలమా..’ ఇలా ఆయన పాడిన పాటలు ఎన్నివిన్నా ఆ కంఠంలోని మాధుర్యం ఇట్టే ఆకట్టుకుంటుంది. ‘హరివరాసనం’ అంటూ ఆయన పాట పాడిన తర్వాతే హరిహరసుతుడు అయ్యప్పస్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. అంతటి గొప్ప గౌరవం దక్కించుకున్నారు ఏసుదాసు.
ఏసుదాసు 1940 జనవరి 10న అగస్టీన్‌ జొసెఫ్‌, ఆలిస్‌ కుట్టి అనే రోమెన్‌ కేథలిక్‌ దంపతులకు కేరళ రాష్ట్రంలో ఫోర్ట్‌ కొచి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, కళాకారులు కూడా. దీంతో ఏసుదాసు బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ అదే తన జీవిత గమ్యంగా చేసుకుని ఆర్‌.ఎల్‌.వి మ్యూజిక్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత స్వాతి తిరునాళ్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ తిరువనంతపురంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు, శ్రీ కె.ఆర్‌. కుమారస్వామి దగ్గర శిష్యరికం చేస్తూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆ కాలేజీలో శిక్షణ సగంలో ఆగిపోయినా చెంబై వైద్యనాథ భాగవతార్‌ వద్ద శిక్షణ పొందుతూ ఉండేవారు. తర్వాత ఆర్‌.ఎల్‌.వి మ్యూజిక్‌ అకాడమీలో గానభూషణం కోర్సును పూర్తి చేశారు.
తర్వాత వూర్లల్లో సంగీత కచేరీలు పెట్టేవారు. 1961 నవంబర్‌ 14న ఏసుదాసు మొదటి ప్లే బ్యాక్‌ రికార్డింగ్‌ మలయాళంలో జరిగింది. ఆ పాట బాగా ప్రాచుర్యం పొంది.. అప్పటి నుంచి శాస్త్రీయ సంగీత కళాకారుడిగా ఎంత ప్రతిభ కనబరుస్తూ ఎదిగారు. అంతేకాకుండా సినీ సంగీత జగత్తులో కూడా తన మధురమైన గాత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో పాటలు పాడారు. మనదేశ భాషల్లోనే కాక మలేషియన్‌, రష్యన్‌, అరబిక్‌, లాటిన్‌, ఆంగ్ల భాషలలో కూడా పాడి శ్రోతలను మెప్పించారు.
ఏసుదాసు ప్రతిభకుగానూ పలు అవార్డులు లభించాయి. 1975లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, 2002లో ప‌ద్మ భూష‌ణ్‌‌ బిరుదుతో ఆయ‌న్ను గౌర‌వించింది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆయన పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులతో సత్కరాలు అందుకున్నారు. జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అత్యధికంగా ఏడుసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి ఆయనే. కేరళ ప్రభుత్వం నుంచి 24 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదీ ఓ రికార్డు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 8 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 6 సార్లు, పశ్చిమ్‌బంగా ప్రభుత్వం నుంచి ఒకసారి ఆయన ఉత్తమ గాయకుడి అవార్డులు పొందారు. పలు చిత్రాల్లోనూ నటించారు. ‘ప్రస్తుతం సినిమా పాటల స్పీడూ పెరిగింది, స్టైలూ మారింది’ అంటారు ఏసుదాసు. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్నా.. ఆయన కంఠం నుంచి జాలు వారిన ఆ ‘స్వరరాగ గంగా ప్రవాహం’ ఎప్పటికీ పొంగిపొర్లుతూనే ఉంటుంది.
ఆయన పాట స్వరరాగ గంగా ప్రవాహం..ఆయన పాడితే భక్తిభావ సమ్మోహనం..శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం పాటేదైన ఆయన గొంతులో చేరితే అమృతమంత మధురం. ఆ పాటలు వింటే ఎదలనిండా అనందతాండవం. కర్ణాటక, సీని సంగీతాన్ని ఎల్లలు దాటించి హిమగిరులంతఎత్తులో నిలిపిన స్వర చక్రవర్తి.పాటను ప్రేమించి, పాటనుశ్వాసించి, పాటనే శాసించగలస్థాయికి ఎదిగిన గాన గంధర్వుడు యేసుదాసు. 

యేసుదాసు అసలు పేరు కట్టశ్శేరి జోసఫ్ యేసుదాసు. 1940 జనవరి 10న ఆగస్టీన్ జోసెఫ్, ఆలిస్‌కుట్టి అనే రోమన్ కేథలిక్ కుటుంబంలో కేరళ రాష్ట్రంలోని పోర్ట్ కొచి అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసులు. నటులు కూడా. తల్లి కూడా చర్చిలో పాటలు పాడేది. దీంతో యేసుదాసు బాల్యం నుంచే సంగీతం నేర్చుకున్నారు. ఆర్.ఎల్.వి మ్యూజిక్ అకాడమీ, స్వాతి తిరునాళ్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో శిక్షణ తీసుకున్నారు. తిరువనంతపురంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారు, కె.ఆర్. కుమారస్వామి దగ్గర శిష్యరికం చేసి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. గానభూషణం కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆయన గ్రామాల్లో అనేక కచేరీలు నిర్వహించారు.
1961 నవంబర్ 14న యేసుదాసు మొదటి ప్లేబ్యాక్ రికార్డింగ్ మలయాళంలో జరిగింది. ఆయన పాడిన తొలిపాటనే ఎంతో ప్రాచుర్యం పొందడంతో శాస్త్రీయ సంగీత కళాకారుడిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత సినీ సంగీత సామ్రాజ్యంలోకి అడుగిడి తన మధురగాత్రంతో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలతో పాటు మలేషియన్, రష్యన్, అరబిక్, లాటిన్, ఆంగ్లం ఇలా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత యేసుదాసుది.
నీ గొంతు పాటకు పనికిరాదన్న అవమానాలు, పేదరికం ఆర్థిక ఇబ్బందుల మూలంగా కాలేజీ శిక్షణ మధ్యలో ఆగిపోయినా ఆయన పాట మాత్రం ఆపలేదు. అనుభవం నేర్పిన పాఠాలు పాటల పూదోటలో స్వరానికి స్వర్ణకంకణం తొడిగేలా చేశాయి.

ఆకాశదేశాన, ఆశాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘసందేశం అంటూ ప్రియురాలు దూరమైన వేళ ప్రియుడు విరహాన్ని తన చెలికి చేరవేయమంటూ మబ్బుని వేడుకుంటూ మేఘాలతో సందేశాన్ని పంపుతున్నానంటాడు. మేఘసందేశం సినిమా కోసం వేటూరి రాసిన గీతానికి తన స్వరంతో ప్రాణప్రతిష్ట చేసిన గాయకుడు యేసుదాసు.

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుకా కళ్లార చూడవమ్మా
పెదరాయుడు సినిమాలోని ఈ పాట ప్రతి మహిళతో కన్నీరు పెట్టించింది. అందరికీ దూరంగా ఉంటున్న పెదరాయుడి భార్యకు శ్రీమంతం సమయంలో పాడే పాట. ఎంతో ఘనంగా జరగాల్సిన శ్రీమంతం ఒంటరిగా జరుగుతున్నా ఆ లోటు భార్యకు తెలియకుండా ఉండడం కోసం లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీకన్నీ అంటూ ఓదార్చుతాడు. నిగూడమైన భావంతో కూడిన ఈ పాట యేసుదాసు గొంతులో చేరి మరింత మధురంగా మారిందంటే అతిశయోక్తికాదు.
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడిచి రావే సరిగమలా అంటూ అసెంబ్లీ రౌడి చిత్రం కోసం యేసుదాసు పాడిన పాట. ప్రేయసిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ ప్రియుడు పాడుకునే సందర్భంలోనిది.
1991లో వచ్చిన రౌడీగారి పెళ్లాం చిత్రం కోసం ఆయన పాడిన కుంతీకుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం అంటూ భావోద్వేకంగా పాడారాయన. 

ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది


ఎవరాపిన ఆగని సంధ్యారాగమిది అంటూ కుంతీపుత్రుడు (1993) చిత్రం కోసం ఆయన పాడిన పాటకూడా శ్రోతల అభిమానాన్ని చూరగొన్నది. మోహన్‌బాబు తన లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించి తను నటించే ప్రతి చిత్రంలో కనీసం ఒక్కపాటన్నా యేసుదాసుతో పాడించుకునేవారు.

సొగసు చూడ తరమా 
సొగసు చూడతరమా నీ సొగసు చూడ తరమా!
సొగసు చూడతరమా సినిమా కోసం పాడిన పాట. అమ్మాయి నడుమును విల్లు (బాణం)కు కట్టే నారి (దారం)తో పోలుస్తూ నారి వంగినట్లు అందంగా ఉందంటూ సిరివెన్నెల రాసిన గీతాన్ని యేసుదాసు అంతే అద్భుతంగా పాడి మెప్పించారు.
యేసుదాసు ప్రతి ఏడాది మార్చి 1న కేరళలోని సెయింట్ జోసెఫ్ చర్చికి తప్పకుండా వెళ్తారు. యేసుదాసు చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి ఆయన తండ్రి మార్చి 31న ఆ చర్చిలో పాటలు పాడేవారట. అందుకే తన తండ్రి పరంపరను కొనసాగించడం కోసం ఆయన ఎక్కడ ఉనా మార్చి 31న మాత్రం తప్పకుండా ఆ చర్చికి వెళ్లి పాటలు పాడుతారు. అలాగే ఆయన పుట్టిన రోజైన జనవరి 10న మూకాంబికా తల్లి దగ్గర కచేరీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆడంబరాలకు పోకుండా ఆ రోజు తప్పకుండా కచ్చేరీ చేయడం ఆయనకు అలవాటు. అలాగే తిరువాయ్యురు ఉత్సవాలు, చెంబైస్వామి ఉత్సవాలకు తప్పకుండా కచేరిచేయడాన్ని అనేక సంవత్సరాలుగా పాటిస్తున్నారు. తన భార్య ప్రభ తొలికాన్పు సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మూకాంబికాదేవిని దర్శించుకున్నట్లు ఆప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుని కచేరి నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక సందర్భంలో చెప్పారు.
సంగీత చక్రవర్తులైన మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భాగవతార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణలను యేసుదాసు బాగా అభిమానిస్తారు. యేసుదాసు రోమన్ కేథలిక్ అయినప్పటికీ నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని గాఢంగా విశ్వసిస్తాడు. అందుకే చిన్నతనం నుంచి కూడా తన తోటివారితో అలాగే మెలిగేవారు. అందుకే ఉడుపి, శృంగేరి, రాఘవేంద్ర మఠాలకు ఆస్థాన విద్వాన్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు షిరిడీసాయి, అయ్యప్పస్వాములకు గీతాలు ఆలపించి తన సర్వమత సమానత్వాన్ని చాటుకున్నారు.

హే పాండురంగా! హే పండరి నాథా!
శరణం శరణం శరణం
సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమున సంగమ సమానం అంటూ ఆయన స్వరమెత్తితే కనులముందు బాబా సాక్షాత్కారించినంత హాయిగా ఉంటుందంటే అతిశయోక్తికాదు. 
యేసుదాసు పాటలు ఎన్ని విన్నా ఆ కంఠంలోని మాధుర్యం ఆకట్టుకుంటూనే ఉంటుంది.
యేసుదాసు ప్రతిభకుగానూ పలు అవార్డులు లభించాయి. 1975లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్‌లతో గౌరవించారు.

పురస్కారాలు, బిరుదులు


డాక్టరేట్ : అన్నామలై 
విశ్వవిద్యాలయం:1989
డి.లిట్-కేరళ 
విశ్వవిద్యాలయం: 2003
ఆస్థాన గాయక : కేరళప్రభుత్వం
సంగీత సాగరము: 1989
సంగీత చక్రవర్తి: 1988
సంగీతరాజా: 1974
సంగీత రత్న: స్వాతిరత్నము
సప్తగిరి సంగీత విద్వాన్మని: 2002
భక్తి సంగీత గీతా శిరోమణి: 2002
జాతీయ పురస్కారాలు
1972 అచనుమ్ బప్పయుమ్ మలయాళం
1973 గాయత్రి మలయాళం
1976 చిత్‌చోర్ హిందీ
1982 మేఘసందేశం తెలుగు
1987 ఉన్నికలె ఒరు కథా ప్రాయం 
మలయాళం
1991 భారతం మలయాళం
1993 సోపానం మలయాళం
ఉత్తమ నేపథ్య గాయకుడు (నంది)
2006 గంగ వెళ్లిపోతున్నావా
1990 అల్లుడుగారు ముద్దబంతి నవ్వులో
1988 జీవనజ్యోతి
1982 మేఘసందేశం సిగలో 

చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే ఎతికానే
పూసిందే ఆ పూల మాను నీ దీపంలో 
కాగిందే నా పేద గుండె నీ తాపంలో.....
1981లో వచ్చిన నిరీక్షణ చిత్రం కోసం యేసుదాసు గానం చేసిన అద్భుత గీతం. ఆయన ఏ భాషలో పాడినా అది ఆయన మాతృభాషేమో అన్నంత స్వచ్ఛంగా, స్పష్టంగా, మధురంగా పాడడం యేసుదాసుకే చెల్లింది.

ముద్దబంతి నవ్వులో మూగభాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు మరో అద్భుతమైన పాట. తను ప్రేమించిన అమ్మాయి మూగది అని తెలిసినా ప్రేమకు అవేమి అడ్డుకావంటూ ప్రేమికుడు పాడేపాట. యేసుదాసు గొంతులో చేరి ప్రేమలు కురిపించింది. ఇదే చిత్రంలో 
నగుమోము గనలేని నా జాలి దెలిసి
నన్ను బ్రోవగ రాద శ్రీ రఘువర తో పాటు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు అనే రెండు త్యాగరాజ కృతులను కూడా యేసుదాసే పాడారు.

శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
హరిహరాసనం స్వామి విశ్వమోహనం
హరితదీశ్వరం స్వామి ఆరాధ్యపాదుకం
హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం
హరిహరాసనం స్వామి దేవమాశ్రయే 

అంటూ ఆయన పాడిన తర్వాతే అయ్యప్పస్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. అంతటి గొప్ప గౌరవం దక్కించుకున్నారు యేసుదాసు. యేసుదాసుకు భార్య ప్రభ, ముగ్గురు పిల్లలు వినోద్, విజయ్, విశాల్‌లు ఉన్నారు. విజయ్ యేసుదాసు కూడా మంచి సంగీత దర్శకుడు. ఆయన ఇప్పటికే కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నేపథ్య గాయకునిగా ఆవార్డు అందుకున్నారు.



గరుడ కవచ స్తోత్రం, Garuda Kavacha Stotram


ONLINE....

గరుడ కవచ స్తోత్రం
Garuda Kavacha Stotram

గరుడ కవచ స్తోత్రం
అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
కాలసర్పదోష(యోగం) నివారణకు,నాగదోష నివారణకు,బందనముల నుండి విముక్తి కొరకు,శత్రుభాదల కొరకు గరుడ కవచ స్తోత్రం త్రికరణ శుద్దితో పఠించిన సర్వ పాపములు తొలగిపోవును. గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది.
జాతకచక్రంలో గ్రహాలు అన్ని రాహు కేతువుల మద్య ఉండి మిగతా రాశి భావాలు ఖాళీగా ఉండటం వలన ఆలస్య వివాహం, భార్యాభర్తలు విడిపోవడం, దాంపత్య సౌఖ్యం లేకపోవడం, చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ప్రధాన సమస్యలన్నీ జీవితం లో కొన్ని అనుకోని ఊహించలేని మార్పులు జరుగుతుంటాయి.
కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.
మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.
పంచమంలో రాహువు ఉండటం వలన పూర్వజన్మలో శాపం వలన ఈ జన్మలో సంతాన దోషాన్ని అనుభవిస్తున్నారని పరాశర మహర్షి తెలియజేసిన గ్రంధాల ఆదారంగా తెలుస్తుంది. వీటి నివారణకు గరుడ కవచ స్తోత్రాన్ని గురు ముఖంగా పఠించటం వలన సంతాన దోషాన్ని తొలగించుకోవచును.
దోషం తీవ్రం గా ఉన్న జాతకులు మంగళవారం కాని, ఆదివారం నాడు కాని ఉపవాసముండి నాగదేవతను గాని దుర్గాదేవిని గాని పూజించుకుంటూ గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక బాధలు తొలగించుకోవచ్చును.
అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.










Garuda Puranam in telugu books pdf free download | గరుడ పురాణం










Garuda Puranam in telugu books 
 గరుడ పురాణం


అబద్ధమాడిన వారు నరకాన్ని చవి చూడాల్సిందే....... వైతరణి నది..... ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో? వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉన్నది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నది దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గూండా లోనికి వస్తారు. ఈ నది అతి భయంకరమైనది, దీంట్లో నుండి వెళ్ళె సమయములో వచ్చే భాదకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పెర్కొనబడినది. ఈ నది కొన్ని వేల మైళ్ళ వెడల్పు కలిగి ఉన్నది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు వుండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో వుండే మాంసహారులన్ని వుండును. వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఖఃద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురాలు దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి. గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రధమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు. హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట.ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గూండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గూండా రారు, ఇంకా చెప్పలంటే యమలోకనికే రారు.
 ++++++++++++++++++++++ 
గరుడ పురాణం 
796 pages Print book ₹600/- 
Mohan publications 
Kotagummam 
Opp.AJANTHA hotel 
Rajamahendravaram 
9032462565
++++++++++
వ్యాస భగవానుడు రచించిన 
"గరుడ పురాణం"ఇంట్లో వుంచుకోవచ్చా?

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ... ఆసక్తిగా గరుడపురాణం చదవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు.
ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం ... జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ... కొన్ని కుటుంబాల్లో శ్రార్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.
ఇలాంటి సందర్భాల్లో గరుడపురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమగతులు కలగడానికి తాము చేయవలసిన విధుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంతే కాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయి. నిజానికి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినవే. అయితే ఎవరైనా చనిపోయినప్పుడు గరుడపురాణం చదవాలనే విషయాన్ని అంతా పక్కనపెట్టేశారు. గరుడపురాణం చదవడం వలన ఎవరైనా పోతరేమోననే సందేహమే ఎక్కువగా ప్రచారాన్ని సంతరించుకుంది.
ఈ కారణంగానే 'గరుడ పురాణం' ఎవరి ఇంట్లో కనిపించకుండా పోయింది ... ఎవరి నోటా వినిపించకుండా పోయింది. పరలోకంలో ఆత్మగా జీవుడు కొనసాగించే యాత్ర గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే వ్యాసభగవానుడు దానిని రచించాడు కనుక, నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవవచ్చని పండితులు తేల్చిచెబుతున్నారు.
కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి... బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట.
పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట.
పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు.
అంటే... తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు... యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట.
యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది.
ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు... ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే... బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు.




             mohanpublications


గౌతమిపుత్ర శాతకర్ణి _GautamiputraSatakarni_

సాహో... శాతకర్ణి
నాయకుడు...
గౌతమిపుత్ర శాతకర్ణి క్రీ.పూ. ఒకటి, రెండు శతాబ్దాలు. శాతవాహన సామ్రాజ్యం.
రాజధాని నగరమైన అమరావతి.
ఇరవైమూడో పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి - ఏకవ్యక్తి అక్షౌహిణి, కదిలే శతఘ్ని. అంతటి వీరుడు, అపార సాహసి! గౌతమిపుత్రుడు పట్టంకట్టుకున్న సమయానికి దేశం నిండా...జానాబెత్తెడు రాజ్యాలే, వామనవృక్షాల్లాంటి పాలకులే. ఆ అనైక్యతతో జాతి సార్వభౌమత్వానికి చేటుతప్పదని గ్రహించాడు. దేశాన్నంతా ఓ ఛత్రం కిందికి తీసుకురావాలని సంకల్పించాడు. అది రణన్నినాదమే అయినా, శాంతిమంత్రం అంతర్లీనం. పైపైకి రాజ్యకాంక్షలా అనిపించినా...సంక్షేమ ఆకాంక్ష నిబిడీకృతం. అస్థిరత్వాన్నీ అరాచకత్వాన్నీ రూపుమాపి...ఓ జాతినీ నీతినీ రీతినీ నిర్మించడానికి రాజసూయమే రాచమార్గమని తలచాడు.
భరతవర్షంలో ఇప్పటిదాకా మూడు రాజసూయ యాగాలు జరిగాయంటారు. ఒకటోది - మహాభారతంలో, ధర్మరాజు నేతృత్వంలో. రెండోది - ఉత్తరాదిలో, విక్రమాదిత్యుడి హయాంలో. మూడోది - అమరావతిలో, గౌతమిపుత్ర శాతకర్ణి కర్తృత్వంలో. అప్పుడే, రాజసూయంలో అగ్రపూజ ఎవరికన్న ప్రశ్న ఎదురైంది. హరిహరబ్రహ్మాదులకైనా అమ్మే ఆధారం కాబట్టి, బ్రహ్మాండనాయకుడైనా అమ్మ కడుపున పిండమే కాబట్టి...మాతృశ్రీ గౌతమీదేవికే ఆ గౌరవం దక్కుతుందని ప్రకటించాడా రాచబిడ్డడు. గౌతమి...మహిళ, వితంతువు! అపచారమనీ అనాచారమనీ హెచ్చరించారు. అయినా శాతకర్ణి నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ మహాయాగంతో శాలివాహనశకం ప్రారంభమైంది. అదే యుగాది...ఉగాది.
తెలంగాణ గడ్డమీదున్న కోటిలింగాల శాతకర్ణి జన్మభూమి! ఇక్కడే, మాతామహుల ఇంట్లో పుట్టి పెరిగాడు. ఆంధ్రుల ప్రజారాజధానిగా పునర్వైభవానికి నోచుకున్న అమరావతి శాతకర్ణి కర్మభూమి! పట్టాభిషేకం చేసుకున్నదీ, పట్టుదలతో యావత్‌ దేశం మీదా పట్టుసాధించినదీ అమరేంద్రుడికి సైతం అసూయపుట్టేలా పాలన సాగించినదీ అమరావతి నుంచే!
గౌతమిపుత్ర శాతకర్ణి నడిచే పటాలం. జీవితమంతా రణమండలంలోనే గడిచిపోయింది. దేశీ శత్రువులూ, విదేశీ శత్రువులూ, మిత్రుల చాటు శత్రువులూ...ఏ ఒక్కర్నీ వదల్లేదు. ఆంధ్రప్రశస్తిలో విశ్వనాథవారు ‘ఇతడు విద్యానిధి. ప్రజ్ఞావంతుడు. ధనుర్విద్యావిశారదుడు. ఇతని పరాక్రమము నాభాగ నహూషజనమేజయ సగర యయాతి రామాంబరీశులను మించి ఉండెను..’ అని కొనియాడారు. శాతకర్ణి తర్వాత, పరపాలకులు ఇటువైపు కన్నెత్తి చూడటానికి కూడా పదిహేనువందల సంవత్సరాలు పట్టింది. అవీ పునాదులంటే, అదీ నాయకత్వమంటే! ఆ సంగ్రామయోధుడి సమగ్ర వ్యక్తిత్వాన్ని తెరకెక్కించడం అంటే - రాజసూయాన్ని తలపించే సృజనాత్మక యాగమే.
బృందనాయకుడు
జాగర్లమూడి క్రిష్‌
గౌతమిపుత్ర శాతకర్ణి...ఆ పేరు వింటేనే క్రిష్‌ ఒళ్లు పులకిస్తుంది, కళ్లు మెరుస్తాయి. బాల్యం నుంచీ ఆ యోధుడే దర్శకుడి కలల కథా నాయకుడు. కార్తిక స్నానానికో, వనభోజనానికో వెళ్లినప్పుడు...తాతయ్య జాగర్లమూడి రమణయ్యగారి చిటికెనవేలు పట్టుకుని అమరావతి వీధుల్లో నడుస్తున్నప్పుడు - తొలిసారిగా ఆ సమ్రాట్టు పేరు విన్నాడట. అప్పుడే మొదలైంది క్రిష్‌ చారిత్రక కృషి...
‘ఏ పుస్తకం కనిపించినా శాతకర్ణి కదనకుతూహలాన్ని చాటే వీరోచిత గాథల కోసం కళ్లు ఆత్రుతగా వెదికేవి. అమరావతిలో ఏ బండరాయి కనిపించినా శాతవాహనుల శాసనమేమో అని ఆశగా తడిమిచూసిన రోజులున్నాయి. కోటిలింగాలలో అలనాటి నాణాలు దొరికినట్టు ఎవరో చెప్పారు. రెక్కలు కట్టుకుని ఆ గడ్డ మీద వాలిపోయాను. అయినా, తనివితీరక పరబ్రహ్మశాస్త్రి లాంటి పురావస్తు నిపుణుల్ని సంప్రదించాను. గౌతమీమాత నాసిక్‌లో వేయించిన శాసనాల్నీ చూసొచ్చాను. దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించి నీలకంఠశాస్త్రిలాంటి వారు లోతైన పరిశోధనలు చేశారు. ఆ పుస్తకాలన్నీ కంఠతా వచ్చేశాయి. లండన్‌ మ్యూజియంలోని అమరావతి గ్యాలరీ నుంచి కూడా సమాచారం తెప్పించుకున్నాను. మహారాష్ట్ర రాజు నహపాణుడూ, యవనపాలకుడు డెమిత్రియస్‌...తదితరుల చరిత్ర నుంచీ కొంత ఆధారం లభించింది. చరిత్రను చరిత్రగా చదివితే యుద్ధాలూ సైనిక దాడులూ మినహా మరో ప్రస్తావన ఉండదు. వర్తమానంలోంచి గతాన్నిచూస్తే... నిస్సారంగానే ఉంటుంది. అది కాదు పద్ధతి. మనమూ, కాలయంత్రమెక్కి గతంలోకి వెళ్లాలి. ఆ భేరీనాదాలు వినాలి. కత్తులూ బల్లాలూ పట్టుకుని ఆ
సైనికులతో పాటూ పరిగెత్తాలి. పాలకుడి ప్రతి బిరుదం వెనకున్న అంతరార్థాన్ని విశ్లేషించుకోవాలి. శాతకర్ణిని ‘త్రిసముద్రతోయ పీతవాహన’ అని అభివర్ణించిందో శాసనం. అంటే, ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయట! ఆ సామ్రాజ్యం అంత విస్తారమైంది అన్నమాట! అలా...ఒక్కో ఘట్టాన్నీ పేర్చుకుంటూ వెళ్లినప్పుడే...గౌతమిపుత్ర శాతకర్ణి విరాట్‌రూపం మనకు దర్శనమిస్తుంది. గౌతమిపుత్రుడి కథను జిజియాబాయి శివాజీకి చెప్పేదట. మామూలు తల్లుల్లా... నిద్రపుచ్చడానికి కాదు. ఆత్మాభిమానాన్ని మేల్కొలపడానికి, కర్తవ్యాన్ని గుర్తుచేయడానికి. అంతటి మహావీరుడి రూపురేఖలు ఇంకెంత పదునుగా ఉండాలి! ఆ రాజసం, తేజసం నందమూరి బాలకృష్ణగారిలో కనిపించాయి. ఆయన కూడా అంతే ఉత్సాహంగా ఈ పాత్రకు అంగీకరించారు.
వీరుడి తొలిబడి అమ్మ ఒడే! ఆమెలో కారుణ్యమూ కాఠిన్యమూ కలగలసి ఉండాలి. గౌతమీమాత పాత్రకు ఎవర్ని ఎంచుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు...హేమమాలినే గుర్తుకొచ్చారు. శాతకర్ణి అర్ధాంగి వాసిష్ఠి. భర్త మీద అపారమైన మమకారం ఒకవైపూ, పోరే సర్వస్వమైన పెనిమిటి, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న తీవ్ర అసంతృప్తి మరోవైపూ...ఆ ద్వైదీభావాన్ని సమర్థంగా పలికించే నటి ఎవరన్న ప్రశ్నకు - శ్రియ హావభావాల్లో సమాధానం దొరికింది. క్రూరత్వానికి పరాకాష్ట అయిన నహపాణుడి పాత్రకు కబీర్‌బేడీ అతికినట్టు సరిపోయారు. వస్త్రధారణ విషయంలోనూ ఎంతో తర్జనభర్జన. పల్లెవాటుగా చిన్న వస్త్రాన్ని కప్పుకోవడమే తప్పించి...భారీ అలంకరణలు తెలియని రోజులవి. ఆడవారికి కూడా నడుము పైభాగంలో ఎలాంటి ఆచ్ఛాదనా ఉండేది కాదు. ఆ వస్త్రధారణను యథాతథంగా తీసుకోలేం. ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతాలుల్లా అలనాటి సంప్రదాయశైలికి దగ్గరగా వస్త్రాల్ని రూపొందించారు. చిరంతన్‌భట్‌ సంగీతం యుద్ధ దృశ్యాల్లో కొత్త వేడిని రగిలించింది. ఒకరని ఏమిటి, బృందంలోని ప్రతి ఒక్కరూ పనిని తపస్సుగా భావించారు. కాబట్టే, ఏడెనిమిది నెలల సమయంలో ఇంత గొప్ప చిత్రాన్ని తీయగలిగాం.
జాతీయ అవార్డు అందుకోడానికి వెళ్లినప్పుడు రాజమౌళిగారికి ఈ కథ చెప్పాను. ‘ఎక్కువగా గ్రాఫిక్స్‌ పెట్టుకోవద్దు. దీనివల్ల చాలా సమయం పడుతుంది. సాధ్యమైనంత వరకూ లైవ్‌ షూటింగ్‌ పెట్టుకో. చిన్నచిన్న సెట్స్‌ వరకూ అయితే ఫర్వాలేదు’ అని సలహా ఇచ్చారు. ఆ సూచన బాగా ఉపయోగపడింది. సహజమైన దృశ్యాలకోసం మొరాకో, జార్జియాలకు వెళ్లాం. మధ్యప్రదేశ్‌ లాంటి చోట్లా షూటింగ్‌ చేశాం. వందలకొద్దీ గుర్రాలతో, వేలమంది సైనికులతో భారీ యుద్ధ దృశ్యాలు చిత్రించాం. కాబట్టే, చిత్రంలో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కంటే, సహజ దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. దర్శకుడు అనేవాడు అంతర్నేత్రాలతో దర్శించినదాన్ని....ప్రేక్షకుల బాహ్య నేత్రాల ముందుకు తీసుకెళ్లగలగాలి. ఆ ప్రయత్నంలో నేను విజయం సాధించానని సగర్వంగా చెప్పగలను’
కథా నాయకుడు...
నందమూరి బాలకృష్ణ
ఎవరైనా నటిస్తారు. మహా అయితే జీవిస్తారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఆ పాత్రను ఆవాహన చేసుకుంటారు. అందులోనూ అది శకపురుషుడి పాత్రŒ. నడకలో నడతలో, చూపులో పలుకులో రాజసం తొణికిసలాడాలి. ఆ పాత్రధారి క్షాత్రవిద్యల్లోనూ ఆరితేరి ఉండాలి. బాలయ్యకు రాజసం వారసత్వంగా వచ్చేసింది. ఇక, కత్తిసాములు కొట్టినపిండి. గుర్రపుస్వారీ బొమ్మలాటే...కాబట్టే, క్రిష్‌ ఆయన్నే దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసుకున్నాడు. కాదంటే, సినిమాయే లేదనేంత కఠిన నిర్ణయానికొచ్చాడు. కాస్త ఆలస్యమై ఉంటే, బాలయ్య ఇంకేదో ప్రాజెక్టును వందో సినిమాగా ఒప్పుకునేవారే! అనేక అవాంతరాల తర్వాత, సృష్టికర్త మహాదర్శకుడి పాత్ర పోషించి...చక్కని స్క్రీన్‌ప్లేతో ఇద్దరినీ ఒక చోటికి చేర్చాడు. ఒక చారిత్రక సందర్భానికి తగినట్టు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని తెరమీదికి తెచ్చాడు. బాలయ్యకైతే ఈ అవకాశం నాన్న పంపిన ఆశీర్వచనపూర్వక కానుక. ఆ ఆనందమంతా ఆయన మాటల్లోనే...
‘ఈరోజు కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో నేనూ అంతే ఎదురుచూస్తున్నా. ఇంత సమయం తీసుకోడానికి కారణమేమిటో కూడా ముందు చెప్పాలి. వందో సినిమా అంటే...తొంభై తొమ్మిది సినిమాల కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఫలితం. తొంభై తొమ్మిది మైలురాళ్లను దాటిన నా నలభై ఏళ్ల ప్రయాణం. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తూ వచ్చిన నా ప్రేక్షక దేవుళ్లకు నేను చేయాల్సిన చిత్రోత్సవం. నా చరిత్రలోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనూ నిలిచిపోవాలి. అందుకే, ఎన్నో కథలు విన్నాను. కొన్ని నచ్చలేదు. కొన్ని నచ్చినా, వందో సినిమా స్థాయి ఉందనిపించలేదు. ఎక్కడో ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో కావాలి. ఆ క్రమంలోనే క్రిష్‌ కథ విన్నాను. అదే, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇంతకాలం నేను ఆగింది ఇలాంటి కథ కోసమే అనిపించింది. ఇది ఓ తెలుగు వీరుడి కథ. మన చరిత్ర. ఈ సమయంలో నాన్నగారే ఉంటే, నన్ను ప్రేమగా గుండెలకు హత్తుకునేవారు. నా వందో చిత్రం ఇదే కావాలన్నది ఆయన సంకల్పమేమో! అందుకే, క్రిష్‌ను నా దగ్గరికి పంపారేమో! నాగరికత తలకట్టు నా తెలుగుభాష. జాతి మెలితిప్పిన మీసకట్టు నా మాతృభాష. ప్రపంచం కట్టిన పంచెకట్టు నా తెలుగు భాష. జాతి ఘనతనూ భాషా వైభవాన్నీ చాటే ఓ మంచి చిత్రం ద్వారా ఈ సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నా’.
అక్షర తపస్వి
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఆయన గదిలోకి అడుగుపెట్టగానే నా ఉచ్ఛ్వాసం కవనం...నా నిశ్వాసం గానం - అన్న ‘సిరివెన్నెల’ వచనాలు కనిపిస్తాయి. దాదాపు మూడు దశాబ్దాల నుంచీ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సినిమా సాహిత్యాన్ని బతికిస్తున్నాయి. లేకపోతే, ‘ఆదిభిక్షువు వాడినేది కోరేదీ, బూడిదిచ్చేవాడినేది అడిగేదీ...’ అనగలిగేంత తాత్విక భూమిక ఆధునిక తెలుగు సినిమాకు ఎక్కడిది? అల్లాటప్పా పదవిన్యాసాలతో సరిపెట్టుకోకుండా, భావపుష్టి ఉన్న పాటల్ని కోరుకునే దర్శకులకు సీతారామశాస్త్రి పదబంధ పరమేశ్వరుడు! కాబట్టే, కథ సిద్ధం కాగానే క్రిష్‌ నేరుగా వెళ్లి, పట్టినిలిచే పాట కావాలంటూ పెద్దాయన పాదాల మీద పడ్డాడు. ఇంకేముంది...అక్షరమథనం మొదలైంది, గేయామృతం వరదైంది...‘పదకొండో శతాబ్దం నుంచీ తెలుగు భాష సంకరమైంది. ఆ పదాలేమిటో తెలియకపోయినా, ఈ పదాల్ని మాత్రం ఉపయోగించకూడదు. రెండువేల సంవత్సరాల నాటి భాషే అనిపించేలా రాయగలగాలి. అందుకే, ఓ యుగళగీతాన్ని ‘ఎకిమీడా..’ అని మొదలుపెట్టాను. ఇది సంస్కృత సంపర్కం లేని తెలుగుమాట. ‘రాజా..’ అని అర్థం. ఓ సందర్భంలో గౌతమి పుత్రుడూ, వాసిష్ఠీదేవీ మారువేషాల్లో విహారానికి వెళ్తారు. అంతఃపురంలో అయితే ‘ప్రభూ!’ అనో ‘స్వామీ!’ అనో సంబోధించేదేమో. ఏకాంతంలో రాచరిక బంధనాలుండవు కాబట్టి, అచ్చమైన అనురాగానికి గుర్తుగా స్వచ్ఛమైన తెలుగు మాట ప్రయోగించాను. ‘ఎకిమీడా నా జతవిడనని వరమిడవా..తగుజోడా నా కడకొంగున ముడిపడవా’ అన్నాను. ఆ ప్రయోగం విషయంలో పెద్ద చర్చే జరిగింది. ‘ఎవరికి అర్థం అవుతుందీ?’ అన్నవారూ ఉన్నారు. అర్థం కాకపోవడం అన్న మాటకు అర్థం లేదు. ఆత్మతో రాస్తే, ఆత్మ ఆత్మతో సంభాషిస్తుంది. తెలియకపోతే తెలుసుకుంటారు. ఇప్పటికే చాలా పదాల్ని పోగొట్టుకున్నాం. మిగిలిన కొద్దిపాటి పద సంపదనైనా కాపాడుకోకపోతే ఎలా? ఆ తపనతోనే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని నాలుగు గీతాలకూ ప్రాణం పోశాను. కథకు అనుగుణంగా, అవసరంగా ఉంటూనే, శ్రవణపేయంగా ఉండే పదాల్ని ఎంచుకున్నాను. యుద్ధ నేపథ్యంలో ‘గణగణగణ గుండెలలో జేగంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలుముక్కలయేలా...గణగణగణ కన్నులలో కార్చిచ్చులు రేగెను చిక్కటి చీకటి నెర్రగ రగిలించేలా...’ ఇలా, చిన్నచిన్న పదాలతోనే రౌద్రాన్ని పలికించిందో గీతం. ‘సాహో సార్వభౌమా...బహుపరాక్‌’ కూడా అంతే ఉత్సాహభరితమైన పాట. ‘నిన్నే కన్న పుణ్యం కన్న ఏదీ మిన్న కాదనుకున్న జననికి, జన్మభూమికి తగిన తనయుడివన్న మన్నన పొందరా...’ అంటూ ప్రతి ఒక్కరిలోనూ నైతిక బాధ్యత గుర్తుచేసే ప్రయత్నమూ చేశాను. రచయితగా అది నా కర్తవ్యం కూడా.
మాటల మాంత్రికుడు..
బుర్రా సాయిమాధవ్‌
పాత్ర..నడిచేయుద్ధం లాంటి మహావీరుడిది. పాత్రధారి...శతచిత్ర యోధుడైన బాలకృష్ణ. రౌద్రరస ప్రధానమైన ఇతివృత్తం. ప్రతి మాటా మందుగుండులా పేలాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో రచయిత తనకంటూ ఓ అక్షర ఆయుధాగారాన్ని నిర్మించుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి...ప్రేక్షకుడికి వూపిరిపీల్చుకునేంత సమయం కూడా ఇవ్వకుండా, సంభాషణ భాస్వరమై మండాల్సిందే. బుర్రా సాయిమాధవ్‌కు ఆ జిగిబిగి తెలుసు. కాబట్టే...‘దేశం మీసం మెలేసింది!’, ‘దొరికినవాళ్లని తురుముదాం, దొరకనివాళ్లని తరుముదాం’ తరహా వీర వచనాలు పేరిణీ శివతాండవంలా కథలో సైనికుల్నీ, థియేటర్లో ప్రేక్షకుల్నీ ఉర్రూతలూగిస్తాయి. ఈ అవకాశం మహద్భాగ్యమని పొంగిపోతాడా యువ రచయిత...‘ క్రిష్‌ స్పష్టత ఉన్న దర్శకుడు. తనకేం కావాలో తెలుసు. రచయిత నుంచి ఎలా రాబట్టుకోవాలో కూడా తెలుసు. గతంలో కలసి పనిచేయడంతో...ఆయన ఏం చెప్పారన్నదే కాదు, ఎందుకు చెప్పారన్నదీ అర్థం చేసుకోగలిగినంత అవగాహన నాకు ఏర్పడింది. దీంతో, ఎక్కడా ఇబ్బంది కలగలేదు. పతాక సన్నివేశ దృశ్యాల విషయంలో మాత్రం....ఓపట్టాన ఆయన సంతృప్తి చెందలేదు. నేనూ దాన్నో సవాలుగా తీసుకున్నా. దాదాపు పది సార్లు తిరగరాసుకున్నా. అయినా దర్శకుడికి నచ్చలేదు. రెండ్రోజుల విరామం తర్వాత...మళ్లీ మొదలుపెట్టాను. వాటిని చూశాక ‘ఇదే నాకు కావలసింది...’ అన్నారు క్రిష్‌. ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణగారు వినిపించిన డైలాగ్‌ కూడా అదే ...‘వెళ్లు. వెళ్లి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికీ గదికీ మధ్య గోడలుంటాయి. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లోనే మీకో శ్మశానం నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండా ఎగరేస్తాం’. క్రిష్‌ సంభాషణలు రాసే అవకాశం ఇస్తూ...‘తెలుగు భాష సౌందర్యం ఏమిటో తెలుగు రానివాళ్లకూ తెలియాలి’ అని చెప్పారు. ఆ మాట నిలుపుకున్నా!
* * *
సినిమా అంటే గ్రాఫిక్స్‌ మాయాజాలమో, గగుర్పాటు కలిగించే విన్యాసాల సమాహారమో కాదు. బలమైన మాధ్యమం. విశ్వశ్రేయః కావ్యం...సినిమా కూడా ఓ కావ్యమే, మహా అయితే దృశ్య కావ్యం. సాహిత్యానికి వర్తించే విలువలే చలనచిత్రానికీ వర్తిస్తాయి. వినోదంతో పాటూ వికాసాన్నీ మోసుకురాని సినిమా...దొమ్మరాటలా ఓ కాలక్షేపమంతే! పేకాటలా ఓ వ్యసనమంతే! మంచి సినిమా అనేది... ‘ఇది నీ జాతి. ఇదే నీ ఘన చరిత్ర. ఈ మహానుభావులకే నువ్వు వారసుడివి. ఆ పేరు నిలబెట్టుకో, ఆ విలువల్ని కాపాడుకో..’ అంటూ వర్తమానమనే తెరమీద, గతాన్ని గుర్తుచేసి, భవిష్యత్తు దిశగా ప్రేక్షకులతో అడుగులేయిస్తుంది. నిద్రలో ఉన్నవారిని తట్టిలేపినట్టు, నిద్రాణమైన శక్తిసామర్థ్యాల్ని గుర్తుచేస్తుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పరమలక్ష్యం కూడా ఆ సామాజిక పరివర్తనేనంటాడు దర్శకుడు క్రిష్‌.
శాతవాహనుల కథ..
విశ్వనాథవారి ‘ఆంధ్రప్రశస్తి’ ప్రకారం ...పూర్వం దీపకర్ణి అనే తెలుగు పాలకుడు ఉండేవాడు. అతడి అర్ధాంగి పాముకాటుకు బలైపోయింది. భార్య తలపులతో జీవితాన్ని గడుపుతున్న మహారాజుకు కులదేవత కలలో కనిపించి మరుసటి రోజు వేటకు వెళ్లమని ఆదేశించింది. దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకోగానే...అక్కడో అద్భుత దృశ్యం గోచరించింది. ఓ పసివాడు సింహం మీద సవారీ చేస్తూ కనిపించాడు. ఓ సరస్సు దగ్గరికి చేరుకోగానే సింహం ఆ బిడ్డను దింపి, దాహం తీర్చుకోడానికి వెళ్లింది. రాజు అదే అదనుగా భావించి సింహం మీద బాణం వేయబోయాడు. అప్పుడా మృగం గంధర్వరూపం ధరించి తన కథంతా వివరించింది. శాతం అంటే సింహం. మృగరాజును వాహనం చేసుకున్నవాడు కాబట్టి, ఆ బాలుడు శాతవాహనుడు అయ్యాడు.
స్వప్నసుందరీ...
లనాటి అందాలతార హేమమాలిని ఈ చిత్రంలో రాజమాత గౌతమి పాత్రను పోషించారు. హేమమాలినికి కోపం ఎక్కువనీ, ఏ కాస్త తేడా వచ్చినా షూటింగ్‌ మధ్యలోంచి వెళ్లిపోతారనీ ఓ ప్రచారం ఉండేది. ‘గౌతమిపుత్ర...’ బృందానికి అదంతా అపోహే అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ‘నాకు తెలుగు సినిమాలు కొత్తేం కాదు. నా మొదటి చిత్రం...పాండవ వనవాసం. నర్తకి పాత్రలో కనిపించాను. శ్రీకృష్ణ విజయంలోనూ నటించాను. రెండు సినిమాలకూ ఎన్టీఆర్‌గారే హీరో’ అంటూ అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. నటులకు భాష పెద్ద అవరోధం కాబట్టి, తొలుత ఈ చిత్రంలో నటించడానికి హేమమాలిని అంగీకరించలేదు. క్రిష్‌ ఓ గంట సమయం తీసుకుని, పాత్ర ఔన్నత్యాన్ని వివరించాక, ఆమె సంతోషంగా సరేనన్నారు.
కబీర్‌బేడీ
‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కబీర్‌బేడి నహపాణుడిగా దర్శనమిస్తాడు. క్రూరత్వానికి పరాకాష్ట ఆ పాత్ర. పసిపిల్లల్ని ఎత్తుకెళ్లి పాలకుల్ని బెదిరించే కుటిల స్వభావం. ప్రతినాయకుడిలోని రక్కసి గుణాన్ని సంభాషణలు రెట్టిస్తాయి. కబీర్‌బేడీకి తెలుగు రాదు. అర్థం చేసుకోనూలేరు. మరో నటుడైతే, సంభాషణల్ని ఏ ఆంగ్లంలోనో రాయించుకుని గడగడా అప్పజెప్పేసి, తన పని అయిపోయిందని అనుకునేవాడు. దీంతో డబ్బింగ్‌ సమయంలో, ఇబ్బంది ఏర్పడేది. పెదాలకదలికలకు తగినట్టు మాటల్ని మార్చాల్సి వచ్చేది. ఫలితంగా బలమైన పదాలు పడాల్సిన చోట, మొక్కుబడి మాటలతో ముగించాల్సి వచ్చేది. కబీర్‌బేడీకి ఆ వ్యవహారం నచ్చదు. డైలాగ్‌ చెబుతున్నప్పుడే...అర్థంలోనూ ఉచ్చారణలోనూ తెలుగు పదానికి దగ్గరగా ఉండే హిందీమాటనే ఎంచుకునేవారు. దీంతో డబ్బింగ్‌ కష్టాలు తప్పాయి.
భేష్‌...బాలయ్య!
ఓ ఘట్టంలో గౌతమిపుత్ర శాతకర్ణి తన బిడ్డ పులోమావిని తీసుకుని యుద్ధానికి బయల్దేరతాడు. ఆ దృశ్యాన్ని చిత్రిస్తున్నప్పుడు...చుట్టూ అగ్నిగోళాలు మండుతూ ఉంటాయి. గుర్రం కాస్త ముందుకెళ్లాక....అగ్ని గోళాలు ఒకవైపున మాత్రమే పేలడం మొదలుపెట్టాయి. రెండోవైపు ఆగిపోవడంతో...ముందుకెళ్లాల్సిన గుర్రం పక్కకి తిరిగింది. దీంతో బాలకృష్ణ గుర్రం మీది నుంచి పసివాడితో సహా కిందపడిపోయారు. అయినా, బిడ్డకు ప్రమాదం జరగకుండా భద్రంగా ఒడిసిపట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా తన గురించి పట్టించుకోకుండా, ‘బిడ్డకేం కాలేదు కదా..’ అని ఆందోళన చెందారు. అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ సెట్స్‌ మీదికి వచ్చారు. ఇనుమడించిన ఉత్సాహంతో యుద్ధ సన్నివేశంలో నటించారు. ఇది మొరాకోలో జరిగిన సంఘటన. ఆ దృశ్యాన్ని చూసిన విదేశీయులు ‘మీ హీరో...నిజ జీవితంలోనూ హీరోయే’ అని మెచ్చుకున్నారు.
ఎన్టీఆర్‌ హయాంలోనే...
కలకళా వల్లభుడైన గౌతమిపుత్ర శాతకర్ణిగా నటించాలన్నది ఎన్టీఆర్‌ చిరకాల వాంఛ. స్క్రిప్టు కూడా రాయించుకున్నారు. అయితే ఆ కథా, ఈ కథా ఒకటి కాదు. మహాసామ్రాజ్య నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ కథ మొదలవుతుంది. గౌతమిపుత్రుడు బౌద్ధాన్ని తీసుకోవడంతో పూర్తి అవుతుంది. ఈ సినిమాలో మాత్రం...భరతజాతిని ఒక ఛత్రం కిందికి తీసుకురావడమే ప్రధాన ఇతివృత్తం. శాతకర్ణి పుత్రుడైన పులోమావి పాత్రకు వెంకటేశ్‌ను అనుకున్నారు. పూర్వ శాతవాహనరాజు హాలుడిగా ఫ్లాష్‌బ్యాక్‌ సీనులో బాలకృష్ణ అయితే బావుంటుందన్న నిర్ణయానికొచ్చారు. ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశంతో ఆ ఆలోచన ఆలోచనగానే మిగిలిపోయింది. అయితేనేం, మరో రూపంలో శాతవాహనుల మీద అభిమానాన్ని చాటుకున్నారాయన. ట్యాంక్‌బండ్‌ మీద ఏర్పాటు చేసిన తెలుగు ప్రముఖుల విగ్రహాల్లో మొదటిది శాతవాహనుడిదే! విజయవాడ ఆర్టీసీ బస్సు ప్రాంగణానికి కూడా శాతవాహనుడి పేరే పెట్టారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో 90 శాతం!
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించి దేశీయంగా జరగాల్సిన షూటింగ్‌లో తొంభైశాతం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే జరిగింది. ఆతర్వాత చెప్పుకోవాల్సింది...మొరాకోలోని అట్లాస్‌ స్టూడియో. ‘ట్రాయ్‌’ లాంటి ప్రసిద్ధ చిత్రాలన్నీ అక్కడే ప్రాణంపోసుకున్నాయి. చారిత్రక సినిమాల కోసం హాలీవుడ్‌ దర్శకులు ఆ స్టూడియోకే ప్రయాణం అవుతారు. ఆ నగరం సినిమా కోసమే నిర్మితమైనట్టు ఉంటుంది. అంతా ఎడారి ప్రాంతం. దూరంగా మంచుకొండలూ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పది నిమిషాలకోసారి హోరుగాలికి ఇసుక...రేగిపోతుంది. ఆ ప్రతికూల వాతావరణంలోనూ నటులూ, సాంకేతిక నిపుణులూ...శాతకర్ణి సైన్యంలో తామూ భాగమే అన్నంత అంకిత భావంతో పనిచేశారు.

mohan publications price list