MohanPublications Print Books Online store clik Here Devullu.com

పాడనా తెనుగు పాట.._Padana telugu pata





పాడనా తెనుగు పాట..

చిత్రం: అమెరికా అమ్మాయి
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: జి.కె. వెంకటేశ్‌
గానం: పి. సుశీల


పల్లవి :

పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చరణం : 1
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాలపేట మధురామృతాల తేట
ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చరణం : 2
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడునాడులుకదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట

ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చరణం : 3
ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్లకు పారాణి మెరిసే కుంకుమబొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే
తెలుగుతల్లి పెట్టనికోట తెలుగునాట ప్రతిచోట
ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె.వెంకటేష్
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : పి.సుశీల

‘అమెరికా అమ్మాయి’ చిత్రంలోని ‘పాడనా తెనుగుపాట’ నాకు చాలా చాలా ఇష్టమైన పాట. అమెరికాలో ఉండే అమ్మాయి, మన దేశానికి వచ్చి, మన భాష, సంస్కృతి, సంగీతం, సంప్రదాయం నేర్చుకుంటుంది. ఒకసారి వేదిక మీద జరుగుతున్న ఒక కార్యక్రమంలో తెలుగువారు... పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ, వారి సంస్కృతిని కల్తీ చేసి నాట్యం చేస్తారు. ‘ఇది కాదు మన సంస్కృతి’ అని అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి, తెలుగుదనం వెల్లివిరిసేలా పాడే పాట ఇది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ఈ పాటలో చూపాలి. సందర్భానికి తగ్గట్టుగా దేవులపల్లి వారు రాసిన పాట ఇది. వారి పదాలలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. అందుకే ఆయన చేత రాయించుకున్నాను.

ఈ పాటకు జి. కె. వెంకటేశ్‌ సంగీతం సమకూర్చారు. ప్రముఖ వయొలిన్‌ విద్వాంసులు ఎల్‌.వైద్యనాథన్, ఇళయరాజా సంగీత సహాయకులుగా పని చేశారు. ఈ చిత్రంలో అమెరికా అమ్మాయిగా ‘దేవయాని’ అనే ఫ్రెంచ్‌ అమ్మాయిని ఎంచుకున్నాం. ఈ అమ్మాయి మద్రాసు కళాక్షేత్రంలో నాట్యం నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చేది. ఈ పాట ఎత్తుగడే ‘పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట...’ అని వస్తుంది. ఒక విదేశీ అమ్మాయి భారతదేశానికి వచ్చి, తెలుగు సంస్కృతీసంప్రదాయాలను అలవర్చుకుని, పట్టుచీర, కుంకుమబొట్టు, పూలతో అందమైన అచ్చమైన పల్లెవాతావరణాన్ని ప్రతిబింబించేలా కనిపిస్తుంది.

మన తెలుగువారి పాట మన ఎదురుగా వినిపిస్తాను అంటూ ఈ పాట పాడుతుంది. ‘‘కోవెల గంటలు, గోదావరి తరగలు, మంచి ముత్యాలు, మధురామృతాలతో నిండిన పాట పాడుతాను’’ అంటూ తెనుగు భాష, తెనుగు నేల గొప్పదనాన్ని ఈ పాటలో పలుకుతుంది కథానాయకి. తెనుగు వాగ్గేయకారులైన త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసుల కవితలో చక్కెర మాటల మూటలు, చిక్కని తేనెల ఊటలు ఉన్నాయంటే తేనె వంటి తెనుగును చూపారు కృష్ణశాస్త్రి గారు. ఈ పాటలో ముఖ్యంగా ‘‘ఒళ్లంత వయ్యారి కోక, కళ్లకు కాటుక రేఖ...’’ చరణంలో తెలుగు నేపథ్యం, గ్రామీణ వాతావరణం, పల్లెల గొప్పదనం, ప్రాశస్త్యం చూపాలనుకున్నాం. అందుకుగాను రాజమండ్రి దామెర్ల ఆర్ట్‌ గ్యాలరీలో ఉన్న దామెర్ల రామారావు చిత్రాలు చూపాలనుకున్నాను.

నాకు అత్యంత సన్నిహితులైన బాపు గారి ద్వారా ఆ చిత్రాలు తెప్పించి, అవి చూపాం. మూడో చరణమంతా అలా అచ్చలె నుగు పల్లెను పిక్చరైజ్‌ చేశాం. ఈ పాటలోని ప్రతి పదంలోనూ తెనుగుదనం ఉట్టిపడుతుంది. తెనుగు భాష విశిష్టతను, తెనుగుదనాన్ని తేనెలొలికించారు కృష్ణశాస్త్రి గారు. ఆయన గురించి చెప్పడమంటే మాటలు కాదు. అప్పటికే మల్లీశ్వరి చిత్రం ద్వారా తెలుగువారికి సుపరిచితులైన కృష్ణశాస్త్రిగారు ఈ పాటను కూడా అంతే అందంగా రచించారు.
– సంభాషణ: డా. జయంతి

సూపర్‌ జీమెయిల్‌!-Supergmail

సూపర్‌ జీమెయిల్‌!
జీమెయిల్‌లో రోజుకో కొత్త ఆప్షన్‌ వస్తుంటుంది... అయితే అవి అందించని కొన్ని అదనపు సౌకర్యాల్ని క్రోమ్‌ బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లతో పొందొచ్చు. వీటిని ఇన్‌స్టాల్‌ చేసుకొని మెయిల్స్‌ ట్రాకింగ్‌, అక్షరదోషాల నివారణ, మెయిళ్ల వర్గీకరణ, ... లాంటి కొత్త కొత్త ఆప్షన్లతో మీ జీమెయిల్‌ని సూపర్‌ జీమెయిల్‌గా మార్చేయొచ్చు. వాటికి ఉపయోగపడే క్రోమ్‌ బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌లివీ!
మెయిల్‌ ట్రాక్‌ ఎక్స్‌టెన్షన్‌తో మీరు పంపిన మెయిల్‌ అవతలి వ్యక్తి చూశారో లేదో తెలుసుకోవచ్చు.
డ్రాఫ్ట్‌ మ్యాప్‌ ఎక్స్‌టెన్షన్‌ ఉంటే మీరు రాసిన మెయిల్‌లో అక్షర, వ్యాకరణ దోషాలు తెలిసిపోతాయి.
చెకర్‌ప్లస్‌ ఎక్స్‌టెన్షన్‌ను మీరు ఇన్‌స్టాల్‌ చేసుకుంటే... మొబైల్‌ తరహాలో మెయిల్‌ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్‌ వస్తుంది.
రీనేమ్‌ ఈమెయిల్‌తో మీకు వచ్చిన ఈమెయిళ్ల సబ్జెక్ట్‌ను మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
పేరు మార్చుకోవచ్చు 
రెండు నెలల క్రితం ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేశారు. ఆ టికెట్‌ పీడీఎఫ్‌ మెయిల్‌కి వచ్చింది కూడా. ఇప్పుడు దాని కోసం వెతుకుతుంటే దొరకడం లేదా? ఆ మెయిల్‌ సబ్జెక్ట్‌ను మీకు గుర్తుండేలా మార్చుకొని ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా. Rename Email ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఈ పని చేయొచ్చు. దీన్ని మీ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మీకు వచ్చే మెయిళ్ల సబ్జెక్ట్‌ను మార్చుకోవచ్చు. ఫ్లైట్‌ టికెట్‌నే తీసుకుంటే... ప్రయాణం తేదీ, రైలు పేరు లాంటివి సబ్జెక్ట్‌గా ఇస్తే వెతకడం సులభంగా ఉంటుంది.
సరి చేస్తుంది 
ఒకే మెయిల్‌లోని టెక్స్ట్‌లో రెండు, మూడు రకాల ఫాంట్‌లు ఉంటే బాగుండదు కదా. వెబ్‌సైట్‌లో టెక్స్ట్‌ కాపీ చేసుకున్న టెక్స్ట్‌ను మెయిల్‌లో పేస్ట్‌ చేస్తే... అలానే కనిపిస్తుంది. Email Text Formatter ఎక్స్‌టెన్షన్‌తో ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్న మేటర్‌ను మెయిల్‌ బాక్స్‌లో పేస్ట్‌ చేసిన తర్వాత... పైన ‘ఫిక్స్‌ ఫాంట్‌’ అని ట్యాబ్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే మీరు పేస్ట్‌ చేసిన ఫాంట్‌ సాధారణ అక్షరాల్లా మారిపోతుంది.
ప్రశ్నలు ఉన్నాయా?
మీ పై అధికారి నుంచి మీకో మెయిల్‌ వచ్చింది... అందులో విషయంపై మీకు చిన్న సందేహం ఉంది. అప్పుడు అడుగుదామంటే ఆయన అందుబాటులో లేరు. తర్వాత అడుగుదామంటే గుర్తుండదు. ఆ మెయిల్‌కి ఓ నోట్‌ యాడ్‌ చేసుకుంటే ఈ సమస్య ఉండదు కదా. Simple Gmail Notes ఎక్స్‌టెన్షన్‌ ఈ పని చేసిపెడుతుంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత మీకు వచ్చే మెయిల్‌కుపైన ఒక బాక్స్‌ కనిపిస్తుంది. అందులో మీ సందేహాన్ని రాసుకోవచు.
తప్పొప్పులు తెలుస్తాయి
ఆంగ్లంలో మెయిల్‌ అయితే కంపోజ్‌ చేసేస్తారు కానీ... గ్రామర్‌లో తప్పులుంటాయేమో అని మీకు సందేహమా? అయితే DraftMap ఎక్స్‌టెన్షన్‌ మీ ఇబ్బంది తీరుస్తుంది. దీన్ని క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత జీమెయిల్‌లో టైప్‌ చేస్తే... ఆ వాక్యాల్లోని పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, ఎక్కువగా వాడిన పదాలు, శైలి సరిగ్గా లేని పదాలు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో రంగు కనిపిస్తాయి. అనవసరం లేదా తప్పు అనుకున్న పదాల్ని అక్కడే మార్చేయొచ్చు.
మీ పేరు కొత్తగా
జీమెయిల్‌ సెట్టింగ్స్‌లో సిగ్నేచర్‌ అనే ఓ ఆప్షన్‌ ఉంటుంది. అందులో పేరు, వివరాలు ముందుగానే రాసిపెట్టేస్తే... ప్రతి సెంట్‌ మెయిల్‌ మేటర్‌ ఆఖరున అవి ఆటోమేటిక్‌గా వచ్చి చేరుతాయి. దానికి ఫొటో, మీ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఐడీలు లాంటి కొత్త సొబగులు అద్దాలంటే WiseStamp - Email Signatures for Gmail ఎక్స్‌టెన్షన్‌ ఉండాల్సిందే. దీన్ని క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే... ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ పేరు, మొబైల్‌ నెంబరు, ఫొటో, చిరునామా, సోషల్‌ నెట్‌వర్క్‌ ఐడీ తదితర సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత ఎప్పుడు మెయిల్‌ చేసినా ఆ వివరాలు అడుగున వస్తాయి.
చూశారా లేదా?
వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పంపిస్తే... దాన్ని చూశారా లేదా అనే విషయాన్ని టిక్‌ మార్క్‌ ద్వారా తెలుసుకోవచ్చు. జీమెయిల్‌లోనూ అలాంటి సౌకర్యం ఉంది. అయితే దాని కోసం Mailtrack ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిల్‌ చేసినప్పుడు దిగువన ఉన్న బటన్‌ ద్వారా ‘మెయిల్‌ ట్రాక్‌’ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకొని సెండ్‌ చేయాలి. అలా పంపించిన మెయిల్‌ అవతలి వ్యక్తికి చేరితే ఒక గ్రీన్‌ టిక్‌, దాన్ని ఓపెన్‌ చేస్తే రెండు గ్రీన్‌ టిక్‌లు వస్తాయి. ఎంత సేపటి క్రితం మెయిల్‌ ఓపెన్‌ చేశారనేది మీరూ తెలుసుకోవచ్చు.
వస్తే చెబుతుంది
మీకు మెయిల్‌ వచ్చినప్పుడల్లా మొబైల్‌లో నోటిఫికేషన్‌ వస్తుంది. అదే సిస్టమ్‌లో అయితే ప్రతిసారి మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసి చూసుకోవాలి. అదే మీరు Checker Plus for Gmail ఎక్స్‌టెన్షన్‌ వాడుతుంటే... మీకు కంప్యూటర్‌లోనూ నోటిఫికేషన్‌ వస్తుంది. దీన్ని సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక మీకు ప్రతిసారి మెయిల్‌ వచ్చినప్పుడు స్టార్ట్‌ బార్‌లో నోటిఫికేషన్‌ వస్తుంది. అక్కడే క్లిక్‌ చేసి మెయిల్‌ను చూడొచ్చు. వాటిని డిలీట్‌, మూవ్‌, ఫార్వర్డ్‌ లాంటివి కూడా చేయొచ్చు.
వర్గీకరణ సులభంగా...
వ్యక్తిగత మెయిల్స్‌, వృత్తిగత మెయిల్స్‌, బ్యాంకు వివరాలు... వీటి మధ్యలో టాస్క్‌లు. అలా గజిబిజిగా కాకుండా టాస్క్‌లను వేరుగా పెట్టుకుంటే పని సులభమవుతుంది. Sortd ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఈ పని చేయొచ్చు. దీనికి మీ మెయిల్‌ ఐడీని జోడించాక... సరికొత్త విండో ఓపెన్‌ అవుతుంది. అందులో టుడూ, ఫాలో అప్‌, లిస్ట్‌ అని విభాగాలు కనిపిస్తాయి. వాటి పక్కనే మీకు వచ్చిన మెయిల్స్‌, మీరు నమోదు చేసుకున్న టాస్క్‌లుంటాయి. వాటిని పక్కనున్న ట్యాబ్స్‌లోకి డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ చేసి సులభంగా వర్గీకరించొచ్చు.
సమాధానం రాకపోతే...
మీ స్నేహితుని మెయిల్‌ చేశారు... సమాధానం కోసం రెండు రోజులు వేచి చూశారు. కానీ ఫలితం లేదు. దీంతో మళ్లీ మెయిల్‌ చేశారు. ఇలా సమాధానం రాని వారికి మీరే మళ్లీ మెయిల్‌ చేయాల్సిన అవసరం లేకుండా... ఆటోమేటిక్‌గా మెయిల్‌ వెళ్లే ఆప్షన్‌ ఒకటి ఉంది. Notifus ఎక్స్‌టెన్షన్‌తో ఈ పని చేయొచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక కంపోజ్‌ మెయిల్‌ ఐకాన్‌ క్లిక్‌ చేస్తే... దిగువ సెండ్‌, సెండ్‌+1డే, సెండ్‌+2డే అంటూ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. సెండ్‌+1డేను ఎంచుకుంటే మీరు మెయిల్‌ పంపిన ఒక రోజులోగా దానికి సమాధానం రాకపోతే ఆ మెయిల్‌ రీసెండ్‌ అవుతుంది.

ఆసన్నం-Yoga, Obesity, యోగా, ఒబేసిటీ

ఆసన్నం
డంబెల్‌ షేప్‌–2
గత వారం విభిన్న రకాల శరీరపు తీరుతెన్నులను బట్టి ఒబేసిటీ ని 3 రకాలుగా విభజిస్తారని తెలుసుకున్నాం. పొట్టకన్నా పిరుదులు, తొడలు, భుజాలు బాగా లావుగా ఉంటే డంబెల్‌ ఒబేసిటీ అంటారని, ఆ డంబెల్‌ ఒబేసిటీ సమస్యకు పరిష్కారంగా కొన్ని ఆసనాలను, అవి చేసే విధానాన్ని వివరించడం జరిగింది. అదే క్రమంలో డంబెల్‌ షేప్‌ సమస్య నుంచి బయట పడేందుకు ఉపకరించే మరికొన్ని ఆసనాలు,
అవి వేసే విధానాన్ని ఈ వారం కూడా అందిస్తున్నాం. 
1.చక్రాసన
వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ మడచి పాదాలు– మడమలను పిరుదుల దగ్గరగా తీసుకొని మోకాళ్లు పైకి నిలబెట్టాలి. తలకి ఇరువైపులా అరచేతులు నేల మీద ఉంచి (చేతి వేళ్లు లోపలి వైపునకు ఉంటాయి) శ్వాస తీసుకుంటూ అరచేతులూ, అరిపాదాలు భూమికి బలంగా నొక్కుతూ శరీరాన్ని పైకి లేపాలి. రెండు లేదా మూడు శ్వాసల తరువాత శ్వాస వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని కిందకు తీసుకురావాలి. కాళ్లను స్ట్రెచ్‌ చేసి చేతులు శరీరం పక్కన ఉంచి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఒక వేళ పూర్తి స్థితిలో చేయలేకపోతే...
స్టెప్‌–1 ముందుగా భుజాలు భూమి మీదనే ఉంచి పిరుదులను పైకి లేపాలి. శ్వాస వదులుతూ ïపిరుదులను భూమి మీద ఉంచాలి.
స్టెప్‌–2 మళ్లీ స్టెప్‌ 1 లోకి వచ్చి, ఈ సారి తలను (మాడు భాగాన్ని) నేలమీద ఉంచి అరచేతులు భూమి మీద ఉంచి భుజాలను కూడా పైకి లేపి రెండు మూడు సాధారణ శ్వాసల అనంతరం శ్వాస వదులుతూ ముందు భుజాలను తరువాత సీటు భాగాన్ని నేల మీదకు తీసుకురావాలి.
స్టెప్‌–3 ఇంకా పూర్తి స్థాయిలో చేయాలనుకుంటే స్టెప్‌ 2లో నుంచి, చేతుల మీద భారం ఉంచుతూ తలను భుజాలను పూర్తిగా పైకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి స్థితిలోకి వచ్చిన తరువాత శరీరం మొత్తాన్ని చేతుల మీద తేలికగా నిలుపగల స్థితి ఉన్నట్లయితే కుడి కాలుని పైకి లేపి పాదాన్ని కాలివేళ్లను పైకి స్ట్రెచ్‌ చేసి ఉంచవచ్చు. తరువాత కుడి కాలుని కిందకు తీసుకువచ్చి తిరిగి ఎడమకాలుని పైకి తీసుకువెళ్లవచ్చు.
జాగ్రత్తలు: ఇది కొంచెం ముందస్తు భంగిమ (అడ్వాన్స్‌డ్‌ పోశ్చర్‌) కాబట్టి ఊబకాయం ఉన్నవారు శరీరాన్ని పైకి లేపాల్సి వచ్చినప్పుడు భుజాలు, చేతి మణికట్టు బలంగా ఉన్నట్లయితే తేలికగా చేయవచ్చు. మణికట్టు ఏమాత్రం బలహీనంగా ఉన్నా పూర్తి స్థాయిలో చేయకుండా స్టెప్‌ 1 లేదా స్టెప్‌ 2 వరకూ చేయడం మంచిది.
2. వీరాసన
విడదీసి ఉంచిన పాదాల మధ్యలో కూర్చున్న తరువాత వెనుకకు ఒరిగి, రెండు మోచేతులూ భూమి మీద ఆనించి, రెండు అరచేతులూ సీటు పక్కన భూమి మీద ఉంచి భూమికి నొక్కుతూ, వీపు భాగాలని తరువాత మెడ భాగాలని ఆ తరువాత తల భాగాన్ని భూమి మీద ఉంచి, చేతులు రెండూ వెనుకకు స్ట్రెచ్‌ చేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆసనం పూర్తి స్థితిలో వీపుపై భాగాలే కాకుండా వీపు మధ్య భాగం, కింద భాగం కూడా భూమి మీద ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి. మోకాళ్లు రెండూ దూరంగా కాకుండా వీలైనంత వరకు కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. అలాగే మోకాళ్లు గాలిలోకి లేవకుండా పూర్తిగా భూమి మీదనే ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి.
జాగ్రత్తలు: మోకాలు సమస్య ఉన్నవారు ఎంతవరకు సాధ్యపడితే అంతవరకే చేయాలి.
3. వీరభద్రాసనం
త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసన తరువాత చేసే ఆసనం ఈ వీరభద్రాసనం. రెండు కాళ్ళమధ్య వీలైనంత దూరం ఉంచి, కుడిపాదాన్ని ముందు వైపునకు, ఎడమపాదాన్ని పక్కకు ఉంచి, కుడి మోకాలును ముందుకు వంచి, కుడి మోకాలు నుంచి కుడి తొడ కీలుభాగం వరకు 90 డిగ్రీల కోణంలో ఉండేటట్లు చూసుకోవాలి. చేతులు రెండూ 180 డిగ్రీల కోణంలో ఉంచాలి. శరీర బరువును ఎడమపాదం మీదకు షిఫ్ట్‌ అయ్యేటట్లుగా శరీరాన్ని కొంచెం వెనుకకు ఏటవాలుగా ఉంచితే కుడి మోకాలు మీద లోడ్‌ పడదు. శ్వాసతీసుకుంటూ పూర్తి ఆసనస్థితిలోకి వచ్చి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ చేతులు రెండూ క్రిందకు, కుడి మోకాలు స్ట్రెయిట్‌గా తీసుకురావాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి. 
4. ఏకపాద ప్రసారిత మార్జాలాసనం
రెండు అరచేతులు ముందువైపు నేల మీద ఉంచాలి. రెండు మోకాళ్ళు మధ్య 1 లేదా ఒకటిన్నర అడుగుల దూరం ఉంచి మార్జాలాసనంలో నడుమును రిలాక్స్‌ చేస్తూ, నెమ్మదిగా కుడి మోచేయి, ముంజేయి, అరచేయి నేలమీద ఉంచి శ్వాస తీసుకుంటూ ఎడమకాలును బాగా స్ట్రెచ్‌ చేసి శ్వాస వదులుతూ ఎడమకాలును కుడివైపు పక్కకు పడేసి నడుము భాగాల్లో ట్విస్ట్‌ ఫీల్‌ అవుతూ తొడ కీలును బాగా ఓపెన్‌ అయ్యేటట్లుగా రిలాక్స్‌ చెయ్యాలి. శ్వాస తీసుకుంటూ ఎడమకాలును మళ్ళీ స్ట్రెచ్‌ చేసి ఎడమ మోకాలు కిందకు తీసుకువచ్చి మళ్ళీ మార్జాలాసనంలో రిలాక్స్‌ అవ్వాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి.
డంబెల్‌ షేప్‌ నుంచి విముక్తి పొందే క్రమంలో వేయాల్సిన ఆసనాల క్రమం...
1) పరివృత్త త్రికోణాసనం 2) వీరభద్రాసనం వేరియంట్‌ 3) ఏకపాద ప్రసారిత మార్జాలాసనం 4) ఎల్బో ప్లాంక్‌ 5) ఏకపాద అధోముఖ శ్వానాసనం 6) కోణాసనం 7) ఏకపాద కపోతాసనం 8)వీరాసనం
9) చక్రాసనం
– సమన్వయం: ఎస్‌. సత్యబాబు
ఎ.ఎల్‌.వి కుమార్‌ ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌


పాదం తొక్కేస్తోందా?-Foot, Depression, Bone, పాదం, డిప్రెషన్‌, ఎముక

పాదం తొక్కేస్తోందా?
ముందడుగు వేసేది పాదమే
ముందంజలో ఉంచేదీ పాదమే
పాదానికి ప్రాబ్లమ్‌ వస్తే వెనకబడిపోతాం
అవును... పడిపోతాం
పాదాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే
ఆరోగ్యాన్నే తొక్కేస్తుంది.
పాదం... పదిలం!
కాలు లేకపోతే కదలిక లేదు. పాదం కదలకపోతే పురోగతి లేదు. అంతెందుకు పాదంలో ఏదైనా సమస్య ఉండి కాళ్లను కదిలించలేక పోతే మన క్యాలరీల ఖర్చు తగ్గుతుంది. దాంతో మొత్తం ఆరోగ్యమే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కాళ్లు కదలాలి. కదలిక ఉండాలి. అంటే వ్యాయామ రూపంలోనన్నమాట. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు... మానసిక ఆరోగ్యానికి కూడా. పిల్లల్లో ఏమాత్రం కదలికలు లేకుండా ఇంటికే పరిమితమయ్యేవారు, ఏవో కారణాలతో కాళ్లు కదలికలు మందగించి మంచానికే అంటిపెట్టుకుని ఉండేవారిలో కొన్ని మానసిక సమస్యలూ కనిపించవచ్చు. తాము బయటికి వెళ్లకపోవడం, నలుగురిలో కలవకపోవడంతో డిప్రెషన్‌ వంటి సమస్యలూ రావచ్చు. అంతేకాదు... పోటీతత్వం మందగించి మందకొడిగానూ మారిపోవచ్చు. పిల్లల్లో ఆ పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటే చదువుల్లో, ఆటల్లో, ఎదిగాక సమాజంలోనూ వారిది క్రియాశీల భూమిక. అంత కీలకమైనది కాలు. చలనశీలమైనది పాదం. ఆ పాదం గురించి కొన్ని విషయాలు ఆపాదం నుంచి మస్తకంలోకి వెళ్లడానికి ఈ కథనం.
పాదాల నిర్మాణం: మానవ పాదంలో 26 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అంటే రెండు పాదాల్లోనూ కలుపుకుంటే 52 కాబట్టి... ఒక వ్యక్తిలో ఉండే మొత్తం ఎముకల్లోని నాలుగో వంతు పాదాల్లోనే ఉంటాయన్నమాట. 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. ఒక వ్యక్తి బరువంతా మోయడానికి వీలుగా పాదం విశాలంగా రూపొందింది.
మొదటి నష్టం షూస్‌ లేదా పాదరక్షలతోనే...
ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ పాదం పూర్తిగా రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. కానీ మారుతున్న జీవనశైలి ప్రకారం చిన్నప్పట్నుంచే ప్రతివారి పాదాలనూ షూలతో బిగించి ఉంచడం సాధారణమైంది. బుడిబుడి అడుగులు వేసే బుడతల పాదాలను సైతం రంగురంగుల సాక్స్‌ లేదా షూలతో బిగిస్తుంటారు. దీనివల్ల వచ్చే చిన్న చిన్న లోపాలే పెద్దయ్యాక నడకలో నష్టం కలిగించే అవకాశం ఉంది.
హైహీల్‌ వల్ల నష్టాలు ఎందుకంటే...
జీవులు తమ నాలుగు కాళ్ల మీద నడవడానికి అనువుగా రూపొందాయి. కానీ మనిషి తన రెండు కాళ్ల మీదే మొత్తం బరువు మోపేలా ముందు వైపు లింబ్స్‌ను చేతులుగా రూపొందించుకుంటూ నిటారుగా నిలబడ్డాడు. దాంతో మనిషి బరువంతా రెండు కాళ్ల మీద వెన్ను మీద పడటం ప్రారంభమైంది. మన వీపు భాగం ఇంగ్లిష్‌ అక్షరమైన ‘ఎస్‌’ అనే ఆకృతితో ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ‘ఎస్‌’ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్‌ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్‌) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్‌ లేదా మిడ్‌ బ్యాక్‌), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్‌’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్‌మెంట్‌లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది.
హైహీల్స్‌ ఇష్టపడేవారికి టిప్స్‌
⇒రోజంతా హైహీల్స్‌ మాత్రమే వేసుకోకండి
⇒మధ్యాహ్నం లేదా సాయంత్రాలే షాపింగ్‌ చేయండి. ఆ సమయంలో మీ పాదాల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.
⇒మీ హైహీల్‌ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా... రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. (ఒక్కోసారి హీల్‌ నిడివిలోనూ మార్పు ఉండవచ్చు. రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఆ తేడా తెలిసేందుకు అవకాశం ఎక్కువ)
⇒ మీ మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్‌ అని గుర్తుంచుకోండి.
⇒ మీరు హైహీల్స్‌ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి ఠి పాయింటెడ్‌ హైహీల్స్‌ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్‌ వేసుకోవద్దు
⇒మీరు హైహీల్స్‌ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థి తి కూడా తలెత్త వచ్చని గుర్తుంచుకోండి
⇒హైహీల్స్‌ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్‌ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్‌ మసాజ్‌లా చేయండి. కాఫ్‌ మజిల్స్‌కు ప్రతిరోజూ తగినంత వ్యాయామాన్ని, స్ట్రెచింగ్‌ను ఇవ్వండి
⇒ మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్‌ వేసుకుంటే... అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలాగే నిలబడండి. ఈ సమయంలో ముందుకు వంగి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజ్‌ను చేయండి
⇒హైహీల్స్‌ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి.
పాదాలలో పగుళ్లు
పాదాల పగుళ్లకు అలర్జీలు మొదలుకొని చాలా కారణాలు ఉండవచ్చు. శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. మనం వాడే సబ్బు, తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్‌ పాళ్లు తక్కువగా ఉండటమూ కారణం కావచ్చు. కాళ్ల పగుళ్లకు బ్యాక్టీరియా/ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణమైతే ఒక్కోసారి అవి పగుళ్ల నుంచి పుండ్లుగా మారొచ్చు. అందుకే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్నిసార్లు డయాబెటిస్‌/థైరాయిడ్‌ /ఒబేసిటీ లాంటివీ కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది సూచనలు పాటించాలి. మంచినీటిని ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పొడిబట్టతో శుభ్రంగా, తడిలేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్‌ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించాలి. రాత్రంతా సాక్స్‌లు ధరించడం మంచిది.
కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో...
పాదాలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన కొన్ని సమస్యలివే...
ఆనెకాయలు: షూ వల్ల ఒకేచోట నిరంతరం ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఈ ఆనెకాయలు వస్తుంటాయి. కొందరు ఆనెకాయలను బ్లేడుతో కోసేస్తుంటారు. మరికొందరు ఆనెకాయలపై కొన్ని చుక్కల యాసి పోస్తూంటారు. కానీ ఆనెకాయలు వస్తే దాని చుట్టూ ప్లాస్టర్‌ వేసి డాక్టర్‌కు చూపించాలి.
బ్యూనియన్‌: కొందరికి షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమసయను ‘బ్యూనియన్‌’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట... పాదం తనను తాను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సమస్య ఉన్నవారు డాక్టర్‌ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం.
అథ్లెట్స్‌ ఫుట్‌ : ఈ సమస్య ఫంగస్‌ కారణంగా వస్తుంది. నిజానికి ఈ ఫంగస్‌ ఎప్పుడూ పాదాలపై ఉండే ఉంటుంది. కానీ పాదం నిత్యం తేమ, తడిలో ఉన్నప్పుడు ఆ ఫంగస్‌ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్‌ ఫుట్‌ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథుల స్రావంతోనూ పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్‌ ఉన్న వాష్‌లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్‌ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పాదం ఆరోగ్యంగా ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి యాంటీ ఫంగల్‌ ట్యాబ్లెట్స్‌ కూడా వేసుకోవాల్సి రావచ్చు.
బొటనవేలి గోరు లోపలికి పెరగడం : కొందరికి బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్‌ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు.
పాదాలకు తిమ్మిర్లు పట్టడం : పాదానికి తిమ్మిర్లు పట్టి, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం చాలా మందిలో కనిపించే సాధారణ లక్షణమే. ఇలాంటి లక్షణం కనిపించినవారిలో షుగర్‌ వ్యాధి లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే షుగర్‌ వ్యాధి ఉండి తిమ్మిర్లతో పాదం మొద్దుబారి స్పర్శ తెలియకపోతే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.
పాదాల వ్యాయామం: పాదాల కోసం చేయాల్సిన వ్యాయామాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న వయసులో అయితే స్కూలు ఆవరణలో ఆడే అనేక రకాల ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్కిప్పింగ్‌ లాంటివి కాళ్ల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకూ తోడ్పడతాయి. ఇక టీనేజ్‌ దాటాక జిమ్‌కు వెళ్లే యువకులు స్క్వాట్స్‌ మొదలుకొని, వారికి అనువుగా ఉండే అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. పిక్కలు మనకు గుండెలాంటివి కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తపడటం వల్ల కాళ్ల ఆరోగ్యం బాగుటుంది. అయితే ఏ వయసు వారిలోనైనా బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం అన్ని విధాలా ఆరోగ్యకరం. అది కాళ్లతో పాటు సమస్త అవయవాలకూ ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది.
పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే...
పాదరక్షల ఎంపికలో మొదట రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోడునే ఇవ్వమని చెప్పాలి. మనం తొడుక్కునే షూస్‌ పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. అలా ఖాళీ ఉందో లేదో నొక్కి చూసుకోవాలి. పాదంలో వెడల్పులగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా షూ ఉండాలి. ఈమధ్య చాలామంది పొట్టిగా ఉండే ‘షార్ట్‌ సాక్స్‌’ తొడుగుతున్నారు. అవి కాలిని బాగా బిగుతుగా మడిచినట్లుగా చేసే టైట్‌ షూ అంత ప్రమాదకరం. సాక్స్‌ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది.
డయాబెటిస్‌ ఉన్నవారు పాదాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
మిగతావారితో పోలిస్తే డయాబెటిస్‌తో బాధపడేవారు పాదాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. అందునా ఐదు నుంచి పదేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు తమ కాళ్లను ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. వారు పాదాల పరిరక్షణ కోసం పాటించాల్సిన సూచనలివి... 
⇒ తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండాలి. పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్ని కూడా నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. అది భవిష్యత్తులో కాలిని తొలగించేంత ప్రమాదకరంగా కూడా మారేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పొక్కు చిన్నగా ఉన్నప్పుడే పూర్తిగా మానిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
⇒నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్‌ రాసుకోవాలి.
⇒కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి.
⇒ వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్‌ ఉన్నవారు హాట్‌ వాటర్‌ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోక పోవడమే మంచిది.
⇒పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి.
⇒కాళ్లమీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా అవసరం.
⇒కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్‌ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరుమూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్‌ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్‌ రోగుల్లో ప్రమాదం.
⇒ఇంట్లోకూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్‌ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.
⇒ఏడాదికోసారి డాక్టర్‌కు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ పాదాల సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు.
చివరగా... పాదాలు మన ప్రతి కదలికనూ నిర్ణయిస్తాయి... నియంత్రిస్తాయి. ప్రగతి పథాన ఉంచుతాయి. అందుకే పాదాల ఆరోగ్య పరిరక్షణే అందరి ప్రథమ ప్రాధాన్యం కావాలి.
డాక్టర్‌ కె.సుధీర్‌రెడ్డి
చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌








చూస్తే..ఫిదా-Fidaa GRANTHANIDHI MOHANPUBLICATIONS BHAKTIPUSTAKALU

చూస్తే..ఫిదా
అనంత సౌందర్యం.. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌
సంచారం జీవితానికి కొత్త బాటలు వేస్తుంది. నవ జీవనగానం వినిపిస్తుంది. పర్యటన ఆనంద మార్గాల్లో ఒకటంటున్నారు పరిశోధకులు. పశ్చిమ హిమాలయాల్లోని బద్రీనాథ్‌ క్షేత్రానికి చేరువలో వున్న అనంత సౌందర్యరాశి వ్యాలీ ఆఫ్‌ ప్లవర్స్‌, సిక్కుల పుణ్యధామం హేమ్‌కుంద్‌ సాహెబాలను ఇటీవల సందర్శించారు తిప్పావఝుల కుమార్‌. ‘అక్కడకు వచ్చిన పర్యాటకులతో ముచ్చటించినప్పుడు సంచారం వారి జీవితాలను ఎంతగా ప్రభావితం చేసిందో తెలిసింది. సంచారంపై మక్కువను మరింత పెంచింది’ అంటూ ఆ సంగతులు పంచుకుంటున్నారిలా...
సమున్నత హిమాలయాలు విశ్వరహస్యాన్ని తనలో దాచుకున్నట్లు గంభీరంగా ఉంటాయి. అందుకే వాటి అందాలను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అక్టోబర్‌ - ఏప్రిల్‌ మాసాల మధ్య హిమాలయాలన్నీ మంచుదుప్పటి కప్పుకుని ఉంటాయి. మిగిలిన మాసాల్లో అరుదైన వృక్ష, పుష్ప సంపదకు హిమాయలాలు నిలయాలు. ముఖ్యంగా జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు శ్రావణమేఘాలు హిమాలయాల అందాలను పదింతలు చేస్తాయి. పచ్చదనాలు పరుచుకున్న ఆ హిమవంతుడ్ని తెల్లని మేఘాలు దేవకన్యల్లా అల్లుకుంటాయి. ఆ మంచుపర్వతాల నుంచి జలపాతాలు గలగలా ప్రవహిస్తూ వుంటాయి. దారిలో వున్న అరుదైన వృక్షాలను, శిలలను ముద్దాడుతూ ప్రవహించే ఆ జలపాతాల అందాలు వర్ణనాతీతం. ఆకాశాన్ని తాకే హిమాలయాలు.. శ్రావణ జల్లుల్లో తడిసిన దేవదారు వృక్షాలు... నవరాగాలను పలికిస్తూ పారే జలపాతాల అందాలకు..... అరుదైన పూలసోయగాలు తోడైతే ఆ దృశ్యాన్ని వర్ణించేందుకు కవులకు సైతం పదాలు దొరకవేమో! ఈ నాలుగు అందాలను రాశిగా పోసిన హిమాలయ సౌందర్యం ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’.
అనంత సౌందర్యసీమ
బ్రహ్మకమలంతో సహా అరుదైన 500 రకాల పుష్పజాతులు ‘వ్యాలీ ఆప్‌ ఫ్లవర్స్‌’లో కనువిందు చేస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఏటా లక్షల మంది ఈ పుష్పసౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వస్తూ ఉంటారు. సంవత్సరంలో నాలుగు మాసాలు మాత్రమే ఈ వ్యాలీకి వెళ్లే అవకాశం వుంది. మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పేసి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవులంతా జీవితంలో ఒకసారయినా దర్శించాలనుకునే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని బద్రీనాథ్‌కు చేరువలో ఉందీ సౌందర్యసీమ. బ్రహ్మకమలం, బ్లూపాపీ, మార్క్‌ మారీగోల్డ్‌, హిమాలయన్‌ మాంక్‌సూద్‌, మెడోస్వీట్‌ వంటి హిమాలయాల్లో మాత్రమే పుష్పించే అరుదైన పూలకు ఈ వ్యాలీ నిలయం. శ్రావణమాసంలో ఎక్కువశాతం పూలు వికసిస్తాయని, అప్పుడు వ్యాలీ సర్వాంగ సుందరంగా ఉంటుందంటారు స్థానికులు. పుష్పావతీ నదిని దాటుకుని, దట్టమైన అడవిని అధిగమిస్తే అదురైన కోటానుకోట్ల పుష్పాలు మనకు స్వాగతం పలుకుతాయి. పది కిలోమీటర్లు నడిచి, అలసిన మనకు మధుర సుగంధ పరిమళాల వింజామరలు వీచి సాంత్వన కలిగిస్తాయి. 87 కిలోమీటర్ల దూరం పరచుకున్న ఆ పూలవనం మధ్యన వున్న చిన్న కాలి బాట నుంచి సెలయేళ్లు దాటుకుంటూ, అనంత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వెళ్లడం ఒక గొప్ప అనుభవం.
ప్రపంచ వారసత్వ కేంద్రం
బ్రిటీష్‌ పర్వతారోహకుడు, వృక్షశాస్త్ర నిపుణుడు ఫ్రాంక్‌ స్మిత్‌ 1939లో ‘వ్యాలీఆఫ్‌ ఫ్లవర్స్‌’ను సందర్శించి అరుదైన పుష్పజాతులపై పుస్తకం రచించాడు. ఆయన తరువాత రాయల్‌ బొటానిక్‌ గార్డెన్స్‌ తరపున వృక్షశాస్త్ర నిపుణురాలు మార్గరెట్‌ లెగ్గీ ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’ సందర్శించి మరిన్ని అరుదైన పుష్పజాతులను వెలుగులోకి తెచ్చారు. ఆ క్రమంలో లోయలో పొరపాటున కాలుజారి పడి కన్నుమూశారు లెగ్గీ. కొన్నాళ్లకు ఆమె సోదరి ఇండియా వచ్చి లెగ్గీ సమాధిని నిర్మించారు. 1982లో ఈ వ్యాలీని భారత ప్రభుత్వం నేషనల్‌ పార్క్‌గా గుర్తించింది. యునెస్కో ఈ సుందర ప్రదేశానికి ప్రపంచ వారసత్వ కేంద్రం హోదాను ఇచ్చింది. సముద్రమట్టానికి 12 వేల అడుగులు ఎత్తులో వుండే ఈ వ్యాలీ నుంచి 9 కిలో మీటర్ల దూరం నడిచి వెళితే టిప్రా గ్లేషియర్‌ వస్తుంది. ప్రణాళికాబద్ధంగా వెళితే ట్రెక్కర్స్‌ టిప్రా వరకు వెళ్లి రావచ్చు. మరో 13 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 25 వేల అడుగుల ఎత్తులో గౌరీప్రభాత్‌ పర్వత శిఖరం వుంది.
హిమదేవాలయం
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి ధీటుగా సిక్కులు పవిత్రంగా భావించే హేమ్‌కుంద్‌ సాహెబా గంగారియాకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో వున్న ఈ ఆధ్మాత్మిక కేంద్రంలో పదో సిక్కు గురువు గురుగోవింద్‌ సింగ్‌ తపస్సు చేశారని విశ్వాసం. చిన్నారుల నుంచి పెద్దల దాకా సిక్కులందరూ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. నిర్మలంగా వుండే హిమకుండంలో స్నానం చేసి, ప్రార్థనలు చేస్తారు. హేమ్‌కుంద్‌కు చేరుకునే మార్గం తిరుమల మోకాళ్ల పర్వతాన్ని తలపిస్తుంది. అయినా ఏటా రెండు లక్షల మంది భక్తులు హేమ్‌కుంద్‌ సందర్శిస్తున్నారు. ఆగస్టులో హేమ్‌కుంద్‌ వెళ్లే వారికి వేలాది బ్రహ్మకమలాలు కనువిందు చేస్తాయి.
పుష్పవనానికి ఇదీ దారి
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుషీకేష్‌ 250 కిలోమీటర్ల దూరంలో వుంది. అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది జోషీమఠ్‌. జోషీమఠ్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్‌ వెళ్లే మార్గంలో గోవింద్‌ ఘాట్‌ వస్తుంది. అక్కడి వరకు మాత్రమే వాహన సౌకర్యం వుంటుంది. గోవింద్‌ఘాట్‌ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగారియాకు నడకమార్గంలో చేరుకోవచ్చు. గుర్రాల మీద వెళ్లే సౌకర్యంతో పాటు హెలికాప్టర్‌ సౌకర్యం కూడా ఉంది. గంగారియా సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’ ఉంది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ పర్యాటక విభాగం గఢ్వాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌(జి.ఎం.వి.ఎన్‌)కు హైదరాబాద్‌లో బ్రాంచ్‌ ఉంది. ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’ పర్యటనకు జిఎంవిఎన్‌ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఆ సంస్థ ఫోన్‌: 040- 2340 0259. 
ఓ మహాద్భుతం
మానససరోవరంతో పాటు హిమాలయాల్లో పలు ప్రాంతాలను చూశాం. ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’ భారతదేశంలో ఉన్న ఓ మహాద్భుతం. యువత ఇలాంటి సుందర ప్రదేశాలు చూస్తే జీవితం పట్ల వారి దృక్పథంలో మార్పు వస్తుంది. ఆలోచనా పటిమ పెంపొందుతుంది. సంచారం జీవితంలో ఆనందానికి కొత్త దారులు చూపుతుంది. పిల్లల్లో పర్యటనాభిలాష పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులదే!
- డాక్టర్‌ పి. శ్యాంసుందర్‌రెడ్డి, డాక్టర్‌ దేవిరెడ్డి, బి. అశోక్‌వర్దన్‌రెడ్డి
ప్రకృతి ఆస్వాదన వరం
సువిశాల ప్రపంచాన్ని చుట్టి రావడాన్ని మించిన గొప్ప అనుభవం మరొకటి లేదు. నేను అమెరికాలో భారీనిర్మాణ కార్మికుడిగా పనిచేస్తాను. ఏడాది పాటు పనిచేసి డబ్బు కూడబెట్టుకుంటాను. మరుసటి ఏడాది ప్రపంచ దేశాలన్నీ చుట్టివస్తాను. ఐదు నెలలుగా భారతదేశంలో కన్యాకుమారి నుంచి హిమాలయాల దాకా పలు ప్రాంతాల్లో పర్యటించాను. ప్రకృతిలోని సోయగాలన్నీ పోగుపోసుకున్నట్టు ఉన్న ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’కు ఇంత తక్కువ మంది సందర్శకులు రావడం ఆశ్చర్యంగా వుంది.
- రిచర్డ్‌ జో, న్యూయార్క్‌ భ్రమణకాంక్ష 
‘‘నేస్తం.. పద పోదాం.! ప్రపంచాన్ని చుట్టొద్దాం.! సంచారం కోసం మరో జన్మ వుందంటావా ఏం? నిండు నూరేళ్లు జీవించినా ఈ తరుణం మరి రాదు... పద పోదాం.! ప్రపంచాన్ని చుట్టొద్దాం!’’
- రాహుల్‌ సాంకృత్యాయన్‌. 
ఇన్నాళ్లు తెలియదు
డిగ్రీ పూర్తి చేసి రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. ఫ్రెండ్‌తో కలిసి ఇక్కడికి వచ్చాను. మా రాష్ట్రంలో ఇంత సుందరప్రదేశం వున్న విషయం నాకు ఇన్నాళ్లూ తెలియదు. ప్రకృతిలోని వర్ణాలను చూశాక నేను, నా ఉద్యోగం ఎంత చిన్నవో అర్థమైంది. హేమ్‌కుంద్‌ సాహెబాకు నడవడం కష్టం అంటున్నారు. అయినా నేను నడిచే వెళతాను. ఈ ప్రదేశం చూశాక ప్రపంచమంతా చూడాలనే అభిలాష పెరిగింది.
- ప్రియాంక, ఉత్తరాఖండ్‌ 
ఛాన్స్‌ దొరికితే సంచారమే
దక్షిణ కొరియాలో పుట్టి కెనడాలో స్థిరపడ్డాను. రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఏ మాత్రం వీలుచిక్కినా ప్రపంచంలో ఏదో ఒక సుందర ప్రదేశాన్ని చూసొస్తాను. వందల రకాల పుష్పజాతులకు నిలయం ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’. అరుదైన ఈ పుష్పజాతులు పదేళ్ల తరువాత కనుమరుగయ్యే ప్రమాదం వుంది. బ్రహ్మకమలంతో సహా అరుదైన ఈ పుష్పజాతుల డిఎన్‌ఏలు సేకరించి భద్రపరచాల్సిందిగా యునెస్కోకు లేఖ రాస్తాను.
- కిమ్‌, సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు, హైదరాబాద్‌
వీకెండ్‌లో విహారం...
ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు జైళ్ల శాఖ ప్రయోగాత్మక నిర్ణయం
వీటికి రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ కలిగించే పవర్‌ ఉందా...
జియో ఫోన్ బుకింగ్ స్టేటస్ తెలుసుకోండిలా...
పిల్లల్లోనూ ఆత్మగౌరవం ఎక్కువే..
వ్యర్థాలు పోతే వన్నె పెరిగినట్టే
ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం
దద్దుర్లు దరిచేరకుండా...
వెరైటీ పోరాటం!
ప్రపంచం నిదురోయింది ఇలా..



ఆరోగ్యానికి నెచ్చెలి
బచ్చలి ఆకులను, కందిపప్పుతో కలిపి కూరగా వండుకుని తింటూ ఉంటే, గర్భిణులు ఎదుర్కొనే మలబద్ధకం తొలగిపోతుంది.
పచ్చి ఆకులను, రోజుకు రెండు పూటలా నమిలి మింగుతూ ఉంటే, నాలుక మీది గుగ్గులు తగ్గిపోతాయి.
బచ్చలి ఆకులను నూరి, కణతలకు పట్టువేస్తే తలలోంచి వచ్చే తీవ్రమైన వేడి తగ్గిపోవడంతో పాటు, సుఖనిద్ర కలుగుతుంది.
బచ్చలి ఆకులతో చేసిన కూరలు తరుచూ వాడుతూ ఉంటే, ఒంటికి చలువ చేస్తుంది. దగ్గు, పైత్యం, అతిదాహం తగ్గిపోతాయి. రక్తహీనత తొలగిపోతుంది. ఆకలి పెరుగుతుంది.
మజ్జిగలో బచ్చలి ఆకులు వేసి ఉడికించి తింటూ ఉంటే, పైల్స్‌ కారణంగా వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పిండితే, వెంటనే మంట తగ్గడంతో పాటు, పుండు కూడా మానుతుంది.
మూత్రవిసర్జనలో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు, 50 మి.లీ బచ్చలి ఆకు కషాయాన్ని రోజుకు రెండు పూటలా సేవిస్తే మూత్రం సాపీగా సాగిపోతుంది.
తీగ బచ్చలి కూరను తరుచూ తింటూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది. కంఠస్వరం మృదువుగా అవుతుంది
20 గ్రాముల బచ్చలి ఆకుల రసాన్ని రోజూ రెండు పూటలా తీసుకుంటే మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.



అప్పు లేనివాడు అధిక సంపన్నుడు-Debt, richest, అప్పు, సంపన్నుడు



మన స్వభావాన్ని మనమెందుకు వదులుకోవాలి?
ఎన్నో మైళ్ల దూరం ప్రయాణం చేసి అలిసిపోయిన ఒక బాటసారి, ఆ పక్కగానే వెళుతున్న ఒక నదిలో స్నానం చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే ఒక సాధువు స్నానం కోసం ఆ నదిలోకి దిగిపోయి ఉన్నాడు. అయితే స్నానం చేయడం మానేసి నది ఒడ్డుకు 10 గజాల దూరం దాకా వెళ్లి దేన్నో పట్టుకోవడానికి ప్రయత్నించి, ఏదో షాక్‌ కొట్టినట్టు చెయ్యి విదిలించుకుని ఇవతలికి వచ్చేస్తున్నాడు. తన చెయ్యి అదిమి పట్టుకుంటూ విలవిల్లాడుతున్నాడు. అయినా ఆగకుండా అదే చోటికి పదే పదే వెళుతున్నాడు. మళ్లీ చేయి విదిలించుకుంటూ పక్కకు జరుగుతున్నాడు. ఆ వచ్చిన బాటసారికి అక్కడ ఏమవుతుందో అర్థంకాక, ఆ సాధువు దగ్గరగా వెళ్లాడు. ‘‘ఏమిటి స్వామీ! మీరేదో చేస్తున్నట్లున్నారు?’’ అన్నాడు ఎంతో వినమ్రంగా, అందుకాయన ‘‘ఈ వరదలో ఇదిగో ఈ తేలుకు కొట్టుకుపోతోంది. 
ఇలా వదిలేస్తే అది తన ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే దీన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాను’’ అన్నాడు ‘‘అది సరే గానీ స్వామీజీ! మీరు ఆ ప్రయత్నం చేస్తున్న ప్రతిసారీ అది మిమ్మల్ని కాటేస్తున్నట్లు అనిపిస్తోంది. నిజమేనా?’’ అన్నాడు.
అందుకాయన ‘‘నిజమే నాయనా!’’ అన్నాడు సౌమ్యంగానే. ఆ వెంటనే ’’తేలు కాటు వేస్తుందని మీకు తెలిసి తెలిసి మీరెందుకు పదే పదే దాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు? దాని మానాన దాన్ని వదిలేసి, మీరు మీ స్నానం ఆచరించండి స్వామీ!’’ అన్నాడు బాటసారి కాస్త అసహనంగానే. ఆ మాటలు విన్న సాధువు అతనికేసి మందహాసంతో చూస్తూ ‘‘నాయనా! కాటు వేయడం దాని స్వభావం. ఆపదలో ఉన్నప్పుడు కాపాడటం అనేది మనిషిగా మన స్వభావం. దాని సహజ స్వభావాన్ని కొనసాగించే విషయంలో దానికంత పట్టుదల ఉన్నప్పుడు, మన స్వభావాన్ని కొనసాగించే విషయంలో మన పట్టుదలను మనమెందుకు వదులుకోవాలి చెప్పు?’’ అన్నాడు. 
అలా అంటూనే మరో సారి ప్రయత్నించి, ఎట్టకేలకు తేలును ఒడ్డు మీదికి విసిరేయగలిగాడు. ఒడ్డున పడి అలా వెళ్లిపోతున్న తేలుకేసి సాధువు ఎంతో ప్రేమగా చూడసాగాడు. ఎంతైనా మహానుభావుల ఆలోచనా విధానమే వేరు కదా! అనుకుంటూ ఆరాధనగా సాధువుకేసి చూస్తూ, చేతులెత్తి నమస్కరించాడు బాటసారి.

పెదవుల మృదుత్వానికి...
కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,. పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు...
♦ కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి.
♦ వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమ కోల్పోయి పొడిబారతాయి.
♦ పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే.
♦ లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్‌ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి.
♦ ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితే కూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదే మొదటిది.
పెదవులకు సాంత్వన చేకూరాలంటే...
ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసాన్ని, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. దానంతట అది ఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండుసార్లు, సాయంత్రం రెండుసార్లు కాని పట్టించవచ్చు.
♦ ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడినీటిలో దూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటిని పట్టించాలి. వీలైతే నీటిలోనే వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు.
♦ లిప్‌స్టిక్‌ కొనేటప్పుడు అందులో వాడిన పదార్థాల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్‌ కంపెనీలు తప్పనిసరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్‌ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్‌ ప్రాపర్టీస్‌ కూడా ఉంటాయి. ఒకసారి నిర్ధారణ చేసుకోవడం మంచిది.

హృద్రోగులకు ప్రత్యేక ఆహారం ఉందా?
మా నాన్నగారి వయసు 68. రెండేళ్ల క్రితం ఆయనకు ఒక స్టెంట్‌ వేశారు. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే హృద్రోగులు తీసుకునే ప్రత్యేకమైన ఆహారం ఏమైనా ఉందా? ఉంటే ఆ ఆహారం ఎలాంటిది? ఎలా తీసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోవాలని ఉంది. - సి. నిరంజన్‌, మంచిర్యాల
గుండె జబ్బును నయం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలు ఉన్న మాట నిజమే. అలాంటి వాటిల్లో కొన్ని.....
ఓట్లు: నీటిలో కలిసిపోగ లిగే ఒక జిగురు పదార్థం, లిపిడ్స్‌ను తగ్గించే గుణం ఉన్న బి- గ్లూకాన్‌ వీటిలో ఉన్నాయి. రోజుకు 25 గ్రాముల ఓట్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
వెల్లుల్లి: చాలా పరిశోధనల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఎల్‌.డి.ఎల్‌ను, ట్రైగ్లిసరైడ్లను తగ్గించే సానుకూల అంశాలు వెల్లుల్లిలో ఉన్నాయని తేలింది. రక్తాన్ని గడ్డకట్టించే త్రాంబోసిస్‌ సమస్యను వెల్లుల్లి అడ్డుకుంటుంది. దీనికి తోడు అధిక రక్తపోటును తగ్గించే శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. రోజుకు రెండు వెల్లుల్లి పాయలను తీసుకుంటే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
మెంతులు: వీటిలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. వీటిల్లోని మొత్తం 50 శాతం పీచుపదార్థంలో 20 శాతం జిగురుతో ఉండే పీచుపదార్థం ఉంటుంది. ఇది పైత్యరసంలోని ఆమ్లాల, తటస్థమైన స్టెరాయిడ్ల విసర్జనను పెంచుతుంది. దీనికి తోడు కాలేయంలో కొలెస్ట్రాల్‌ ఒత్తిడి ని తగ్గిస్తుంది. అందువల్ల రోజుకు 20 గ్రాముల మెంతులు తీసుకుంటే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి.
సోయాపాలు: సోయాలోని మాంస కృత్తులకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి ఉంది. దీనితో పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు. రోజుకు 300 మి. లీటర్ల సోయా పాలు తీసుకుంటే హృద్రోగులకు ఎంతో మేలు కలుగుతుంది.
అప్పు లేనివాడు అధిక సంపన్నుడు
ఇది పెద్దలు అనుభవంతో చెప్పిన మాట. అయితే, ఇప్పుడు అప్పు చేయడం ఒక ఫ్యాషన్‌. ఒక అలవాటు. అప్పు చేయనిదే పొద్దు పోదు కొందరికి. రకరకాల కారణాలు చెప్పి, అవతలి వాళ్లని బురిడీలు కొట్టించి మరీ అప్పు చేసి, జల్సాలు చేయడం ఇంకొందరి నిత్యకృత్యం. కావాలంటే వడ్డీ ఎంతయినా తీసుకోండి కానీ, అప్పు లేదని మాత్రం అనకండి అంటూ ముందే ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. ఒకటి రెండుసార్లు మాట నిలబెట్టుకుని నమ్మకం కలిగిస్తారు, ఆ తర్వాత నట్టేట ముంచుతారు. నిజానికి అప్పు చేయడం తప్పేమీ కాదు. అవసరానికి సరిపడా డబ్బు లేకపోతేనో, సమయానికి సర్దుబాటు కాకపోతేనో చేబదులు తీసుకోవచ్చు.
అయితే, అప్పు చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడమే తప్పు. అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకున్న వాళ్లకు ముఖం చాటేయడం ఇంకా తప్పు. గట్టిగా అడిగితే ‘మీ డబ్బు తీసుకుని మేమేమీ ఊరొదిలి పారిపోములే’ అంటూ ఈసడింపుగా మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. ఇరుగు పొరుగు దగ్గరో, తెలిసిన వాళ్ల దగ్గరో చేబదుళ్లు తీసుకోవడం నామోషీగా మారిపోయి, క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం, కార్డు చేతిలో ఉంది కదా అని దానిని ఎడాపెడా వాడేయటం, ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక తల వేలాడేయడం... ఇదంతా ఊహించే పెద్దలు ‘అప్పు లేనివాడు అధిక సంపన్నుడు’ అన్నారు. అందుకే, అవసరానికి అప్పు చేయడం తప్పు కాదు. అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ‘మా దగ్గర ఆ వస్తువులున్నాయి, ఈ వస్తువులున్నాయి’ అని గప్పాలు కొట్టుకోవడం, విందు వినోదాలతో జల్సా చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే. అందుకే ‘అప్పు చేసి పప్పు కూడు’ తినేకన్నా, ఉన్నదానిని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ హుందాగా జీవించడమే ఆనందం.




వ్యాధులు నయం చేసే పాలజ్‌ కర్ర గణే శుడు- Palaj, Ganesha, పాలజ్‌, గణేశుడు

వ్యాధులు నయం చేసే పాలజ్‌ కర్ర గణే శుడు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠి గ్రామం పాలజ్‌. ఈ చిన్న మారుమూల పల్లె 15 ఏళ్లుగా లక్షలాది మంది నోళ్లల్లో నానుతోంది. ఇక్కడి ప్రత్యేకతే ఈ కుగ్రామానికి ప్రతిఏటా లక్షలాదిమందిని రప్పిస్తోంది. ఎక్కడా లేని విధంగా వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణేశుని ప్రతిష్ఠించి.. పూజించడమే ఈ పాలజ్‌ ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరే కర్రగణేశుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరొందాడు. పాలజ్‌లో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి లేకపోయినా ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సమష్టిగా లక్షలాది భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తుంటారు. గణేశ్‌ ఉత్సవాలన్ని రోజులూ ఈ ఊరి పేరు ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరి నోళ్లలో నానుతుంది.
తెలంగాణ సరిహద్దు మండలమైన కుభీర్‌కు పక్కనే మహారాష్ట్రలోని బోకర్‌ తాలూకాలో పాలజ్‌ గ్రామం ఉంటుంది. ఇక్కడ 1948లో నిర్మల్‌కు చెందిన నకాషీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మ కర్రతో మలిచిన వినాయకుడికి ప్రతిష్ఠాపన చేసి ప్రతియేటా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి వినాయకచవితి సందర్భంగా కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి, చివరిరోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్‌ కర్రగణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడి ఆలయంలో గణేశుడి ఫొటో మాత్రమే ఉంటుంది.
ఊరంతా మంచం పట్టిందని...
స్వాతంత్య్రానికి పూర్వం పాలజ్‌ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి ఊరంతా మంచం పట్టింది. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఊరి ప్రజలంతా గణేశుని నమ్ముకుందాం.. అని నిశ్చయించుకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కర్రగణపతిని చేయించి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మల్‌లో కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీవర్మను రప్పించి సుందరమైన కర్ర గణేశుడి విగ్రహాన్ని చేయించారు.
ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరంతా మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా అప్పటి నుంచి కర్ర గణేశుడిని మాత్రమే వినాయక ఉత్సవాల్లో కొలువడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఇక్కడ పూజలు చేసి, ముడుపు కడితే కోరుకున్న పని జరిగి తీరుతుందన్న నమ్మకం ఉంది. ముందుగా ఈ ఊరికి చెందిన ఆడపడుచుల ద్వారా కర్రగణేశుడి మహిమ ఇతర గ్రామాలకు తెలిసింది. అలా ఊరూరా పాలజ్‌ ప్రత్యేకత విస్తరిస్తూ ఇప్పుడు ఏకంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర అంతా వ్యాపించింది.
సుందర రూపుడిగా
కర్రతో చేసిందైనా.. నకాషీ కళాకారుడైన గుండాజీవర్మ చేతుల్లో సుందరంగా రూపుదిద్దుకున్నాడు ఇక్కడి లంబోదరుడు. అసలు.. కర్రతో ఇంత అందంగా విగ్రహాన్ని మలచవచ్చా.. అనేంత నునుపుగా గణపయ్యను తీర్చిదిద్దాడు. సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. నాలుగుచేతుల వాడిగా.. ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరోచేతిలో త్రిశూలం, ఇంకోచేతిలో లడ్డులతోపాటు కుడిచేత్తో ఆశీర్వదిస్తుంటాడు.
కలిసికట్టుగా
లక్షల్లో తరలివచ్చే భక్తులతో పాలజ్‌ ఆలయానికి ఆదాయమూ లక్షల్లోనే వస్తోంది. ఈ గ్రామస్తులు కలిసికట్టుగా కర్రగణేశుడి సేవలో పాల్గొంటారు. గత ఏడాది 11 రోజుల ఉత్సవాల్లో ఆలయానికి రూ. 80 లక్షల ఆదాయం వచ్చింది. రూ. 11 లక్షల ఖర్చులు పోను రూ. 69 లక్షల కానుకలు మిగిలాయి. పదేళ్ల కింద సాదాసీదాగా ఉండే పాలజ్‌ ఆలయం ఇప్పుడు సరికొత్త హంగులతో ఇరుగుపొరుగు జిల్లాలవారినీ ఆకట్టుకుంటోంది.
2004 ప్రాంతంలో ఆలయ కమిటీ వద్ద మొత్తానికి, గ్రామస్తులు చందాలు పోగు చేసి సేకరించిన మరో రూ. 2 లక్షలు కలిపి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందంగా నిర్మించిన ఆలయం పూర్తయిన తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గ్రామస్తులే కోటి రూపాయలతో అన్నదాన సత్రాలు, స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాలకూ ఇక్కడి నుంచి శుద్ధ నీరు అందిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే సీసీ రోడ్లు వేశారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చారు.
పాలజ్‌ వెళ్లడం ఇలా...
హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసరల మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్‌ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్‌ ఉంటుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. వాహనాల కోసం ఆలయ ప్రాంగణంలో పార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు. – పుప్పాల హన్మాండ్లు సాక్షి, భైంసా, నిర్మల్‌ జిల్లా
అన్ని ఏర్పాట్లు చేశాం..
పాలజ్‌లో భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశాం. బారికేడ్లు, తాగునీరు, తీర్థప్రసాదాలు అందిస్తున్నాం. వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. భక్తులకు అల్పాహారాన్నీ అందిస్తాం. – గంధం గణేశ్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు

హరిహరుల దివ్య క్షేత్రం మొగిలి-Mogali, Chittoor district, మొగిలి, చిత్తూరు జిల్లా GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


హరిహరుల దివ్య క్షేత్రం మొగిలి
చిత్తూరు జిల్లాలోని మొగిలి ఆధ్యాత్మిక కేంద్రం. మొగిలీశ్వరుడు అక్కడ కొలువైనాడు. తడిబట్టలతో స్నానం చేసి సాష్టాంగ పడితే చాలు కోరిన కోరిక నెరవేరుతుందని అక్కడి ప్రజలకు నమ్మకం. అందుకే కాబోలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా.. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మొగిలీశ్వరుడి పేరున్న వ్యక్తులు అనేకమంది కనిపిస్తుంటారు.
చుట్టూ కొండల మధ్య కనువిందైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభువుగా ముక్కంటి అక్కడ వెలిశాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. హరితో కొలువైనందున దీన్ని హరిహర క్షేత్రమని కూడా అంటారు. ఆ గోపాలుడు రుక్మిణీ, సత్యభామ సమేతంగా కొలువై ఉండటం మొగిలి ప్రత్యేకత. దేశంలో ఏ హర క్షేత్రంలో లేని విధంగా భక్తులకు శఠగోపంతో పూజారులు ఆశీర్వాదాలు అందజేస్తారు. సర్పదోష నివారణ కోసం చేసే రాహుకేతు పూజ ఈ ఆలయంలో చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు.
స్థల పురాణం
మొగలిపొదల సమీపంలో గల మొగిలివారిపల్లి గ్రామంలో పేద బోయ దంపతులు నివసించేవారు. బోయ భార్య నిండు చూలు తో ఉన్నపుడు ఒకరోజు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు వచ్చి అక్కడే బిడ్డను ప్రసవించింది. మొగలిపొదల వద్ద పుట్టాడు కనుక మొగిలప్ప అని ఆ బిడ్డను అందరూ పిలవసాగారు. మొగిలప్ప యుక్తవయస్సుకు వచ్చాక ఒక పెద్ద రైతు ఇంట్లో పశువులను మేపే పనికి కుదిరాడు. ఒకరోజు మొగిలప్ప అడవిలోకి పశువులను తోలుకెళ్లి సమీపంలోని మొగలిపొదల వద్ద వాటిని వదిలి, వంటచెరకు కోసం పొదలను నరకసాగాడు. కొద్దిసేపటికి కంగుమని శబ్దం వచ్చి రక్తం కారసాగింది.
ఆ పొదలను తొలగించి చూడగా అక్కడ రక్తం ధారగా స్రవిస్తున్న శివలింగం కనిపించింది. వెంటనే మొగిలప్ప ఆ లింగానికి కట్టుకట్టాడు. నాటినుంచి ఆ శివలింగాన్ని పూజిస్తూ పూలు, పళ్లు సమర్పించేవాడు. మొగిలప్పకు శివుడిపై భక్తి పెరిగి ఇంటి ధ్యాస తగ్గిపోగా, కలవరపడ్డ అతని తల్లి వెంటనే మొగిలప్పకు వివాహం చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మొగిలప్ప మేపుతున్న మందలో ఒకగోవు పాలివ్వకపోతుండడంతో రైతు మొగిలప్పను మందలించాడు. మరునాడు మొగిలప్ప ఆ గోవుపై ఒక కన్నేసి ఉంచాడు. ఆ గోవు మేతమేస్తూ దేవరకొండ వైపు వెళ్లి అక్కడ ఉన్న బిలంలో ప్రవేశిస్తుండగా దాని తోకను పట్టుకొన్నాడు. అతనూ గోవుతోపాటు చాలా దూరం ప్రయాణించాడు.
ఇద్దరూ ఒక విశాల ప్రదేశానికి చేరుకోగా అక్కడ జగన్మాత పార్వతీదేవి ఒక బంగారు పాత్రను చేబూని, ఆ గోవును సమీపించి పాలు పితికింది. ఇంతలో మొగిలప్పను గమనించి అనుమతి లేకుండానే ఆ ప్రదేశానికి వచ్చినందుకు శపించబోయింది. మొగిలప్ప ఆమె పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. జగన్మాత శాంతించి మొగిలప్పకు ఆకలిదప్పులు లేకుండా ఉండేటట్లు వరమిచ్చి, జ్ఞానోపదేశం చేసింది. ఈ విషయం ఎవరికి చెప్పినా వెంటనే మరణిస్తావని హెచ్చరించింది. అనంతరం మొగిలప్ప ఇంటికి చేరుకున్నాడు.
నాటినుంచి సర్వం త్యజించి శివధ్యానంలో మునిగిపోయేవాడు. నిద్రాహారాలు మానేసి శివధ్యానంలో గడిపేవాడు. అతని భార్య ఎంత అడిగినా ఏమీ చెప్పేవాడు కాదు. చచ్చిపోతానని భార్య బెదిరించడంతో చేసేదేమీ లేక ఊరి పొలిమేరల్లో చితి పేర్చుకొని, ఊరందరినీ పిలిచి విషయం చెప్పాడు. మరుక్షణం మరణించాడు. మొగిలప్ప భార్య పశ్చాత్తాపంతో సహగమనం చేసింది. మొగిలప్ప చితి ఉన్న ప్రదేశాన్ని మొగిలప్ప గుండంగా పిలుస్తుంటారు. మొగిలప్ప పేరుమీదుగానే శివలింగాన్ని మొగిలీశ్వరుడు అని పిలవసాగారు. చోళుల కాలంలో దేవాలయాన్ని నిర్మించారు.
మహిమ గల దైవం
సంతానం లేనివారు ఆలయంలో నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. బిడ్డలు లేని ఎందరో మహిళలు స్వామివారి కృపాకటాక్షాలతో సంతానం పొందారు. ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం కనీసం వంద వరకు వివాహాలు జరుగుతుంటాయి. ప్రతి అమావాస్యకూ భక్తులు ఆలయానికి పోటెత్తుతారు.
నిత్య పూజలు
అర్చన, రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, రుద్ర హోమం, చండీ హోమం సహస్రనామార్చన, శనిదోష నివారణ పూజలు
వారపు పూజలు
ప్రతి సోమవారం రాహుకేతు పూజ (రాహుకాలంలో సర్ప దోష నివారణకోసం) ఉ‘‘ 7.30 నుంచి 8 వరకు జరుపుతారు.
మాస పూజలు
శ్రావణమాసంలో రెండో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉచితంగా ఆలయ యాజమాన్యం నిర్వ హిస్తుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉచితంగా నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలు..
ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మొగిలీశ్వరస్వామి దేవస్థానంలో 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉభయదారుల చేతులు మీదుగా ఒక్కోరోజు ఒక్కో ఉత్సవం జరిపి స్వామివారిని మేళతాలాలతో ఊరేగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఇసకేస్తే రాలనంత జనం హాజరవుతారు.
ఇలా చేరుకోవచ్చు..
బెంగళూరు చెన్నై హైవేలో చిత్తూరుకు 30 కిలోమీటర్ల దూరంలో మొగిలీశ్వరుడు కొలువైనాడు. బెంగళూరుకు 148 కిలో మీటర్లు, చెన్నైకి 186 కిలోమీటర్లు, కాణిపాకంకు 39 కిలోమీటర్లు ఉంది. చెన్నై నుంచి వచ్చే భక్తులు బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో మొగిలికి చేరుకోవచ్చు. చిత్తూరు, పలమనేరు నుంచి బస్సు సౌకర్యం ఉంది.
– గాండ్లపర్తి భరత్‌రెడ్డి సాక్షి, చిత్తూరు


వృద్ధాపి జీర్ణం!-Digestive Digestion!

వృద్ధాపి జీర్ణం!
ఉదయాన్నే ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు పరుగెత్తాల్సిన పనిలేదు. డెడ్‌లైన్‌ దాటిపోతుందేమోనన్న బెంగ లేదు. కావాల్సినంత సమయం చేతిలో ఉంటుంది. మనవలు, మనవళ్లతో బోలెడంత కాలక్షేపం. వృద్ధాప్యానికి ఇదొక పార్శ్వం మాత్రమే. మరోవైపు- చర్మం ముడతలు పడుతుంటుంది. నడుం ఒంగిపోతుంటుంది. నిస్సత్తువ ఆవరించేస్తుంటుంది. ఇలా వృద్ధాప్యం మోసుకొచ్చే శారీరక మార్పులు ఎన్నెన్నో. లోలోపల్నుంచి తలెత్తే జబ్బులూ మరెన్నో. ముఖ్యంగా- జీర్ణ సమస్యల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆకలి తగ్గిపోయి, రుచి మారిపోయి.. సరిగా తినలేక, తిన్నది అరగక.. కడుపుబ్బరం, ఛాతీలో మంట, మలబద్ధకం వంటి వాటితో సతమతమయ్యే వృద్ధులు ఎందరో. చూడటానికివి మామూలుగానే, అంత ఇబ్బందికరమైనవి కావనీ అనిపించొచ్చు. అందుకేనేమో కొందరు వీటిని వయసుతో పాటు వచ్చే ఇబ్బందులుగా భావిస్తూ నిర్లక్ష్యం చేసేస్తుంటారు. వాటితో సర్దుకుపోతుంటారు. కానీ తాత్సారం చేస్తే ఇవే క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యలకూ దారితీయొచ్చు. 
మనం ఏ పని చేయాలన్నా శక్తి కావాలి. ప్రతి కణానికీ సత్తువ కావాలి. ఇది మనకు ఆహారం నుంచే లభిస్తుంది. తిన్న ఆహారం జీర్ణమై, దానిలోని పోషకాలను శరీరం గ్రహించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇందుకు నోటి నుంచి మలద్వారం వరకూ జీర్ణ వ్యవస్థ మొత్తం సరిగా పనిచేయటం చాలా ముఖ్యం. లేకపోతే శరీరమంతా నిస్సత్తువతో జావగారిపోతుంది. మనం నోటి ద్వారా తీసుకున్న ఆహారం.. గొంతును దాటుకొని, అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ్నుంచి చిన్న పేగుల గుండా ప్రయాణించి.. చివరికి పెద్దపేగుకు చేరుకుంటుంది. అప్పటికే జీర్ణవ్యవస్థ దానిలోని పోషకాలన్నింటినీ దాదాపుగా గ్రహించేస్తుంది. మిగిలిన వ్యర్థ పదార్థం మలంగా తయారై.. ముందుకు కదులుతూ గట్టిపడి పెద్దపేగు చివరి భాగానికి చేరుకొని.. అక్కడ్నుంచి మలద్వారం గుండా బయటకు వచ్చేస్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఎక్కడ సమస్య తలెత్తినా మొత్తం జీర్ణ ప్రక్రియే ప్రభావితమవుతుంది. రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువ. దీనికి ఆమ్లం ఉత్పత్తి తగ్గటం, పేగుల కదలికలు మందగించటం వంటి పలు అంశాలు దోహదం చేస్తాయి.
మలబద్ధకం 
వృద్ధుల్లో సర్వ సాధారణంగా కనిపించే సమస్య మలబద్ధకం. సుమారు 70-80% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. మలం గట్టిగా వస్తుండటం, ముక్కాల్సి రావటం, విసర్జన పూర్తిగా కానట్టు అనిపించటం, ఉదయాన్నే విసర్జనకు వెళ్లాలని అనిపించకపోవటం.. ఇలా ఎలాంటి తేడా అనిపించినా చాలామంది మలబద్ధకంగా భావిస్తుంటారు. నిజానికి వైద్యపరంగా వారానికి 3 కన్నా తక్కువసార్లు మల విసర్జన జరుగుతుంటేనే మలబద్ధకంగా పరిగణిస్తారు. మలబద్ధకానికి ప్రధాన కారణం పెద్దపేగు కదలికలు తగ్గిపోవటం. మనం తిన్న ఆహారం జీర్ణమై, దానిలోని సారాన్ని పేగులు పీల్చుకున్న తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థం మలం రూపంలో బయటకు వస్తుంది. ముందుగా ఇది చిన్న పేగుల నుంచి పెద్ద పేగు కుడి భాగంలోకి ప్రవేశించి.. పేగు కండరాలు సంకోచిస్తున్నకొద్దీ ముందుకు కదులుతూ ఎడమ వైపునకు వస్తుంది. క్రమంగా పేగు చివర్లోని మలాశయం లేదా పురీషనాళం (రెక్టమ్‌) వద్దకు చేరుకుంటుంది. ఇలా మలం వచ్చి చేరుతున్నకొద్దీ అక్కడ ఒత్తిడి పెరిగి, మల విసర్జనకు వెళ్లాలనే భావన కలుగుతుంది. అయితే వృద్ధుల్లో పేగు కదలికలు తగ్గటం వల్ల మల పదార్థం త్వరగా ముందుకు సాగదు. దీంతో మల పదార్థంలోని నీటిని పేగు మరింతగా పీల్చేసుకుంటుంది. మలం గట్టిపడుతూ వస్తుంది. మరోవైపు- వృద్ధుల్లో మల పదార్థం చాలాసేపు కుడివైపుననే ఉండిపోవటం వల్ల అక్కడి పేగు పెద్దగా అవుతుంది కూడా. విసర్జన సరిగా కాకపోవటం వల్ల మనసును ఎప్పుడూ ఏదో ఒకరకమైన భావన తొలిచేస్తుంటుంది. చిరాకూ మొదలవుతుంది. సాధారణంగా పీచు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవటం ద్వారా మలబద్ధకం తగ్గుతుంది. కానీ వృద్ధులకు ఇది అంతగా ఉపయోగపడదు. పీచుతో మల పదార్థం ఎక్కువైనప్పటికీ.. అది కదలకుండా ఉండిపోవటం వల్ల మరిన్ని సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి వీరికి పీచుతో పాటు కదలికలను మెరుగు పరచే ప్రుకాలోప్రైడ్‌, ల్యుబిప్రోస్టోన్‌ వంటి (ప్రొకైనటిక్‌) మందులూ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగటం, రోజూ ఒకే వేళకు విసర్జనకు వెళ్లటమూ అలవాటు చేసుకోవాలి.
మారింది వృద్ధ నిర్వచనం! 
రోజురోజుకీ వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వృద్ధాప్య నిర్వచనమూ మారిపోయింది. ఒకప్పుడు 65 ఏళ్లు దాటితే వృద్ధాప్యంగా భావించేవారు. కానీ ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా సిఫారసుల ప్రకారం 80ల్లోకి అడుగుపెడితేనే వృద్ధాప్యం వచ్చినట్టు! అక్కడ్నుంచి 99 ఏళ్ల వరకూ వృద్ధాప్య దశే. 18-65 ఏళ్ల వారిని యువతరంగా, 66-70 ఏళ్ల వారిని మధ్యవయసువారిగా పరిగణించింది. అయితే మనదేశంలో ఇంకా 65 ఏళ్లు దాటినప్పట్నుంచే వృద్ధాప్యంగా భావిస్తున్నారు. త్వరలో మనదేశంలోనూ ఇది మారిపోవచ్చు.
ముద్ద దిగకపోవటం
మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయానికి చేర్చేది అన్నవాహిక. ఓ పొడవైన గొట్టంలా ఉండే దీనిలోని కండరాలుంటాయి క్రమపద్ధతిలో సంకోచిస్తూ.. మనం మింగిన ముద్దను జీర్ణాశయంలోకి చేరుస్తాయి. అయితే వృద్ధుల్లో ఈ కండరాల సంకోచం మందగిస్తుంది. దీన్నే ‘ప్రెస్‌బయోఈసోఫేగస్‌’ అంటారు. దీంతో ముద్ద సరిగా కిందికి దిగదు. లోపల తట్టుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ముద్ద ఎక్కువసేపు నిలిచిపోతుండటం వల్ల అన్నవాహిక వ్యాకోచించి, పెద్దగా అవుతుంది కూడా. అంతేకాదు.. రాత్రిపూట పడుకున్నప్పుడు ఆహార పదార్థాలు గొంతులోకి ఎగదన్నుకొనీ వస్తుంటాయి. ఇవి వూపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి, ఇన్‌ఫెక్షన్‌కూ దారితీయొచ్చు. కాబట్టి వృద్ధులు భోజనం చేసేటప్పుడు నీరు బాగా తాగటం మంచిది. భోజనం చేశాక కనీసం 2 గంటల తర్వాతే పడుకోవాలి. కొన్నిసార్లు వేసుకునే మాత్రలు కూడా సరిగా కిందికి దిగవు. దీంతో అన్నవాహిక దెబ్బతిని (పిల్‌ ఈసోఫేజైటిస్‌) అల్సర్లకూ దారితీయొచ్చు. అందువల్ల మాత్రలు వేసుకున్న ప్రతిసారీ ఒక గ్లాసు నీళ్లు తాగటం మంచిది.
ఛాతీలో మంట
అన్నవాహిక అడుగున ఒక బిగుతైన కండర వలయం (స్ఫింక్టర్‌) ఉంటుంది. తిన్న ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశించే సమయంలో దీని బిగువు సడలుతుంది. ముద్ద లోపలికి వెళ్లగానే ఇది తిరిగి బిగుసుకుపోతుంది. ఇలా ఇది జీర్ణాశయంలోని ఆమ్లం, ఆహారం వంటివి పైకి ఎగదన్నుకొని రాకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది. వృద్ధుల్లో ఈ కండర వలయం బలహీనపడి, బిగువు సడలుతుంది. దీంతో జీర్ణాశయంలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని వచ్చి ఛాతీలో మంట (జీఈఆర్‌డీ), నొప్పి వంటివి బయలుదేరతాయి. రాత్రిపూట పడుకున్నప్పుడు పైకి ఎగదన్నుకొని వచ్చిన ఆమ్లం వూపిరితిత్తులోకీ వెళ్లొచ్చు. ఇది ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. కొందరు గుండెజబ్బులకు ఆస్ప్రిన్‌ వంటి మందులూ వేసుకుంటుంటారు. ఇవి గుండె కండరాలతో పాటు కండర వలయాన్నీ వదులుగా చేస్తాయి. దీంతో ఆమ్లం మరింతగా పైకి ఎగదన్నుకొని రావొచ్చు. అందువల్ల వృద్ధుల్లో ఛాతీలో మంట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరిలో గుండె సమస్యలతో పాటు జీర్ణాశయ సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవటం ముఖ్యం.
అజీర్ణ వేదన
తిన్న ఆహారం సరిగా జీర్ణమైతేనే దానిలోని పోషకాలు బాగా ఒంట పడతాయి. ఇందుకు జీర్ణాశయంలోని ఆమ్లం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే వృద్ధుల్లో జీర్ణాశయంలో జిగురుపొరలు క్షీణించటం (అట్రోఫిక్‌ గ్యాస్ట్రయిటిస్‌) వంటి వాటి మూలంగా ఆమ్లం ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీంతో తిన్నది సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపుబ్బరం, త్రేన్పుల వంటివి వేధిస్తుంటాయి. వీరికి పాంక్రియాటిక్‌ ఎంజైమ్‌ల భర్తీ చికిత్స ఇస్తే జీర్ణక్రియ చాలావరకు మెరుగుపడుతుంది. ఆమ్లం తగ్గటం వల్ల తలెత్తే మరో ముప్పు విటమిన్‌ బి12 లోపం. ఆమ్లంలోని ఇంట్రిన్సిక్‌ ఫ్యాక్టర్‌ విటమిన్‌ బి12తో జత కలిస్తేనే శరీరం దాన్ని గ్రహించగలుతుంది. ఆమ్లం ఉత్పత్తి తగ్గితే ఇంట్రిన్సిక్‌ ఫ్యాక్టర్‌ కూడా తగ్గిపోయి విటమిన్‌ బి12 లోపం తలెత్తుతుంది. వృద్ధుల్లో ఇది మరింత ఎక్కువగా కనబడుతుంది. దీంతో చేతులు, కాళ్లు మొద్దుబారటం.. తిమ్మిర్లు, కండరాలు బలహీనం కావటం, రాత్రిపూట చూపు తగ్గటం వంటివన్నీ బయలుదేరతాయి. పాదాలకు స్పర్శ తగ్గటం, సమన్వయం కొరవడటంతో కింద పడిపోయే ప్రమాదమూ ఉంది. వీరికి విటమిన్‌ బి12 ఇంజెక్షన్లు క్రమం తప్పకుండా ఇస్తే చాలావరకు పరిస్థితి కుదుటపడుతుంది.
గ్యాస్‌-ఉబ్బరం
ఆహారాన్ని జీర్ణం చేస్తూ.. వాటిలోని పోషకాలను గ్రహించటంలో చిన్న పేగులదే కీలకపాత్ర. వృద్ధుల్లో చిన్న పేగుల కదలికలూ మందగిస్తాయి. దీంతో ఆహారం సరిగా ముందుకు కదలదు. దీంతో తలెత్తే మరో ముప్పు చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందటం. ఫలితంగా గ్యాస్‌ ఎక్కువై పొట్ట ఉబ్బరం.. త్రేన్పులు, అపాన వాయువుల వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. తరచుగా విరేచనాలు కూడా కావొచ్చు. తిన్నది సరిగా జీర్ణం కాకపోవటం వల్ల పోషణలోపమూ తలెత్తొచ్చు. ముఖ్యంగా విటమిన్‌ డి, క్యాల్షియం మోతాదులు తగ్గిపోవటం వల్ల ఎముకలు బలహీనపడతాయి. చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగే ముప్పూ పెరుగుతుంది. కాబట్టి కడుపు ఉబ్బరం, అపాన వాయువుల వంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి ‘హైడ్రోజెన్‌ శ్వాస’ పరీక్ష చేసి బ్యాక్టీరియా తీరుతెన్నులను పరిశీలించాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువుంటే ఇందులో బయటపడుతుంది. వీరికి యాంటీబయోటిక్స్‌, పేగు కదలిలకను మెరుగుపరచే మందులతో ఫలితం కనబడుతుంది. అలాగే ప్రొబయోటిక్స్‌ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటితో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బ్యాక్టీరియా తగ్గుతుంది. అలాగే పెరుగు, మజ్జిగ వంటివీ మేలు చేస్తాయి.
పేగులో తిత్తులు
మలపదార్థం సరిగా కదలనప్పుడు దాన్ని ముందుకు తోయటానికి పెద్దపేగు మరింతగా కష్టపడాల్సి వస్తుంటుంది. దీంతో లోపల ఒత్తిడి పెరిగి.. పేగు గోడ బలహీనపడి.. చిన్న సంచుల్లా తిత్తులు ఏర్పడుతుంటాయి. 60 ఏళ్లు పైబడిన దాదాపు సగం మందిలో ఇలాంటి తిత్తులు కనబడటం చూస్తుంటాం. ఒకప్పుడు ఇది విదేశాల్లో ఎక్కువగా కనబడేది. మన ఆహార అలవాట్లు మారిపోతుండటం, పూర్తిగా శుద్ధిచేసిన రిఫైన్డ్‌ పదార్థాలను తీసుకోవటం పెరుగుతున్నకొద్దీ మనదేశంలోనూ తరచుగా కనబడుతోంది. నిజానికి లోపల తిత్తులు ఉన్నప్పటికీ ఇవేమీ ఇబ్బంది కలిగించవు. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కొన్నిసార్లు గ్యాస్‌, కడుపుబ్బరం, కడుపునొప్పి వంటివి పొడసూపొచ్చు. అయితే కొందరిలో ఈ తిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ మొదలై ఇవి వాచిపోవచ్చు. దీన్నే డైవర్టిక్యులైటిస్‌ అంటారు. దీంతో తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, చలి, వికారం, వాంతి వంటివి మొదలవుతాయి. దీనికి యాంటీబయోటిక్స్‌, నొప్పి నివారణ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సర్జరీ చేసి తిత్తులు తలెత్తిన భాగాన్ని తొలగించాల్సి వస్తుంది కూడా.
రుచి-ఆకలి తగ్గటం
నాలుకపై, గొంతులో రుచి మొగ్గలుంటాయి. ఒక్కో రుచి మొగ్గలోనూ చాలా రుచి కణాలుంటాయి. మనం ఆహారాన్ని నమిలినప్పుడు ఈ కణాలు ప్రేరేపితమై.. వీటికి అనుసంధానంగా ఉన్న నాడుల ద్వారా ఆ సమాచారం మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు ఆయా ప దార్థాల రుచి తెలుస్తుంది. అయితే వృద్ధుల్లో ఈ రుచి మొగ్గల సంఖ్య తగ్గుతుంది. దీంతో నోటికి చాలా పదార్థాలు చప్పిడిగాఅనిపిస్తుంటాయి. అలాగే వాసనలు పసిగట్టే ఘ్రాణ శక్తి కూడా మందగిస్తుంది. ఫలితంగా ఆకలి వేయటమూ తగ్గుతుంది. పోషణలోపం ముఖ్యంగా జింక్‌ లోపించటం కూడా రుచి తగ్గటానికి దారితీయొచ్చు. అందువల్ల కొందరికి జింక్‌ ఇస్తే రుచి మెరుగవుతుంది. జీర్ణకోశంలో వాపు, కొన్నిరకాల మందులు, మద్యం, పొగ అలవాటు, ఒత్తిడి, కుంగుబాటు వంటివీ ఇందుకు దోహదం చేయొచ్చు. వృద్ధుల్లో ఆకలి తగ్గితే క్యాన్సర్‌ ఉందేమోననీ అనుమానించాలి. ఎందుకంటే క్యాన్సర్ల మూలంగా ఆకలిని ప్రేరేపించే ఘ్రెలిన్‌, కడుపునిండిందనే భావన కలిగించే లెప్టిన్‌ హార్మోన్ల మధ్య సమతుల్యం దెబ్బతిని ఆకలి మందగిస్తుంటుంది. కాబట్టి ఆకలి తగ్గటాన్ని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. క్షుణ్నంగా పరిశీలించి, తగు కారణాన్ని గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది.
క్యాన్సర్లు పెద్ద సమస్య
ఈ జీర్ణ ప్రక్రియ అస్తవ్యస్తం కావటం వల్ల వృద్ధులకు క్యాన్సర్ల ముప్పూ ఎక్కువే. వీరిలో అల్సర్ల కన్నా క్యాన్సర్లే అధికంగా కనబడుతుంటాయి. అన్నవాహిక, జీర్ణాశయం, పెద్దపేగు.. ఇలా ఎక్కడైనా క్యాన్సర్లు రావొచ్చు. దీర్ఘకాలంగా గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకొని వస్తుంటే అన్నవాహిక లోపలుండే సున్నితమైన పొర దెబ్బతింటుంది. క్రమంగా ఇది జీర్ణాశయంలో ఉండే పైపొర మాదిరిగానూ మారిపోతుంది (బ్యారెట్స్‌ ఈసోఫేగస్‌). దీంతో క్యాన్సర్‌ ముప్పూ పెరుగుతుంది. జీర్ణాశయంలోని జిగురుపొరలు క్షీణించటం (అట్రోఫిక్‌ గ్యాస్ట్రయిటిస్‌) వల్ల జీర్ణాశయ క్యాన్సర్లు తలెత్తొచ్చు. జీర్ణాశయంలో క్యాన్సర్‌ ఉంటే కడుపునొప్పి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ కడుపునొప్పి అనేది తీవ్రదశలోనే కనబడుతుంది. అప్పటికే క్యాన్సర్‌ బాగా ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల ఒక వయసు వచ్చాక ఎండోస్కోపీ చేసి జీర్ణాశయాన్ని క్షుణ్నంగా పరిశీలించటం మంచిది. దీంతో క్యాన్సర్‌ను తొలిదశలోనే పట్టుకోవచ్చు. క్యాన్సర్‌ అక్కడికే పరిమితమైతే ఈఎస్‌డీ (ఎండోస్కోపిక్‌ సబ్‌మ్యూకోజల్‌ డిసెక్షన్‌) ద్వారా తేలికగా తొలగించొచ్చు. 
* వృద్ధుల్లో చాలామందిలో పెద్దపేగు గోడలకు పిలకలు (పాలిప్స్‌) ఏర్పడుతుంటాయి. కొందరిలో ఇవి క్యాన్సర్‌గానూ మారొచ్చు. కాబట్టి వీటిని ముందుగానే గుర్తించి తొలగిస్తే క్యాన్సర్‌ తలెత్తకుండా కాపాడుకోవచ్చు. అందుకే విదేశాల్లో వృద్ధులకు తరచూ కొలనోస్కోపీ పరీక్షను తప్పనిసరి చేశారు. ఇందులో పిలకలు ఉన్నట్టు తేలితే వెంటనే వాటిని కూడా తొలగిస్తారు. ఈ పద్ధతి ద్వారా పెద్దపేగు క్యాన్సర్‌ను చాలావరకు నివారించగలిగారు. మనదేశంలో పెద్దఎత్తున ఇలాంటి పరీక్షలు చేయటం సాధ్యం కాకపోవచ్చు గానీ వీలున్నవారు కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకసారి పరీక్ష చేయించుకున్నాక.. బుడిపెలు లేకపోతే ప్రతి మూడేళ్లకు ఒకసారి, బుడిపెలుంటే ప్రతి సంవత్సరం దీన్ని చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా రొమ్ము, గర్భాశయ ముఖద్వార, పెద్దపేగు క్యాన్సర్లుంటే చిన్న వయసులోనే కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవటం మంచిది.
ఇవీ.. క్యాన్సర్‌ హెచ్చరికలు
1. ముద్ద సరిగా మింగలేకపోవటం. 
2. ఆకలి తగ్గటం 
3. కడుపునొప్పి 
4. బరువు తగ్గటం 
5. అజీర్ణం 
6. మలవిసర్జనలో మార్పులు 
7. మలంలో రక్తం పడటం

అలసటతీరి... హాయిగా!-Fatigue ... comfortably!


అలసటతీరి... హాయిగా! 
ఆఫీస్‌లో గంటలు గంటలు కూర్చుని పనిచేశాక శరీరం అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. ఇంటికెళ్లిన తర్వాత మరే పని చేయబుద్ధి కాదు. ముఖ్యంగా చాలామందిలో నడుం కింది భాగం పట్టేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా కేవలం ఓ పదిహేను నిమిషాల పాటూ ఈ వ్యాయామాలు చేస్తే చాలు.. ఉపశమనం లభిస్తుంది. ఇంటికెళ్లిన తర్వాత కూడా చురుగ్గా ఉండగలుగుతాం..
వెల్లకిలా పడుకుని గాలిని లోపలికి పీల్చుకుంటూ రెండు కాళ్లను మడిచి అరిపాదాలను రెండింటినీ కుర్చీ అంచులకు ఆనించాలి. ఇప్పుడు కాళ్లను నెమ్మదిగా పైకి లేపుతూ పొట్ట దగ్గరగా తీసుకురావాలి. రెండు చేతులతో మోకాళ్ల చుట్టూ బంధించి ఉంచాలి. చిత్రంలో చూపినవిధంగా అరనిమిషం ఉండాలి. ఇలా చేయడం వల్ల నడుము కిందిభాగానికి రక్తప్రసరణ పెరిగి.. ఒత్తిడి తగ్గుతుంది.
వెల్లకిలా పడుకుని కాళ్లను నిటారుగా చాపాలి. ఇప్పుడు ఎడమ కాలిని నెమ్మదిగా పైకి లేపుతూ కుడికాలి తొడపై నుంచి తీసుకురావాలి. అరనిమిషం పాటూ ఉన్న తర్వాత మళ్లీ కుడికాలితో ఇలా ప్రయత్నించాలి. ఇలా కాళ్లు మార్చి మార్చి.. నాలుగైదుసార్లు చేయాలి. శరీరం తేలికపడి అన్ని పనులు చురుగ్గా చేయగలుగుతాం.
ఈ వ్యాయామాల కోసం ఓ కుర్చీని దగ్గర పెట్టుకోవాలి. వెల్లకిలా పడుకుని ఎడమ కాలిని కుర్చీకి ఆన్చి కుడి కాలిని ఫొటోలో చూపిన విధంగా ఎడమ మోకాలిపై ఉంచాలి. రెండు చేతులతో ఎడమకాలి తొడను పట్టుకోవాలి. ఇదేవిధంగా కుడికాలితోనూ చేయాలి. నడుం కింది భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగి పట్టేసిన కండరాలు విశ్రాంతి పొందుతాయి.
డాక్టర్‌ మణిపవిత్ర 
యోగా నిపుణురాలు 
* 7702491110

గడ్డి కాదు!....అమృతం!!-Amrutham

గడ్డి కాదు!....అమృతం!!
భూమిలో పాతుకుని ఉన్నంత సేపే, ఏ చెట్టయినా పచ్చపచ్చగా మెరిసిపోతుంది.
ఒక్కసారి ఆ భూమితో తెగతెంపులు చేసుకుని, వేళ్లు పెకిలించుకుని, ఈవలికి వచ్చిపడిందా...! పచ్చదనమంతాపోయి, ప్రాణర హితంగా మారిపోతుంది.
ప్రకృతి నుంచి, ప్రకృతి సిద్ద జీవనశైలి నుంచి దూరంగా వెళుతున్న. మనిషి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఆధునిక జీవనంలో ప్రధాన భాగమైపోయిన పిజ్జాలు, బర్గర్ల నుంచి, సూప్స్‌, కూల్‌ డ్రింక్స్‌ దాకా.... అన్నీ. ప్రాణాల్ని హరింపచేసేవే తప్ప వీటిల్లో ఏ ఒక్కదానికైనా ప్రాణాల్ని నిలబెట్టే శ క్తి ఉందా? నిజానికి వేల సంవత్సరాల క్రితమే కొందరు మహర్షులు అద్భుతమైన ప్రకృతి చికిత్సా విధానాలెన్నో సూచించారు. వాటిల్లో ఏ కొన్ని పాటించినా, మానవ శరీరాలు ఇంతగా రోగ గ్రస్థమయ్యేవే కాదు.
ప్రస్తుతం మనం ఏ ఆహారపానీయాలు తీసుకున్నా, వాటిల్లో శక్తిదాయకాలెన్ని? రోగకారకాలెన్ని? రోగనిరోధక శక్తిని పెంచేవెన్ని? ఈ దృష్టితో చూడాల్సి వస్తోంది.
ప్రస్తుతానికి గోదుమ నారు (గోదుమ గడ్డి) రసం, లేదా పొడినే తీసుకుంటే.... మనిషిలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవశక్తిని పదింతలు చే యడంలో దాని పాత్ర ఎంతో కీలకమని చెప్పే పలు శాస్త్రీయ విశ్లేషణలు మన ముందున్నాయి
మన శరీరానికి అవసరంగా, మనసుకు ఆసక్తికరంగా అనిపించేవే కావచ్చు. వాటిల్లో అన్నింటికి అన్నీ మేలు చేసేవిగా ఏమీ ఉండవు.మనకు అందుబాటులో ఉన్న ఏ పదార్థంలోనైనా, శరీరానికి మేలు చేసేవాటితో పాటు కీడు చేసేవీ ఉంటాయి. అయితే, ప్రకృతి సిద్ధమైన వాటిల్లో ప్రత్యేకించి గోదుమ నారులో మాత్రం, ఆరోగ్యదాయకమైనవే తప్ప వాటిల్లో ఏ ఒక్క అంశమూ హానికారకమైనవి కావు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ గోదుమ గడ్డి రసం లేదా చూర్ణం, ఒక ఔషధంగా ఆదరణ పొందుతోంది.
ఆపద్భాంధవిగా....
ప్రతి మనిషిలోనూ సహజంగానే ఒక నిరోధక వ్యవస్థ ఉంటుంది. చాలా జబ్బుల నుంచి నిరంతరం అది మనిషిని కాపాడుతుంది. ఎప్పుడైనా ఆ రోగ నిరోధక శక్తికి మించిన సమస్య తలెత్తినప్పుడే వైద్య చికిత్సలు అవసరమవుతాయి. కాకపోతే కాలగతిలో వస్తున్న వివిధ పరిణామాల్లో భాగంగా, హానికారక ఆహార పానీయాల వల్ల, కలుషిత వాతావరణం వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల అతనిలోని వ్యాధినిరోధక శక్తి రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా శరీరాలు అనునిత్యం అనారోగ్యం పాలవుతున్నాయి. ఈ స్థితిలో గోదుమ గడ్డి చూర్ణంక, ర సం ఉపకరిస్తాయి.
గోదుమగడ్డి రసం లేదా చూర్ణం సహజసిద్ధమైన పౌష్టికాహారం. అదే సమయంలో ఔషఽధంగా కూడా ఇది పనిచేస్తోంది. మౌలికంగా, గోదుమ నారు పొడిలో 111 రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. మరోరకంగా చెప్పాలంటే, 23 కిలోల కూరగాయలు ఇచ్చే శక్తిని ఒక కిలో పచ్చి గోదుమ నారు ఇస్తుంది. గోదుమ నారులో ఎ,బి,సి, ఇ మొదలైన విటమిన్లు, ప్రొటీన్లు, అమీనో యాసిడ్లు, ఎంజైములు, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి. వీటితో పాటు సోడియం, పొటాషియం, జింక్‌, భాస్వరం, సెలీనియం వంటి ఖనిజాలు, పత్రహరితం, పీచుపదార్థం, మానవ శరీరానికి కావలసిన పరిణామంలో ఉన్నాయి.
శరీరానికి అవసరమైన మొత్తం 22 అమైనో యాసిడ్స్‌ల్లో 19 ఒక్క గోదుమ నారులోనే లభిస్తాయి.
గోదుమ నారులో పత్రహరితం (క్లోరోఫిల్‌) 70 శాతం ఉంది. మనిషి రక్తానికి ఎరుపుదనం తెచ్చే ’హెమిన్‌’ కణ స్వరూపానికీ, క్లోరోపిల్‌ కణ స్వరూపానికీ మధ్య సారూప్యత ఉండడమే కాదు అంతే శక్తిమంతంగా కూడా పనిచేస్తుంది.
గోదుమ నారు రసంలో అతి త్వరితంగా రక్తంలో కలిసిపోయి, అన్ని కణాలకూ వ్యాపించి వాటిని బలోపేతం చేసే శక్తి ఉంది.
గోదుమ నారులోని ఈ పత్రహరితంతో పాటుగా ఇంకా అనేక ఇతర పదార్థాలు ఉండడం వల్ల గోదు నారు రసాన్ని ’ గ్రీన్‌ బ్లడ్‌’ అని కూడా అంటారు. ఇది రక్తహీనతను (అనీమియా)ను తగ్గిస్తుంది. క్లోరోఫిల్‌లో ఉండే క్రిమిసంహారక శక్తి కూడా ఎక్కువే. ఇది యాంటీ సెఫ్టిక్‌గా పనిచేస్తుంది.
ఆస్తమా, అల్సర్లు, చర్మవ్యాధులు, చిన్నపేవు ఉబ్బడం, గాయాలు మానకపోవడం వంటి సమస్యలను గోదుమనారు చూర్ణం నయం చేయగలదు. శరీరంలోని విషపదార్థాలను తొలగించగలదు.
గోదుమ నారు చూర్ణంలో కరగని, కరిగిపోయే ఈ రెండు రకాల పీచుపదార్థాలూ ఉన్నాయి. ఇందులోని కరగని పీచుపదార్థం చిన్న పేగులో, జీర్ణకోశంలో ఆహారపు కదలిక జరిగేలా చూస్తుంది. దీనివల్ల మలబద్ధకం పోయి, శరీరంలో విషపదార్థాలు చేరే అవకాశం లేకుండాపోతుంది. కరిగే పీచుపదార్థం కార్బోహైడ్రేట్లు శరీరంలో ఇమిడిపోయే విఽధానాన్ని ఆలస్యం చేస్తుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయి అదుపులోకి వస్తుంది. పీచుపదార్థం కేన్సర్‌ నిరోధకంగా కూడా పనిచేస్తుంది.
జీర్ణాశయానికి సంబంధించిన మలబద్ధకం అసిడిటీ, పైల్స్‌, కోలైటిస్‌, అల్సర్స్‌ తో పాటు, కిడ్నీ సమస్యలను కూడా గోదుమ నారు చూర్ణం దూరం చేస్తుంది. అలర్జీ, సొరియాసిస్‌, మొటిమలు, ఎగ్జిమా వంటి చర్మ రోగాల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఫ కేన్సర్‌, బి.పి, బహిష్టు సమస్యలు, పక్షవాతం, లుకేమియా, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్‌, నిద్రపట్టకపోవడం, ఆస్తమా బ్రాంకైటిస్‌ నివారణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణ శక్తిహీనతను తొలగిస్తుంది. క్రమంగా పెంచాలి
ప్రారంభంలో ఈ రసాన్ని కొద్దిమోతాదులో తీసుకుంటూ క్రమంగా మోతాదు పెంచాలి. మామూలు జబ్బులకు 10 మి.లీ రసం చాలు. తీవ్రమైన వ్యాధితో బాధపడే వారు 25 నుంచి 50 మి. లీ రసం చొప్పున రోజుకు మూడు సార్లు తాగాలి. ఈ రసం తాగిన అరగంట దాకా మరేమీ తీసుకోకూడదు. ఈ రసాన్ని పొద్దున పరగడుపున తీసుకోవడమే మేలు. ఒకవేళ పొద్దున్నే తీసుకోవడం వీలు కాని వారు మధ్యాహ్నం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. వ్యాధి గ్రస్థులు తమ సమస్య నయం అయ్యేదాకా వరుసగా వాడవచ్చు. ఆరోగ్యవంతులు ఈ రసం తాగితే మరింత ఆరోగ్యవంతులవుతారు. వీరు 3 మాసాలు వాడిన తర్వాత ఆపేయాలి మళ్లీ మూడు నెలల తర్వాత వాడుకోవచ్చు. వీరు 2.5 గ్రాముల చూర్ణాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున 20 మి. లీ నీటితో కలిపి సేవించాలి. రుచికొరకు తేనె కలుపుకోవచ్చు మధుమేహలు మాత్రం తేనె కలుపుకోకూడదు.
ఏదో వ్యాధిన బారినపడి దాని తాలూకు అనేక పరిణామాలకు ఆ తర్వాత బలికావడం కన్నా, గోదుమ నారు రసం సేవించడం ద్వారా ఆ వ్యాధులను అసలే దరిచేరకుండా చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఎలా తీసుకోవాలి?
గోదుమ నారులో అనేకమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఒకే పదార్థంలో ఇవన్నీ ఉండడం వల్ల ఒక్కుమ్మడిగా వాటన్నింటినీ తీసుకోవడంలో తొలుత మన శరీరం కొంత ఇబ్బంది పడుతుంది. మరీ ముఖ్యంగా మన శరీరంలో మలినాలు బాగా పేరుకుపోయినప్పుడు వాటిని స్వీకరించడానికి శరీరం ఇష్టపడదు. అందువల్ల ముందు బాగా విరేచనం అయ్యేలా చూసుకోవాలి. నాలుగు రోజుల పాటు ఘనాహారం ఏమీ తీసుకోకుండా, వెచ్చని నీరు, పండ్ల రసం తీసుకోవాలి. చాలా స్వల్పంగా ఉడికించిని కాయగూరలు తీసుకోవచ్చు. ఇలా నాలుగు రోజులు గడిపాకే గోదుమ నారు రసంగానీ, చూర్ణం గానీ తీసుకోవాలి. గోడుమ నారు రసంలో పీచుపదార్థం ఉండదు. కాబట్టి చూర్ణాన్ని నీళ్లల్లో కలుపుకుని తీసుకోవడమే ఉత్తమం. గోదుమ నారు రసాన్ని తయారు చేసుకున్న వెంటనే తాగెయ్యాలి. చాలా సేపు అలాగే ఉంచితే అందులోని ఔషధ గుణాలు తగ్గుతాయి. ఒకవేళ ఈ రసం వగరుగా, ఘాటుగా అనిపిస్తే, కొంచెం తేనె కలిపి తాగవచ్చు.


mohan publications price list