MohanPublications Print Books Online store clik Here Devullu.com

మంగళగిరి_Mangalagiri

ముగ్గురయ్యల కొండ... మంగళగిరి


భక్తుల కోరిన కోర్కెలు తీర్చేందుకు కొండపైన కొలువయ్యాడు పానకాల స్వామి. ఆ దిగువనే నిలిచాడు శ్రీలక్ష్మీనృసింహస్వామి. నమ్మినవారిని గండాల నుంచి గట్టెక్కించేందుకు కొండ శిఖరాన వెలిశాడు గండాలయస్వామి. ఇలా ముగ్గురు నరసింహస్వాములు ఒకేచోట ఉన్న ఆ దివ్య క్షేత్రమే మంగళగిరి.
మంగళగిరి ప్రసిద్ధ వైష్ణవాలయం. దీన్నే మంగళాచలం, మంగళశైలం, మంగళాద్రి, ధర్మాద్రి, ముక్త్యాద్రి అనికూడా పిలుస్తారు. సర్వ శుభాలూ చేకూర్చే ఐశ్వర్య ప్రదాయిని లక్ష్మీదేవి అధిష్ఠించి ఉన్న క్షేత్రమిది.
స్థల పురాణం...
పూర్వం నమూచి అనే రాక్షసుడు మనుషులూ, ఆయుధాల వల్ల మరణం లేకుండా బ్రహ్మదేవుడి వరం పొందుతాడు. ఆ గర్వంతో ముల్లోకాలలోని సకల పాలకులనూ హింసిస్తుంటాడు. దేవతలూ, మునులూ శ్రీమహావిష్ణువుని శరణు వేడతారు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని సముద్రపు నురుగులో ముంచి నమూచిపై ప్రయోగిస్తాడు. అతడు పారిపోయి తోతాద్రిగా పిలిచే మంగళాద్రి క్షేత్రంలోని చీకటి గుహలో దాక్కుంటాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంలో ప్రవేశించి నమూచిని సంహరిస్తాడు. ఉగ్రరూపంలో ఉన్న శ్రీవారిని శాంతింపజేయటానికి శ్రీమహాలక్ష్మి ఇక్కడి కొండపై తపస్సు చేసింది. మంగళాద్రి క్షేత్రంపై నమూచి దాగిన గుహ ఇప్పటికీ ఉంది. ఈ కొండపై శ్రీమహావిష్ణువు-సుదర్శనమూర్తిగా, శ్రీమహాలక్ష్మి-రాజ్యలక్ష్మి స్వరూపంలో స్వయంభువుగా వెలసి దర్శనమిస్తున్నారు.
క¹ృతయుగం నుంచీ ఉన్న ఈక్షేత్రంలో కొలువై ఉన్న పానకాల శ్రీలక్ష్మీనృసింహస్వామిని యుగయుగాల దేవుడిగా కొలుస్తారు. ఈ స్వామికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవునెయ్యి, ద్వాపరయుగంలో ఆవుపాలను నైవేద్యంగా సమర్పించేవారట. కలియుగంలో భక్తులు పటిక బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కొండపైన శ్రీవారి కోసం పానకం తయారుచేస్తారు. నిత్యం పానకం పొంగి పొరలుతున్నా శ్రీవారి సమక్షంలోనూ, భక్తులు నడయాడే ప్రాంతంలోనూ ఈగలు అనేవే కనిపించకపోవడం ఇక్కడి ప్రత్యేకత.
కొలువైన శ్రీలక్ష్మీనృసింహస్వామి
దిగువ సన్నిధిలో ఎడమతొడపై అమ్మవారు కూర్చున్న లక్ష్మీనృసింహస్వామి దర్శనమిస్తాడు. భీముడితో గండకశిలని తెప్పించి విగ్రహంగా మలచి ధర్మరాజు ప్రతిష్ఠించాడని చెబుతారు. పక్కనే రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు స్వామిని దర్శించుకున్న సందర్భంగా గర్భాలయానికి ముందు మండపాన్ని నిర్మించారు. దీంట్లోనే శ్రీవారి నిత్య కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయానికి తూర్పున పదకొండు అంతస్తుల గాలి గోపురం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది.
దీపమే గండాలయస్వామి...
మంగళగిరి క్షేత్రంలో పడుకుని ఉన్న ఏనుగు ఆకారంలో కొండ ఉంది. ఏనుగుపై అంబారీ అమర్చినట్టుగా చిన్నగుడి శిఖర భాగాన కనిపిస్తుంది. ఇదే గండాలయస్వామి ఆలయం. ఇది సుమారు 850 అడుగుల ఎత్తైన కొండ శిఖర భాగాన ఉంది. ఇక్కడ దేవుడికి రూపం ఉండదు. చిన్న గుహలా కనిపించే గుడిలో ఒక ఇనుప పాత్ర ఉంటుంది. దాంట్లో ఆవునెయ్యి లేదా నువ్వులనూనె పోసి దీపం వెలిగిస్తారు. ఈ దీపాన్నే గండాలయస్వామిగా ఆరాధిస్తారు. ఆపదలూ, గండాల్లో ఉన్నవారు తమను గట్టెక్కించమని ఇక్కడ మొక్కుతారు. భక్తుల మొర ఆలకించి ఎంతటి గండంలో ఉన్నప్పటికీ ఇట్టే గట్టెక్కించి ఈ స్వామి ఆదుకుంటాడని నమ్ముతారు. ఆ విశ్వాసంతోనే భక్తులు సాయంత్రం సమయంలో ఎత్తైన కొండ ఎక్కి దీపం వెలిగిస్తారు. ఈ దీప మహత్యం గురించి ఎంతచెప్పినా తక్కువే. రాత్రంతా ఎంత తీవ్రంగా గాలి వీచినా దీపం వెలుగుతూ వూళ్లొని వాళ్లందరికీ కనిపిస్తూనే ఉంటుంది. పూర్వం కొండరాళ్లూ, చెట్లమార్గంలో అతి కష్టంపై శిఖర భాగానికి చేరుకుని భక్తులు గండదీపం వెలిగించేవారు. ఇప్పుడు మెట్లదారి ఏర్పాటుచేశారు. శ్రీరామానుజాచార్యులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం విశేషం.
దిగువ సన్నిధి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో, కొండపైకి వెళ్లే మెట్లదారి పక్కన చరిత్ర తెలిపే శిలా శాసనాలు దర్శనమిస్తాయి. ప్రధాన వీధిలో శాసన స్తంభం ఉంది. దీనిపైన శ్రీఆంజనేయస్వామి కొలువై ఉంటాడు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మంగళగిరికి నాలుగు దిక్కులా కొలువై పూజలందుకుంటున్నాడు. ఏటా ఫిబ్రవరి లేదా మార్చిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.పన్నెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో రథోత్సవం ఎంతో ప్రత్యేకమైంది.
కొండపైకి చేరుకోవాలంటే...
పదిహేడేళ్ల కిందటివరకూ కొండపైన ఉండే పానకాలస్వామిని భక్తులు 450 మెట్లు ఎక్కి దర్శించుకునేవారు. 2004 కృష్ణా పుష్కరాల సందర్భంగా కొండపైకి ఘాట్‌ రోడ్డుని నిర్మించారు. మంగళగిరి విజయవాడ రైల్వే జంక్షన్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ, గుంటూరుల నుంచి ప్రతి ఐదు నిమిషాలకూ బస్సు సౌకర్యం ఉంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చేవారు నేరుగా మంగళగిరి రైల్వేస్టేషన్‌కు వెళ్లవచ్చు. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఆలయం ఉంది. బస్సులూ, సొంత వాహనాల్లో వెళ్లేవారు నేరుగా ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు. దేశంలోని ఏ నృసింహ క్షేత్రంలోనైనా ఒక్క నరసింహస్వామే దర్శనమిస్తాడు. కానీ లక్ష్మీనృసింహస్వామీ, పానకాల నరసింహస్వామీ, గండాలయ నరసింహస్వామిలను ఒకేచోట కళ్లారా చూసుకుని తరించాలంటే మంగళగిరిని దర్శించాల్సిందే.
- ఎస్‌.కృష్ణప్రసాద్‌, న్యూస్‌టుడే, మంగళగిరి

శ్రీతల్పగిరిపై శ్రీహరి_Talpagiri Ranganadh Swamy Devalayam

శ్రీతల్పగిరిపై శ్రీహరి


నెల్లూరు జిల్లాలోని ఆలయాలన్నింటిలో ప్రాచీనమైనది... తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం. నెల్లూరులో పెన్నానదికి దక్షిణ ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని స్వామివారి పేరు రంగనాథస్వామి. అందువల్లే ఈ ప్రాంతానికి రంగనాయకులపేట అని పేరు.
స్థలపురాణం
మహా పుణ్యక్షేత్రాల దర్శనంలో భాగంగా ఈ ప్రాంతం మీదుగా ప్రయాణం సాగించిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. ఆ భక్తికి కరిగిపోయిన నారాయణుడు, కశ్యపుడి కోరికపైన ఇతర క్షేత్రాల్లానే ఈ ప్రాంతం కూడా భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అభయమిచ్చాడట. ఆ మాట ప్రకారమే శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథస్వామిగా ఇక్కడ వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మరో కథనం ప్రకారం... కశ్యప మహాముని నిర్వహించిన యజ్ఞం నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలలలో ఒకటి శ్రీరంగనాథస్వామి ఆలయంగా, ఇంకోటి శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంగా, మరొకటి వేదగిరి నృసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కాంద పురాణం వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది.
ఆదిశేషుడే తల్పగిరి
శ్రీరంగనాథుడు కొలువైన ఈ క్షేత్రానికి తల్పగిరి అన్న పేరు రావడం వెనకా ఓ ఆసక్తికర కథనం వినిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఓరోజు శ్రీదేవీ సమేతంగా భూలోకంలో విహరించదలచి ఆదిశేషుని పిలిచి అందుకు అనువైన ప్రాంతం చూపించమని అడిగాడట... అప్పుడు పినాకినీ నదీ తీరాన ఆదిశేషుడే స్వయంగా గిరిగా వెలసి మహావిష్ణువు పాద స్పర్శతో పులకించిపోయాడట. తల్పంగా మారి వైకుంఠంలో తనకు సేద తీరుస్తోన్న ఆదిశేషుడి పేరుతోనే భవిష్యత్తులో ఆ కొండ తల్పగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని స్వామి అనుగ్రహించాడట. అలా ఆ పర్వతం పదిహేడో శతాబ్దం నుంచి తల్పగిరిగానే వెలుగొందుతోంది. ఇది శ్రీరంగానికి ఉత్తర దిశలో ఉన్న ఆలయం కాబట్టి ఉత్తర శ్రీరంగం అనీ పేరు.
పశ్చిమదిక్కుగా విగ్రహం
తల్పగిరిలోని ఆలయ శాసనాల ప్రకారం 1178-1216 మధ్య కుళొత్తుంగ చోళుల హయాంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీరంగనాయకి అమ్మవారు, గోదాదేవి అమ్మవార్ల ఆలయాలనూ అప్పుడే నిర్మించారు. సాధారణంగా ముఖద్వారం ప్రవేశద్వారంగా ఉంటుంది. కానీ పెన్నానది దాదాపు ముఖద్వారం వరకూ రావడంతో గుడికి వెనక వూరివైపు వేరొక ముఖద్వారం ఉంటుంది. అందువల్ల ప్రధాన ద్వారం స్వామికి వెనకవైపు ఉంటుంది. ఆలయ గర్భగుడిలో పశ్చిమ దిశగా పెన్నానదికి అభిముఖంగా స్వామి శయనించి కనిపిస్తారు. 1859లో యరగుడిపాటి వెంకటాచలం పంతులు నేతృత్వంలో ఏడు అంతస్తులతో 96 అడుగుల ఎత్తయిన గాలిగోపురాన్ని పద్నాలుగు ఏళ్లపాటు శ్రమించి నిర్మించారు. గర్భాలయం ప్రాకారంపైన తీర్చిదిద్దిన దేవీదేవతల సుందర మూర్తులు చూపరులను ఆకట్టుకుంటాయి. మహ్మదీయ రాజులు దండయాత్రలో ఉదయగిరి దుర్గాన్ని వశం చేసుకున్నప్పుడు స్థానికులు స్వామివారి ఉత్సవమూర్తులను సంరక్షించుకునేందుకు వాటిని నెల్లూరు తరలించి భద్రపరిచారు. ఆ విగ్రహాలే ప్రస్తుతం ప్రధాన ఉత్సవాలలో పూజలందుకుంటున్నాయి.
ఫాల్గుణంలో బ్రహ్మోత్సవం
శ్రీరంగంలో మాదిరిగానే తల్పగిరిలోనూ మూలవిరాట్టు 12 అడుగుల ఆదిశేషునిపైన భారీ రూపంలో దర్శనమివ్వడం విశేషం. స్వామి పాదాల దగ్గర శ్రీదేవీ భూదేవినీ, నాభికమలంలో బ్రహ్మనూ దర్శించుకోవచ్చు. ఏటా 45రోజులపాటు తైల సమర్పణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఏటా దేవస్థాన ఉత్సవాలు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం కనులపండువగా జరుగుతాయి. మార్గశిర మాసంలో పగల్‌పత్తు-రాపత్తు ఉత్సవాలను 20రోజులపాటు వేడుకగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారంలో రంగనాథుని దర్శనం మోక్షప్రదమన్నది భక్తుల విశ్వాసం. ఫాల్గుణ శుద్ధ దశమి నుంచి శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవ సంబరాలు మొదలవుతాయి.
1928లో ముప్పిరాల చిన నరసింహాచారి స్వామికి తంజావూరు చిత్రకళతో నిండిన అద్దాల మందిరాన్ని నిర్మించారు. అక్కడ గజేంద్ర మోక్షం, దశావతారాలు, ఆళ్వారాచార్యుల చిత్రాలు బంగారు పూతతో కనువిందుచేస్తాయి. మందిర పైభాగంలో శ్రీమన్నారాయణుడు వటపత్రశాయిగా పవళించి ఏవైపు నుంచి చూసినా తమనే చూస్తున్న భావనను భక్తులకు కలిగిస్తాడు. శ్రీరంగనాథుడు అవతరించిన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు పెన్నానదిలో 12 ప్రముఖ నదులు సంగమించాయని పినాకినీ క్షేత్ర మహత్మ్య గ్రంథం చెబుతుంది. అందుకే ఆరోజు ఆ పుణ్య నదిలో స్నానం చేస్తే పుష్కరస్నాన ఫలం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. తల్పగిరి క్షేత్రంలో స్వామివారి పవళింపు సేవను చూసినపుడు కలిగే భావన నభూతో నభవిష్యతి.
నెల్లూరు రైల్వేస్టేషన్‌ నుంచి ఈ ఆలయాన్ని కాలి నడకనే చేరుకోవచ్చు!
- కె.శ్రీనివాసాచారి న్యూస్‌టుడే, నెల్లూరు కల్చరల్‌

నాలుగు యుగాల దేవుడు... చెన్నకేశవుడు!_Chennakesavudu

నాలుగు యుగాల దేవుడు... చెన్నకేశవుడు!
సత్యయుగం నుంచీ కలియుగం దాకా అన్ని యుగాల్లోనూ భక్తుల పూజలందుకున్న దేవదేవుడు... మార్కాపురంలో కొలువైన లక్ష్మీచెన్నకేశవుడు. ఆనాడు మహర్షుల కోరికపై దండకారణ్యంలో వెలసిన స్వామి, ఈనాడు నగరం నడి మధ్యలో శరణు కోరిన వారికి అభయ హస్తం అందిస్తున్నాడు.
కతే గజారణ్యం తవేశః
త్రేతాయుగే మాధవపుర్య భూత్తత్‌
సాద్వాపరే సర్వపురం హిక్షేత్రం
మార్కాపురీత్యద్య కలౌ ప్రసిద్ధా...
శివారాధన చేసి మృత్యువును జయించిన చిరంజీవి మార్కండేయుడు. ఆ మహా పురుషుడు రచించిన ‘గజారణ్య సంహిత’ అనే గ్రంథం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన లక్ష్మీచెన్నకేశవుడు నాలుగు యుగాలుగా భక్తులను కటాక్షిస్తున్నాడు. నల్లమలకు ఆనుకొని ఉన్న మార్కాపురమే ఒకప్పుడు గజారణ్యంగా ప్రతీతి. అప్పట్లో అదంతా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో మహర్షులు తపస్సు చేసుకునేందుకు అనువుగా ఉండేది. ఆ దీక్షను భగ్నం చేసేందుకు అసురులు సకల ప్రయత్నాలూ చేసేవారు. వాళ్ల ఆగడాల నుంచి రక్షించమని వేడుకున్న రుషి పుంగవుల కోరిక మేరకు మహావిష్ణువు ఆ దండకారణ్యంలో చెన్నకేశవుని రూపంలో స్వయంభువుగా వెలిశాడు. కృతయుగంలో ఏనుగులు గుండికానది నుంచి నీటిని తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించేవట. ఏనుగులు ఎక్కువగా సంచరించేవి కాబట్టి దీనికి గజారణ్యం అని పేరు. త్రేతాయుగంలో గౌతమ మహర్షి ఇక్కడే తపస్సు చేశారు. ఆ కాలంలో ఆ ప్రాంతం మాధవీపురంగా ప్రసిద్ధి చెందింది. ద్వాపర యుగంలో అక్కడ రాక్షసుల చేతిలో హింసకు గురైన భక్తులకు విష్ణుమూర్తి స్వర్గలోక ప్రాప్తి కలిగించడంతో అది స్వర్గసోపానంగా విలసిల్లింది. కలియుగారంభంలో మారిక, మారకులనే భక్తులు నిత్యం స్వామిని ఆరాధించేవారు. ఆ పరమ భక్తుల పేర్ల మీదే క్షేత్రాన్ని మారికపురం, మారకాపురమని పిలిచేవారు. కాలక్రమంలో అది మార్కాపురం చెన్నకేశవ క్షేత్రంగా మారిందని చెబుతారు.
రాయల ఆధ్వర్యంలో...
పల్నాటి రాజుల నుంచీ కృష్ణదేవరాయల వరకూ చాలామంది ప్రభువులు చెన్నకేశవుని కొలిచిన వారే. ఆలయ శాసనాల ప్రకారం... పన్నెండవ శతాబ్దంలో మలిదేవుడనే పల్నాటి రాజు ఓసారి గురజాలలో జరిగిన కోడిపందేలలో ఓడిపోయాడు. ఆ తరవాత చెన్నకేశవుని కొలిచి, చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాడు. స్వామి కటాక్షంతోనే తన దశ మారిందని నమ్మి ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మాచర్లలో మరో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఆ విషయాన్ని ‘పల్నాటి వీరచరిత్ర’లో శ్రీనాథుడూ ప్రస్తావించాడు.
ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగరానికి తిరిగి వెళ్తూ మార్గ మధ్యంలో చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు. ఆయన ఆదేశానుసారం గర్భాలయం, అంతరాలయం, మహాద్వారం, విమాన గోపురం, రాజ్యలక్షీ అమ్మవార్ల అలయాలను సామంతరాజు సిద్ధిరాజు తిమ్మయ్య నిర్మించాడు. తరవాతి కాలంలో లక్ష్మీనరసింహస్వామి, వేణుగోపాలస్వామి, రంగనాయకస్వామి, గోదాదేవి, రామానుజల ఆలయాలను ఆ ప్రాంగణంలో అచ్యుత దేవరాయలు నిర్మించారు. రాయల కాలంలో రెండంతస్తులకే పరిమితమైన గాలిగోపురాన్ని 1929లో తొమ్మిదంతస్తులకు పెంచారు. శిథిలావస్థకు చేరిన ఆ గోపురాన్ని నాలుగేళ్ల క్రితం పునర్నిర్మించారు.

ఎన్నెన్నో విశేషాలు
సాధారణంగా శ్రీహరికి కుడిచేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. మార్కాపురం చెన్నకేశవుడికి ఎడమచేతిలోనూ ఓ శేషచక్రం దర్శనమిస్తుంది. కేశీ అనే రాక్షసుడి సంహారానికి గుర్తుగా స్వామి శేషచక్రం ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. మూలవిరాట్టు పక్కనే మార్కండేయ మహామునితోపాటు మారిక, మారకయ్యల విగ్రహాలూ కనిపిస్తాయి. మరే దేవాలయంలో లేని విధంగా స్వామివారి మూలవిరాట్టు పానవట్టంపై కొలువై ఉంటుంది. ఆస్థాన మండపంలో ఉన్న స్థంభాలన్నీ ఏకశిలపై చెక్కినవే. ఇద్దరు అన్నదమ్ములు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే అనేక స్తంభాలను ఆలయ ప్రాంగణంలో అందంగా మలిచారు. మధ్యరంగంలోని శిల్పకళా సంపద భక్తులను ఇట్టే కట్టిపడేస్తుంది. ధనుర్మాసంలో గాలిగోపురం, విజయస్తంభం, మధ్యమండపంలోని అవాంతరాలను దాటుకొని భానుడి కిరణాలు నేరుగా మూలవిరాట్టుని తాకేలా అద్భుత రీతిలో ఆలయాన్ని నిర్మించారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు..
చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు వేద కాలం నుంచే జరుగుతున్నట్లు గజారణ్య సంహిత చెబుతోంది. ఏటా ఛైత్రశుద్ధ చతుర్దశి రోజున బ్రహ్మోత్సవాలను అంకురార్పణతో ప్రారంభించి పౌర్ణమి రోజున వైభవంగా కల్యాణం జరిపిస్తారు. సూర్య, చంద్ర, సింహ, శేష, వ్యాళి, పొన్న, హనుమ, గరుడ, గజ, అశ్వ, హంస వాహనోత్సవాలను కన్నులపండువగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టం రథోత్సవం. మార్కాపురంతోపాటు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి లక్షమందికిపైగా ఆ రోజు రథోత్సవాన్ని తిలకిస్తారు. ఆలయంలో రథసప్తమి వేడుకలూ ఈ ఏడాది నుంచే ప్రారంభమయ్యాయి. వాటి కోసం భక్తులు స్వామివారికి రజత రథాన్ని సమకూర్చారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఒకే రోజున స్వామి ఏడు వాహనాలపైన పురవీధుల్లో దర్శనమిస్తాడు.
ఒంగోలు నుంచి మార్కాపురానికి 95 కిలోమీటర్ల దూరం. ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంటుంది. విజయవాడ- నంద్యాల రైల్వే మార్గంలో ఉన్న వూరు కాబట్టి, రెండు ప్రాంతాల నుంచీ రైలు ద్వారానూ చేరుకోవచ్చు.
- దొండపాటి మోహన్‌రెడ్డిన్యూస్‌టుడే, మార్కాపురం

వీరేశ్వరస్వామి!_Vereswara Swamy

పెళ్లిళ్ల దేవుడు వీరేశ్వరస్వామి!


పెళ్ళిళ్ళ దేవుడుగా ప్రాచుర్యం చెందిన ఆ స్వామికి కళ్యాణం జరిపిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరతాయన్న నమ్మకంతో భక్తులు అక్కడకు విశేషంగా తరలివస్తుంటారు... అదే వృద్ధ గౌతమీ తీరంలో వెలసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం... మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం.
కొబ్బరిచెట్ల సవ్వడులూ పచ్చని పంటపొలాలూ గోదావరీజలాల గలగలల మధ్య భద్రకాళీ సమేతంగా వెలసిన వీరేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంతో అలరారుతుంటుంది. తూర్పుగోదావరి జిల్లా, మురమళ్లలో వెలసిన ఆ వీరేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలి వస్తుంటారు. ఆలయంలో కొలువైన స్వామికి కళ్యాణం జరిపిస్తే అవివాహితులకు వెంటనే వివాహం జరుగుతుందని ప్రతీతి. దక్షిణ భారతదేశంలోనే మరెక్కడాలేని విధంగా ఈ ఆలయంలో స్వామికి నిత్యం వివాహ వేడుకని అత్యంత శాస్త్రోక్తంగా జరిపించడం విశేషం. భక్తులంతా సంకల్పం చెప్పుకుని, తమ గోత్రనామాలతో ఆ వీరభద్రుడికి కళ్యాణం జరిపిస్తుంటారు. అందుకే ఆయన్ని పెళ్లిళ్ల దేవుడని పిలుస్తారు.
స్థల పురాణం!
దక్షయాగాన్ని భంగం చేసి, సతీదేవి పార్థివ దేహంతో తాండవం చేస్తూ ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తోన్న వీరభద్రుడి మహోగ్రాన్ని చల్లార్చేందుకు దేవతల కోరిక మేరకు ఆ జగజ్జనని భద్రకాళి పేరుతో అతిలోకసుందరిగా రూపుదాల్చుతుంది. ఆమెను చూడగానే స్వామి శాంతించి, వివాహం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు వాళ్లిద్దరికీ గాంధర్వ పద్ధతిలో మునులంతా కలిసి వివాహం జరిపించారట. మునులు సంచరించే ప్రాంతాన్నే మునిమండలి అంటారు. ఆ మునిమండలి ప్రాంతమే కాలక్రమంలో మురమళ్లగా మారింది అనేది పురాణ కథనం. ఆరోజునుంచీ అక్కడ వెలసిన స్వామికి మునులంతా కలిసి గాంధర్వ పద్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు.
పూర్వం గౌతమీ నదికి వరదలు వచ్చినప్పుడు స్వామి ఆలయం మునిగిపోయిందట. అప్పుడు శివభక్తుడైన వేలవలి శరభరాజుకి స్వామి కలలో కనిపించి మునిమండలి ప్రాంతంలోని గోదావరిలో మునిగి ఉన్న తనను వెలికితీయాలని కోరడంతో, శివలింగాన్ని గడ్డపారతో తీసేందుకు ప్రయత్నించాడట. అయితే గడ్డపార దెబ్బకు శివలింగం నుంచి రక్తం రావడంతో, భయభ్రాంతులైన భక్తులు స్వామిని ధ్యానించగా శివలింగం నుంచి మాటలు వినిపించాయట. శివలింగాన్ని ఐ.పోలవరం సమీపంలోని బాణేశ్వరాలయానికి తీసుకువెళ్లాలనీ మధ్యలో అనుకూలంగా ఉన్నచోట ఆగిపోతానన్నది ఆ మాటల సారాంశం. అంతట భక్తులు జయజయ ధ్వానాలమధ్య శివలింగాన్ని తీసుకెళుతుండగా మురమళ్ల గ్రామంలోని ఓ ప్రదేశంలో శివలింగం భారీగా పెరగడంతో అదే స్వామి ఆజ్ఞగా భావించి అక్కడే దించి, ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడుగా లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు.
వివాహమహోత్సవం!
అనాదిగా వస్తోన్న ఈ వివాహ క్రతువు జరిగే తీరు భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంటుంది. బాజా భజంత్రీలూ మేళతాళాలతో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం జరపడం ద్వారా కళ్యాణ వేడుకను ప్రారంభిస్తారు. ఓ పక్క కొందరు అర్చకులు యక్షగానం ఆలపిస్తుంటారు. మరోపక్క స్మార్తాగమం ప్రకారం ఆలయ పురోహితులు స్వామివారి వివాహ వేడుకను నిర్వహిస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి తంతులన్నీ స్వామి కళ్యాణంలో కనిపిస్తాయి. అనంతరం స్వామివారినీ అమ్మవారినీ అద్దాల మండపానికి తోడ్కొని, పవళింపుసేవ చేయడంతో కళ్యాణమహోత్సవం ముగుస్తుంది. మూడుగంటల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవం భక్తులకు కన్నులపండగే. కళ్యాణం జరిపించే భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ఉదయంపూట అభిషేకం జరుపుతారు. రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు నెల రోజులు ముందుగానే నమోదు చేసుకుంటుంటారు.దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆలయంలో నిత్యాన్నదానం, వసతి గదులూ అందుబాటులో ఉన్నాయి. కాకినాడకు 36, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం.
- వై.నాయుడు, న్యూస్‌టుడే, ఐ.పోలవరం

శ్రీ కాళహస్తి!_Sri Kalahasthi

దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!


నమఃశివాయలో... ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’ మరుత్‌ (వాయువు), ‘శి’ శిఖి (అగ్ని), ‘వా’ వారి (జలం), ‘య’ అంటే యజ్ఞం (భూమి). ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వపాపాలూ హరించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం. మిగిలిన నాలుగూ ఫృథ్వీలింగం (కాంచీపురం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (తిరువణ్నామలై), ఆకాశలింగం (చిదంబరం) తమిళనాడులో ఉన్నాయి. కాళహస్తీశ్వరుడు వాయు లింగం రూపంలో ఉన్నాడనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన ఉన్న రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుందట.
బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన క్షేత్రం
కృతయుగం ప్రారంభంలో బ్రహ్మ దేవుడు మహా శివుడి ఆజ్ఞను ధిక్కరించడం వల్ల అజ్ఞానంతో సృష్టి కార్య నిర్వహణలో విఫలమవుతాడు. పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగిపొందేందుకు కైలాసంలో తేజోవిరాజితమైన శివానందైక నిలయమనే శిఖరాన్ని తన భుజస్కంధాలపై తీసుకుని భూలోకంలో ఓ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటాడు. ఆ ప్రకారంగా శివానందైక శిఖరాన్ని కాశీ క్షేత్రానికి 190 యోజనాల దూరంలో దించుతాడు బ్రహ్మ. అక్కడ పంచముఖాలతో కూడిన మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, శాపం నుంచి విమోచనం పొందుతాడు. అలా శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం దాదాపు 5500 ఎకరాల్లో ఈ కైలాసగిం¹ులు విస్తరించి ఉన్నాయి. బ్రహ్మదేవుడి మాదిరిగానే వాయులింగేశ్వరుడి దేవేరి అయిన పార్వతీ దేవి కూడా శివుడి కోసం తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందడంతో ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువుదీరింది.
భక్తుల పేరుతోనే...
శ్రీ (సాలీడు), కాళము (సర్పం), హస్తి (ఏనుగు)... ఈ మూడు మూగ జీవాల భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన శివుడు ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిగా కొలువు దీరాడు. అదెలాగంటే... పూర్వం తామ్రపర్ణీ నదీ తీరంలో నివసించే కరబుడు చీరల అల్లకంలో దిట్ట. పుట్టినప్పట్నుంచీ శివ భక్తుడైన అతడు దుష్ట సావాసంతో శివారాధన విస్మరించి, వైదిక ధర్మాలను విడిచి పెట్టడంతో అనారోగ్యానికి గురై తనువు చాలించాడు. మరుజన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు. ఈ సాలీడు తన దారాలతో వాయులింగేశ్వరుడికి కైలాసంలో ఉన్నట్లు వేదికలూ భవనాలను అల్లుతూ ఉండేదట. దాని భక్తిని పరీక్షించదలచి ఓరోజు శివయ్య ఆ అల్లికలను అగ్నికి ఆహుతి చేశాడట. అది చూసి భరించలేక అగ్నిలో దూకిన సాలీడుకి శివుడు సాయుజ్యాన్ని ప్రసాదించాడు.
కాళము(సర్పం)... హస్తి(ఏనుగు)ల కథ కూడా ఇలాంటిదే. లోగడ ఇద్దరు శివ భక్తులు పూర్వ జన్మ పాపాలతో అష్టకష్టాలూ పడుతూ వచ్చారు. ఆ ఇద్దరూ మరు జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం, ఏనుగు రూపాల్లో జన్మించారు. పాము రోజూ ఓ మణిని తీసుకొచ్చి లింగానికి అర్పించి పూజలు చేస్తూ ఉండేది. కొన్నాళ్లకు అక్కడ లింగాన్ని చూసిన ఏనుగు స్వర్ణముఖీ నదిలో స్నానమాచరించి తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి, మారేడు బిల్వ పత్రాలతో శివార్చన చెయ్యడం మొదలు పెట్టింది. అయితే ఏనుగు మరుసటి రోజు వచ్చేసరికి మారేడు దళాలన్నీ కిందపడిపోయి ఉండేవి. అది చూసి ఏనుగు అసంతృప్తి చెందేది. సర్పం కూడా తాను దేవుడికి అర్పిస్తున్న మణి కింద పడిపోయి ఉండటం వల్ల ఎందుకిలా జరుగుతోందని ఆలోచించింది. విషయం తెలుసుకుందామని ఓరోజు లింగాన్ని చుట్టుకుని పడుకుంది. ఆ సమయంలో ఏనుగు రావడం, పూజ చేసేందుకు మణిని పక్కకు తొయ్యడం చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. దాంతో బాధను తట్టుకోలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీ కొట్టడంతో రెండు జీవులూ శివైక్యం పొందాయి. అలా ఈ క్షేత్రం శ్రీ కాళహస్తి అయింది.
మహా భక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్లనే తీసిచ్చింది ఇక్కడి శివుడికే. అందుకే, కాళహస్తిలో తొలి పూజను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప.


రాహు కేతు పూజలతో ఖ్యాతి
పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి దక్షిణకైలాసంలోనే పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనిమిచ్చాడట శివయ్య. ఆ నాగరూపం కారణంగానే కాళహస్తి ‘రాహు కేతు క్షేత్రం’గా కూడా వర్ధిల్లుతోంది. సర్ప దోషం, రాహు కేతు గ్రహ దోషాల నుంచి నివారణ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయానికి వెళ్తే మహాదేవుడి దర్శనంతో పాటు అలనాటి శిల్పకళా వైభవాన్నీ దర్శించుకోవచ్చు. పాతాళ వినాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల విజయస్తంభం, జలవినాయకుడి ఆలయం, భరద్వాజ తీర్థం, వేయి లింగాల తీర్థం, ఆలయానికి దక్షిణం వైపున ఉన్న బ్రహ్మ గుడి... ఇలా దర్శించుకోదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాళహస్తిలో.
- బ్రహ్మాండం రాజేష్‌ కుమార్‌, న్యూస్‌టుడే, కాళహస్తి

సింహాచలం... _Simhachalam

సింహాచలం... మహాపుణ్యక్షేత్రం

ఏడాదికి పన్నెండు గంటలు మాత్రమే ఆ దేవుడి నిజరూప దర్శనం భక్తులకు దొరుకుతుంది. మిగిలిన సమయంలో ఆ విగ్రహం చందనంతోనే నిండి ఉంటుంది. ఏడాదికోసారి మాత్రమే అరుదుగా దొరికే ఆ స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తారు. అతడే.. సింహాచలంలో వెలసిన వరాహ లక్ష్మీనరసింహస్వామి.
సింహాచలం దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. సముద్ర మట్టానికి రెండువందల నలభైనాలుగు మీటర్ల ఎత్తులో ఉండే సింహగిరి పర్వతంపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి మహత్యాన్ని తెలిపే కథలెన్నో ఉన్నాయి.
స్థల పురాణం
సింహాచలంలో శ్రీమహావిష్ణువు దశావతారాల్లో నాలుగోదైన లక్ష్మీనారసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం... రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. అతడి కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి బయటకు వచ్చిన విష్ణువు, హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇది జరిగిన తర్వాత నుంచీ ప్రహ్లాదుడు వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని సింహగిరి కొండ మీద ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానంలో ఈ కొండ మీదుగా వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రకాశవంతమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకు ఆకర్షించబడింది. అక్కడ అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. ఆ విగ్రహాన్ని ఏడాదిపాటు చందనంతో కప్పి ఉంచి, వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేట్టు చేయమని ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. ఏటా వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాడు చందనం తీసివేసి భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కలిగిస్తారు.
సింహాచల దేవాలయం పడమర ముఖంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న శాసనాలు సింహాచలం ప్రాముఖ్యాన్ని తెలుపుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండుసార్లు దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటుచేశాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలనూ సమర్పించాడు.
కప్ప స్తంభం
దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. దీన్ని సంతాన గోపాల యంత్రం మీద ప్రతిష్ఠించారు. ఇది అత్యంత శక్తిమంతమైందని భక్తుల నమ్మకం. సంతానంలేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు (పన్నులు) చెల్లించేవారు కాబట్టి దీన్ని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది. సింహాచలం కొండల మధ్యలో ఈ ఆలయం ఉంది. ఈ కొండల మీద గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనే సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. భక్తులు ఈ ధారలలో స్నానాలుచేసి స్వామిని దర్శించుకుని తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సెలయేరు ఉంది. కల్యాణం తర్వాత స్వామి ఈ ఘట్టంలో స్నానమాచరిస్తాడు.
ఉత్సవాలూ, పండగలూ...
సింహాచలేశునికి ఏడాది పొడవునా ఉత్సవాలూ పండగలూ జరుగుతూనే ఉంటాయి. పెళ్లికొడుకును చేయడం, కల్యాణ మహోత్సవాలు, రథోత్సవం, చందనోత్తరణం, చందనోత్సవం, శయనోత్సవం, గిరిప్రదక్షిణ, కరాళచందనం, పవిత్రోత్సవం, శరన్నవ రాత్రులు, తెప్పోత్సవం, డోలోత్సవం, నరసింహ జయంతి లాంటి ఉత్సవాలను నిర్వహిస్తారు. సింహాచలం కొండ ఏడాది పొడవునా నిత్య కల్యాణాలతో కళకళ్లాడుతూ ఉంటుంది. కొండపైన ఉండే నృసింహ మండపం, దిగువన ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం సత్రంలోనూ వివాహాలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రానికి విశాఖపట్నం వరకూ రైలు, బస్సు, విమాన మార్గాల్లో వెళ్లవచ్చు.
- ఎం.సత్యనారాయణ న్యూస్‌టుడే, సింహాచలం

విజయవాడ కనకదుర్గమ్మ_Vijayawada Kanaka Durgamma


విజయవాడ కనకదుర్గమ్మ 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.

ఇంద్రకీలాద్రి స్థలపురాణం

త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది.
పరిసరాల్లోని ఉపాలయాలు: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.
దర్శన సమయాలు
* వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోగం సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.
* ఆలయంలో చేసే ప్రధాన పూజలు: ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
* ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు.
* మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు.
* రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.
దేవస్థానంలో నిర్వహించే పూజలు: ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు.
అన్నప్రసాద వితరణ: 1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
రవాణా సౌకర్యాలు: విజయవాడ.. రైలు.. రోడ్డు.. విమాన మార్గాల్లో అనుసంధానమై వుంది. కోల్‌కతా- చెన్నై జాతీయరహదారిపై ఉన్న నేపథ్యంలో విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గంలో చేరడం చాలా సులభం. ఆపై ఇక్కడి పండిట్‌ నెహ్రూ సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇంద్రకీలాద్రిపైకి ప్రతి 10 నిమిషాలకో సిటీ/ మెట్రో బస్సు చొప్పున ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు విస్తృతంగా లభిస్తాయి. గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సుదూర ప్రాంతాల వారు సులభంగా విజయవాడ-ఇంద్రకీలాద్రిని చేరవచ్చు.
వసతి సౌకర్యం: ఇంద్రకీలాద్రిపై మేడపాటి గెస్ట్‌హౌస్‌.. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం (ఏసీ.. నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో కేటాయిస్తారు. ఇవి కాకుండా విజయవాడ నగరంలో పలు ప్రభుత్వ.. ప్రైవేటు వసతిగృహాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వసతి గురించి భక్తులు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

దుర్గమ్మ మాయమ్మా...
శ్రీ శక్తి పీఠంగా పేరుగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ గుడి దేశంలోని మహిమాన్విత దుర్గమ్మ ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర కృష్ణానదీ తీరంలో కొలువై ఉన్న ఆ తల్లిని దర్శించినంతనే దుర్గతులన్నీ దూరమవుతాయని నమ్ముతారు భక్తులు.
దుర్గమ్మ పేరులో ‘ద’ కారం దైత్యనాశకం. ‘ఉ’ కారం విఘ్న నాశకం. ‘ర్‌’ కారం రోగ నాశకం. ‘గ’ కారం పాప నాశకం. ‘ఆ’ భయనాశక వాచకం. అందుకే, ఆ అమ్మ నామాన్ని పలికినా స్మరించినా సర్వపాపాలూ నశిస్తాయనేది సాక్షాత్తూ పరమ శివుడు చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.
పూర్వం పర్వత రూపుడైన కీలుడు అనే యక్షుడు దుర్గమ్మ కృప కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చిన అమ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మంది. జగదంబను ఎప్పుడూ తన హృదయ కుహరంలో కొలువుండమని కోరాడు కీలుడు. తర్వాతి కాలంలో దుర్గమాసురుడిని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం కీలాద్రిపై స్వయంభూగా వెలసింది. అప్పుడు ఇంద్రాది దేవతలు శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాచరించి, స్వర్ణమణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారిని శాంతించమని ప్రణమిల్లారు. నాటి నుంచి కీలాద్రి ఇంద్ర కీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించి అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండడంతో కనకదుర్గమ్మగా పేరుగాంచింది.
మల్లేశ్వర సమేత దుర్గమ్మ 
అమ్మవారి ఆలయం పక్కనే పరమేశ్వరుడిని కూడా కొలువుంచాలని భావించిన బ్రహ్మాది దేవతలు శతాశ్వమేధయాగం చేసి శివుడిని మెప్పించారు. వారి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో స్వయంభూగా ఇంద్రకీలాద్రిపై వెలిశాడు. బ్రహ్మాదిదేవతలు పరమేశ్వరుడిని మల్లి, కదంబ పుష్పాలతో పూజించడంతో అప్పట్నుంచి మల్లేశ్వరుడిగా వెలుగొందుతున్నాడు.
తర్వాతి కాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆది శంకరాచార్యులు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేసేందుకు మహోగ్ర శక్తులను శ్రీ చక్రంలో నిక్షిప్తం చేసి, అమ్మవారి పాదాల చెంత స్థాపన చేశారు. అప్పట్నుంచి దుర్గమ్మ శాంతి స్వరూపిణిగా మారి భక్తులకు దర్శనమిస్తోంది. పరమేశ్వరుని జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండడాన్ని గుర్తించిన ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఆలయానికి ఉత్తరభాగంలో పునఃప్రతిష్ఠించారు. అప్పట్నుంచి ఇంద్ర కీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధిచెందింది. ఇంద్రకీలాద్రిపై ఉన్న నవ దుర్గల విగ్రహాలు ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను చేకూరుస్తాయి. కొండమీద ఉన్న అనేక రకాల వృక్షాలను కూడా దేవతా స్వరూపాలుగా కొలుస్తారు.
ఫల్గుణ క్షేత్రం ఇదే 
అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడిని మెప్పించేందుకు ఇంద్రకీలాద్రిపై ఘోర తపస్సు చేశాడు. అతడిని పరీక్షించేందుకు పరమేశ్వరుడు కిరాతుడి రూపంలో వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేశాడు. అనంతరం అతడి భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇవ్వడంతో అర్జునుడు కురుక్షేత్రంలో విజయుడయ్యాడు. అందుకే, ఈ క్షేత్రానికి ఫల్గుణ క్షేత్రం, విజయపురి అనే పేర్లు కూడా వచ్చాయనేది పురాణ కథనం. ఇంద్రకీలాద్రిపై అర్జునుడు తపస్సు చేసినట్టుగా చెబుతున్న స్థలం నేటికీ కనిపిస్తుంది. తాజాగా ఇంద్రకీలాద్రి బృహత్తర ప్రణాళికలో భాగంగా ఇక్కడికీ భక్తులు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం వల్ల విజయవాడ అనే పేరొచ్చిందన్నది మరో ఇతిహాసం.
పంచ ప్రకృతి మహా స్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. ఇక, ఆ అమ్మవారు కృష్ణుడూ పరమేశ్వరుడి అంశలతో ప్రవహించే పవిత్ర కృష్ణవేణీ నది ఒడ్డున వెలసింది కనుక ఈ క్షేత్రాన్ని దర్శించినంతనే కష్టాలు తీరతాయనేది పురాణ ప్రవచనం. ముగ్గురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతోన్న విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకునేందుకు ఏటా రెండు కోట్ల మందికి పైగా భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు. దసరా సమయంలో వైభవంగా నిర్వహించే శరన్నవరాత్రోత్సవాలకు 15లక్షల మంది వరకూ భక్తులు వస్తుంటారు. భవానీ దీక్షల సమయంలోనూ పది లక్షలమంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. నమ్ముకున్న భక్తుల కోర్కెలు తీర్చే ఆశ్రిత మందారవల్లిగా కనక దుర్గమ్మను కొలుస్తారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు, మల్లేశ్వర స్వామి ఆలయాలతో పాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయాలున్నాయి.
అన్న ప్రసాదం... 
1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇక్కడికొచ్చిన భక్తులు భోజనం చెయ్యొచ్చు.

సత్యనారాయణస్వామి_Annavaram Satyanarayana Swamy




కోరిన కోర్కెలు తీర్చే శ్రీసత్యనారాయణుడు

గృహ ప్రవేశమైనా... వివాహమైనా ముందుగా కొలిచేది శ్రీసత్యనారాయణుడినే. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి శ్రీకారం చుట్టేదీ సత్యనారాయణస్వామి వ్రతంతోనే. భక్తుల కొంగు బంగారంగా వెలసిన ఆ భక్తవత్సలుడిని స్మరించుకుంటే మనోభీష్టాలెన్నింటినో నెరవేరుస్తాడు.
సత్యదేవుడిగా... మీసాలరాయుడిగా... రత్నగిరివాసుడిగా... భక్తుల కొంగు బంగారంగా... కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడిగా నిలచిన సత్యనారాయణస్వామిని ‘సత్యనారాయణం దేవం వదేహం కామదం ప్రభుం... లీలయ విపతం విశ్వం ఏనతస్మై నమోనమ:’ అని స్మరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వెలసిన సత్యదేవుడు అనంతలక్ష్మీ సమేత శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామిగా విరాజిల్లుతున్నాడు. రెండంతస్తుల్లో ఉండే ఈ ఆలయంలోని దిగువ అంతస్తులో విఘ్నేశ్వరుడు, సూర్యనారాయణస్వామి, అమ్మవారు, పరమేశ్వరుల మధ్యలో మహాయంత్రంలో దర్శనమిస్తారు. ప్రధానాలయం పై అంతస్తులో ఉంది. ఇక్కడ సత్యనారాయణస్వామికి ఎడమవైపు అనంతలక్ష్మీ అమ్మవారూ, కుడివైపు ఈశ్వరుడూ ఒకేపీఠంపై దర్శనమిస్తారు. ఇలా ఒకే పీఠంపై శివకేశవులూ, అమ్మవారూ కనిపించే ఆలయం ఇదొక్కటే కావడం విశేషం.
సత్యదేవుడు కొలువైన ఈ ప్రాంతం రత్నగిరిగా ప్రసిద్ధిచెందింది. పురాణాల ప్రకారం... శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రత్నకరుడు అనే భక్తుడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే... ‘నిన్ను నా తలపై మోసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ’ అని వేడుకున్నాడట. ‘కలియుగంలో భక్తులను సంరక్షించడానికై త్రిమూర్తుల ఏకస్వరూపంగా, త్రిగుణాత్మకుడైన శ్రీవీరవేంకట సత్యనారాయణ అనే పేరుతో ఆవిర్భవిస్తాను. అప్పుడు నువ్వు రత్నగిరి రూపంలో నీ శిరస్సున నన్ను మోస్తావు’ అని రత్నకరుడికి వరమిచ్చాడట. ఇలాంటిదే మరో కథనమూ ప్రచారంలో ఉంది... తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గర్లో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకట రామనారాయణం ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. ఆ వూళ్లొ ఈరంకి ప్రకాశరావు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఒకరోజు శ్రీమహావిష్ణువు ప్రకాశరావు, రాజావారి కలల్లో ఏకకాలంలో కనిపించి ‘రాబోయే శ్రావణశుక్ల విదియ మఖ నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలయుచున్నాను. నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు’ అని మాయమయ్యాడట. మర్నాడు ఇద్దరూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకుని అన్నవరంలోని రత్నగిరి కొండపైకి చేరుకున్నారు. అక్కడ ఒక పొదలో పాదముద్రలు కనిపించి వాటిపైన సూర్యకిరణాలు పడ్డాయి. వాళ్లు వెంటనే ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. రెండంతస్తుల్లో ఆలయం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. సత్యదేవుని వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. పవిత్ర కార్తికమాసంలో అయితే లక్షల్లో వ్రతాలు జరుగుతాయి.
సీతారాములు క్షేత్రపాలకులు...
సత్యదేవుని క్షేత్రపాలకులుగా సీతారాములను కొలుస్తారు. క్షేత్రరక్షకులుగా వనదుర్గ, కనకదుర్గ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను కూడా భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుంటారు. మెట్లమార్గం ప్రారంభంలో తొలిపావంచాల వద్ద కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంటే కొండపైన శ్రీగోకులం ఉంది. సత్యదేవుని ప్రసాదానికీ ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా మిగతా దేవస్థానాల్లో లడ్డూ, పులిహోరా ప్రసాదంగా అందిస్తారు. అన్నవరంలో మాత్రం గోధుమనూక, నెయ్యి, పంచదార, యాలకులతో ప్రత్యేకంగా ప్రసాదాన్ని తయారుచేస్తారు.
ఎన్నెన్నో ఉత్సవాలు...
ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యదేవుని కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు వారం రోజులపాటు ఘనంగా జరుగుతాయి. శ్రావణశుద్ద విదియరోజు శ్రీస్వామివారు ఆవిర్భవించడంతో ఏటా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలూ, ఇతర కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఏటా కార్తికశుద్ధ ద్వాదశి రోజున తెప్ప మహోత్సవం జరుగుతుంది. కార్తికపౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ జరుగుతుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ రైలూ, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. - పి.వెంకటరాజు, న్యూస్‌టుడే, అన్నవరం

++++++++++++++++++++++++++++++++


త్రిగుణాత్మకుడు.. 
అన్నవరం సత్యదేవుడు

ప్రారంభంలో బ్రహ్మస్వరూపము, మధ్య భాగంలో మహేశ్వరస్వరూపము చివరకు అంటే పైన విష్ణురూపము ఒక స్తంభంలో ఉన్నవన్న ట్టుగా ఇక్కడ వీర వేంకట సత్యనారాయణ స్వామి త్రిగుణాత్మక రూపంలో రత్నాకరుని కోరిక తీర్చడానికిగాను అన్నవరం లోని అంకుడు చెట్టు మొదట్లోని పుట్టలో వెలిశాడు. ఇలా స్వయంభూగా, అర్చామూర్తిగా రావడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
స్థలపురాణం:
మేరు పర్వతానికి ఇద్దరు కుమారులు. వారే భద్రుడు, రత్నాకరుడు. భద్రుడు మహావిష్ణువును మెప్పించి భద్రాది రామునికి కొలువైన భద్రాచలంగా మారినప్పటి నుంచి రత్నాకరునిలోను తాను కూడా మహావిష్ణువుపాదం మోయాలన్న బుద్ధి పుట్టింది. అది రామావతారసమయం. రాముని దగ్గరకు వెళ్లి ‘అయ్యా! శ్రీరామచంద్రా నీవు మా అన్న భద్రునికి కోరిక తీర్చడానికి అనుకూలంగా ఉన్నావని తెలుసుకొన్నాను. మరి నాకోరిక తీరే మార్గం నాకు చూపించవా? నాకోరికలను తీర్చే భారం కూడా నీదే సుమా. ఇహం పరం బెరుగ నేను. అన్నింటికి కారణాకారుడవైన నీవే నా కోరిక తీరే తరుణోపాయం చెప్పాలి’అని వేయివిధాలుగా ప్రార్థించాడు.
పరంధాముడైన రాముడు చిరునవ్వుతో ‘నాయనా రత్నాకరా నీకోరిక బాగుంది. కాని నేను ఈ త్రేతాయుగంలో కేవలం దశరథ పుత్రుడిని మాత్రమే.నేనిప్పుడు నీకోరికను తీర్చలేను.’ అన్నాడు. దానికి రత్నాకరుడు ఎంతో నొచ్చుకొని స్వామి మీకెప్పుడు నాకోరిక తీర్చాలని నాపై అనుగ్రహం చూపాలని అనిపిస్తుందో అంతదాకా నేను వేచి ఉంటాను. మీరు సంకల్పించినపుడుమాత్రం ఈ అల్పుని కోరికను కాదనకండి. మీరే నాకు దిక్కు. సర్వావస్థల యందు నేను మీకు శరణువేడే వాడిని. మీరు నాకోరిక తీర్చేదాకా నేను మిమ్మేస్మరిస్తూ ఉండే బుద్ధిని నాకు ప్రసాదించండి’ అని వేడుకున్నాడట. దాంతో రాముడు ‘తథాస్తు! ఆ పరమాత్మ ఏది ఏపుడు ఎందుకు సంకల్పిస్తాడో మానవ మాత్రులమైన మనం తెలుసుకోవడం కష్టం. కనుక నీకోరిక తీరాలని నీవు యథాశక్తి దైవాన్ని ప్రార్థించు ’ అన్నాడట. అలా చెప్పడమే మహద్భాగ్యం అనుకొన్న రత్నాకరుడు మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు.అట్లా తపస్సు చేసుకొంటున్న రత్నాకరుని దగ్గరకు మహావిష్ణు వచ్చి వచ్చి ‘నాయనా! నీకోరిక తీరు కాలం వచ్చింది. నేను ఈ అంకుడుచెట్టు మొదట్లో ఉన్న ఈ పుట్టలో వెలుస్తాను. ఇక్కడే నాకు ఆలయం నిర్మించమని ఇక్కడి వారినిప్రేరేపిస్తాను. ఇక నీవు కోరుకున్నట్లుగానే నీవు తపస్సు ఆచరించిన ఈ స్థలంలోనే సత్యదేవునిగా నేనుకొలువు అవుతాను ’ అని చెప్పాడట. కొంతకాలానికి స్వామి చెప్పినట్లుగానే ఓ పుట్టలో స్వయంభూగా వెలిశాడు. ఆ సజ్జనులకు నెలవైన ఆ క్షేత్రంలోనే ఈరంకి సూర్య ప్రకాశం అన్న పేరుగల సజ్జనుడు ప్రతిరోజు అన్నదాన సేవ చేస్తుండేవాడు. కిర్లంపూడి సంస్థానాధీశుడైన రాజా ఇనుగంటి రామనారాయణం బహద్దూర్ తన ఏలుబడిలో అన్నవరంలో ప్రజలందరికీ ఏ కష్టాలు రాకుండా చూడాలని నిత్యం ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిస్తుండేవాడు.
ఒకనాడు మహావిష్ణువు సూర్యప్రకాశం అనే నిత్యాన్నదాన వేత్త అయిన సూర్య ప్రకాశానికి కలలో కనబడ్డాడు. ‘నాయనా! నీవు చేసే నిత్యాన్నదాన సేవకు నేను సంతృప్తి పడ్డాను. అందుకే నీవు నీతో పాటు ఉన్నవారు నన్ను సేవించుకోవడానికి వీలుగా నేను అంకుడు చెట్టు మొదట్లో ఆర్చామూర్తిగా ఉన్నాను. నన్ను వెలికి తీసి నిత్యాధూపదీపారాధనలు చేయండి అని చెప్పాడు. దిగ్గున లేచిన సూర్య ప్రకాశానికి తాను స్వయంగా భగవంతుడిని చూచానన్న సంతోషం ఇబ్బడి ముబ్బడి అయింది. శరీరమంతా రోమాచితం అయింది. కన్నుల్లో నీరు ఉబికి వస్తున్నాయి. ఇంత మంచి శుభవార్తను వెంటనే రాజుగారి చెవిలో వేయాలని సంస్థానాధీశుని దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా పులకాంకిత శరీరంతో ఆశ్రువులు కారుతుండగా రాజాఇనుగంటి వేంకట రామనారాయణం తన వద్ద వున్న మిత్రగణంతో తాను స్వయంగా స్వప్నంలో భగవంతుడిని చూచానని, ఆ దైవం అంకుడుచెట్టు మొదట్లో ఉన్నానని తన్ను వెలికి తీసి పూజించమని చెప్పినట్లుగా చెబుతుండడం చూచి మరింత సంతోషంతో తనకు వచ్చిన కలను కూడా సూర్యప్రకాశం వారికి వివరించాడు.
ఆహా ఆ శ్రీమన్నారాయణుని లీల తెలుసుకొనరానిది. త్రిగుణాతీతుడైన స్వామి మనలను ఇలా కరుణించాడు కనుక వెంటనే మనం ఆ పుట్ట దగ్గరకు వెళ్దాం అని అనుకొని ఊరి వారంతా కలసి వెళ్లారు. అక్కడ ఆ చెట్టు మొదట్లో ఉన్న పుట్టను తవ్వారు. దేదీప్యమానంగా వెలుగుతున్న సత్యదేవుని విగ్రహం వారికి కనబడింది. జయఘోషతో స్వామిని వారంతా కీర్తించారు. అందరూ కలసి స్వామిని బయటకు తీసి అభిషేకాదులు నిర్వర్తించారు. ఆ తరువాత చిన్న తాటాకు పందిరి వేసి ఆ స్వామి వారికి నీడ కల్పించారు. అందరూ స్వామిని వీర వేంకట సత్యనారాయణుడుగా అభివర్ణించారు. కొన్నాళ్ల తరువాత ఆ సంస్థానాధీశుడు మహాపండితులను రావించాడు. ఆగమశాస్తవ్రేత్తలు పిలిపించాడు. వారందరి సలహాను తీసుకొని అన్నవరం లో రత్నాచలం మీద సత్యదేవుని కోవెలను రథాకృతిలో ఉండేట్లుగా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీర వేంకట సత్యదేవుని కొలువు తీరడానికి వాస్తు ప్రకారం ఆలయ నిర్మాణంతో ప్రారంభించారు. ఈ దేవాలయం రెండు అంతస్థులతో ఉంటుంది. మొదటి అంతస్థు యంత్రాలయంగాను, రెండవ అంతస్థులో స్వామి దివ్యమంగళ స్వరూపం కనబడుతుంది. మధ్య ప్రదేశం పానవట్టంగా కనబడడం ఇక్కడి విశేషం. ఈ యంత్రనిర్మాణంలో వృత్తాకారంలో ఉన్న శిలాయంత్రంలో మొదటి భాగం బ్రహ్మస్వరూపంగాను, రెండవ భాగం లింగాకార స్తంభం శివస్వరూపంగాను, ఇక ఊర్థ్వమండలిలో కనిపించే విగ్రహం నారాయణ స్వరూపంగా దర్శన మివ్వడం అంటే నిస్సంగుడు, నిర్వికారుడు, నిరామయడు, నిరాకారుడు , గుణాతీతుడు అయిన దైవం ఇక్కడ త్రిగుణాత్మకుడుగా దర్శనం ఇస్తున్నాడని దీని అంతరార్థంగా పండితులు చెప్తారు. తనను కొలిచిన వారిని ఇంద్రియాలను జయించే శక్తినిస్తాడని వారిని సాత్విక గుణ సంపన్నులుగా తీర్చి దిద్దుతాడని ఇక్కడి నివాసితులు చెప్తారు. ఈ అన్నవరానికి దగ్గరలో పంపానది ప్రవహిస్తూ ఉంటుంది.ఈ సత్యదేవుని గుడిలో అమ్మవారు అనంతలక్ష్మీ నామధేయంతో అన్నార్తులను, దీనులను, ఆపన్నులను సంరక్షిస్తూ ఉంది.
ఇక్కడకు వచ్చే భక్తజనంలో సత్యధర్మాచరణ చేసేవారికి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి అంత ఎల్లవేళలా ఉంటుంది. సత్యధారణ చేసేవారంతా సత్యదేవుని మారురూపాలని సత్యదేవుని దగ్గర అసత్యులు, అధర్మాచరణులైన వారికి నిలువ నీడ ఉండదని అటువంటి వారిని నిముషాల్లోనే స్వామి శిక్షిస్తాడని సత్యదేవుని భక్తుల నమ్మకం. సత్యదేవుని దర్శించడానికి రైల్వే వారు కూడా రత్నాచల్ అనే రైలుసదుపాయాన్ని కల్పించారు. ఈ రత్నాచల్‌లో ఎక్కిన వారు అన్నవరంలోనే దిగే సౌకర్యం ఉంది. ఇక అక్కడ నుంచి తనపై పాదం మోపాలని తనపైనే స్థిర నివాసమేర్పరుచుకోవాలని కోరిన రత్నాచలుడు రత్నగిరి గా మారిన కొండపైకి చేరుకోవాలి. ఈ కొండపైన కోరి కొలువున్న వీర వేంకట సత్యదేవుని దర్శనం చేస్తే ఇహపరాల్లో సుఖసంపదలకు కొదువ ఉండదనే కీర్తిని పొందాడీ వీరవేంకట సత్యనారాయణ స్వామి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని శంఖవరం మండల పరిధిలోని అన్నవరం రాజమండ్రికి సుమారు 70 కి.మీ దూరంలోను, కాకినాడకు సుమారు 45 కి.మీల దూరంలోను నెలకొని ఉంది. శివకేశవుల అభిన్నత్వానికి మారుపేరుగా నెలకొన్న ఈ వీర వేంకట సత్యనారాయణ స్వామి క్షేత్రంలో ప్రతి విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అమ్మవారికి, స్వామికి నిర్వహిస్తారు. శ్రావణ శుద్ద విదియ నాడు స్వామి వారి జయంతిని, వైశాఖ శుద్ధ దశమినాడు కల్యాణోత్సవాలను జరుపుతారు. తెప్పోత్సవాలు, జ్వాలా తోరణాలు, కుంకుమార్చనలు, వివిధ పుష్పార్చనలు తులసీ అర్చనలు విశేషవేళలలో కనువిందుగా జరుగుతాయి. ఈ స్వామిని దర్శించడానికి వారి వారి పాపరాశులను దగ్ధం చేసుకోవడానికి ఎక్కడెక్కడనుంచో భక్తులు నిత్యమూ తండోపతండాలుగా ఈ క్షేత్రానికి వస్తుంటారు.       - శ్యామసుందరి శ్రీనివాసులు


ఖాద్రి నృసింహుడు..!_Kadhri Narasimhudu

భక్తవత్సలుడు... ఖాద్రి నృసింహుడు..!


లోకకళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో ఉగ్రనారసింహావతారం అత్యంత ప్రధానమైనది. ప్రహ్లాదుని మొర ఆలకించి హిరణ్యకశ్యపుని సంహారార్థం రౌద్రరూపంలో స్తంభంలోంచి ఆవిర్భవించిన ఆ నారసింహునికి దేశవ్యాప్తంగా తొమ్మిది సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఆ నవ నారసింహాలయాల్లో ఒకటి ఖాద్రి నృసింహక్షేత్రం.
‘‘ఇందుగలడందులేడని సందేహంవలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందేగలడు....’’ అన్న భక్తప్రహ్లాదుని పలుకులను నిజంచేస్తూ హిరణ్యకశ్యప సంహారార్థమై మహోగ్రరూపంతో వెలసిన ఉగ్రనరసింహుడు, ప్రశాంత వదనంతో ప్రహ్లాదసమేతంగా కొలువుదీరిన క్షేత్రమే కదిరి లేదా ఖాద్రి. అనంతపురంజిల్లా కదిరిలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి భక్తుల కోర్కెలు తీర్చే భక్తనారసింహునిగా పూజలందుకుంటున్నాడు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్యుల నుంచి విజయనగర చక్రవర్తులవరకూ వివిధ దశల్లో అభివృద్ధిచేశారు. దేశంలోకెల్లాఅత్యంత పెద్ద రథాలున్న ఆలయాల్లో ఇది మూడోది.
స్థల పురాణం!
పూర్వం కదిరి పట్టణానికి సమీపంలో పాత రేపల్లె పట్టణం(పట్నం) అనే సామంతరాజ్యం ఉండేది. దీని పాలేగారైన రంగనాయకునికి నృసింహస్వామి స్వప్నంలో కనిపించి వల్మీకం(పుట్ట)లో ఉన్న తన అర్చాబింబాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించాలని కోరాడట. ఆయన ఆదేశం మేరకు రంగనాయకుడు ప్రతిష్ఠించటంతోబాటు గర్భాలయాన్ని నిర్మించాడట. అభిషేకంచేశాక మూలవిరాట్టు విగ్రహం నుంచి స్వేదబిందువులు ఉద్భవిస్తాయనీ, స్వామివారు స్వయంగా కొలువై ఉన్నాడనేందుకు ఇదే నిదర్శనమనీ చెబుతారు భక్తులు.
కాటమరాయుడు!
శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని వసంత వల్లభుడు, కాటమరాయుడు, కంబాలరాయుడు...ఇలా పలుపేర్లతో కొలుస్తారు. కదిరి ప్రాంతంలోని గొడ్డువెలగల గ్రామ సమీపంలో ఉన్న కొండపై సభామండపం ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఇది హిరణ్యకశ్యప కాలంనాటిదేననీ అందులోని స్తంభంనుంచే స్వామి ఉద్భవించాడని విశ్వసిస్తారు. స్తంభం నుంచి ఆవిర్భవించడంవల్లే స్వామివారిని జానపదులు కంబాలరాయుడు, కాటమరాయుడు అంటారు.
రాక్షససంహారానంతరం ప్రహ్లాదుని స్తోత్రానికి ప్రసన్నుడై కదిరికి తూర్పున ఉన్న పర్వతంపై దర్శనమివ్వటంతో ఈ ప్రాంతానికి ఖాద్రి అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఖాద్రి పేరులో ‘ఖా’ అంటే విష్ణుపాదం, ‘అద్రి’ అంటే పర్వతం. విష్ణుపాదం మోపిన ప్రాంతం కావటంతో ఈ ప్రాంతానికి ఖాద్రి, కదిరి అని పేరు వచ్చింది. అదే కదిరిగా మారింది. మద్దిలేరుగా పిలవబడుతోన్న నదిని పూర్వం అర్జుననదిగా పిలిచేవారని బ్రహ్మాండపురాణం చెబుతోంది. శ్రీదేవి, భూదేవిసమేతంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఆలయానికి పడమటివైపున ఉన్న పవిత్ర భృగుతీర్థంలో వసంతరుతువులో లభ్యమవడంవల్లే వసంతవల్లభులు అనీ అంటారు.
చారిత్రక నేపథ్యం..!
క్రీ.శ 985-1076 సంవత్సరాల మధ్య కదిరి ప్రాంతంలోని దట్టమైన వేదారణ్యం పశ్చిమ చాళుక్యుల పాలనలో ఉండేది. ఆ సమయంలో దక్షిణ దిగ్విజయయాత్రలో భాగంగా అర్జున నదీతీరాన చాళుక్యులు తమ కులదేవత దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం చెపుతోంది. దీనికి దక్షిణభాగాన వెలసిన శ్రీనారసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దుర్గాదేవి అమ్మవారినీ కొలిచేవారు. అనంతరం దుర్గాదేవి విగ్రహం స్థానంలో అమృతవల్లి అమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆల యాన్ని క్రీ.శ. 1274లో వీరబుక్కరాయల హయాంలో నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది.
సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నలువైపులా నాలుగు గోపురాలతో అలరారే ఈ ఆలయంలో స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి రథోత్సవం కన్నులపండువగా జరుగుతుంది. 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు పీఠం, 256 శిల్పకళాకృతులతో అందంగా తీర్చిదిద్దిన ఈ రథాన్ని బ్రహ్మోత్సవ సమయంలో భక్తులే లాగటం విశేషం. తమిళనాడులోని ఆండాళ్‌ అమ్మవారి శ్రీవల్లిపుత్తూరు రథం, తంజావూరుజిల్లాలోని తిరువార్‌ రథాల తరవాతి స్థానం ఖాద్రి నృసింహునిదే. అనంతపురంకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిరికి బస్సు, రైలుమార్గాలు ఉన్నాయి.
- జి.సుధాకర్‌నాయుడు, న్యూస్‌టుడే, కదిరి

mohan publications price list