MohanPublications Print Books Online store clik Here Devullu.com

నాగులచవితి_NagulaChavithi






 నాగులచవితి_NagulaChavithi















నాగులచవితి



భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా- సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి.

కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.

నాగదేవతను పూజించే సత్సంప్రదాయం జపాన్‌, చైనా, గ్రీకు దేశాలకు సైతం వ్యాపించింది. పుట్టకు పూజ చేసే పండుగ- నాగుల చవితి. ఇందులో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు. తెల్లవారుజామునే తలంటి స్నానం, శుభ్ర వస్త్రధారణ, పూజ సామగ్రితో సమీపంలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పూజించడం ఈ పర్వదిన కార్యక్రమం. దీపావళినాడు కాల్చగా మిగిలిన టపాసుల్ని నాగుల చవితినాడు వెలిగించి పిల్లలు సంబరపడతారు.

దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.


వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తిక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.

పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! 

పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. 

‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. 

పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ! - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు











నాగపంచమి 

శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు శయనించేది ఆదిశేషువుపైన అన్న విషయం తెలిసిందే. యావత్‌ భారాన్ని మోస్తున్న ఆదిశేషువును ఏదైన వరం కోరుకోమంటాడు విష్ణుమూర్తి. ప్రతి మాసం శుక్ల పంచమి నాడు లేదా ప్రతి ఏడాది శ్రావణ శుక్ల, మార్గశిర పంచమి నాడు నాగులను మానవులు పూజించాలని ఆదిశేషువు కోరుకున్నాడు. దీంతో ఆ వరాన్ని విష్ణుమూర్తి ఇవ్వడంతో శ్రావణశుక్ల పంచమి పర్వదినాన్ని నాగపంచమిగా జరుపుకొంటూ నాగులకు పూజలు చేయడం సంప్రదాయంగా మారింది.
కశ్యపప్రజాపతి సతీమణుల్లోని వినత, కద్రువలు అక్కాచెల్లెళ్లు. ఒక రోజు దూరంగా వున్న ఒక తెల్లటి అశ్వాన్ని చూసిన కద్రువ దాని తోక నల్లగా వుందని చెప్పింది. అయితే వినత దాని తోక తెల్లగానే వుందని పేర్కొంది. దీంతో వారు పందెం వేసుకున్నారు. ఎవరైతే పందెంలో ఓడిపోతే గెలిచిన వారి దగ్గర దాసిగా పనిచేయాలని పందెం పెట్టుకున్నారు. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వద్దామని వెళ్లిపోయారు. ఆ రాత్రి కద్రువ తన సర్పకుమారులందరిని పిలిచి ఎవరైనా అశ్వం తోకకు చుట్టుకోవాలని కోరింది. అయితే నాగులు అలా పాపం చేయడం తగదని హితవు పలికాయి. దీంతో కోపించిన ఆమె భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాగులు పడి జాతి అంతమవుతుందని శాపం పెడుతుంది. దీంతో భీతిల్లిన కుమారుల్లో ఒకరైన కర్కోటకుడు అశ్వం తోకను చుట్టుకుంటాడు. అనంతరం అశ్వాన్ని చూసిన వినత తాను ఓడిపోయినట్టు గ్రహించి దాసిగా వుండిపోయింది. ఆమె కుమారుడైన గరుత్మంతుడు తల్లికి శాపవిముక్తి కలిగించాడు.
తరువాత ద్వాపర యుగంలో పరిక్షిత్తు మహారాజును తక్షకుడు కాటు వేయడంతో మరణిస్తాడు. తండ్రి మరణానికి నాగులే కారణమన్న ఆగ్రహంతో జనమజేయుడు సర్పయాగం నిర్వహిస్తాడు. ఈ యాగంలో లక్షలాది సర్పాలు పడి మృతిచెందాయి. వాసుకి సోదరి మాతా మానసదేవి తన కుమారుడైన అస్తీకున్ని యాగప్రదేశానికి పంపడంతో అతను యాగాన్ని నిలిపివేయమని జనమేజయుడిని ప్రార్థిస్తాడు. దీంతో యాగం నిలిచిపోతుంది. శ్రావణ శుక్ల పంచమి నాడు నాగజాతిని సంరక్షించిన దినం కావడంతో ఆ రోజును నాగపంచమిగా జరుపుకొంటారు. ఆ రోజున సమీపంలోని పుట్టలకు వెళ్లి పాలు పోసి పూజలు నిర్వహిస్తారు.
అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గరుత్మంతునికి, నాగులకు మధ్య వున్న ఘర్షణను నివారించేందుకు విష్ణుమూర్తి ఇరువర్గాల మధ్య సంధి కుదర్చుతాడు. ఈ ఒప్పందం శ్రావణమాసం శుక్లపంచమినాడు జరిగింది. అందుకే గరుడ పంచమి అని కూడా వ్యవహరిస్తారు.





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list