MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆషాఢమాసంలో ఔషధాల గోరింటాకు, Mehandhi | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu



ఆషాఢమాసంలో ఔషధాల గోరింటాకు, 

Mehandhi
     ఆషాఢమాసంలో అతివల అరచేతిలకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే ఐదోతనమని ముత్తైదువుల నమ్మకం. కొత్తగా పెళ్ళయిన యువతులు ఈనెలలో గోరింటాకు పెట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శుభసూచకమని వివాహాలు, వివిధ శుభకార్యాలయాలకు అరచేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటారు. పాదాలకు పారాణీ, అరచేతులకు అలంకరణగా గోరింటాకు సుపరిచితమే. తొలకరి ఆరంభం ఆషాఢమాసం కావడంతో గోరింటాకు చిగురిస్తుంది. లేతగోరింటాకు కోసి మెత్తగా రుబ్బి పెట్టుకుంటే బాగా పండుతుంది. పెళ్ళికాని అమ్మాయిలకు ఎర్రగా పండితే మంచిమొగుడొస్తాడని నానుడు. ఈ గోరింటాకు ఎర్రగా పండి శరీర ఛాయల నుంచి కళ్ళకు ఇంపుగా కనిపిస్తాయి. ఆషాఢమాసంలో దొరికే గోరింటాకు లేలేతగా ఉండి శరీరంలో రసం త్వరగా ఇంకి చేతులు, కాళ్ళు ఎర్రగా పండుతాయి.

ఔషధాల గోరింటాకు
గోరింటాకులో సౌందర్య సాధనంగానే కాక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. కాళ్ళు, చేతులు అధికంగా నీటిలో నానడం వల్ల పుండ్లు పడుతుంటాయి. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. ఆయుర్వేదంలో గోరింటాకును చర్మరోగాలకు, కాలేయ రోగాలకు, నోటిపూతకు, గనేరియా వంటి రోగాలకు వాడతారు. కీళ్ళనొప్పులు, వాపు ఉన్నవారు గోరింటాకు నూనె పైపూతగా వాడితే మంచిగుణం కనబడుతుంది.

గోరింట చెట్టు ఆకును రుబ్బి దానిని కాలిగోళ్లు, చేతిగోళ్ల చుట్టూ పెట్టుకొని రెండు, మూడు గంటలు నాని ఆరిన తరువాత తీసివేస్తే అది ఎర్రగా పండుతుంది. ఆ విధంగా ఆ ఆకును గోళ్లకు పెట్టుకోవడం వల్ల ఆకురసం గోళ్లు పుచ్చి పోకుండా, పాడై పోకుండా, గోళ్లకు, వేళ్లకు ఏ విధమైన అంటు వ్యాధులు సోకుండా రక్షిస్తుంది. (గోర్ల అంతట) గోర్ల చుట్టూ పెట్టుకునే ఆకు కాబట్టి దానిని గోరంటాకు, గోరింటాకు అన్నారు. అందుకే మన జీవన విధానంలో దానిని ఒక ఆచారంగా సంప్రదాయంగా ప్రవేశపెట్టి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేశారు. ఈ పద్ధతి కూడా ప్రకృతి కనుగుణంగా వాతావరణ పరిస్థితుల కనుగుణంగా ప్రవేశపెట్టడంలోనే హిందువుల వైజ్ఞానిక దృక్పథం తేట తెలమౌతుంది.

శ్రావణ భాద్రపద మాసాలు వర్షబుుతువులు వర్షాలు బాగా కురవడం వల్ల స్త్రీలు తమ తమ పనులన్నిటినీ ఆ నీళ్లల్లో నానుతూ చేసుకోవలసి వస్తుంది. అంతేగాక నిత్యమూ ఇంటి పనులు, వంట పనులు, పాత్రలు తోమడం, బట్టలుతకడం, ఇల్లలకడం వంటి పనులన్నీ నీళ్లలోనే చేసుకుంటూ ఉండడం వల్ల కాలిగోళ్లు, చేతిగోళ్లు పుచ్చిపోయి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వాటి నుండి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా గోరింటాకు పెట్టుకునే ఆచారం ప్రవేశపెట్టారు. వర్ష బుుతువుకు ముందు వచ్చే ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటే గోళ్లు పుచ్చిపోయి పిప్పిగోళ్లు అయ్యే ప్రమాద ముండదు.

తరువాత భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ల తద్ది పండుగ-ఆశ్వీయుజ బహుళ తదియ అట్లతద్ది పండుగ. ఈ పండుగ రోజులలో తప్పనిసరిగా ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పాటు చేశారు. ఒకసారి వర్ష బుుతువు ముందు, మరోసారి వర్షబుుతువు మధ్యలో ఇంకోసారి వర్ష బుుతువు అనంతరం ఇలా మూడు పర్యాయాలు ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యకరమని చెప్పారు. హిందువుల ఆచారాలు ఎంత వైజ్ఞానికంగా ఆరోగ్య ప్రధంగా ఉన్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మూడు పర్యాయాలే పెట్టుకోవాలనే నియమం లేదు. అవకాశం ఉన్నప్పుడు అవసరం అయినప్పుడు దీనిని పెట్టుకుంటూ ఉండవచ్చు.

క్రిముల బారి నుండి గోళ్లను రక్షించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమైనప్పటికీ ఎర్రగా పండి అత్యంత ఆకర్షణీయంగా అందంగా ఉండడం వల్ల కూడ ఒక సౌందర్య సాధనంగా కనిపిస్తుంది.

తెల్లని జుట్టును కూడా నల్లబరిచే ఔషదగుణం గోరిం టాకులో ఉన్నదని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. గోరింటాకు పొడిని నూనెలో కలిసి వడకట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్లజుట్టు కూడా నల్లబడుతుంది. కళ్ల మంటలు తగ్గుతాయి. ఒక టీ స్పూను గోరింటాకు పొడిని నిమ్మరసంతో కలిపి ప్రతి రోజూ త్రాగితే రక్తం శుభ్రపడి చర్మంలో మెరుగు వస్తుంది. కాళ్ల పగుళ్లను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కృత్రిమ గోరిటాకు పొడిని వాడటం కంటే సహజమైన గోరింటాకును వాడటం ఎంతైనా మేలు.

ఈనాడు'' పెళ్లిళ్లలో పండుగల్లో అన్నిటా ఈ గోరింటాకు చిత్ర విచిత్ర రూపాల్లో అలంకరించుకుంటున్నారు. ఇలా అలంకరించడం ఒక వృత్తిగా కూడా మారింది. ఈనాడు బ్యూటిపార్లల్లో మనం కోరిన విధంగా రకరకాల డిజైన్లలో గోరింటాకును డిజైను చేస్తున్నారు.

అది సహజమైన చెట్ల నుండి తీసిన పొడిగా మనం చూసుకోవాలి. కృత్రిమంగా రసాయన పదార్థాలతో తయారు చేసిన గోరింటాకు అది అంత మంచిది కాదేమో నని ఆలోచించుకోవాలి. ఎప్పటికైనా గోరింటాకు గోరింటాకే మరి. మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.


అందం... చందం... ఆషాఢమాసం


     

ఆషాఢం అనగానే శూన్యమాసమనీ, శుభకార్యాలకు పనికిరాదనీ పెదవి విరుస్తుంటారు చాలామంది. ఆషాఢమనేది కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల పాలిట విలన్ లాంటిదని పళ్లు కొరుక్కుంటారు ఇంకొంతమంది. నిజానికి ఆషాఢమాసం తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించే మాసం. విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు శాకంబరిదేవిగా అలంకరించి మురిసిపోతారు. జగానికే నాథుడైన పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగేది ఈ నెలలోనే. అని తల్లీతండ్రీ తర్వాత స్థానంలో ఉన్న గురువులను పూజించి, గౌరవించే గురుపౌర్ణమి వేడుకలు జరిగేది ఆషాఢంలోనే కదా!

ఆడపడచులందరూ గోరింటాకుతో ఎర్రగా మిరప్పళ్లలా పండిన చేతులతో కనిపించేది, ఈ కాలంలో విరివిగా వచ్చే వాక్కాయలతో పప్పు, మునగకాడలతో ఘుమఘుమలాడే చారో పులుసో కాచుకునేది, పొట్లకాయ కూర, పెరుగుపచ్చడి చేసుకునేది ఆషాఢంలోనే!

కొత్తగా పెళ్లయ్యి, పుట్టింటి మీద బెంగను అత్తమామలకి చెప్పుకోలేక తనలో తనే సతమతమవుతూన్న కొత్తకోడలి పాలిట ఆపద్భాంధవి ఆషాఢం కాదా! అత్తగారు, మామగారు, ఆడపడచులు, మరుదులను అర్థం చేసుకుంటూ, వాళ్లకి కావలసినవి వేళకు ఎలా అమర్చగలమా అని ఆందోళన పడే వేళ నేనున్నానంటూ వచ్చి, కళ్లు తుడిచేది ఆషాఢమే కదా!

మొన్న మొన్ననే పెళ్లయ్యింది.. భార్యతో ఇంకా అచ్చటాముచ్చటా తీరనేలేదు... ఇంతలోనే నా పాలిటి విలన్‌లా దాపురించింది ఆషాఢం అని తిట్టుకునే రోజులా ఇవి! ఎప్పుడో పోయాయి. ఆషాఢంలో అత్తాకోడలూ, అత్తా అల్లుడూ నే కదా, ఒక గడప దాటకూడనిది, మొగుడూ పెళ్లాల విషయంలో ఆ రూలేమీ లేదు కదా అని ఎట్లాగో అట్లా నానా తంటాలు పడుతూ వెళ్లి, భార్యను ఆమె బాబాయి ఇంటికో, పిన్నిగారింటికో రప్పించుకుంటే సరి, అక్కడ కూడా మర్యాదలన్నీ అందుకోవచ్చుకదా! అని ఆలోచించని వాళ్లు, దానిని వెంటనే అమలు చెయ్యని వాళ్లు చాలా అరుదు.

అసలు ఆషాఢంలో కలుసుకోకూడనిదే భార్యాభర్తలు. ఎందుకంటే ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల గర్భోత్పత్తి జరిగి, ఎండాకాలంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అప్పుడే భూమిమీదికొచ్చిన చిన్నారులు ఆ ఎండలను తట్టుకోలేక నానా ఇబ్బందులూ పడతారు. వాళ్ల బాధలు చూడలేక మళ్లీ మనం బాధపడాలి. అదొక్కటేనా? వ్యవసాయ పనులు ఆరంభమయ్యేది తొలకరి జల్లులు కురిసే ఆషాఢంలోనే. అంతకాలం ఎండవేడిమికి భూమిలోపలి పొరల్లో దాగి ఉన్న క్రిమికీటకాలు వర్షాలకు బయటికొచ్చి, వీరవిహారం చేస్తాయి. ఈగలూ దోమలూ ముసిరి, రకరకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు. కొత్తగా పెళ్లయినవాళ్లేమో, భార్య ఇంటిదగ్గర ఉండి, ఆమె మీదకు ధ్యాస మళ్లుతూ ఉంటుంది. దానిమూలంగా వ్యవసాయ పనులు దెబ్బతింటాయి. రైతులకు ఇంత అన్నం పెట్టేది, ఆధారభూతమయ్యేదీ వ్యవసాయపనులే కదా, అందువల్లే పెద్దవాళ్లు నవ వధూవరుల మధ్యలో ఆషాఢాన్ని అడ్డం పెట్టారు. ఇన్ని విషయాలున్నాయన్నమాట ఆషాఢంలో అత్తాకోడలూ ఒక ఇంటి గడప దాటకూడదనడం వెనక!


ఇక ఆషాఢం వచ్చింది మొదలు- గోరింటాకు పెట్టుకోకూడదటే ఆ చేతులకూ అని బామ్మలు, అమ్మమ్మలు సణుగుడు మొదలెడతారు. వాళ్ల సణుగుడు తట్టుకోలేక కన్నెపిల్లలు ఎవరి దొడ్లోనో ఉన్న గోరింట చెట్టునుంచి ఇంత ఆకు దూసుకొచ్చి, అందులో ఇంత చింతపండు ముద్ద వేసి, మధ్యమధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ నూరడం మొదలెడతారు. మెదిగిందా లేదా అని రోట్లోకి ఆకును తోసేటప్పుడే చిలకముక్కుల్లా ఎర్రగా పండిన అమ్మ చేతులని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. కొత్తగా పెళ్లయి, పుట్టింటికి వచ్చిన నవ వధువులు కూడా ఆషాఢంలో చేతులనిండా గోరింటాకు పెట్టుకుని, తిరిగి అత్తారింటికి వెళ్లాక అమ్మ లేదా చెల్లి పెట్టిన గోరింటాకు చేతులను చూసుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపించి మురిసిపోతారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనక శాస్త్రీయ కారణాలేమిటంటే, గోరింట వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్టు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు మందారంలా పండితే మంచిమొగుడొస్తాడని, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడని పెద్దలు చెబుతారు. అదే వివాహితలకు అయితే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు చెబుతారు. ఇవన్నీ ఒకప్పటి తీపి జ్ఞాపకాలు.

ఇప్పుడయితే ఆషాఢం వచ్చిందంటే బంపర్ సేల్సు, డిస్కౌంట్ సేల్సు, ఆఫర్ల మీద ఆఫర్లు, కేజీల్లెక్కన చీరలమ్ముతారు... క్రెడిట్ కార్డుకు చిల్లులు పొడుస్తారు. సెల్‌ఫోన్లు కూడా ఒకటి కొంటే మూడు ఉచితం అని ఊరించడం, కొన్న తర్వాత ఫ్రీ పీసులకు మా పూచీ లేదని ముందే చెప్పాం కదండీ అని గిల్లుతూనే కావాలంటే, మరో పీసొచ్చింది చూడండి, ఎక్స్ఛేంజ్ చేసుకుని చూడండి అని ఊరడింపులు... ఇవి చూస్తుంటే ఆషాఢమంటేనే ఒకలాంటి బెంగ. డిస్కౌంట్ అంటేనే దిగులు..! - బాచి


టాగ్లు: ఆషాఢం, శుభకార్యాలు, పూరీ జగన్నాథ స్వామి, 

Asadham, Ceremonies, Puri Jagannath Swami

#bhakthibooks



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list