MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆత్మన్యూనత... ఆత్మవిశ్వాసం- Self-confidence, Courage,



పిల్లల గది అలంకరణలో..!
పిల్లల గదిని అలంకరించడం కూడా ఒక కళే. వారి అభిరుచులు, అభిప్రాయాలకు తగిన విధంగా గది అలంకరణ ఉన్నప్పుడు సంతోషంగా ఫీలవుతారు. పిల్లల గది అలంకరణలో గుర్తుంచుకోవాల్సిన విషయాలివి..
పిల్లలిద్దరూ ఒకే థీమ్‌ కావాలని అంగీకరిస్తే ఏ సమస్యా లేకుండా గదిని అలంకరించవచ్చు. ఇద్దరికీ కలిపి ఒకే బెడ్‌ను వేసినా సరిపోతుంది. అలాకాక ఇద్దరూ ఎవరికి వారే ప్రత్యేకంగా బెడ్‌ కావాలంటే అప్పుడు విడివిడిగా ఏర్పాటు చేయాలి.
ఇద్దరికీ వేరువేరు బెడ్‌లు ఏర్పాటు చేసినా రెండూ ఒకే థీమ్‌లో ఉండే విధంగా చూడాలి. దీనివల్ల ఒకటి బాగుంది మరొకటి బాగాలేదు అన్న సమస్య తలెత్తకుండా ఉంటుంది.
పిల్లలిద్దరూ గదిని ఒకే థీమ్‌లో అలంకరించుకోవడానికి ఇష్టపడకపోతే గదిని పార్టిషన్‌లుగా చేసి నచ్చిన థీమ్‌లో అలంకరించాలి. గదిలో ఉపయోగించే బెడ్‌లు మడతపెట్టడానికి గానీ, ఒక ద గ్గరి నుంచి మరో చోటికి తరలించడానికి సులభంగా ఉండే వాటిని ఉపయోగించడం మంచిది.
పిల్లల గదిలో గోడల రంగును, బెడ్‌ రంగును దృష్టిలో ఉంచుకొని ఫర్నిచర్‌ను ఎంచుకుంటే గది అందం ఇనుమడించడమే కాకుండా ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
పిల్లలు గదులను వారిచేతే అలంకరింపచేస్తే వారిలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది. అంతేకాకుండా పిల్లల అభిరుచులను కనుక్కోవడం, వారి గది ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోవడం వల్ల గది అలంకరణ మరింత సులభం అవుతుంది.

తేనెతో సౌందర్యం
తేనెలో అందాన్ని ఇనుమడింప చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడటంతో పాటు నిగారింపు వచ్చేలా చేస్తుంది.
పొడిచర్మం ఉన్న వారికి తేనె మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్‌ తేనెను ముఖానికి రాసుకుని పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు తేనెతో పెదాలపై నెమ్మదిగా మర్దన చేసి వదిలేయాలి. ఉదయానికల్లా పెదాలు మృదువుగా తయారవుతాయు.
ముఖంపై మొటిమలు బాధిస్తుంటే తేనె రాయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది మొటిమలు ఎర్రగా మారడం, నొప్పిని కలగజేయడం వంటి సమస్యలు దూరమవుతాయి.
జుట్టు ఆరోగ్యంగా, షైనీగా మారాలంటే షాంపూలో ఒక టీస్పూన్‌ తేనె కలుపుకుని తలకు పట్టించి స్నానం చేయాలి. షాంపూ ఏదైనా తేనె కలుపుకోవచ్చు.
టీస్పూన్‌ కొబ్బరినూనెలో ఒక టీస్పూన్‌ తేనె కలిపి పదినిమిషాల పాటు మర్దనా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

జీవనశైలి మార్పులతో గుండె పదిలం
జీవన వృత్తికి సంబధించి అనునిత్యం మన పనులు మనం చేసుకుంటూ అలా వెళుతుంటాం. గుండె కూడా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ, ఒక్కోసారి అది తప్పటడుగులు వేస్తూ మన ప్రాణాల్ని ప్రమాదపు అంచుకు చేరుస్తుంది. మెదడుకు రక్తప్రసరణ జరగకపోతే పక్షవాతం వచ్చినట్టు, గుండెకు రక్తప్రసరణ అందకపోతే గుండెపోటే కదా వచ్చేది. అయితే గుండె ప్రధాన రక్తనాళాలు పూడిపోయి గుండెకు రక్తప్రసరణ జరగకపోతే అంతటితో అంతా అయిపోయినట్టేమీ కాదు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మరో అద్భుతమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ మన శరీరంలో ఉంది.
అదే సూక్ష్మరక్తనాళాల వ్యవస్థ. తాత్కాలికంగా అవి ప్రాణాపాయ స్థితినుంచి తప్పించినా ఆ వెనువెంటనే జీవనశైలిలో మార్పులు చే సుకుని, రక్తనాళాల దారులు మళ్లీ తెరుచుకునే ప్రయత్నం చేయాలి.
గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డ వారికి లేదా ఒక సారి గుండెపోటు వచ్చిన వారికి ప్రతి అవయవం చుట్టూ ఉండే సూక్ష్మ రక్తనాళాలు (కొల్లాట్రల్స్‌) పనిచేయడం మొదలెడతాయి. అందుకే వారు గుండె పోటుకు గురికాకుండా ఉండిపోతారు. కాకపోతే రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడే ఈ సూక్ష్మ రక్తనాళాలు పనిచేయడం మొదలెడతాయి. అత్యంత వేగంగా ఆటంకాలు ఏర్పడినప్పుడు ఈ సూక్ష్మ రక్తనాళాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవచ్చు. గుండెపోటు వచ్చి హఠాన్మరణం పాలైన వారి విషయంలో వీటి పాత్ర ఏమీ ఉండదు కానీ, సమస్య నిదానంగా మొదలయ్యే వారిని ఈ సూక్ష్మ రక్తనాళాలు కాపాడతాయి.
నిజానికి ఇప్పటిదాకా గుండెపోటుకు గురికాని వారి గుండె రక్తనాళాల్లో అసలు ఆటంకాలే లేవనికాదు. అయినా వారి గుండె సక్రమంగా పనిచేయడానికి వారి సూక్ష్మ రక్తనాళాలు పనిచేయడమే. అందువల్ల రిపోర్టులల్లో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయని తేలినంత మాత్రాన అందరూ వెంటనే శస్త్ర చికిత్సకు వెళ్లాలనేమీ లేదు. కాకపోతే వేగంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రకృతి వైద్య నియమాలన్నీ పాటించాలి. వీటివల్ల గుండెకు అవసరమైన రక్తం అందడమే కాకుండా, అప్పటికే గుండె రకతనాళాల్లో చేరిన అడ్డంకులు కూడా క్రమంగా తొలగిపోతాయి.
సహజ నియమాలు
మానసిక ఒత్తిళ్లు గుండె జబ్బులకు ప్రధాన కారణంగా చెబుతారు. అయితే, మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో శరీర శ్రమకు లేదా వ్యాయామానికి దూరంగా ఉండేవారే ఎక్కువ. రోజూ వ్యాయామం చేసేవారిలో గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా, వాళ్లు గుండెపోటుకు గురయ్యే అవకాశం చాలా తక్కువ. వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే, 90 శాతం వృక్ష సంబంధమైన ఆహార పదార్థాలు వృక్ష సంబంధమైనవి ఉంటే మేలు. పిండి పదార్థాలు, కొవ్వు మోతాదును ఆహారంలో బాగా తగ్గించడం చాలా అవసరం. అన్నింటినీ మించి రక్తం పలుచగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
అప్పటికే గుండె జబ్బు ఉంటే..
ఆహారంలో పళ్ల రసాలు అంటే సిట్రస్‌ (విటమిన్‌-సి) ఉండేలా చూసుకోవాలి. పళ్లల్లో ప్రత్యేకించి, దానిమ్మ రసం లేదా ఉసిరికాయ రసం ఎంతో ఉత్తమం. వీటి ద్వారా రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ లేదా కొవ్వు కరిగిపోతుంది. ఒక వేళ వారికి మధుమేహమే ఉంటే ఇన్సులిన్‌ ఇస్తూనే అయినా దానిమ్మ రసం ఇస్తే, ఆ అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ఇవన్నీ గుండె జబ్బు వచ్చే అత్యవసర పరిస్థితి కన్నా ముందే చేయాలి. ఒకప్పుడు గుండె జబ్బులన్నింటికీ, పెరిగిపోయిన కొలెస్ట్రాల్‌ నిలువలే కారణమని, గుండె రక్తనాళాల్లో అడ్డుపడేది ఈ కొలెస్ట్రాలే కారణమని చెప్పేవారు. ఇప్పుడు ఆ భావన మారిపోయింది.
రక్తకణాల్లో ఆటంకాలకు కొవ్వు కణాల్లో రక్తస్రావమైనప్పటి ఫ్రీ ర్యాడికల్స్‌ అక్కడ వాపు ఏర్పడటం కారణమని ఇటీవల వెల్లడయ్యింది. అయితే, ఆ ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే శక్తి దానిమ్మ రసానికి సమృద్ధిగా ఉంది. ఉసిరి కాయ రసంలో కూడా ఈ శక్తి ఉంది. రోజూ ఉదయమే పరగడుపున రెండు కాయల రసం తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ రసాల్లో ఏదో ఒకటి తీసుకుంటే కేవలం ఒకటి రెండు వారాల్లోనే గుండె నొప్పి తగ్గిపోతుంది. అదే క్రమంలో మెల్లమెల్లగా రక్తనాళాల్లోని ఆటంకాలు కరిగిపోతాయి.
అలాగే ఉదయం లేవగానే 5నుంచి 10 నిమిషాల వ్యవధిలో లీటర్‌నుంచి లీటర్‌ పావు నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తం పలుచబడి రక్తప్రసరణలోని అంత
రాయాలు తొలగిపోతాయి. అలాగే యోగాసనాలు, ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. వాస్తవానికి గుండె, శ్వాసకోశాలు ఈ రెండింటికీ మౌలికంగా ఒక యంత్రం ఉంటుంది. అందువల్ల శ్వాసకోశాలను శుద్ధి చేయడంతో పాటు, వాటిని చైతన్య పరిచే ప్రాణాయామం వల్ల గుండె పనితీరు కూడా చక్కబడుతుంది. గుండె జబ్బు నయమవుతుంది. ఉదయం అరగంట, సాయంత్రం ఒక అరగంట ఈ వ్యాయామాలు చేయడం ద్వారా గుండె జబ్బుల సమస్యనుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

- డాక్టర్‌ కె. సత్యలక్ష్మి, ప్రకృతి వైద్యం
మ‌న‌శ్శ‌రీరాల‌తో మ‌హ‌ర్ద‌శ‌...
మన నిత్య జీవితంలోని అన్ని సమస్యల్నీ యోగ పరిష్కరించలేకపోవచ్చు. కానీ, పరోక్షంగా వాటిని ఎదుర్కొనే మనోబలాన్నీ, శారీరక దారుఢ్యాన్నీ యోగా ప్రసాదిస్తుంది. గత 50 ఏళ్లుగా, జరిపిన అనేక పరిశోధనల్లో యోగ, మనశ్శరీరాల మీద చూపే ప్రభావం స్పష్టమవుతూ వచ్చిన క్రమంలో యోగాను ఒక సైన్సుగా గుర్తించడం మొదలయ్యింది. మౌలికంగా, మనశరీరంలోని ప్రతి వ్యవస్థ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తుంటాయి. వీటి మధ్య బ్యాలెన్స్‌ ఉన్నప్పుడు మన శరీరం, మనస్సూ ఆరోగ్యంగా ఉంటాయి. ఆ బ్యాలెన్స్‌ దెబ్బ తిన్నప్పుడు శరీరంలో అనారోగ్యం పొడసూపుతుంది. అయితే యోగ ఈ వివిధ వ్యవస్థలను ఒక్క తాటిపై నడిచేలా చేస్తుంది. అలా వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని ఆరోగ్యంగా మార్చడంతో పాటు కొత్త వ్యాధుల్ని రాకుండా చేస్తుంది.
వ్యాయామాల పరమావధి
వ్యాయామం ఏదైనా న్యూరో మస్కులర్‌ ఇంటెగ్రేషన్‌ కలిగించేదై ఉండాలి. అంటే కండర వ్యవస్థకు, నాడీ వ్యవస్థకూ మధ్య గల అనుబంధాన్ని నిలబెట్టేదై ఉండాలి.
మనం చేసే ఏ వ్యాయామం అయినా శ్వాసకోశాల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకు రాకూడదు. గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ముక్కుతో శ్వాస తీసుకునేలా ఉండాలే తప్ప నోటితో తీసుకునే స్థితి రాకూడదు. అలా వస్తే, మీరు మీ శక్తికి మించి వ్యాయామం చేస్తున్నారని, మీ శరీర వ్యవస్థను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారని అర్థం. అందుకే యోగాలో న్యూరో మస్కులర్‌, న్యూరో రెస్పిటరీ వ్యాయామాలను ప్రతిపాదించాయి.
రోజంతా నిలబడి, కూర్చుని ఉండడం వల్ల భూమిలోని గురుత్వాకర్షణ శక్తి వల్ల అధోభాగానికి అంటే కిందికి జారిపోతుంటాయి. వీటిని పూర్తిస్థితికి తేవడంలో శీర్షాసనం, సర్వాంగాసనం, హళాసనం వంటివి తోడ్పడతాయి. యోగ అంటే ఆసనాలు అనేమీ కాదు గానీ, ఆసనాల చరిత్ర కూడా సామాన్యమైనదేమీ కాదు. ఒక అధ్యయనం ప్రకారం మొత్తం ఆసనాలు లక్షన్నర దాకా ఉంటాయనేది ఒక అంచనా. వాటిల్లోంచి మనకు ఏవి అవసరమో, ఏవి సౌకర్యవంతమో వాటిని ఎంచుకుని సాధన చేస్తూ ఉండాలి.
పాటించవలసిన నియమాలు
ప్రతి ఆసనం దేనికది విలక్షణమైనదే అయినా, అన్ని ఆసనాలూ అందరి శరీర ధర్యాలకూ ఉపయుక్తంగా ఉండవు. అందువల్ల వాటి గురించి ముందు తెలియాలి.
ఆసనాలు వేయడానికి ముందు మన శరీరంలో వ్యర్థ పదార్థాలేవీ లేకుండా చూసుకోవాలి. కొద్ది రోజుల పాలు రోజూ వరుసగా త్రిఫలా చూర్ణం వేసుకుంటూ ఏ మాత్రం మలబద్దకం లేకుండా చూసుకోవాలి. మలబద్దకాన్ని తొలగించుకోకుండా ఆసనాలు వేస్తే మలినాలు రక్తంలో కలిసిపోయి యోగా వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ గా ఉంటుంది.
దైనందిన కార్యక్రమాలతో అతిగా అలసిపోయిన రోజున ఆసనాలు వేయకపోవడమే మేలు.
ఏరకంగా చూసినా ఆసనాలు ఉదయం పూట వేయడమే మేలు. ఒక వేళ అలా వీలు కాని పక్షంలో సాయంత్రంపూట త్వరగా వేయాలి. కాకపోతే ఆసనాలు వేయడానికి, భోజనానికీ మధ్య 4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
యోగాసనాలు వేయడంలో బాగా నైపుణ్యం వచ్చాకే ప్రాణాయామానికి సిద్ధం కావడం మేలు. ఆసనాల వల్ల శ్వాసకోశాలు, గుండె బలపడతాయి కాబట్టి ప్రాణాయామం సౌకర్యవంతగా అనిపిస్తుంది. కొన్నాళ్ల త ర్వాతే అయినా. యోగాతో పాటు, ప్రాణాయామం, ధ్యానం కూడా చేస్తే, ఆలోచనా శక్తి, గ్రహణ శక్తి పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత మనోబలం అపారంగా పెరుగుతాయి.
ఫ ఉయ్యూరు కృష్ణమూర్తి, యోగా టీచర్‌
మూల కణాలతో లుకేమియా చికిత్స
సాధారణ చికిత్సకు లొంగని వ్యాధులకు స్టెమ్‌సెల్‌ చికిత్స గొప్ప వరం లాంటిది. మూల కణాలతో ‘లుకేమియా’ (బ్లడ్‌ క్యాన్సర్‌)ను కూడా నయం చేయొచ్చని రుజువైంది. ఇప్పటివరకూ లుకేమియా వ్యాధికి ఎముక మజ్జ మార్పిడే ప్రధాన చికిత్స. కానీ ఈ చికిత్స అందరు రోగులకూ వీలు పడదు. తోబుట్టువులు, తల్లిదండ్రుల నుంచి ఎముక మజ్జ మార్పిడి చేయటం ఇప్పటివరకూ అనుసరిస్తున్న వైద్య విధానం. కానీ కొన్ని అరుదైన లుకేమియా కేసుల్లో ఈ విధానం సత్ఫలితాలను ఇవ్వదు. కొందరు రోగులకు మ్యాచ్‌ అయ్యే డోనర్‌ దొరకనప్పుడు చికిత్స మరింత క్లిష్టమవొచ్చు. అలాంటి రోగులకు స్టెమ్‌సెల్‌ చికిత్స ఆసరాగా నిలుస్తోంది.
లుకేమియాలో పలు రకాలు
‘ప్రాక్సిమల్‌ అక్యూట్‌ లుకేమియా’...ఇది ఎముకు మజ్జ కణాలకు చెందిన ఈ వ్యాధి వల్ల ఎర్ర రక్తకణాలు త్వరితంగా నశిస్తాయి. ఈ రోగులకు వారికి మ్యాచ్‌ అయ్యే ఎర్ర రక్తకణాలను ఇతరుల నుంచి సేకరించి ఎక్కిస్తూ ఉండాలి. ఇది ఎంతో శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని. ‘బైపెనోటైపిక్‌ అక్యూట్‌ లుకేమియా’... జీవించే అవకాశం 8 శాతం కన్నా తక్కువ ఉండే అరుదైన బ్లడ్‌ క్యాన్సర్‌. ‘అప్లాస్టిక్‌ అనీమియా’...రక్త కణాలను గణనీయంగా తగ్గించే వ్యాధి ఇది. ఈ మూడు రకాల వ్యాధులూ బోన్‌ మ్యారో స్టెమ్‌ సెల్‌ డిజార్డర్‌ కోవకు చెందినవే! ఈ మూడింటికి చికిత్స ఎంతో క్లిష్టం. దాంతో వైద్యులు స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ద్వారా చికిత్స చేసి పునర్జన్మనిచ్చారు.
తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం
లుకేమియా కోవకు చెందిన మరో వ్యాధి...‘పారాక్సీస్మల్‌ నాక్టర్నల్‌ హిమోగ్లోబిన్యూరియా’. ఈ వ్యాధి ఉన్న వ్యక్తుల ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఇలాంటి రోగులకు ప్రధాన రక్తనాణాల్లో రక్తపు గడ్డలు ఏర్పడి గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధిగ్రస్థులు వారానికి మూడు సార్లు రక్తమార్పిడి చేయించుకోవలసి ఉంటుంది.
అలాగే ఎకులిజముబ్‌ అనే యాంటీబాడీ చికిత్స కూడా అదనంగా వారానికోసారి తీసుకోవలసి ఉంటుంది. ఈ మొత్తానికి వారానికి దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఇలాంటి రోగులకు తక్కువ ఖర్చులో పూర్తయ్యే స్టెమ్‌ సెల్‌ చికిత్స చక్కటి ఫలితాన్నిస్తోంది. స్టెమ్‌ సెల్‌ చికిత్సకున్న మరో అడ్వాంటేజ్‌...బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచ్‌ అవని వ్యక్తి నుంచి సేకరించిన కణాలతో చికిత్స అందించటం. రక్తం బదులుగా డిఎన్‌ఎ మ్యాచ్‌ అయిన వ్యక్తి నుంచి కణాలను సేకరించి చికిత్సనందించవచ్చు.
మూల కణాల దానం
అవయవ దానం గురించి మనందరికీ తెలుసు. కళ్లు, మూత్రపిండాలు...ఇలా శరీరంలోని ప్రధాన అవయవాలను మనం చనిపోయున తర్వాత మాత్రమే దానం చేయగలం. కానీ స్టెమ్‌ సెల్స్‌ను బతికుండగానే దానం చేసే వీలుంది. బొడ్డు తాడులోనే కాకుండా మన దంతాలు, రక్తంలో కూడా మూల కణాలుంటాయి. రక్తంలో కలిసి ఉండే మూల కణాలను దానం చేసే వీలుంది. మనం దానం చేసిన మూల కణాలు ప్రపంచంలో ఏ మూలనున్న లుకేమియా రోగి ప్రాణాలనైనా నిలబెట్టొచ్చు.
లుకేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం వైద్యులు మొదట ఎముక మజ్జ మార్పిడిని ఎంచుకుంటారు. అలా వీలుకాని పక్షంలో స్టెమ్‌ సెల్‌ దాతల కోసం వెతుకుతారు. ఐ బ్యాంక్‌, బ్లడ్‌ బ్యాంక్‌లాగే మూల కణాల కోసం కూడా బ్యాంక్‌ ఉంటుంది. ఈ బ్యాంక్‌లో 20 ఏళ్ల లోపు వ్యక్తులెవరైనా తమ మూల కణాలను దానం చేయొచ్చు. ప్రతి బ్యాంక్‌లో ఆ మూల కణాలు, వ్యక్తి వివరాలు నమోదై ఉంటాయి. వాటి ఆధారంగా మ్యాచ్‌ స్టెమ్‌ సెల్‌ డోనర్‌ను గుర్తించి, అతని రక్తం నుంచి మూల కణాలను వేరు చేసి రోగికి అందించి చికిత్స చేస్తారు.
అవిసెలో పోషకాలెన్నో..
అవిసెల్లో పోషకాలు పుష్కలం. ఒమెగా 3, ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్‌ బి1, మాంగనీస్‌ వంటివి అవిసెల్లో అధికం. కొలెస్ట్రాల్‌ స్థాయిలను, రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రించడంలోనూ అవిసెలు బాగా ఉపయోగపడతాయి. కనీసం రోజూ రెండు టేబుల్‌స్పూన్ల అవిసెలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం దరిచేరదని అంటున్నారు నిపుణులు.
అవిసెల్లో ఏఎల్‌ఏ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి జట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు, మొటిమలు, ఎగ్జిమా, రొసేషియా వంటి చర్మ సమస్యలు దరిచేరవు. కళ్లు పొడిబారే సమస్య కూడా దూరమవుతుంది.
వీటిలో ‘లిగ్నన్‌’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్‌ సంబంధించిన పోలీఫెనాల్స్‌ వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలు దరిచేరకుండా చూస్తాయి. కణజాల ఆరోగ్యానికి, హార్మోన్ల బ్యాలెన్స్‌కు ఉపయోగపడుతుంది. పోలీఫెనాల్స్‌ పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది.
అవిసెల్లో ఉన్న యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు రోగనిరోధక వ్యవస్థను మరింత పరిపుష్టం చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు అవిసెలు తోడ్పతాయు. గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడకుండా చూస్తాయి.
కేన్సర్‌ రిస్క్‌ను తగ్గించడంలోనూ అవిసెలు ప్రథమస్థానంలో ఉంటాయి. ముఖ్యంగా రొమ్ము కేన్సర్‌ రిస్క్‌ను తగ్గించడంలో అవిసెలు బాగా ఉపయోగపడతాయి.
అవిసె నూనెతో మణికట్టు దగ్గర మర్దన చేస్తే కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ సమస్య పెరగకుండా ఉంటుంది. సమస్య పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
పురాతనమైన రెస్టారెంట్‌
ఇప్పుడంటే వీధి వీధిలో ఒక రెస్టారెంట్‌ కనిపిస్తోంది కానీ, ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్తే పెద్ద పెద్ద నగరాల్లో సైతం వెళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని రెస్టారెంట్లు మాత్రమే ఉండేవి. అదే శతాబ్దాలు వెనక్కి వెళ్తే.. దేశవ్యాప్తంగా ఒకటో రెండో రెస్టారెంట్లు మాత్రమే ఉండేవి. అలాంటి రెస్టారెంటే ఒకటి స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఉంది. దాని పేరు ‘బాటిన్‌ ఇన్‌ కాలె డి కుచిల్లర్స్‌’. దీన్ని 1725లో ప్రారంభించారు. అంటే 292 సంవత్సరాల కిందట అన్నమాట. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం ప్రపంచంలో అత్యంత పురాతమైన రెస్టారెంట్‌ ఇది. ఫ్రెంచ్‌ వంటగాడు జీన్‌ బాటిన్‌, ఆస్ట్రియాకు చెందిన అతని భార్య ఇద్దరూ కలిసి మాడ్రిడ్‌ నగరంలో ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. కొన్నేళ్ల పాటు రెస్టారెంట్‌ వ్యవహారాలన్నీ వీరిద్దరే చూసుకున్నారు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఈ జంట తదనంతరం రెస్టారెంట్‌ బాధ్యతలు బాటిన్‌ మేనల్లుడు తీసుకున్నాడట. ఆ తర్వాతి కాలంలో యాజమాన్యాలు మారినా.. రెస్టారెంట్‌ పేరు మారలేదు. అందులో వంటకాల నాణ్యత, రుచి.. ఏవీ మారలేదు. ఇప్పటికీ మాడ్రిడ్‌ నగరంలో మంచి రెస్టారెంట్‌ ఏదని అడిగితే... టక్కున వచ్చే సమాధానం ‘బాటిన్‌ ఇన్‌ కాలె డి కుచిల్లర్స్‌’ అనే. గిన్నిస్‌ బుక్‌ని పక్కన పెడితే దీని కన్నా పురాతమైన రెస్టారెంట్లు ఒకటో రెండో ఉన్నాయని చెప్పేవారూ ఉన్నారు. అయితే అవి ఇప్పుడు అవే పేరుతో ఉన్నాయి అంటే మాత్రం సమాధానం లేదు!
సెకండ్‌ షిప్ట్‌గా ఏమైనా చేయాలని ఉంది...
నా వయసు 28. ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. సాయంత్రం 6 గంటలకే ఇంటికి వచ్చేస్తాను. ఈ సమయంలో సెకండ్‌ షిప్ట్‌గా ఏమైనా చేయాలని నాకు బలంగా ఉంది. దానికి ఆర్థికపరమైన అవసరాలు కూడా కారణమే. ఈ ఉద్దేశంతో కొన్ని పార్ట్‌టైం జాబ్‌ లలో చేరాను. ఎందులో చేరినా ఒకటి రెండు నెలలకన్నా ఎక్కువ చేయలేకపోయాను. దానికి శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్న భావన కలగడమే కారణం. ఏమీ చేయకుండా సాయంత్రం నుంచి ఇంటి వద్దే ఉంటేనేమో సమయమంతా వృఽథా అయిపోతోందన్న భావన కలుగుతోంది. నా సెకండ్‌ షిప్ట్‌ ఆలోచన నెరవేరాలంటే ఏం చేయాలో చెప్పండి.
- ఎల్‌.శివకుమార్‌, హైదరాబాద్‌
సెకండ్‌ షిప్ట్‌గా ఏదైనా చేయాలనే ఉత్సాహం మీలో ఉండడం అభినందనీయమే. అయితే ఇలా సెకండ్‌ షిప్ట్‌గా చేసేవి పగలంతా చేసిన దానికి కొనసాగింపుగా ఉండకూడదు. అదొక హాబీలా అనిపించాలే తప్ప, మరో ఉద్యోగంలా ఉండకూడదు. ఉదాహరణకు పెయింటింగ్‌ మీ హాబీ అనుకోండి. ఆ హాబీ ద్వారా సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నిస్తే అది మీకు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఒత్తిడిని కలిగించదు. కాకపోతే ఇప్పటిదాకా ఏదో చిన్నపాటి హాబీగా ఉన్న సబ్జెక్ట్‌ను కమర్షియల్‌గా మలుచుకోవాలనుకుంటే ఇప్పుడు మీలో ఉన్న సామర్థ్యం సరిపోకపోవచ్చు.
అందువల్ల ఆ రంగంలో మరికొంత ప్రావీణ్యం సంపాదించే ప్రయత్నం చే యాలి. అవసరమైతే కొన్నాళ్లు కోచింగ్‌కు కూడా వెళ్లాలి. ఇది కొంత ఖర్చుతో కూడిన విషయమే అయినా అది మీకు శాశ్వతమైన భృతిని ఇస్తుంది. పైగా అది మీకు గొప్ప సంతృప్తిని కూడా ఇస్తుంది. ఇప్పుడే కాకుండా మీరు రిటైరయ్యాక కూడా ఈ రంగంలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. హాబీ అంటే అది మీ మనసుకు బాగా నచ్చిన అంశమనే కదా! ఈ రంగంలో మీరు ఎంతో అధ్యయనం చేసి, సృజనాత్మకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.
- ఎన్‌. కృష్ణమూర్తి , కెరీర్‌ స్పెషలిస్ట్‌
శ్రద్ధాసక్తులు ముఖ్యం
ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడు మహా పిసినారి. అంతకు మించిన బద్ధకస్తుడు. భార్య పోరు భరించలేక ఒక రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నాడు. పురోహితుణ్ణి పిలిపించాడు. పురోహితుడు శాస్త్రోక్తంగా వ్రతం చేయిస్తున్నాడు. ‘నాయనా! స్వామికి ధూపం సమర్పించాలి. అగరొత్తులు ఎక్కడా?’ అని ప్రశ్నించాడు పురోహితుడు. ఇంట్లో అగరొత్తులు ఉన్నా.. ‘స్వామి! అగరొత్తులు లేవు. ఈసారికి ఇలా కానివ్వండి’ అని బదులిచ్చాడు శ్రీమంతుడు. ‘ధూపార్థం అక్షతాన్‌ సమర్పయామి!’ అని వ్రతం కొనసాగించాడు పురోహితుడు. వ్రతం పూర్తయ్యే సమయానికి ‘నాయనా! స్వామివారి నైవేద్యానికి చేసిన పదార్థాలు తీసుకురమ్మ’ని కోరాడు. ఇంటో పంచభక్ష్య పరమాన్నాలూ ఉన్నా.. అవి తీసుకురావడానికి బద్ధకం అడ్డొచ్చింది. ‘ఏదో కానివ్వండి పంతులూ!’ అన్నాడు శ్రీమంతుడు.
‘నైవేద్యార్థం అక్షతాన్‌ సమర్పయామి’ అని వ్రతం ముగించాడు పురోహితుడు. ఇదంతా చూసి శ్రీమంతుని భార్య చిన్న బుచ్చుకుంది. కాసేపయ్యాక భోజనానికి ఉపక్రమించాడు శ్రీమంతుడు. అతడి భార్య విస్తరి వేసింది. ‘అన్నార్థం అక్షతాన్‌ సమర్పయామి’ అని విస్తట్లో నాలుగు అక్షతలు వేసింది. ‘శాకార్థం అక్షతాన్‌ సమర్పయామి’ అంటూ మరో నాలుగు అక్షతలు విస్తట్లో వేసింది. భార్య ప్రవర్తనకు శ్రీమంతుడి ఒళ్లు మండింది. ‘ఇదేమిటే! వంటింట్లో అన్ని పదార్థాలూ ఉన్నా... ఇలా అక్షతలు వేస్తావేమిటి’ అని గద్దించాడు. దానికామె.. ‘ఇంట్లో అన్నీ ఉన్నా.. దేవుడిని అక్షతలతో సరిపెట్టుకోమనగా లేనిది. మీకొచ్చిన నష్టమేమిటి?’ అని ఎదురు ప్రశ్నించింది. శ్రీమంతుడి కళ్లు తెరుచుకున్నాయి. మరుసటి రోజు భక్తి, శ్రద్ధలతో వ్రతం ఆచరించి భగవానుడి కృపకు పాత్రుడయ్యాడు. ఏ కార్యమైనా శ్రద్ధతో, విశ్వాసంతో చేసినపుడే అది సత్ఫలితం ఇవ్వగలదు. అశ్రద్ధతో ఏది చేసినా.. అది చేయని దానితో సమానం. భక్తిశ్రద్ధలు ఉన్నప్పుడే ఆధ్యాత్మిక పురోగతి నిరాటంకంగా సాగుతుంది.

వృషణాల్లో వాపు ఉంటే...
వృషణాల్లో వాపు రావడానికి కారణాలు అనేకం. కారణాలు ఏమైనా ఒకసారి వృషణాల్లో వాపు రావడం మొదలయ్యిందీ అంటే ఇంక ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య చికిత్సలు లేకుండా ఎక్కువ కాలం అలాగే ఉంటే వృషణాలు పెద్దవై, మరికొన్ని ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ములక్యాల లోపలి గింజలు, ఆముదం గింజలు, ఆవాలు, జనుము గింజలు ముల్లంగి విత్తనాలను తీసుకుని వాటిలో పుల్లటి మజ్జిగను పోస్తూ నూరి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును వాపు ఉన్న చోట పట్టువేస్తే వృషణాల వాపు తగ్గుతుంది.
జిల్లెడు మొక్కల వేళ్లను నీటితో శుభ్రం చేసి గంజి కలుపుతూ దంచుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని వాపు పైన పట్టు వేయడంతో త్వరితంగా నొప్పి, వాపు తగ్గుతాయి.
పై విధానాలతో తగ్గకపోతే.....
మహిపాక్షి గుగ్గులను మట్టిలేకుండా శుభ్రం చేసి, కొంచెం ఆముదంతో బాగా నూరాలి. దీన్ని వాపు మీద రాస్తూ ఉంటే వాపు తగ్గుతుంది.
కాంచనాది గుగ్గులు, నిత్యానంద రసం, లోహ భస్మం.. ఈ మందులు కూడా వాపును బాగా త గ్గిస్తాయి.

బ్యాగులో.. ఏమున్నాయ్‌?
అరె సమయానికి ఛార్జరు మర్చిపోయా... తెచ్చుకుని ఉంటే బాగుండేది. బ్యాగులో పెన్ను పెట్టుకున్నట్టే గుర్తే..ఇప్పుడెలా.. ఇలా మనలో చాలామంది ఆఫీసుకొచ్చిన తర్వాత బాధపడతాం. అవనే కాదు... మన బ్యాగులో నిత్యం ఉండాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి. వాటి చెక్‌లిస్టే ఇవి. అవేంటో చూద్దాం! 
* క్రెడిట్‌ కార్డూ, డెబిట్‌కార్డూ, లైసెన్స్‌ మరేవయినా ఇతరత్రా కార్డులు పెట్టుకోవడానికి వీలుగా ఓ చిన్నవాలెట్‌ని విడిగా ఉంచుకోండి. ఈ కార్డులు బ్యాగులో అన్ని వస్తువులతో కలిసిపోతే విరిగిపోతాయి. వీటికోసం ప్రత్యేకించి వాలెట్‌ని వాడితే పాడవకుండా ఉంటాయి. వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. 
* వీలుంటే ఓ చిన్న హ్యాండ్‌ శానిటైజర్‌ని పెట్టుకోండి. వర్షాకాలం త్వరగా సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే కాలం కాబట్టి ఈ జాగ్రత్త జ్వరం, జలుబు లాంటివి రాకుండా చేస్తుంది. 
* అనుకోకుండా తలపగిలిపోయే తలనొప్పి...! ఎక్కువ సేపు కార్యాలయంలో గడపడం వల్ల భుజాలూ, మెడనొప్పి. మాత్ర కన్నా బ్యాగులో చిన్న పెయిన్‌ బామ్‌ను పెట్టుకుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 
* అత్యవసర సమయంలో మీకూ లేదా మీ స్నేహితురాలికి ఉపయోగపడుతుంది శానిటరీ నాప్‌కిన్‌. కాబట్టి దాన్ని చక్కగా కాగితంలోకానీ, కవర్‌లోకానీ చుట్టి అడుగున ఉంచండి. 
* భారీగా అవసరం లేదు కానీ... సమయానికి ఉపయోగపడేలా ఒక కాజల్‌, టచప్‌ ఇచ్చుకునేందుకు అవసరం అయిన వస్తువుల్ని మాత్రం బ్యాగులో తప్పనిసరి. 
* అత్యవసర సమావేశాలు వంటివి ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా మింట్‌ పరిమళం ఉన్న చూయింగ్‌ గమ్‌ని దగ్గర పెట్టుకోండి. వీటన్నింటితోపాటు ముఖ్యంగా కొంత డబ్బు పెట్టుకోవడం కూడా ఉండాల్సిందే.
కాలిలో రక్తం గడ్డలా?
నడుస్తున్నప్పుడు తరచుగా కాలు.. ముఖ్యంగా పిక్కల్లో.. అదీ ఒక పిక్కలో నొప్పి పుడుతోందా? కాలు ఉబ్బినట్టుగా కనబడుతోందా? చర్మం రంగు మారిపోయిందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ చర్మానికి కాస్త లోతులోని సిరల్లో తలెత్తే రక్తం గడ్డలకు (డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌) సూచికలు కావొచ్చు. పైకి మామూలుగానే కనబడొచ్చు గానీ ఇది చాలా తీవ్రమైన సమస్య. ఎందుకంటే ఈ గడ్డలు అక్కడికే పరిమితం కాకపోవచ్చు. ఇవి విడిపోయి.. రక్తంతో పాటు ప్రవహించి.. వూపిరితిత్తుల్లోకి చేరుకోవచ్చు. ఫలితంగా రక్త ప్రసరణ దెబ్బతిని ప్రాణాల మీదికీ రావొచ్చు. కాబట్టి సిరల్లో రక్తం గడ్డలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు.
ఎందుకు ఏర్పడతాయి? 
సాధారణంగా డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ పిక్కల్లో, తొడల్లో ఎక్కువగా తలెత్తుతుంది. కొందరికి ఇతరత్రా భాగాల్లోనూ ఏర్పడొచ్చు. ఇది ఏ వయసులోనైనా రావొచ్చు గానీ 60 ఏళ్లు పైబడినవారిలో తరచుగా కనబడుతుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. పుట్టుకతోనే రక్తం గడ్డ కట్టటంలో లోపం గలవారికి దీని ముప్పు ఎక్కువ. ఇలాంటివారికి ఇతరత్రా ముప్పు కారకాలు కూడా తోడైతే సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. అలాగే పక్షవాతం లేదా ఇతరత్రా సమస్యలతో దీర్ఘకాలం మంచాన పడ్డవారికీ.. గంటలకొద్దీ కదలకుండా కూచొని ప్రయాణాలు చేసేవారికీ కాలి సిరల్లో రక్తం గడ్డలు తలెత్తొచ్చు. కాలిలోని సిరలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లటానికి కండరాలు బలంగా పనిచేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలం కదలకుండా ఉండేవారిలో పిక్క, తొడ కండరాలు బలహీనమవుతాయి. దీంతో రక్తం సరిగా పైకి వెళ్లకుండా అక్కడే నిల్వ ఉండి, గడ్డలు ఏర్పడొచ్చు. సిరల్లో రక్తం వెనక్కి రాకుండా చూసే కవాటాలు దెబ్బతినటం వల్ల తలెత్తే సిరల ఉబ్బు (వెరికోస్‌ వీన్స్‌) సమస్య కూడా థ్రాంబోసిస్‌కు దారితీయొచ్చు. అలాగే సిరలకు దెబ్బలు తగలటం లేదా శస్త్రచికిత్సల కారణంగానూ రావొచ్చు. మహిళలు గర్భం ధరించినపుడు కటిభాగం, కాళ్లల్లోని సిరల్లో పీడనం పెరుగుతుంది. ఇది కూడా రక్తం గడ్డలకు దారితీయొచ్చు. పుట్టుకతో రక్తం గడ్డ కట్టటంలో లోపం గల మహిళలకు ఈ ముప్పు మరింత ఎక్కువ. సంతానం కలగకుండా చూసే మాత్రలు లేదా హార్మోన్ల భర్తీ చికిత్సలతోనూ రక్తం గడ్డకట్టే ముప్పు పెరగొచ్చు. పొగ తాగటం- రక్త ప్రసరణ మీదే కాదు.. రక్తం గడ్డకట్టటం పైనా ప్రభావం చూపుతుంది. కొన్నిరకాల క్యాన్సర్లు రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే పదార్థాల స్థాయులనూ పెంచుతాయి. అలాగే గుండె వైఫల్యం బాధితులకూ డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ ముప్పు ఎక్కువే. పేగుల్లో వాపు ప్రక్రియతో ముడిపడిన క్రాన్స్‌ డిసీజ్‌, పేగు పూత కూడా రక్తం గడ్డలకు దారితీయొచ్చు.
చికిత్స ఏంటి? 
సిరల్లో రక్తం గడ్డల చికిత్సలో.. గడ్డలు మరింత పెరగకుండా చూడటానికి, అవి విడిపోయి వూపిరితిత్తులకు చేరకుండా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకు రక్తాన్ని పలుచగా చేసే మందులు బాగా ఉపయోగపడతాయి. ఇవి రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. గడ్డలు విడిపోకుండా, పెద్దగా కాకుండా, కొత్తవి ఏర్పడకుండానూ చూస్తాయి. వీటిని వేసుకునేవారికి కడుపు వద్ద ప్రధాన సిరలో జాలీలను (ఫిల్టర్స్‌) అమరుస్తారు. ఒకవేళ రక్తం గడ్డ విడిపోతే వూపిరితిత్తులకు చేరకుండా ఇవి అడ్డుకుంటాయి. అయితే రక్తాన్ని పలుచగా చేసే మందులను గర్భిణులకు ఇవ్వకూడదు. సమస్య బాగా ముదిరినవారికి రక్తం గడ్డలను విడగొట్టే మందులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటితో రక్తస్రావమయ్యే ప్రమాదముంది కాబట్టి అత్యవసర విభాగంలో చేర్చి ఇస్తుంటారు. సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడేవారు ప్రత్యేకమైన సాక్స్‌ ధరించటం మంచిది. దీంతో కాళ్ల వాపు తగ్గుతుంది. వెరికోస్‌ వీన్స్‌తో బాధపడేవారికి శస్త్రచికిత్స ద్వారా సమస్య తలెత్తిన సిరను తొలగిస్తారు. ఇప్పుడు లేజర్‌ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ వంటి అధునాతన పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి. ఇవి పైన ఎలాంటి కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే లోపలి నుంచే సిరను మూసేయటానికి తోడ్పడతాయి.
కొరికెయ్‌.. చికెన్‌పాప్‌కార్న్‌! 
నాలుగు చినుకులు పడితే చాలు.. జిహ్వ కాస్త కారంకారంగా, కరకరలాడే పదార్థాల్ని కోరుకుంటుంది. పోనీ బజ్జీలు తిందామంటే ఎప్పుడూ ఉండేవే.. పకోడీ, సమోసా అన్నీ తినితినీ విసుగెత్తినవే. కాబట్టి ఈసారి మటన్‌, చికెన్‌, చేపలకే మసాలాలు పట్టించి.. నోరూరించే స్నాక్స్‌ చేసేద్దాం. వర్షం పడుతున్న వేళ.. నాలుకకు రుచి చూపించేద్దాం. 
తందూరీ ప్రాన్స్‌ 
కావల్సినవి: తందూరీ మసాలా - రెండు చెంచాలు (బజార్లో దొరుకుతుంది), పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, శుభ్రం చేసిన రొయ్యలు - నాలుగు వందల గ్రా, ఉప్పు - కొద్దిగా, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఇనుప చువ్వలు - నాలుగు.
తయారీ: పైన పేర్కొన్న పదార్థాలన్నింటిన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఇరవై నిమిషాల తరవాత ఈ రొయ్యల్ని ఇనుప చువ్వలకు గుచ్చి.. నిప్పులపై కాల్చాలి. లేదా గ్రిల్‌ పద్ధతిలోనూ కాల్చుకోవచ్చు.
సీర్‌ ఫిష్‌ 
కావల్సినవి: చేప ముక్కలు - నాలుగు, అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, పసుపు - అరచెంచా, కారం - రెండు చెంచాలు, ధనియాలపొడి - చెంచా, ఉప్పు - తగినంత, జీలకర్రపొడి - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ: అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ధనియాలపొడి, ఉప్పు, జీలకర్రపొడి ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. చేప ముక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి. అరగంట తరవాత బాణలిలో నూనె వేడిచేసి చేపముక్కల్ని ఉంచి.. బాగా వేయించి తీసుకోవాలి.
బులెట్లు
కావల్సినవి: పెద్ద చేప ముక్కలు - నాలుగు, ఉప్పు - తగినంత, పసుపు - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, గుడ్డు - ఒకటి, బ్రెడ్‌పొడి - కప్పు, మిరియాలపొడి - అరచెంచా.
మసాలాకోసం: పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లిముద్ద - అరచెంచా, ఉల్లిపాయలు - రెండు.
తయారీ: చేప ముక్కల్ని ఉడికించి తీసుకోవాలి. పచ్చిమిర్చీ, అల్లంవెల్లుల్లి ముద్దా, ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీనికి చేప ముక్కలు కలిపి మరోసారి మిక్సీ పట్టి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పూ, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఓ గిన్నెలో గుడ్డుసొన తీసుకుని మిరియాలపొడి కలపాలి. చేప మిశ్రమాన్ని పొడుగాటి బులెట్లలా చేసుకోవాలి. ఒకదాన్ని ముందు గుడ్డు మిశ్రమంలో ముంచి.. తరవాత బ్రెడ్‌పొడిలో అద్దాలి. ఇలాగే మిగిలిన వాటినీ చేసుకుని రెండురెండు చొప్పున కాగుతోన్న నూనెలో వేసి వేయిస్తే చాలు.
చికెన్‌ పాప్‌కార్న్‌
కావల్సినవి: చికెన్‌ ముక్కలు - అరకేజీ, అల్లంవెల్లుల్లి ముద్ద - పెద్ద చెంచా, ఉల్లిపాయ ముద్ద - రెండు టేబుల్‌ స్పూన్లు, కారం - రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు - అరచెంచా, గరంమసాలా, మిరియాలపొడి - చెంచా చొప్పున, పెరుగు - టేబుల్‌ స్పూను, మొక్కజొన్నపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - చెంచా, కరివేపాకు రెబ్బలు - గుప్పెడు (వేయించి పొడిలా చేసుకోవాలి), ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ: నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ చికెన్‌ ముక్కల్ని ఇరవై నిమిషాల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత బయటకు తీసి.. కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
షమీ టిక్కీ
కావల్సినవి: కీమా - పావుకేజీ, గుడ్డు - ఒకటి, సెనగపిండి - పావుకప్పు, కసూరీమేథీ - చెంచా, కొత్తిమీర - కట్ట, పుదీనా - సగం కట్ట, అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా, ధనియాలపొడి, జీలకర్రపొడి, యాలకులపొడి, గరంమసాలా - అరచెంచా చొప్పున, లవంగాలపొడి, దాల్చినచెక్కపొడి - అరచెంచా చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - అరకప్పు, నెయ్యి - రెండు చెంచాలు.
తయారీ: గుడ్డూ, సెనగపిండి, కసూరీమేథీ, కొత్తిమీరా, నూనె, నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. బాణలిలో నెయ్యివేసి పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాక మటన్‌ మిశ్రమాన్ని వేసి మూత పెట్టాలి. అరవైశాతం ఉడికిందనుకున్నాక దింపేసి మిక్సీలో మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు గుడ్డుసొనా, కొత్తిమీర తరుగూ, పుదీనా తరుగూ, కసూరీమేథీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. మటన్‌ మిశ్రమాన్ని చిన్నచిన్న బిళ్లల్లా చేసుకోవాలి. తరవాత అన్నింటినీ గుడ్డు మిశ్రమంలో ముంచి తీయాలి. ఇప్పుడు రెండురెండు చొప్పున పెనంమీద ఉంచి.. నూనె వేస్తూ రెండువైపులా కాలిస్తే సరిపోతుంది.
హార్మోన్ల లోపానికి..వ్యాయామం!
హార్మోన్ల లోపానికీ.. సంతానలేమి, నెలసరుల్లో తేడా, ఒత్తిడి లాంటి సమస్యలకూ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మరి హార్మోన్ల సమతుల్యతను పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామా!
* ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ లాంటి హార్మోన్లు స్త్రీలకు చాలా కీలకమైనవి. నెలసరులూ, గర్భధారణ, భావోద్వేగాలూ, మెనోపాజ్‌ను నియంత్రించేది ఈ హార్మోన్లే. సప్లిమెంట్ల రూపంలో కాకుండా ఆహారంలో చేసుకునే చిన్నమార్పులతో కూడా హార్మోన్ల అసమతుల్యతని తగ్గించుకోవచ్చు. జింక్‌ అధికంగా ఉండే పల్లీలూ, డార్క్‌చాక్లెట్లతోపాటూ ఒమెగా త్రీ అధికంగా ఉండే వాల్‌నట్లూ, గుడ్లూ ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
* కొన్ని హార్మోన్లు అధికంగా విడుదల కావడం వల్ల మనలోని భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ఈ సమస్యకు ఏరోబిక్‌ వ్యాయామాలు చక్కని పరిష్కారం. ఇవి విడుదల చేసే రసాయనాలు మనలోని విపరీతమైన భావోద్వేగాలని అదుపులో ఉంచుతాయి. 
* ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్‌ హార్మోను విడుదల అవుతుంది. ఆ హార్మోను... మనకు అవసరం అయిన ఈస్ట్రోజెన్‌ విడుదలని అడ్డుకుంటుంది. అందుకే వీలైనంత వరకూ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. 
* గర్భనిరోధకమాత్రలని చాలామంది సొంతంగానే ప్రయత్నిస్తారు. నిజానికి అవి సింథటిక్‌ హార్మోన్లు. వాటిని వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. వీలైతే వాటికారణంగా దుష్ప్రభావాలని అదుపులో ఉంచుకునేందుకు సాంత్వన ఇచ్చే మందులు కూడా వైద్యుల సలహాతో తీసుకోవడం చాలా ముఖ్యం. 
* స్త్రీ హార్మోన్లతోపాటూ ఇతర కీలక హార్మోన్లు నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్‌, మన జీవక్రియలని నియంత్రించే థైరాయిడ్‌. వీటి లోపం ఏర్పడితే ఒత్తిడి పెరిగి కీళ్లనొప్పులు దాడి చేస్తాయి. అందుకే.. మంచి నిద్రను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు.
వానలో తడిశారా?
వేసవి కాలం వెళ్లిపోయింది. వానలు మొదలయ్యాయి. మరి ఈ వర్షపు చినుకుల నుంచి మన కురులను ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా!
* వానలో తడవడం వల్ల వెంట్రుకలు పాడవుతాయి. ఈ వాన నీరు మాత్రం మీ జుట్టుకు ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ నీటిలో దుమ్మూ, ధూళితోపాటు ఆమ్లాలు మిళితమై ఉంటాయి. కాబట్టి వానలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో తడిస్తే నాణ్యమైన షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయండి. కండిషర్‌ వాడటం మరచిపోవద్దు. అలాగే జుట్టునూ పూర్తిగా ఆరబెట్టుకోవాలి. 
* ఈ వానకాలం ముగిసే వరకూ వారంలో రెండు సార్లు తలస్నానం చేయండి. షాంపూలు కూడా తక్కువ గాఢత ఉండేవి ఎంచుకోండి. ఇవి మాడుపై పేరుకుపోయిన వాననీటి మురికిని వదిలిస్తాయి. ఈ కాలం అంతా మీ జుట్టు పచ్చిగా, ముతకగా ఉంటుంది. కాబట్టి నాణ్యమైన షాంపూలను ఉపయోగించడం ద్వారా మీ జుట్టుకు పోషణ లభిస్తుంది. ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను రాకుండా అరికట్టవచ్చు. 
* నూనె రాసుకుని మర్దనా చేసుకోవడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. ఫలితంగా అవి బలంగా తయారవుతాయి. నూనెను తక్కువ పరిమాణంలో రాసుకోవాలి. లేదంటే దాన్ని తొలగించడానికి షాంపూలనూ అధిక మొత్తంలో వాడాల్సి వస్తుంది. దాంతో జుట్టు పూర్తిగా పొడారిపోయి నిర్జీవంగా మారుతుంది. 
* ఈ కాలంలో జుట్టు చిక్కులు ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి మంచి, నాణ్యమైన దువ్వెనలను ఉపయోగించాలి. 
* కండిషర్‌ను మితంగా ఉపయోగించాలి. 
* వీటన్నింటితోపాటు జుట్టుకు బలాన్నిచ్చే మాంసకృత్తులు, ఇనుము, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోండి. చేపలు, డ్రైఫ్రూట్స్‌, పాలకూర.. వీటన్నింటిని క్రమం తప్పకుండా తినండి. 
* జుట్టును రక్షించుకోవాలంటే వీటన్నింటికంటే ముందు వానలో తడవకుండా మంచి రెయిన్‌ కోట్‌ కొనుక్కోవాలి. ఓ అందమైన గొడుగును మీ వెంట ఉంచుకోవాలి.

ఆత్మన్యూనత... ఆత్మవిశ్వాసం
ఎన్నో మంచిగుణాలున్న వారు కూడా, తమలో ఒక చిన్న గుణాన్ని భూతద్దంలో చూస్తూ, తాము దేనికీ పనికిరామని భావిస్తూ, ఆత్మన్యూనతలో విలువైన కాలాన్నీ, జీవితాన్నీ వృథా చేసుకుంటుండటం చూస్తుంటాం. చక్కని మాటకారి కాదని, చూడచక్కని రూపం లేదని, పెద్ద చదువులు లేవని, సిరిసంపదలు లేవని, లలితకళలు లేవని, ఇవన్నీ కాకపోతే అదృష్టహీనులనీ పక్కవారితో పోల్చుకుంటూ అనుక్షణం బాధపడేవారు కోకొల్లలు. అటువంటి ఆత్మవిశ్వాసం లేనివారికి ధైర్యం కలిగించేలా చాణక్యుడు చక్కని ఉదాహరణను చెప్పాడు. మొగలి పొదలు బురదలో పెరుగుతాయి.
విషసర్పాలు చుట్టుకుని ఉంటాయి. ఆకులనిండా ముళ్ళు ఉంటాయి. మొగలి పూరేకులు, ఆకులు వంకరగా, అడ్డదిడ్డంగా, క్రమపద్ధతి లేకుండా పెరుగుతాయి. ఇన్ని అవలక్షణాలున్నా మొగలిపూవుకున్న ఒకే ఒక సుగుణం మైమరపించే సువాసన మాత్రమే. ఆ ఒక్క పరిమళంతో అందరినీ ఇట్టే తనవైపునకు ఆకర్షిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనే ఒక్క సుగుణం ఉంటే చాలు... వారికి ఏ విధమైన ప్రత్యేకతలు లేకపోయినా ఎటువంటి వారైనా వారికి దాసోహ మనవలసిందే.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list