MohanPublications Print Books Online store clik Here Devullu.com

సాలిగ్రామం ఎలా పుట్టింది?_ How is Saligrama originated?


సాలిగ్రామం ఎలా పుట్టింది?


   
గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||


సాలిగ్రామం అంటే తెలుసా.......? 
         విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు.

అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.

ఆనది పేరు గండకీ.

చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!

గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది.

ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు.

గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది.

ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు.

ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.

ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు.

అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన…

ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది.

సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది.

అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.

గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది.

కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.

గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు.

ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.


మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.


గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు.

ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list