MohanPublications Print Books Online store clik Here Devullu.com

అంతులేని ఆశ-Endless hope



అంతులేని ఆశ

పూర్వం ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి వందల ఎకరాలు భూమి ఉండేది. కానీ దానితో సంతృప్తి చెందలేదు. వేలకొద్దీ ఎకరాలు ఎక్కడైనా చవకగా లభిస్తే కొనాలనే తలంపు అతనికి ఉండేది. ఇంతలో హిమవత్పర్వత ప్రాంతమున విశాలమగు పీఠభూమి కలదని, అది అరణ్యంలోని కోయరాజులదని అతనికెవరో చెప్పారు. వెంటనే ధనికుడు ఆ చోటకి ప్రయాణం చేయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా పట్టణంలోని విచిత్రమైన ఆట వస్తువులు, తినుబండారాలను ఒక పెద్ద బుట్టలో వేసుకుని ధనవంతుడు హిమవత్పర్వత ప్రాంతానికి బయలుదేరాడు.
ఆ ప్రాంతంలోని కోయరాజును కలిశాడు. వారి బిడ్డలకు తెచ్చిన ఆటబొమ్మలు, ఫల హారాలను పంచిపెట్టాడు. కోయరాజు మహదానంద భరితుడై ‘మీ రాకెందుకో చెప్పండి. మీ కోరిక నెరవేరుస్తాను’ అన్నాడు. మాట కూడా ఇచ్చాడు. వెంటనే ధనికుడు ‘మీ పరిసరాల్లో కొంత భూమి కావాలి’ అని అడిగాడు. అందుకు కోయరాజు ‘అట్లే ఇస్తాను. దానికి మీరేమీ చెల్లించనక్కర్లేదు. ఎంతో నేల వ్యర్థముగా ఉన్నది. దాన్ని మీరు సాగు చేసుకుని ఉపయోగించవచ్చును. అయితే ఒక షరతుపై అది ఇస్తాను’ అన్నాడు. ఆసక్తిగా ధనికుడు ఏమిటని అడిగాడు. ‘రేపు ఉదయం సరిగ్గా ఆరు గంటలకు మీరు ఇచ్చట బయలుదేరి, మీ ఇష్టం వచ్చినంత దూరం నడిచి మరల తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఈ చోటికి రావలెను. మీరు నడిచినంత దూరం ఉండే నేలంతా మీదే’ అని కోయరాజు ఆ ధనికుడికి చెప్పాడు.
ఆ కోయరాజు మాటలు వినగానే ధనికుని ఆనందానికి అవధుల్లేవు. తన జీవితం కృతార్థమైనదని అనుకున్నాడు. ఆనందపరవశుడయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఆరు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని వేచిచూశాడు. తెల్లవారిన తర్వాత సరిగ్గా కోయరాజు నిర్ణీత సమయానికి వచ్చాడు. ధనికునికి ఒక స్థలం గుర్తు చూపించాడు. ‘అక్కడ నుండి ఎంత దూరమైననూ నడిచి వెళ్లవచ్చు. అయితే సాయంత్రం ఆరు గంటలకు తిరిగి అక్కడికి చేరుకోవాలి’ అని ఆదేశించాడు. స్థూలకాయుడు, పొట్టి మనిషి అయిన ధనికుడు నడక ప్రారంభించాడు. నడిస్తే కొద్ది స్థలమే వస్తుందనీ, పరిగెత్తితే చాలా స్థలం వస్తుందని అనుకున్నాడు. వేగంగా ధనికుడు పరిగెత్తటం ప్రారంభించాడు. దారిలో ఒక చిన్న కాలువ అడ్డుగా ఉంది. దిగితే ఆలస్యమవుతుందని దూకాడు. కాలు జారిపడి, ఎలాగొలాగ లేచి కుంటుతూ పరుగు అందుకున్నాడు. అది గ్రీష్మరుతువు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటం చేత ధనికుడికి చెమట ఎక్కువైంది. పరిగెడుతున్న అతని అవస్థ చూసి దారిలో ఒకరు జాలిపడ్డారు. ‘అయ్యా.. ఈ పాత్రలోని మంచినీళ్లు తాగి దప్పిక తీర్చుకో’ అని మంచినీటి పాత్ర చేతికి అందించబోయాడు. దాని వద్దన్నాడు. ‘ఈ సమయాన నన్నేమీ పలకరించకండి. మీరిచ్చే నీళ్లు తాగులోపల ఇంకొంత స్థలం నేను ఆక్రమించుకోవచ్చు’ అని పలుకుతూ పరుగును కొనసాగించాడు.
ఇలా ఆహారం, నీళ్లు లేకుండా పరిగెత్తాడు. మండుటెండలో ధనికుడి తల తిరిగింది. కాలి దెబ్బతో బాధపడ్డాడు. డబ్బులు, ఆస్తి ఉన్నా ఉచితంగా వచ్చే స్థలాన్ని సంపాదించాలనే పేరాశతో దేహాన్ని కూడా లెక్క చేయలేదు. సాధ్యమైనంత దూరం వెళ్లి అక్కడినుంచి పరిగెత్తి పరిగెత్తి తుదకు ప్రారంభించిన చోటుకు పది గజాల దూరంలో శోషతో కిందపడిపోయాడు. కోయరాజుతో పాటు స్థానిక పెద్దలు హుటాహుటిన అక్కడికి వచ్చారు. ధనికుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతని నాడి సన్నగిల్లింది. అందరూ చూస్తుండగానే రెండు, మూడు నిమిషాల్లో ధనికుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇది చూసి అందరూ బాధపడ్డారు. ఇక చేసేదేమిక లేక కోయరాజు ఎఓ గొయ్యి తవ్వించి ధనికున్ని అందుల్లో పూడ్చిపెట్టి సమాధి చేయించాడు.
జనుల ఆశకు అంతులేదు. అంతులేని ఆశ ఉండకూడదు. అది ఉంటే శాంతి ఉండదు. భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి. ఉన్న కాలంలో ఆ పరమాత్ముడి దివ్య నమోచ్చారణాలందు అనుభూతుల్ని గడిపి ఽధన్యం చెందాలి. అలా కాకుడా ఆ ధనికుడు వేల ఎకరాల భూమిని ఒక దెబ్బతో కొట్టేయాలనే దురాశతో పరిగెత్తాడు. అతని కోరిక నెరవేరకపోగా చివరికి అతని శరీర పొడవు ఎన్ని అడుగులో అంతమాత్రం నేలమాత్రమే అతనికి దక్కింది. అతనికే కాదు, ఎవరికైనా తుదకు దక్కేది అంత మాత్రం నేలనే. కాబట్టి దురాశను దూరంగా పారద్రోలి నిత్య సంతృప్తుడే భగవద్భక్తియుతుడై మనిషి తన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాలి.



కరుణా‘మూర్తులు’!
భగవంతుడి సకల కళల వర్ఛస్సుకు ప్రతిరూపం- కోవెలలోని మూర్తి! అక్కడి అర్చామూర్తులు అందుకే ప్రత్యక్ష దైవాలుగా కనువిందు చేస్తాయి. అపార భక్తిభావం కలిగిస్తాయి. కష్టనష్టాలు, బాధలు, భావాలను ఆ మూర్తికే విన్నవించుకోవాలని అనిపిస్తుంది. భక్తుల ఆర్తికి, ఆ మూర్తికి అంతటి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలయ్యాయి.

పురాణ, వాంగ్మయాల ప్రకారం- విశ్వంలోని ప్రతి పదార్థంలోనూ దైవత్వం నిండి ఉంది. ఈ విశ్వం సృజన నియమ నిబంధనలు అనుసరించి ఆవిర్భవించింది. ఇది వాటి ప్రకారమే లయమవుతుంది. ‘ముండకోపనిషత్తు’లో ‘నేనే ప్రేరకుణ్ని’ అంటాడు సృజనకారుడు. అందుకే ఎలాంటి వస్తువైనా పరమాత్మ తత్వాన్ని కలిగి ఉంటుంది. భక్తిభావంతో ఏ వస్తువునైనా దైవానికి ప్రతిరూపంగా ఆరాధిస్తే, ఆ వస్తువు పరమాత్మ తత్వం సంతరించుకొంటుంది. విశ్వమంతా అంతర్యామి నిండి ఉన్నాడంటోంది యజుర్వేదం. కనిపించే ప్రతి ఒక్కటీ దైవమే!

దేనినైనా భగవంతుడిగా భావించడం భారతీయ సంప్రదాయం. ఈ భక్తి భావన వల్ల విగ్రహ పూజే ఆధ్యాత్మిక జీవనమైంది. గురువుల్ని, రుషుల్ని సైతం విగ్రహ రూపంలో పూజిస్తున్నాం. ఇలాంటి ఆరాధన అద్వితీయమైంది. బుద్ధుణ్ని, బోధిసత్వుణ్ని, తీర్థంకరులను సైతం మూర్తిమంతం చేశారు. భౌతిక ప్రపంచంలోని ప్రతి ఆకృతిలోనూ భగవంతుడి వర్ఛస్సు ఉంటుంది. ‘దైవం నిరాకారుడు’ అని శంకర భగవత్పాదులు అనేవారు. ఆ పరాత్పరుణ్ని అందుకే ఎవరూ వ్యక్తీకరించలేకపోయారు. హృదయంలో ఒక రూపాన్ని వూహించుకొని ఆ మూర్తినే కొలవడం వల్ల, దైవం భావ స్వరూపుడు అవుతాడు. ఒక ప్రత్యేక రూపంలో అర్చించాలన్న సాకార భక్తితత్వం ఈ భావనకు ప్రతిరూపమే! భగవంతుడిపై విశ్వాసానికి విగ్రహారాధనే చక్కని ఉదాహరణ.

విగ్రహ పూజలో నమ్మకం అత్యంత ప్రధానమైంది. నమ్మేవాడికి దైవానుసంధానం కలుగుతుందన్నది రుషి వాక్కు. ఇంట్లో పూజ గదిలోనో, దేవాలయంలోనో విగ్రహం ముందు వినమ్రుడై నిలుచునేవాడిలో అహం వ్యక్తం కాదు. తన బాధలన్నింటినీ ఆ మూర్తితో విన్నవించుకొంటాడు. దైవంతో నేరుగా మాట్లాడుతున్నట్లు భావిస్తాడు. ‘ఉలకని, పలకని మూర్తి’ అనే సంకోచం భక్తుడిలో ఏ మాత్రం కనిపించదు. అందుకే మూర్తిమంతమైన ఆలయాలు భౌతిక ప్రపంచానికి అతీతంగా వ్యక్తమవుతాయి. అక్కడి వాతావరణం, వినిపించే మంత్ర శ్లోకాలు, తీర్థ ప్రసాదాల్లోని పవిత్రత ఆ విగ్రహంలోని దైవత్వానికి గుర్తులు.

ఇంట్లోని పూజగదిలో దైవం ఉన్నాడనే భావన, మానవ జీవన శైలిని క్రమబద్ధం చేస్తుంది. వేకువజామునే నిద్రలేవడం, స్నాన ధ్యానాదుల వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఎందరో సాధకులు, వాగ్గేయకారులు, ఆచార్యులు విగ్రహపూజకు ఒక ప్రాతిపదిక కల్పించారు. పాంచరాత్రం, వైఖానస ఆగమాలు శ్రీవిష్ణుమూర్తిని కొలిచేందుకు ఏర్పడ్డాయి. శివ (శివలింగం) ఆరాధన- ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన ‘సిద్ధాంత శిఖామణి’లో సూచించిన ప్రకారం జరుగుతుందంటారు. విగ్రహారాధన సంప్రదాయంగా మారిన తరవాతే శిల్పశాస్త్రం ఉద్భవించింది.

సింధులోయ నాగరిక నగరమైన మొహంజొదారోలో ప్రత్యేకమైన శిలతో తయారు చేసిన పశుపతి విగ్రహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఒక వేదికపై కూర్చున్న మూడు ముఖాల మూర్తి అది. ఆ విగ్రహం చారిత్రక యుగంలో శివ పశుపతిగా ఆరాధనలందుకొన్న దైవం ప్రాచీన మూలమని చరిత్రకారుల అభిప్రాయం. పిప్పలాదుడు రచించిన ‘వాస్తుశాస్త్ర ఉపనిషత్తు’ విగ్రహారాధన గురించి వివరించింది. యజ్ఞయాగాలు, వివాహాల వంటి కార్యక్రమాల్లో- ద్వాపరయుగం నాటికే పసుపుతో విఘ్నేశ్వరుణ్ని విగ్రహంగా చేసి పూజలు చేసేవారట. దాన్నిబట్టి విగ్రహారాధన ఎంత ప్రాచీనమైన సంప్రదాయమో వూహించవచ్చు.

భవసాగరాన్ని దాటేందుకు ఎందరో మహానుభావులు విగ్రహారాధనను సాధనంగా మార్చుకొన్నారు. వల్లభాచార్యులు, మీరాబాయి, తుకారాం, శ్రీరామకృష్ణ పరమహంస, త్యాగయ్య వంటి భక్తులు మూర్తి ఆరాధనకే ప్రాధాన్యమిచ్చి తరించారు. ప్రత్యక్షంగా రోజూ ఉదయమే దర్శనమిచ్చే సూర్యుణ్ని ఆరాధించేవారు సైతం, ఆయననే మూర్తిగా చేసుకొని పూజిస్తుంటారు!
                                                       - అప్పరుసు రమాకాంతరావు


                     ప్రశ్నలతో పరిణతి! 

పలు రకాల సందర్భాల్లో ప్రశ్నలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని మనిషికి ఉన్నతి కలిగిస్తే, మరికొన్ని ప్రమాదం అంచున నిలబెడతాయి. వివేకంతో ముడివడి ఉండే ప్రశ్నలు కొన్ని. వ్యక్తి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసేవి మరికొన్ని. ప్రశ్నించడం అనేది ఎప్పుడూ అవసరమే. ఆ గుణం లేనివారు ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అన్నట్లు ఉండిపోతారు.

మనిషి చేసే ప్రతి ప్రతిపాదన వెనకా ఒక ప్రశ్న దాగి ఉంటుంది. ఎదుటి వ్యక్తి తనకు గల పరిణతిని బట్టి సమాధానాలిస్తుంటాడు. ప్రశ్న, జవాబుల సమ్మిళితమే మానవ జీవితం. కొన్ని ప్రశ్నలు ఎంతో చైతన్యాన్ని రేకెత్తిస్తాయి. వాటి కారణంగా అతడు వైవిధ్యభరిత అనుభూతుల్ని, అవకాశాల్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతుంటాడు. మానవ మేధ ఒక దూరదర్శని వంటిది. అది కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల్ని చూడగలదు. అలాంటి శక్తిని మనిషి కేవలం తన కళ్లముందు సాగిపోయే మేఘాల్ని చూడటానికే వినియోగిస్తే ఎలా? దృష్టిని ఉన్నతస్థాయిలో నిలిపినప్పుడు, మదిలో ఎన్నో ధర్మసంబంధ ప్రశ్నలు ఉదయిస్తాయి.

విశ్వ రహస్యాల ద్వారాల్ని తెరిచే తాళంచెవుల వంటివి ప్రశ్నలు. అవి చైతన్యానికి దోహదపడతాయి. గతానికి సంబంధించిన ప్రశ్నలు మానవుడికి అంతర్‌ దృష్టిని ప్రసాదిస్తాయి. అంతర్ముఖ ప్రయాణం అంటే, గతించినవాటిని యాంత్రికంగా తలచుకోవడం కాదు... సక్రమమైన ప్రశ్నలతో విమర్శనాత్మకంగా పరీక్షించుకోవడం! నిర్మాణాత్మక పద్ధతిలో ఆలోచించడానికి అది శిక్షణ వంటిది. అందువల్ల భవిష్యత్తులో తగినంత అవగాహనతో వ్యవహరించడానికి వీలు కలుగుతుంది.

భవితకు చెందిన ప్రశ్నలు మానవ జీవన గమనానికి దిక్సూచిగా నిలుస్తాయి. అతడు ఓ ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకోవడానికి అవి ఎంతో సహాయపడతాయి. తన అశాంతి, మానసిక అలజడి గురించి మనిషి పదేపదే తలచుకుంటే- జీవన యాత్రలో వెనకబడినట్లే! మనసు గతంలోకి లాక్కెళుతుంది. ‘పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి, ఆనందంగా ఎలా ఉండాలి’ అని ప్రశ్నించుకుంటే- సమాధానం దొరికి పురోగమించడానికి మనిషికి అవకాశం ఏర్పడుతుంది. ‘ఏ విధంగా నేను ఇతరులకు సహాయపడగలను’ వంటి ప్రశ్నలను బట్టి, ఆలోచన ముందుకు సాగుతుంది.

ప్రశ్నలు- కూడలి మధ్యలో కనిపించే దారిగుర్తులు గల పలకలు. వాటిని చూసి, ఏ దారిన వెళ్లాలో మనిషే ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక సంబంధమైన అనేక ప్రశ్నలు మెదులుతుంటాయి. కొన్ని పరిస్థితుల్ని కర్మసంబంధమైనవిగా భావిస్తారు. ‘ఎలా జరగాల్సి ఉందో అలా జరుగుతుంది’ వంటి మాటలూ వింటుంటాం. మనిషి తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలన్నది నిర్వివాదం.

విశ్వసృష్టి, కాల గమనం, జీవరాశి, ప్రాణి పుట్టుకకు సంబంధించిన ప్రశ్నలు ఆది నుంచే మనిషిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అతడిలో ఆధ్యాత్మిక తృష్ణ రగిలిస్తున్నాయి. బుద్ధికి పనిపెడుతుంది ప్రశ్న. సమాధానం కోసం అది సవాలు విసరుతుంది. ప్రశ్నకు సమాధానం వెతికే యంత్రమే బుద్ధి. అది ఎప్పుడూ అన్వేషణ పనిలోనే ఉంటుంది. అందుకే ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందింది. అనేక ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు, మనిషిలో నైపుణ్యం కావాలి. సమాధానాలు లభించడం కష్టమనిపించినా, ప్రశ్నించడాన్ని అతడు ఆపకూడదు. దాన్ని ఓ అభ్యాసంగా తీర్చిదిద్దుకోవాలి.

ప్రశ్నల్లో కొన్ని- మనిషి భగవంతుడి వైపు మళ్లేలా చేస్తాయి. అందులో అతి ముఖ్యమైనది ‘నేనెవరు’ అనేది. అంతిమ ప్రశ్న అది. బుద్ధికి సంబంధించినది కాదు. అది ఆత్మ సంబంధమైనది. మనిషి ఉనికికి చెందినది. తగిన సమాధానాల కోసం మనిషి తన అంతశ్శక్తిని పెంచుకోవాలి. ఆలోచనల సరళిని మార్చుకోవాలి.

ఒకే ఒక ప్రశ్నతో మనిషి జీవితాంతం ముందుకు కొనసాగవచ్చు. ‘నేను చేస్తున్నది నా మానసిక, ఆధ్యాత్మిక పరిణతికి దారితీస్తోందా’ అన్నదే ఆ ప్రశ్న. ప్రశ్నించని వ్యక్తి ఎటువంటి స్వేచ్ఛనూ పొందలేడు. జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోవాలన్నా వికాసమే మూలం. ప్రశ్నించే తత్వం ద్వారానే దాన్ని సాధించగలం!
- మంత్రవాది మహేశ్వర్‌



                               ఆత్మజ్ఞానం 

చిన్నప్పటి నుంచి ప్రతి వ్యక్తికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. పుట్టింది మొదలు, అతడు జ్ఞానంలో పెరగాలి. అందులోనే లీనం కావాలి. ఏది అజ్ఞానమో తెలుసుకుంటే, మనిషికి ఉండేదంతా జ్ఞానమే! అది అంచెలంచెలుగా అతడికి అవగాహనకొస్తుంది. చీకటి తొలగిపోతున్నప్పుడు క్రమంగా సూర్యుడు దర్శనమిచ్చినట్లు, మనిషి ఎదుట జ్ఞానం తన రూపాన్ని ఆవిష్కరిస్తుంది. దాన్ని అతడి మనసు వెంటనే గ్రహించి, అంగీకరించి, స్వీకరించాలి. అలా జరిగేలా మానవుడు తనను తాను నిత్యం ఆత్మపరిశీలన చేసుకోవాలి.

అన్నింటికంటే ముఖ్యమైన జ్ఞానం ఒకటుంది. అది- పారమార్థిక జ్ఞానం. తల్లివేరు వంటిది. విశ్వవృక్షానికి అదే ఆధారం. దాన్ని మనిషి పొందగలగాలి. ఆత్మజ్ఞానం అంటే అదే!

ఇతర ప్రాపంచిక జ్ఞానాల మాదిరిగా ఆత్మజ్ఞానం వెంటనే లభించదు. శోధించి సాధించాలి. ఆ జ్ఞానం రహస్యంగా ఉంటుంది. దాన్ని భౌతిక జ్ఞానం ఎప్పుడూ కప్పి ఉంచుతుంది. తొలగించి చూస్తేనే, ఆత్మజ్ఞానం గోచరమవుతుంది. అలా అని, అది శరీరానికో మనసుకో సంబంధించిన జ్ఞానం కాదు. సంపూర్ణంగా ఆత్మకు చెందిన జ్ఞానమది!

ప్రతిదానికీ ఆత్మజ్ఞానమే మూలం. దాన్ని సాధకులు సంపాదించాలని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. అర్జునుడికి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్నే ఉపదేశించాడు. అటువంటి జ్ఞానమే భోగి అయిన వేమనను యోగిగా చేసింది. అదే జ్ఞానసంపద ఆదిశంకరుణ్ని అపర శంకరుడిగా మార్చింది. ఆత్మ సంబంధమైన జ్ఞానమే గౌతముణ్ని బుద్ధుడిగా రూపొందించింది. ఆ జ్ఞానమే వేదసారమై అంతటా విలసిల్లుతోంది. సర్వ విద్యలూ నేర్చినప్పటికీ, ఆత్మవిద్యను విడనాడకూడదు. అలా విడనాడితే ఆ బతుకు వృథా అని పరమేశ్వరుడి వాక్యం!

‘సుఖంగా జీవించడానికి ఆత్మజ్ఞానం కొంతైనా దోహదపడుతుందా...’ అని పలువురు భావిస్తుంటారు.సుఖదుఃఖాలు అనేవి శరీరానికి చెందినవి. ఆత్మజ్ఞానం మానవుడి ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించింది. ఇహం, పరం- రెండింటినీ సాధించాలి మనిషి. పరిపూర్ణ మానవుడు కావడానికి అతడు తన గురించి తాను వివరంగా తెలుసుకోవాలి.

అహంకారాన్ని జ్ఞానమే పటాపంచలు చేస్తుంది. ఒకప్పుడు ‘నేను’ అని పలికేవాడు ఆ తరవాత జ్ఞానశక్తి వల్ల ‘మనం’ అంటాడు. జనంలో ఒకడిగా కలిసిపోతాడు. ‘అందరిలో నేనూ ఒకణ్ని’ అంటూ వినయశీలిగా మారతాడు. ఎంత చిన్నపనినైనా అత్యంత శ్రద్ధతో చేస్తాడు. ఈశ్వరుడి సృష్టి వైభవాన్ని నిత్యం తిలకించి పులకిస్తుంటాడు. అందరికీ సేవ చేయడానికి అతడు ఆనందంగా ముందు కొస్తాడు. సమాజ హితం తప్ప మరేదీ కోరడు.

ఆత్మజ్ఞాన వైభవమే మనిషిని ఆసాంతం మారుస్తుంది. మానవత్వాన్ని హిమాలయ శిఖరాలకు చేరుస్తుంది. ‘సర్వ జీవులూ నీ తోబుట్టువులే’ అంటూ అపరోక్ష అనుభూతిని కలిగిస్తుంది. విశ్వమంతటి కోసం పనిచేసేది దైవమే! ‘నీ దైవత్వాన్ని నువ్వు నిలబెట్టుకో. ఓ మానవ రుషీ! ప్రాణులందరి కోసం నిస్వార్థంగా శ్రమించు’ అని ఆత్మజ్ఞానం హితబోధ చేస్తుంది.

లోపల దివ్యమైన ఆత్మ ఉన్నా, దానికి సంబంధించిన జ్ఞానం పలువురిలో కొరవడటమే బాధాకరం. ఆత్మజ్ఞాన విద్య కోసమే ప్రతి ఒక్కరూ అడుగు ముందుకు వేయాలి. సదా ఆత్మజ్ఞానాన్వేషణ సాగించాలి. ఆత్మ అనేది మానవ శరీరం లోపల కనిపించని ఓ దివ్యత్వ కేంద్రం. దాని ప్రయోజనం ఏమిటో తెలియకుండానే పలువురి జీవితాలు గడిచిపోతాయి. మనిషి మనసులో సాగే నిత్య మథనం కురుక్షేత్రం వంటిది. ఆ యుద్ధంలో కృష్ణుడు వంటి గురువు తారసపడి, జ్ఞానం అనే తాళపు చెవిని అందించాలి. అప్పటికి కానీ, మానవుడి జీవన భాగ్యపు గది తలుపులు తెరుచుకోవు.

గురువు ద్వారా సరైన సమయంలో ఆత్మజ్ఞానాన్ని అభ్యసించాలి. దివ్యమైన ఆ అనుభూతిని అందుకోవాలి. అప్పుడే తల్లిపాలతో పెరిగిన బిడ్డలా ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక పరిపక్వతకు అది దోహదపడుతుంది. భూమిపై నరుడిగా మనిషి లక్ష్యం నెరవేరుతుంది. నారాయణుడి దారిలోకి వెళ్లే మార్గం సుగమమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తీ ఆత్మవిద్యా సంపన్నుడు కావాలి!       - ఆనందసాయి స్వామి
















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list