MohanPublications Print Books Online store clik Here Devullu.com

పంచారామా_Pancharamalu-MohanPublications

శివాయ విష్ణు రూపాయ..

శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే.శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరినీ ద్వేషించినట్టే.ఈ పరమార్థాన్ని చెప్పేవే పంచారామాలు. శివరాత్రి నేపథ్యంలో మనరాష్ట్రంలోని ఈ అయిదు పవిత్ర క్షేత్రాల గురించీ.. మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఓ సారి పార్వతీదేవి పరమ శివుణ్ణి అడిగిందట. అప్పుడు ముక్కంటి...
‘‘ శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ’
అని చెబుతూ.. ‘రామ నామాన్ని మించినది మరొకటి లేదు. ఈ ఒక్క శ్లోకాన్నీ చదివితే సహస్ర నామాలు చదివిన ఫలితం వస్తుంది’ అని సెలవిచ్చాడట.శివ, కేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే పరమేష్ఠి అలా చెప్పాడట.ఇదొక్కటే కాదు..మన పురాణేతి హాసాలు ఎన్నో సందర్భాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
శివకేశవులకుభేదం లేదనీ స్కందపురాణంలోనూ ఉంది.
‘ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః’
అంటే ... శివుని రూపమే విష్ణువు , విష్ణువు రూపమే శివుడు అన్నమాట. అలాంటి శివకేశవుల ఏకత్వానికి ప్రతీకలు పంచారామాలు.
నేను సంహరించలేను: తారకసురుడు పరమశివభక్తుడు తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని సంపాదించాడు. ఆ వర గర్వంతో దేవలోకం పైకి దండయాత్ర చేసి, ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తారకాసురుణ్ణి సంహరించమని కోరారు. అప్పుడు శ్రీహరి...‘తారకుడు శివభక్తుడు. శివుడి ప్రాణలింగాన్ని సంపాదించినవాడు. అందువల్ల నేను వధించలేను. మీరు శివుణ్ణే ఆశ్రయించండి’అని చెప్పాడు. అప్పుడు దేవతలు శివుడి వద్దకు వెళ్లి శరణువేడారు. ‘ నా ప్రియ భక్తుడైన తారకుణ్ణి నేనుచంపలేను. అలాగని మిమ్మల్ని కాదనలేను. అందుకే... కుమార స్వామి తారకుణ్ణి వధిస్తాడు’ అని చెప్పాడు శివుడు.
షణ్ముఖుడు దేవసేనకు సారథ్యం వహించాడు. తారకుడితో యుద్ధం చేశాడు. కానీ సంహరించలేకపోయాడు. కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు. ‘తారకుడి కంఠంలో నా ప్రాణ లింగం ఉన్నంతవరకూ అతడు చావడు’అని రహస్యాన్ని చెప్పాడు శివుడు. అప్పుడు కుమారస్వామి తారకుడితో మళ్లీ తలపడి, అతడి గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలుకొట్టాడు. శివలింగం అయిదు ముక్కలైంది. ఆ శకలాలు గోదావరి, కృష్ణా తీరాల్లో పడ్డాయి.ఆ ప్రాంతాలే పంచారామాలయ్యాయి. అవే అమరారామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారారామం.
ఈ కథలో శివకేశవుల ఏకత్వం కనిపిస్తుంది. అందుకే శివుడి ప్రాణలింగాన్ని కలిగిన తారకాసురుణ్ణి చంపడానికి శ్రీహరి అంగీకరించడు.శైవక్షేత్రాలైన ఈ పంచారామాల్లో దాదాపు అన్నింటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావడం మరో విశేషం.

ద్రాక్షారామం శివాలయం, విష్ణ్వాలయం రెండింటితో పాటు శక్తిపీఠం కూడా ఉన్న ద్రాక్షారామం దివ్య క్షేత్రం. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ.పురాణ కథ ఆధారంగా ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు. తారకుడి సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిన తరవాత ఈ విషయాన్ని తెలుసుకున్న సప్తర్షులు.. సప్త గోదావరి తీర్థంలో భీమేశ్వరుడికి సుప్రభాత అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్యరుషి యజ్ఞం చేస్తున్నాడు. రుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయనుకున్నాడు. రుషులనూ, గోదావరులనూ వారించాడు. ఉభయపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో తెల్లవారిపోయింది. శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. తరవాత వ్యాసమహర్షి వచ్చారు. రుషులను ఓదార్చి.. తాను అంతర్వాహినిగా సప్తగోదావరులను ఒక పుష్కరిణిలో చేర్చాననీ అది ‘సప్తగోదావరి’గా పిలవబడుతుందనీ, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందనీ చెప్పారు.
ద్రాక్షారామ భీమేశ్వరలింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. అందుకే ఆలయం రెండు అంతస్తుల్లో ఉంది. అభిషేకాదులు పై అంతస్తులోని లింగభాగానికి చేస్తారు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలు,గోడలపై 800 కు పైగా శాసనాలున్నాయి.ఆలయ బాహ్య ప్రాకారం నాలుగు ప్రవేశద్వారాలు గల ఎతైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం త్రికూటాలయం ఉన్నాయి. ఆలయ తూర్పుగోపుర మార్గంలో ధ్వజస్తంభం ముందు రావి, వేప వృక్షాలున్నాయి. ఆ చెట్లనీడలో ఒక శివలింగం, ఒక విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరానారాయణ స్వాములు అని పిలుస్తారు. భీమేశ్వరాలయానికి క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. ద్రాక్షారామ ఆలయంలో ఒక మసీదు కూడా ఉంది. ఇది సయ్యద్‌ షాఖాజీ అనే ముస్లిం గురువుది. భీమేశ్వరాలయం కాకినాడకు 28 కి.మీ దూరంలో ఉంది.

కుమారారామం కుమారారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి సహిత సోమేశ్వరుడు ఉన్నాడు. ఈ స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. శ్రీదేవీ భూదేవీ సమేత జనార్దునుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. క్రీ.శ 892 నుంచి 922 వరకూ పాలించిన తూర్పుచాళుక్యులు సామర్లకోటలో కుమారారామ భీమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఇందులో సుద్దరాయితో తయారైన లింగం కింది అంతస్తు నుంచి రెండో అంతస్తు వరకూ ఉంటుంది. ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమాసమేత మృత్యుంజయ లింగం,నవగ్రహాల గుడి ఉన్నాయి. సామర్లకోట రాజమండ్రి నుంచి సుమారు 60 కి.మీ దూరంలో ఉంది.

క్షీరారామం ఇది పాలకొల్లులో ఉంది. ఇక్కడి శివుడు... క్షీరారామలింగేశ్వరుడు. ఒక కథనం ప్రకారం పంచారామాల్లోని మిగతా నాలుగు క్షేత్రాల్లో శివలింగ శకలాల ప్రతిష్ఠ ఒకే ముహూర్తాన వివిధ దేవతలతో జరిగింది.క్షీరారామంలో లింగాన్ని మాత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడట. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజగోపురం. 9 అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. చివరి అంతస్తు దాకా వెళ్లడానికి లోపలి నుంచి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తుంటుంది. ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలుపెద్ద గోపురం రెండో అంతస్తు నుండి శివలింగం పై పడతాయి. ఈ క్షేత్రం ఏలూరు నుంచి సుమారు 110 కి.మీ దూరంలో ఉంది.

సోమారామం ఇది భీమవరానికి రెండు కి.మీ దూరంలోని గునిపూడిలో ఉంది. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్యరోజు వచ్చేసరికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. ఇక్కడి స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామం అని పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ,అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

అమరారామం శివుడి ఆదేశం ప్రకారం ఇంద్రుడు శివలింగ శకలం పడిన చోటుకు చేరుకున్నాడు. పెరిగిపోతున్న ఆ శివలింగాన్ని కృష్ణాతీరాన అమరావతిలో ప్రతిష్ఠించాడు. ఇక్కడి స్ఫటికలింగం ఎత్తు 16 అడుగులు.శివలింగం చుట్టూ రెండు అంతస్తుంలుంటాయి. అభిషేకాదులు రెండో అంతస్తులోనే చేస్తారు.అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపురసుందరీ దేవి ఆలయాలు , కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు,కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు,నవగ్రహ మండపం,యజ్ఞశాల ఉన్నాయి. మూడో ప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యడి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి.ఈ ఆలయం గుంటూరుకు సుమారు 35 కి.మీ దూరంలో ఉంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list