MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆయుర్వేదం - వేసవికాలం_AYURVEDA

ఆయుర్వేదం - వేసవికాలం  ఎండల్లో... వెన్నెల్లా..! BHAKTIPUSTAKALU

ఆయుర్వేదం - వేసవికాలం 
ఎండల్లో... వెన్నెల్లా..!

‘అబ్బ.. ఏం ఎండరా బాబూ! కాసేపటికే చొక్కంతా చెమటతో తడిసిపోయింది’ ‘మార్చిలోనే ఎండలిలా మండిపోతుంటే ఇక మేలో ఎలా ఉంటాయో.. ఏమో?’ మధ్యాహ్నం వేళ పది నిమిషాలు బయటకు వెళ్లివచ్చినా ఇప్పుడు చాలామంది నోట ఇలాంటి మాటలే వినబడుతున్నాయి. అవును.. వేసవి ఆదిలోనే అదరగొడుతోంది. వేడి, ఉక్కపోతలతో పజలను బెంబేలెత్తిస్తోంది. నిజానికి ఇవే కాదు.. వడదెబ్బ, విరేచనాలు, కామెర్ల వంటి పలు సమస్యలనూ వేసవి మోసుకొస్తుంది. అయితే ఆహార, విహార నియమాలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి నివారణ చర్యగానే కాదు.. చికిత్సలుగానూ ఉపయోగపడగలవని భరోసా ఇస్తోంది. మరి ఈ వేసవిలో ఆయుర్వేదం నీడలో చల్లచల్లగా ఎలా గడపాలో తెలుసుకుందాం.

ఎండకాలంలో పిత్తదోషం తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఈ కాలం పిత్తదోషం గలవారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది.

BHAKTIPUSTAKALU
    భారతీయ సంప్రదాయంలో వాతావరణ పరంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ రుతువులకు ప్రత్యేక ప్రాధాన్యముంది. మనకు సంవత్సరానికి 6 రుతువులు, 2 ఆయణాలు. శిశిర, వసంత, గ్రీష్మ రుతువులతో కూడిన కాలాన్ని ఉత్తరాయణంగానూ.. వర్ష, శరద్‌, హేమంత రుతువులతో కూడిన కాలాన్ని దక్షిణాయణంగానూ విభజించారు. సూర్యుడు మన శరీరానికి అందించే శక్తిని బట్టి ఆయుర్వేదం ఉత్తరాయణాన్ని ఆదానకాలంగా, దక్షిణాయణాన్ని విసర్గ కాలంగానూ పేర్కొంటుంది. విసర్గకాలంలో తన శక్తితో మనకు బలాన్ని అందించే సూర్యుడు.. ఆదానకాలంలో తన తాపంతో మన బలాన్ని గ్రహిస్తుంటాడు. వాతావరణంలో వేడి పెరిగినపుడు ఒంట్లో ద్రవ ధాతువులు పడిపోవటం.. ఫలితంగా బలం తగ్గి నీరసం ముంచుకురావటం, దాహం వేయటం వంటివన్నీ మొదలవుతాయి. శరీరానికి పోషణ కూడా తగ్గుతుంది. అందువల్ల ఆదానకాలంలో శరీరానికి తగిన పోషణ, రక్షణ కల్పించటం మన ధర్మం. సాధారణంగా ఎండకాలం వసంత రుతువులో కొంత మొదలై.. గ్రీష్మరుతువులో విజృంభిస్తుంటుంది. మనం వాతావరణాన్ని నియంత్రించలేం. కానీ ఆహార, విహార నియమాలతో దీని దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవచ్చు. అందువల్ల గ్రీష్మరుతువు రావటానికి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం ఆరంభించాలి. ఆయుర్వేదం ప్రకారం- మన శరీరం త్రిదోషాలు (వాత, పిత్త, కఫ దోషాలు).. సప్త ధాతువుల (రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం) మీద ఆధారపడి ఉంటుంది. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఇవన్నీ సమపాళ్లలో ఉండటం కీలకం. సమాన స్థాయిలో ఉన్నంతవరకూ వాత, పిత్త, కఫాలు ధాతువులుగానూ పనిచేస్తుంటాయి. వికృతి చెందితే దోషాలుగా మారి జబ్బులను తెచ్చిపెడతాయి. ‘ప్రాకృతస్తు బలం శ్లేష్మం’.. అంటే ఒంట్లో శ్లేష్మం (కఫం) సమానంగా ఉన్నట్టయితే బలం చేకూరుతుంది. ఎండకాలంలో శ్లేష్మం వికృతమైపోతుంటుంది. వేడి మూలంగా ఒంట్లో కఫం కరిగిపోయి ద్రవంగా మారుతుంది. ఇది జఠరాగ్నిని చల్లార్చి అగ్నిమాంద్యానికి దారితీస్తుంది. దీంతో ఆకలి తగ్గుతుంది, తిన్నది సరిగా జీర్ణం కాదు. నిజానికి ఒంట్లో తలెత్తే వ్యాధులన్నింటికీ అగ్నిమాంద్యమే మూలమని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఎండకాలంలో అగ్నిమాంద్యం తలెత్తకుండా చూసుకోవటం మరింత అవసరం.

కాలాన్ని బట్టి తిండి 
ఆరోగ్యం విషయంలో ఆయుర్వేదం ఆహార, విహారాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. శరీర పోషణకు ఆహారమే కీలకం. ఇది శుచిగా, రుచిగా ఉంటే ధాతువులను పెంపొందించి, బలాన్ని కలగజేస్తుంది. వేసవిలో అగ్నిమాంద్యం వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి తినే ఆహారం లఘువుగా.. అంటే తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. అలాగే స్నిగ్ధంగానూ (కాస్త జిడ్డుగా) ఉండాలి. శరీరంలో స్నిగ్ధత్వం లేకపోతే రూక్షత్వం (ఎండిపోవటం) వస్తుంది. అందువల్ల కాస్త జిడ్డుగా ఉండే నెయ్యి, నూనె వంటి స్నిగ్ధ పదార్థాలు మితంగా తీసుకోవాలి. ఇవి జఠరాగ్నిని పెంపొందించి, ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడతాయి. షడ్రసాల్లో మధుర (తీయని) రసం బలాన్ని కలగజేస్తుంది. ఇది వేసవిలో మరింత బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మధురంగా ఉండే పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ఎండకాలంలో చల్లటి (హిమం) పానీయాలు, పదార్థాలూ మేలు చేస్తాయి. అయితే ఇవి మరీ చల్లగా, నోరు జివ్వుమనించేలా ఉండకూడదు. దాహం తీరేంత, మనసుకు తృప్తిగా అనిపించేంత చల్లగానే ఉండాలి. చాలా చల్లగా 
ఉండేవి జీర్ణశక్తిని తగ్గిస్తాయి. ఒంట్లో విషతుల్యాలు (ఆమం) పుట్టేలా చేస్తాయి.


ఆహారమే ఔషధం 
ఆహార ద్రవ్యాలే అయినా కూరగాయలు, పండ్ల వంటి వాటిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించటంతో పాటు ఎండకాలం సమస్యలకు చికిత్సలుగానూ ఉపయోగపడతాయి. 
* బచ్చలికూర, కలంబి (క్యాబేజీ), కరివేపాకు, పొట్లకాయ, బీరకాయ, పొన్నగంటి కూర, అరటిపూవు, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ వంటి కూరలు ఎండకాలంలో తీసుకోవటం మంచిది. 
* పండ్లలో- పనస, మేడి (అంజీరా), ద్రాక్ష, ఖర్జూరం, దానిమ్మ, బత్తాయి, బాగా పండిన అరటి పండ్లు మంచివి. చలువ చేస్తుందని చాలామంది పుచ్చకాయ ఎక్కువగా తింటుంటారు. కానీ దీన్ని మితంగా తీసుకోవటమే మంచిది. 
* పేలాల పిండిలో (సత్తు పిండి) పంచదార కలుపుకొని తింటే ఒంటికి చలువ చేస్తుంది. 
* గోధుమలు వేడి చేస్తాయని అనుకుంటుంటారు గానీ ఇది నిజం కాదు. ఎండకాలంలో గోధుమల ఆహారం ప్రశస్తం. అయితే పూరీల వంటివి కాకుండా గోధుమలు, గోధుమరవ్వతో అన్నం, ఉప్మా వంటివి చేసుకోవటం మంచిది. 
* పుల్లటి పెరుగు పిత్తాన్ని పెంచుతుంది. అందువల్ల ఎండకాలంలో పుల్లటి పెరుగు మంచిది కాదు. తీయటి పెరుగునే తీసుకోవాలి. అవసరమైతే పెరుగులో చక్కెర కలిపి తీసుకోవచ్చు. 
* పాలతో చేసిన పాయసాలు తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చటి పాలలో కాసేపు నానబెట్టిన అటుకులు తినటం ఎండకాలంలో చాలా మంచిది.

వ్యాధుల నుంచీ రక్షణ 
ఎండకాలంలో తరచుగా కనబడే సమస్యలు- కామలా, విరేచనాలు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, చెమట కాయలు. వీటిని తగ్గించుకోవటానికి ఎవరికి వారు చేసుకోగదగిన ఔషధాలూ ఉన్నాయి. 
* కామలా: దీన్నే కామెర్లు అంటారు. ఇది పిత్త (ఉష్ణ) దోషంతో వస్తుంది. ఉష్ణ, తీక్ష్ణ గుణాలతో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తం దూషితమై కామలాకు దారితీస్తుంది. ఇందులో దేని మీదా ఆసక్తి ఉండదు. అందుకే ‘కామం లాతీతి కామలా’ (కోరికను తగ్గించేది కామలా) అన్నారు. తిండి తిన బుద్ధి కాదు. పని చేయ బుద్ధి కాదు. ఎప్పుడూ స్తబ్ధుగా కూచుంటారు. దీనికి గుంటగలకరాకు ముద్ద బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేల ఉసిరి మొక్కను పంచాంగాలతో దంచి.. 2-3 గ్రాముల ఉండను తీసుకుంటే కామలా తగ్గుతుంది. గుడూచి (తిప్పతీగె) ముద్ద కూడా మేలు చేస్తుంది. వీటిని విడివిడిగా గానీ కలిపి గానీ తీసుకోవచ్చు. 
* విరేచనాలు: ఇదే అతిసారం. దీంతో ద్రవ ధాతువు ఎక్కువగా బయటకు పోతుంది. శోషత్వం, నీరసానికి దారితీస్తుంది. విరేచనాలను ఆత్యయిక వ్యాధిగా పేర్కొంటుంది ఆయుర్వేదం. అంటే త్వరగా ప్రాణాల మీదికి తెచ్చే జబ్బని అర్థం. అందుకే చికిత్స కూడా సత్వరం గుణం చూపేదిగా ఉండాలని సూచించింది. ఉసిరికాయలను గింజలు తీసేసి.. గుజ్జుగా దంచి.. దాన్ని బొడ్డు చుట్టూ చిన్న కట్ట మాదిరిగా కట్టాలి. అందులో అర అంగుళం లోతు వరకు అల్లం రసాన్ని పోయాలి. దీంతో తీవ్రమైన విరేచనాలు కూడా తగ్గొచ్చు. వాంతులు కూడా అవుతుంటే పానకాలు ఇవ్వటం మంచిది. 
* వడదెబ్బ: ఎండకాలంలో తరచుగా కనిపించే సమస్య. ఇందులో జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. కొందరికి వాంతులు కూడా కావొచ్చు. దీనికి మంచి గంధం దివ్యమైన ఔషధం. ఇది శీతం కావటం వల్ల దప్పికను అణచివేస్తుంది, బలాన్ని కలగజేస్తుంది. మంచి గంధం చెక్కను సాన మీద అరగదీసి చెంచాడు ముద్దను గ్లాసు నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది చికిత్సగానే కాకుండా నివారణగానూ ఉపయోగపడుతుంది. ఎండ పూట బయటకు వెళ్లే ముందు గంధం కలిపిన నీటిని తాగితే వడదెబ్బ బారినపడకుండా చూసుకోవచ్చు. ఇక మంచి గంధాన్ని కొబ్బరి నూనెలో కలిపి ఒంటికి రాసుకుంటే ఎండ తాపం తట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఇది సన్‌ స్క్రీన్‌ లోషన్‌గా పనిచేస్తుందన్నమాట. 
* చర్మ వ్యాధులు, చెమటకాయలు: వీటికి మంచి గంధం ఎంతో ఉపయుక్తం. గంధం మంచి వాసనతో గుబాళిస్తుంది గానీ దీని రసం చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి క్రిమిహరంగా పనిచేసి చర్మవ్యాధులు తగ్గటానికి తోడ్పడుతుంది. కొబ్బరినూనెలో గంధాన్ని కలిపి రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. చెమట వల్ల తలెత్తే వాసనా దూరమవుతుంది. పొంగించిన పటిక పొడి కూడా చర్మవ్యాధులకు బాగా పనికొస్తుంది. ముందుగా శుభ్రంగా కడిగిన పటికను పెనం మీద వేడి చేసి, పొంగించాలి. చల్లారిన తర్వాత దీన్ని పొడిచేసి పెట్టుకోవాలి. ఈ పొడిని చిటికెడు తీసుకొని, గ్లాసు నీటిలో కలిపి తాగితే చర్మవ్యాధులు చాలావరకు తగ్గిపోతాయి. మొండి చర్మవ్యాధులకు ఇది పరమౌషధమనీ చెప్పుకోవచ్చు. మల్లె, జాజి, గులాబీ, చేమంతి వంటి మంచి వాసననిచ్చే పూలరసాన్ని ఒంటికి రాసుకున్నా చెమట దుర్గంధం పోతుంది.

పానీయం ప్రధానం! 
ప్రాణులకు నీరే ప్రాణం (పానీయం ప్రాణిణాం ప్రాణః). ఎండకాలంలో ఒంట్లోంచి అధికంగా బయటకు వెళ్లిపోయేది నీరే. కాబట్టి నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం, ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తుంటే వెంటనే భర్తీ చేసుకోవటం చాలా కీలకం. దీంతోనే చాలావరకు ఎండకాలం సమస్యలను నివారించుకోవచ్చు. గది ఉష్ణోగ్రతలో లేదా కాస్త చల్లగా ఉండే నీటిని తాగటం అన్ని విధాలా మంచిది. అయితే ఒక్క నీరే కాదు. నీటితో చేసే పానీయాలకు, కొన్నిరకాల రసాలకూ ఆయుర్వేదం చాలా ప్రాధాన్యం ఇచ్చింది. 
* పంచసార పానకం: నీటిలో నెయ్యి, పిప్పలి, పచ్చ కర్పూరం, తేనె, పంచదార కలిపి చేసే పానకమిది. ఇది దాహాన్ని, నీరసాన్ని, మంటను తగ్గిస్తుంది. 
* శర్కరోదకం: దీన్ని నీరు, పంచదార, యాలకులు, లవంగం, పచ్చ కర్పూరం.. కొంచెంగా మిరియాలు కలిపి చేస్తారు. ఇది బలం పుంజుకోవటానికి దోహదం చేస్తుంది. 
* శ్రీరామనవమి పానకం: మనకు చిరపరిచితమైన పానకమిది. అయితే పాత బెల్లంతో చేసిన పానకమైతే మరీ శ్రేష్టం. పాత బెల్లం తేలికగా జీర్ణమై, మంచి బలాన్నిస్తుంది. దప్పికను తీరుస్తుంది, చలువ చేస్తుంది. 
(మధుమేహులు ఇలాంటి తీపి పానీయాలను వైద్యులను సంప్రతించి తీసుకోవటం మంచిది) 
* ధాన్యకోదకం: రాత్రిపూట గ్లాసు నీటిలో రెండు చెంచాల ధనియాలు వేసి మర్నాడు పొద్దున తాగితే ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది. ఉదయం పూట ధనియాలు నానేసి ఆ నీటిని రాత్రిపూట కూడా తాగొచ్చు. 
* పాలు: ఎండకాలంలో ఆవు పాలు తీసుకోవటం మంచిది. ఆవు ఈనిన ఏడాది తర్వాత వచ్చే పాలు (తరిపి పాలు) ఇంకా శ్రేష్టం. ఇవి తేలికగా జీర్ణమవుతాయి. లఘువుగా, స్నిగ్ధంగా ఉండే మేక పాలనూ తీసుకోవచ్చు. 
* మజ్జిగ: మూడు పాళ్లు పెరుగు, ఒక వంతు నీరు కలిపి చిలక్కొట్టి చేసిన మజ్జిగ (తక్రం) తేలికగా జీర్ణమవుతుంది. ఆకలిని పెంచుతుంది. అయితే దీన్ని మితంగానే తీసుకోవాలి. సగం పెరుగు, సగం నీళ్లు కలిపి చేసిన మజ్జిగ కూడా మంచిదే. 
* కొబ్బరినీరు: ఇది దాహాన్ని తగ్గించటంతో పాటు ధాతువులనూ పెంచుతుంది. 
* చెరకు రసం: యంత్రం ద్వారా తీసిన చెరకు రసం (యంత్ర నిష్పీడనం) దాహాన్ని పెంచుతుంది. అందువల్ల చెరకు ముక్కలను నమిలి తినటం (దంత నిష్పీడనం) మంచిది. నమిలే సమయంలో లాలాజలంతో కలిసిపోయే రసం దాహాన్ని తగ్గిస్తుంది. చలువ చేస్తుంది. 
* నిమ్మరసం: గ్లాసులో పావు వంతు నిమ్మరసం, మూడొంతుల నీరు కలిపి తాగినా మంచిదే. ఇందులో కాస్త జిలకర పొడి కూడా కలుపుకోవచ్చు. 
* షడంగ పానీయం: ఇది ఔషధ పానీయం. తుంగ ముస్తెలు, పర్పాటకం, ఉసీరం (వట్టివేళ్లు), గంధం, చవ్యం, శొంఠి.. వీటిని రాత్రిపూట నీటిలో నానేసి ఉదయం వడగట్టుకొని పెట్టుకొని కొద్దికొద్దిగా తాగితే ఎండకాలం సమస్యలకు బాగా పనిచేస్తుంది.

విహారమూ కీలకమే 
పిత్త దోషం ఉద్ధృతం కాకుండా విహారపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. 
* ఉదయం పూట స్నానం చేయటానికి ముందు శరీరానికి కొబ్బరి నూనె రాసుకుంటే ఒళ్లు చల్లగా ఉంటుంది. ప్రశాంతత చేకూరుతుంది. 
* ఎరుపు, నారింజ, ముదురు పసుపుపచ్చ, నలుపు దుస్తులు వేడిని పట్టి ఉంచి పిత్తదోషం పెరిగేలా చేస్తాయి. కాబట్టి తెలుపు, నీలం, ఊదా, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం మంచిది. 
* వట్టివేళ్లు, చందనం నానేసిన నీటిలో పలుచటి తెల్లటి తువ్వాలును తడిపి, దాన్ని ఒంటికి చుట్టుకుంటే ఎండ వేడిని బాగా తట్టుకోవచ్చు. 
* వీలైనంత వరకు ఎండలో తిరగకపోవటం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వెడల్పయిన అంచులు గల టోపీ ధరించాలి. తలకు కండువానైనా చుట్టుకోవాలి. 
* యోగాసనాలు, ధ్యానం చేయటం మేలు. వీలైతే చంద్ర నమస్కారాలు కూడా చేయొచ్చు. 
* పిత్తదోషం తగ్గటానికి తోడ్పడే గంధం పూసల దండలు, ముత్యాల దండలు, వెండి నగలు ధరించటం మంచిది. 
* రాత్రి పడుకునే ముందు మాడు మీద, పాదాలకు కొబ్బరినూనె రాసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list