MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇది డెంగీ కాలం! Dengue

ఇది డెంగీ కాలం!
Dengue

కాలాలు మారిపోతున్నాయి. ఏప్రిల్‌, మేలను ఎండా కాలంగా.. జూన్‌ జులైలను వర్షా కాలంగా చెప్పుకున్నట్టే మనం.. కొత్తగా జులై, ఆగస్టు నెలలు వచ్చాయంటే చాలు.. దాన్ని ‘డెంగీ కాలం’గా చెప్పుకోవాల్సిన అగత్యం దాపురించేసింది! గత కొన్నేళ్లుగా జరుగుతున్నది ఇదే. జులై-ఆగస్టు నెలలు రాగానే ఠంచనుగా మన ప్రాంతంలో డెంగీ జ్వరాలు ముసురుకుంటున్నాయి. ఈ కలకలం రేగుతూనే.. ఎప్పటిలా మీడియా హెచ్చరికలు, ప్రభుత్వాల పరుగులు, ఆసుపత్రుల సన్నాహాలు.. అన్నీ షురూ అయిపోతున్నాయిగానీ.. ఈ క్రమంలో మనం నేర్వాల్సిన విషయాలు మాత్రం నేర్వటం లేదన్నది సుస్పష్టం. దోమల సంత, దాంతో పాటే ఏటా డెంగీ బెడద క్రమం తప్పకుండా పలకరిస్తున్నా.. ఈ ముప్పు జులై నుంచి అక్టోబరు వరకూ కునుకు లేకుండా చేస్తూనే ఉన్నా.. ఇప్పటికీ డెంగీ జ్వరాల గురించి మనలో బోలెడన్ని బెంగలు, భయాలు, అపోహలు, అనుమానాలు! డెంగీ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమేగానీ.. దీనిపై కొద్దిగా అవగాహన పెంచుకుంటే అంతగా వణికిపోవాల్సిన పనిలేదు. అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!
దోమ కాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి. 
హఠాత్తుగా తీవ్రజ్వరం  తీవ్రమైన తలనొప్పి  కళ్ల వెనుక నుంచి నొప్పి 
ఒళ్లు-కీళ్ల నొప్పులు  వాంతి వికారం  ఆకలి లేకపోవటం 
... ఇవి ఆరంభ లక్షణాలు.. ఈ జ్వరం రెండుమూడు రోజుల్లో తగ్గుతుంది, కానీ ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.
దోమల సంత గురించి మనలో తెలియనిది ఎవరికి? ఏమాత్రం పరిచయం అక్కర్లేని అనాది శత్రు జీవులివి. కాకపోతే అవి కుట్టినప్పటి మంట కంటే ఆ తర్వాత మొదలయ్యే జబ్బుల తంటాలు ఎక్కువైపోతుండటమే ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య! దోమలు మోసుకొచ్చే మలేరియా, బోదకాలు లాంటి చిరకాల చికాకులకు తోడు కొత్తగా గన్యా, డెంగీ లాంటి జ్వరాల బెడదా పెరిగిపోతుండటం.. ప్రజలను, ప్రభుత్వాలను, వైద్య రంగాన్ని కూడా కలచి వేస్తున్న తాజా పరిణామం. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు విపరీతంగా విస్తరించిపోయాయి. అయితే డెంగీ జ్వరం అని నిర్ధారణ అవుతూనే భయంతో వణికిపోవాల్సిన పనేం లేదు. ఈ జ్వరాన్ని మోసుకొచ్చే దోమ చాలా ప్రత్యేకమైనది. అలాగే ఈ జ్వరానికి సంబంధించిన చికిత్స గురించీ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. డెంగీని సమర్థంగా ఎదుర్కొనేందుకు మనందరం ఈ అవగాహన పెంచుకోవటం చాలా అవసరం.
ఏ లక్షణాలతో జ్వరం వచ్చినా ఒకసారి వైద్యుని సంప్రదించటం, డెంగీ జ్వరమేమో తెలుసుకునేందుకు ‘డెంగీ యాంటిజెన్‌ పరీక్ష (ఎన్‌.ఎస్‌-1) చేయించుకుని నిర్ధారించుకోవటం అవసరం. ఈ పరీక్షలో- జ్వరం వచ్చిన మొదటి రోజే అది డెంగీనో, కాదో కచ్చితంగా నిర్ధారణ అయిపోతుంది!
ఈ దోమ చాలా స్పెషల్‌! 
ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు నొప్పి తెలీదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి... ఇలా డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని ‘టైగర్‌ దోమ’ అనీ అంటారు. వీటిని గుర్తుపట్టటం తేలికే. కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారినపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
తప్పించుకునేదెలా? 
టైగర్‌ దోమ మనం మెలకువగా ఉండే సమయంలోనే, పట్టపగలే కుడుతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా కుడుతుంది. కాబట్టి ఇంట్లోనే కాదు.. స్కూళ్లలో, ఆఫీసుల్లో, బస్సుల్లో, ఆఫీసుల్లో, షాపుల్లో, బ్యాంకుల్లో.. ఇలా మనం బయటకు వెళ్లే అన్నిచోట్లా జాగ్రత్తగా ఉండాలి. 
టైగర్‌ దోమలు ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కాబట్టి మన ఇళ్లు, ఆఫీసులు, స్కూళ్ల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఎక్కడా నీరు చేరకుండా చూడాలి. ఇది కూడా కష్టసాధ్యమైనదేం కాదు. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్‌ గ్లాసుల వాడకం బాగా పెరిగింది. వాడిన తర్వాత వీటిని ఎక్కడబడితే అక్కడ పారేస్తుంటారు. వీటిలో నీరు చేరి, దోమలకు ఆలవాలంగా తయారవుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల వాడి పారేసిన ప్లాస్టిక్‌ గ్లాసులు, నీళ్ల సీసాలు, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, ఖాళీ కుండీల వంటివేమీ లేకుండా చూస్తే చాలు. 
మన పిల్లలు వెళుతున్న స్కూలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం. అవసరమైతే క్లాసు రూముల్లో ముందుగానే మ్యాట్స్‌, కాయిల్స్‌ వంటివి పెట్టాలి. స్కూలుకు పంపేటప్పుడు పిల్లలకు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, సాక్సులు వెయ్యటం మంచిది. ఇది కుదరకపోతే దోమలు కుట్టకుండా కాళ్లూచేతులకు దోమల క్రీములు రాసి పంపాలి. క్లాసుల్లో కూడా- బల్లల కింద నుంచి, డెస్కుల నుంచి, టేబుల్‌ సొరుగుల నుంచి, కర్టెన్ల వెనక నుంచి ఈ దోమలు రేగి కుడుతుంటాయి. అందుకే వీటిని తరచూ శుభ్రం చెయ్యాలి.
జ్వరంలో కాదు, తగ్గేప్పుడు జాగ్రత్త 
డెంగీ వస్తే.. జ్వరం చాలా తీవ్రంగా, 105 వరకూ కూడా రావచ్చు. తలనొప్పి, ఒళ్లు నొప్పలు చాలా ఎక్కువగా ఉండొచ్చు. అయినా డెంగీలో ఇదేమంత ప్రమాదకర దశ కాదు. ఆ మంటల జ్వరం రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే దశ చాలా కీలకం. ఒంటి మీద ఎర్ర మచ్చలు రావటం, ప్లేట్‌లెట్లు పడిపోవటం, బీపీ తగ్గటం వంటివన్నీ ఆరంభమయ్యేది ఇప్పుడే. డెంగీలో ఇది ప్రమాదకరమైన దశ. కాబట్టి డెంగీలో జ్వరం ఉన్నప్పుడు కాదు.. జ్వరం తగ్గుతున్నప్పుడే మరింత శ్రద్ధగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో వైద్యుల సలహా పాటించటం, ఆసుపత్రుల్లో ఉండాలని సూచిస్తే ఉండటం ఉత్తమం. జ్వరం తగ్గాక ఒంటి మీద మచ్చలు వస్తున్నా, తీవ్ర నిస్సత్తువగా ఉన్నా, కాళ్లూ చేతులూ చల్లగా ఉంటున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా.. చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా.. పడుకుని లేవగానే కళ్లు తిరుగుతున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
ప్లేట్‌లెట్ల కంటే ‘ప్లాస్మా’ ముఖ్యం! 
మన సమాజంలో చాలామంది డెంగీ జ్వరం అనగానే.. ప్లేట్‌లెట్లు పడిపోతాయని భయపడుతుంటారు. కానీ నిజానికి దీనికంటే కూడా ప్రమాదకరమైనది- రక్తనాళాల్లో నుంచి ప్లాస్మా లీక్‌ అవుతుండటం! మన రక్తంలో ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్‌లెట్ల వంటివన్నీ కలిసి 45 శాతమే ఉంటాయి. మిగిలిన 55 శాతం ద్రవ పదార్థం ప్లాస్మానే. డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తనాళాల్లో నుంచి ఈ ప్లాస్మా బయటకు.. అంటే కడుపు, వూపిరితిత్తులు, కణజాలాల్లోకి లీక్‌ అయిపోతుంటుంది. దీంతో రక్తం చిక్కబడి, రక్తం పరిమాణం తగ్గి, బీపీ పడిపోతుంది. ఈ స్థితిలో శరీర భాగాలకు తగినంత రక్తం, ఆక్సిజన్‌ అందవు, దీంతో అన్ని అవయవాలు దెబ్బతిని రోగి షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ముంచుకొస్తుంది. డెంగీ జ్వరంతో ఎక్కువగా రోగులు చనిపోయేది ఈ స్థితిలోనే. కాబట్టి మనం కేవలం ప్లేట్‌లెట్లనే పట్టించుకోవటం కాదు... వీరికి ‘హెమటోక్రిట్‌’ పరీక్ష చేసి రక్తం చిక్కబడుతోందా? బీపీ తగ్గిపోతోందా? అన్నది తరచూ చూస్తుండటం చాలా అవసరం. 
20 వేల వరకూ తగ్గినా... 
డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్‌ కణాలు కొంత తగ్గటం సహజం. అయితే ఈ కొద్దిపాటి తగ్గుదలనే ప్రమాద సంకేతంగా భావిస్తూ బయటి నుంచి ప్లేట్‌లెట్లు, రక్తం వంటివి ఎక్కించెయ్యాల్సిన పని లేదు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం డెంగీ బాధితులకు ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం చాలా అరుదుగానే ఎదురవుతుంది. దీన్ని కాస్త వివరంగా చూద్దాం: సాధారణ ఆరోగ్యవంతుల్లో ప్లేట్‌లెట్లు 1.5 నుంచి 4 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య 1 లక్ష కంటే తక్కువకు పడిపోతుంటే అప్రమత్తం కావాలి. ఈ స్థితిలో వైద్యుల పర్యవేక్షణ అవసరం. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు పడిపోతే చాలా జాగ్రత్త అవసరం. ఇది 10 వేల కంటే కూడా తగ్గితే రక్తస్రావం అయిపోవచ్చు.. పళ్లచిగుళ్ల నుంచి, ముక్కు నుంచి, మలమూత్రాల ద్వారా లేదా వాంతిలోకూడా రక్తం రావచ్చు. అందుకే ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉండి ఒంట్లో రక్తస్రావం లక్షణాలు కనబడుతుంటే వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. లేదూ- ఎలాంటి రక్తస్రావం లక్షణాలూ లేకున్నా కూడా వీటి సంఖ్య 10 వేలకంటే తక్కువకు పడిపోతుంటే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. కాబట్టి లక్షకంటే తగ్గగానేనే... ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయంటూ ఆందోళనతో వైద్యులపై ఒత్తిళ్లు పెంచాల్సిన పనిలేదని గుర్తించాలి.
మొదటిసారి ఏ సమస్యా ఉండదు! 
ఎవరికైనా గానీ.. డెంగీ జ్వరం మొదటిసారి వచ్చినప్పుడు అదే తగ్గిపోతుంది, సమస్యలు రావటం అరుదు. డెంగీ వైరస్‌లో నాలుగు రకాల ఉపజాతులున్నాయి. వీటిలో ఒక జాతితో జ్వరం వస్తే జీవితాంతం ఇక ఆ రకం ఉపజాతితో మళ్లీ జ్వరం రాదు. మన శరీరం అందుకు తగిన నిరోధక శక్తిని పెంచుకుంటుంది. కానీ మొదటిసారి ఒక ఉపజాతితో వచ్చి తగ్గిపోయి, రెండోసారి మరో రకం ఉపజాతితో జ్వరం వచ్చినప్పుడే- తీవ్ర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- రక్తస్రావమైపోయే ‘డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌’. అయితే ఇది అందరిలో వచ్చే సమస్య కాదు. డెంగీ బారినపడిన చాలా కొద్దిమంది మాత్రమే ఈ పరిస్థితిలోకి వెళతారు. కాబట్టి డెంగీ అనగానే వణికిపోవాల్సిన పని లేదు, వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన పనీ లేదు. కాకపోతే డెంగీ జ్వరమని అనుమానం వచ్చినప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు డెంగీ అని నిర్ధారించినప్పుడు తరచుగా రక్తం చిక్కదనం తెలుసుకునేందుకు ‘హెమటోక్రిట్‌’ పరీక్ష చేసి చూస్తుంటారు, అది ముఖ్యం. ఒకవేళ ఈ పరీక్షలో చిక్కదనం పెరుగుతున్నట్టు తేలితే సత్వరమే సెలైన్‌ పెట్టటం వంటి వైద్యుల సంరక్షణ అవసరం. అలాగే ప్లేట్‌లెట్‌ కణాలు గణనీయంగా తగ్గిపోతుంటే అప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. ఇటువంటి తక్షణ చర్యలతో ప్రాణ ప్రమాదం తగ్గిపోతుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు అది డెంగీనా? కాదా? అన్నది నిర్ధారణ చేయించుకోవటం, డెంగీ అయితే జ్వరం తగ్గే దశలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. డెంగీలో తీవ్ర సమస్యలన్నీ కూడా సాధారణంగా జ్వరం తగ్గిపోతున్న దశలో, ఒకట్రొండు రోజులు మాత్రమే ఉంటాయి. ఆ రెండు రోజులూ వైద్యుల సంరక్షణలో జాగ్రత్తగా ఉంటే చాలు, తర్వాత ఏ సమస్యా ఉండదు. 
నొప్పులు తగ్గించే మందులు వాడొద్దు! 
సాధారణంగా తీవ్రమైన ఒళ్లునొప్పుల్లాంటి బాధలు తగ్గేందుకు ఐబూప్రోఫెన్‌ వంటి మందులు వాడుతుంటారు. కానీ డెంగీ జ్వరంలో వీటిని వాడకూడదు. కాబట్టి ఈ సీజన్లో జ్వరం వస్తే- జ్వర తీవ్రత తగ్గేందుకు ఒక్క ‘ప్యారాసెటమాల్‌’ తప్పించి మరే మందులూ వాడొద్దు. ముఖ్యంగా ఆస్పిరిన్‌, ఐబూప్రోఫెన్‌, నిముసులైడ్‌, డైక్లోఫెనాక్‌ వంటి నొప్పులు తగ్గించే బిళ్లలు అసలుకే వద్దు. కండరాల్లోకి ఇంజక్షన్లు, స్టిరాయిడ్ల వంటివీ తీసుకోకూడదు. యాంటీబయాటిక్‌, యాంటీవైరల్‌ మందులతో ఎలాంటి ఉపయోగం ఉండదు.
పరీక్షలు అనవసరం అనుకోవద్దు!
డెంగీ కొత్త సమస్యేం కాదు. ప్రపంచవ్యాప్తంగా గత రెండు శతాబ్దాలుగా ఉన్నదే అయినా ఒకప్పుడు అరుదుగా కనబడేది. 1950ల నుంచీ ఆగ్నేయాసియా దేశాల్లో తరచుగా కనబడుతోంది. 1975 నాటికి చాలా దేశాలకు విస్తరించింది. 1980లలో, 1996లో, 2003లో, 2006లో మన దేశంలోని పలు రాష్ట్రాలను వణికించింది, ఇక 2010 నుంచీ ఏటా విజృంభిస్తూనే ఉంది. ముఖ్యంగా ఎండా-వానా ఎక్కువగా ఉండే జులై-అక్టోబర్‌ మధ్య కాలంలో.. దోమలతో పాటే డెంగీ కూడా ప్రబలిపోతోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైంది, ఇప్పుడు పల్లెల్లోనూ కనబడుతోంది. సాధారణ డెంగీ జ్వరమైతే డాక్టర్ల పర్యవేక్షణలో సమస్యను నిర్ధారించి, రోగికి పూర్తి విశ్రాంతి కల్పిస్తూ.. సాధారణ చికిత్స చేస్తే తగ్గిపోతుంది. డెంగీ జ్వరంలో ఒక రకమైన ‘డెంగీ హెమరేజిక్‌ జ్వరం’లోనే ప్రమాదకర సమస్యలు మొదలవుతాయి. మొదటి మూడు రోజుల్లో సాధారణ డెంగీకీ, ఈ ప్రమాదకరమైన రకానికీ తేడా కనిబెట్టటం కష్టం కాబట్టి- ఈ సీజన్లో జ్వరం వస్తే వైద్యులకు చూపించుకుని, వారి సలహా ప్రకారం రక్తపరీక్షలు చేయించుకుని, రోగి పరిస్థితిని ప్రతిరోజూ వైద్యులకు తెలుపుతుండాలి.
వైద్యులపై ఒత్తిడి తేవొద్దు 
ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. వెంటనే ప్లేట్‌లెట్లు లేదా రక్తం ఎక్కించాలని వైద్యులపై ఒత్తిడి తెస్తుంటారు. ఇది సమంజసం కాదు. ప్లేట్‌లెట్లు, రక్తం ఎప్పుడు ఎక్కించాలనేది డాక్టర్‌ నిర్ణయానికే వదిలేయటం మంచిది. అలాగే డాక్టర్లు అనవసరంగా ఎక్కువెక్కువగా రక్తపరీక్షలు చేయిస్తున్నారని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ డెంగీ జ్వరమని నిర్ధారణ అయితే తరచూ రక్తం చిక్కదనం తెలుసుకునేందుకు ‘హెమటోక్రిట్‌/ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌’ పరీక్ష, ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య తగ్గుతోందేమో తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేయిస్తారు. జ్వరం తగ్గిపోతున్న దశలోనే రక్తపరీక్షలు ఎక్కువగా అవసరమవుతాయి. అత్యవసర స్థితి తలెత్తితే వెంటనే చికిత్స ఆరంభించేందుకు ఈ పరీక్షలే కీలకం. కాబట్టి వైద్యులు రోజూ లేదా పరిస్థితిని బట్టి రోజుకు నాలుగైదు సార్లు కూడా ఈ పరీక్షలు చేయిస్తారని గుర్తించాలి!
ప్రమాద సంకేతాలు కీలకం
డెంగీ జ్వర పీడితులు- సమస్యల్లోకి వెళుతున్నప్పుడు దాన్ని కచ్చితంగా పట్టుకోవటం అవసరం. దీని కోసం నిత్యం కచ్చితంగా రక్తపరీక్షలు చేస్తుండాలి. సాధారణంగా ప్లాస్మా లీకేజీ ఎక్కువై అంటే ప్యాక్డ్‌సెల్‌ వాల్యూమ్‌ ఉండాల్సిన దానికంటే 20% పెరిగినా, రక్తస్రావం ఎక్కువ అవుతున్నా, ఏదైనా అవయవం దెబ్బతిన్నా.. దాన్ని ‘సివియర్‌ డెంగీ’ అంటున్నారు. (దీన్నే గతంలో డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌, షాక్‌ సిండ్రోమ్‌ అనేవాళ్లు.) ఇది డెంగీలో చాలా తీవ్రమైన స్థితి. జ్వరం వచ్చిన 3, 4 రోజులకు ఈ స్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. రక్తంలో హెమోగ్లోబిన్‌ శాతం అసాధారణంగా పెరిగితే దీన్ని అనుమానించాలి. వెంటనే వేగంగా సెలైన్‌ ఎక్కించటం ఆరంభించాలి. అందుకే డెంగీ జ్వరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య చూడటం కంటే కూడా హెమటోక్రిట్‌/ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌ పరీక్ష ప్రధానమని గుర్తించాలి. నిజానికి ఇది రక్తంలో హెమోగ్లోబిన్‌ ఎంత ఉందోనని చెప్పేచాలా చిన్నపరీక్ష, ఎక్కడైనా చేస్తారు, అయినా చాలామంది దీనిపై శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి. రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్‌ అవుతూ రక్తం చిక్కబడి, హెమోగ్లోబిన్‌ శాతం పెరిగిపోతుంటే అప్పుడు డెక్స్‌ట్రాన్‌ 40 లేదా ప్లాస్మా ఎక్కించటం గురించి ఆలోచించాలి. రక్తంలో హెమటోక్రిట్‌ సాధారణ స్థాయకి చేరుకుని, కనీసం ఒకటి రెండు రోజులు నిలకడగా ఉంటూ, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు మాత్రమే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాలి.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list