MohanPublications Print Books Online store clik Here Devullu.com

జీఎస్టీ_GST


మినహాయింపు
జీఎస్టీతో వినియోగదారులకు వూరట
పలు నిత్యావసరాలకు పన్ను ఉపశమనం
రాష్ట్ర ఆదాయంలో మాత్రం రూ.2,400 కోట్ల కోత
దేశ ఆర్థిక ముఖచిత్రానికి కొత్తరూపునిచ్చే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలులోకి రావడానికి సర్వం సిద్ధమైంది. తాజాగా కశ్మీర్‌లో రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో కీలకమైన పన్నుల రేట్లు ఖరారయ్యాయి. దీంతో వినియోగదారులకు ఒనగూరే లాభనష్టాలపై స్పష్టత వచ్చింది. స్థూలంగా జీఎస్‌టీతో ప్రజలకు జరిగే మేలే ఎక్కువగా కనిపిస్తోంది. పన్ను భారం నుంచి వారికి ఉపశమనం కలగనుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.2400 కోట్ల మేర కోత పడనుంది. రాష్ట్రంలో ప్రస్తుత వ్యాట్‌ విధానంలో విధించిన పన్ను రేట్లతో... జీఎస్టీ పన్ను రేట్లను పోల్చిచూస్తే వినియోగదారుడికి లబ్ధి చేకూరుతుందని వాణిజ్య పన్ను శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని వస్తువులకు పన్ను మినహాయింపు...
ప్రస్తుతం వ్యాట్‌ విధానంలో 5 శాతం పన్ను విధించిన కొన్ని వస్తువులపై జీఎస్టీ పూర్తి మినహాయింపు ఇచ్చింది. ఈ జాబితాలో కీలకమైన వరి, బియ్యం, గోధుమలు, వాటి ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు, పప్పులు, రొట్టె, అప్పడాలు తదితర వస్తువులు ఉన్నాయి. ఇది ప్రజలకు లాభించే అంశం. రాష్ట్రంలో వ్యాట్‌ మినహాయింపు ఉన్న కొన్ని వస్తువులకు జీఎస్టీ కూడా మినహాయింపు ఇచ్చింది. ఆ జాబితాలో... వ్యవసాయ చేతి పనిముట్లు, దివ్యాంగులు వినియోగించే వస్తువులు, ఆక్వా, పౌల్ట్రీ ఫీడ్‌, తమలపాకులు, ప్రచురించిన పుస్తకాలు, జొన్న, సజ్జ, రాగి, వరుగులు; బార్లీ లాంటి తృణ ధాన్యాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ లాంటి పాల పదార్థాలు, విడిపాలు, వంటచెరకు.. కూరగాయలు, ముడి వూలు, మరమరాలు, ప్యాకింగ్‌ నీరు, తదితరాలున్నాయి.
కొత్త శ్లాబులు
జీఎస్టీ ద్వారా వస్తువులపై పన్ను రేట్లను ప్రధానంగా సున్న, 5, 12, 18, 28%గా నిర్ణయించారు. రాష్ట్ర ప్రధాన వస్తు జాబితాలోని...పేపరు, కాటన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు; నిత్యావసరాల్లో వినియోగించే సాధారణ వస్తువులు, ఎలక్ట్రికల్స్‌; బిస్కట్లు, చాక్లెట్లు లాంటి తినుబండారాలు, ఎలక్ట్రికల్స్‌, కెమికల్స్‌, టింబర్‌, సబ్బులు, డిటర్జెంట్స్‌, ఏరియేటెడ్‌ (ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌) వాటర్‌ తదితర వస్తువుల్లో... ప్రస్తుత రేట్లుతో పోలిస్తే పన్నురేట్లు తక్కువగా నిర్ణయించారు. వ్యాట్‌లో అమలులో ఉన్న 14.5 శాతం పన్నుకు అదనంగా ఎక్సైజ్‌ డ్యూటీ 12.5 శాతం కలపగా మొత్తం పన్ను విలువ 27%కు ఉంది. వినియోగదారుని సంక్షేమం దృష్ట్యా ఆయా వస్తువులను 18%గా జీఎస్టీలో నిర్ణయించారు.
కాగితపు గుజ్జు, పాద రక్షలు, రెడీమేడ్‌ దుస్తులు లాంటి వాటికి ప్రస్తుతం ఐదు శాతం పన్ను విధిస్తున్నారు. ఎక్సైజ్‌ డ్యూటీతో కలిపితే 17.5 శాతం అవుతుంది. ఈ వస్తువులకు 5, 12 శాతం వద్ద జీఎస్టీ రేటు నిర్ణయించారు.
ఎండు మిర్చి, కాటన్‌, కాఫీ, టీ ఉత్పత్తులు, ఖనిజాలు, వంట నూనెలు ప్రస్తుతం 5 శాతం పన్ను పరిధిలో ఉన్నాయి. వీటిపై జీఎస్టీలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇనుము, స్టీల్‌, కంప్యూటర్‌, కంప్యూటర్‌ పరికరాలు, యంత్ర సామగ్రి, ప్లా®స్టిక్‌ ఉత్పత్తులు, హార్డ్‌వేర్‌ వంటి వస్తువులపై ఎక్సైజ్‌, వ్యాట్‌ కలిపి 17.5 శాతం పన్ను ఉండగా.. వాటికి జీఎస్టీలో 18% పన్ను నిర్ణయించారు.
ఎరువులు, మొబైల్‌ ఫోన్లు, మందులు, బొగ్గు పన్నును జీఎస్టీలో 12 శాతంగా నిర్ణయించారు. పెయింట్లు, ఆటోమొబైల్‌, సిమెంటు, సిరామిక్‌ ఉత్పత్తులు, బ్యాటరీలు, ప్లైవుడ్‌, సౌందర్య ఉత్పత్తులు, ఫర్నిచర్‌, గ్రానైట్‌, పాలరాయి, రడీమేడ్‌ కాంక్రీటు లాంటి వస్తువులపై 27 శాతం ఉన్న పన్నును...జీఎస్టీ పరిధిలో 28 శాతంగా నిర్ణయించారు.
పంచదారపై 5 శాతం పన్ను!
భారతదేశం మొత్తం మీద ఒకే పన్ను విధానం కోసం తీసుకొచ్చిన జీఎస్టీ విధానంలో... పంచదారను పన్ను పరిధిలోకి తెచ్చారు. చక్కెరకు వ్యాట్‌ విధానంలో పన్ను మినహాయింపు ఉంది. జీఎస్టీ మాత్రం 5 శాతం పన్ను విధించారు. టెక్స్‌టైల్స్‌పై 12 శాతం పన్ను నిర్ణయించారు.
పన్ను బాధ తగ్గినట్లే..
జీఎస్టీ పన్ను మదింపు ప్రక్రియలో పన్ను మీద పన్ను (ట్యాక్స్‌ ఆన్‌ ట్యాక్స్‌) విధానం ఉండదు. వ్యాట్‌ అమలులో ఉన్న సమయంలో పన్ను విధానాన్ని వస్తువు విలువ, ఆపై ఎక్సైజ్‌ సుంకం కలిపిన తర్వాత వచ్చిన మొత్తానికి వ్యాట్‌ పన్ను రేటుతో మదింపు చేస్తున్నారు. ఉదాహరణకు...ఒక వస్తువు విలువ రూ.100 ఉంటే ..దానిపై ఎక్సయిజ్‌ సుంకం కింద 12.5 శాతాన్ని విధిస్తారు. ఆ మొత్తం రూ.112.50 మీద వ్యాట్‌ 14.5 శాతం మదింపు చేస్తారు. అంటే వస్తువుపై పడిన మొత్తం పన్ను రూ.29కి చేరుతుంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ విధానంలో ఎక్సయిజ్‌, వ్యాట్‌ పన్ను విలువ ఏకీకృతం అవ్వడంతో దాని విలువ పూర్తిగా రూ.28 గానే నిర్థరిస్తున్నారు. నికర పన్ను విలువ జీఎస్టీలో ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యాట్‌ విధానం కంటే తక్కువగానే ఉంటుంది. పైగా అంతర్రాష్ట్ర వ్యాపారం కొనసాగించినప్పటికీ దేశం మొత్తం మీద ఇన్‌పుట్‌ విధానం అమలులో ఉంటుంది. ఇప్పుడు చెల్లిస్తున్న సీఎస్టీ రెండు శాతం పన్ను భారం ఇకపై ఉండబోదు. సర్వీసు విభాగానికి సంబంధించి వస్తువుల రవాణా నిమిత్తం ప్రస్తుతం విధిస్తున్న సర్వీసు టాక్స్‌ 15 శాతం నుంచి 5 శాతానికి గణనీయంగా తగ్గించడం వల్ల వస్తువుల ధరలో ఆ మేరకు తగ్గింపు కనిపిస్తుంది.
సేవా పన్ను...
సేవా పన్ను పరంగా రాష్ట్రానికి సంబంధించి వర్క్స్‌ కాంట్రాక్స్ట్‌, హోటల్‌ లావాదేవీలను సేవలుగా గుర్తించి 18 శాతం పన్ను రేటు ఖరారుచేశారు. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు మద్యం లేకుండా రెస్టారెంటు సర్వీసులు అందిస్తే వారు కేవలం 5 శాతం కాంపొజిషన్‌ స్కీం కింద చెల్లిస్తే సరిపోతుంది. మిగిలినవారు 18 శాతం పన్ను చెల్లించాలి.
హోటల్‌ పరిశ్రమలో ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యాట్‌ పన్ను 14.5 శాతం, సేవా పన్ను 6 శాతం కలిపి మొత్తం 20.5 శాతం కాగా.. జీఎస్టీలో ఈ పన్నును 18 శాతంగానే నిర్థరించారు.
రాష్ట్ర ఆదాయంలో కోత!
2017-18 సంవత్సరానికి వస్తువులపై సుమారుగా రూ. 2,200 కోట్లు, సీఎస్టీ పరంగా రూ.1,200 కోట్లు, రూరల్‌ డెవలప్‌మెంటు సెస్‌ రూపంలో రూ.480 కోట్లు, వినోదపు పన్ను, ఇతరత్రా పన్నుల ద్వారా రూ.50 కోట్ల ఆదాయంలో కోతపడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ఇది రూ.3930 కోట్లు. అయితే సర్వీసు టాక్స్‌ రూపంలో అదనంగా లబ్ధిచేకూరే పన్నుల విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉండొచ్చు. ఈ లెక్కన చూస్తే.. సుమారు రూ.2,400 కోట్ల మేర రాష్ట్ర రెవెన్యూ తగ్గే అవకాశం ఉంది.
జీఎస్టీ నిర్ణయాలు విజయవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... నిర్ణయించిన తక్కువ పన్ను రేటు లబ్ధిని నేరుగా వినియోగదారునికి చేరేలా చేయాలి. విధిగా ప్రతి కొనుగోలుపై బిల్లును తీసుకుంటే ప్రభుత్వానికి, ప్రజలకు పరస్పరం లబ్ధి చేకూరి, తద్వారా ఆర్థిక వ్యవ్థ మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

పన్ను పోటు లేని సేవలు 83
విద్యుత్తు బిల్లులు, టోల్‌గేటు రుసుములపై అదనపు భారం లేదు
ఐపీఎల్‌ మ్యాచ్‌లపై 28 శాతం వడ్డింపు
సీనియర్‌ న్యాయవాదులపైనా తప్పని పన్ను
శ్రీనగర్‌: సామాన్యులకు అవసరమయ్యే సేవలకు పన్ను పరిధి నుంచి మినహాయింపు లభించింది. మొత్తం దాదాపు 500 రకాల సేవలు ఉండగా అందులో 83 రకాల సేవలపై పన్ను వేయకూడదని వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. 13 సేవలు 5 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. అధిక శాతం సేవలకు 12 శాతం, 18 శాతం పన్ను వర్తిస్తుంది. 28 శాతం పన్ను పరిధిలో ఉన్నవి కూడా తక్కువగానే ఉన్నాయి.
ఆటలపై 28 శాతం
ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు, ఇతర ఆటలపై గరిష్ఠ శ్రేణికి చెందిన 28 శాతం పన్ను విధించారు.
థీంపార్కులపైనా ఇంతే శాతం పన్ను ఉంటుంది.
నృత్య ప్రదర్శనలపై 18 శాతం
నృత్య ప్రదర్శనల (సంప్రదాయ, జానపద సహా)పై 18 శాతం పన్ను ఉంటుంది.
నాటకాలు, ఇతర ప్రదర్శనలపైనా ఇంతే శాతం పన్ను ఉంటుంది.
సర్కస్‌ ప్రదర్శనలూ ఇదే పరిధిలోకి వస్తాయి.
అవుట్‌డోర్‌ క్యాటరింగ్‌లో సరఫరా చేసే ఆహార పదార్థాలు, పానీయాలపైనా 18 శాతం పన్ను విధించారు.
మేధో సంపత్తి హక్కుల బదిలీపై 12 శాతం
మేధో సంపత్తి హక్కుల (ఇంటలెక్టువల్‌ ప్రోపర్టీ-ఐపీ) వినియోగానికి తాత్కాలిక అనుమతి ఇచ్చినా, వాటిని శాశ్వతంగా బదిలీ చేసినా 12 శాతం పన్ను చెల్లించాలి.
చిన్న రెస్టారెంట్లకు వెసులుబాటు
రూ.50 లక్షలు, అంతకన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న రెస్టారెంట్లు కాంపోజిషన్‌ స్కీం కింద 5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
టూర్‌ ఆపరేటర్లపై 5 శాతం
టూర్‌ ఆపరేటర్ల సేవలపై 5 శాతం పన్ను విధిస్తారు.
విమానాలు అద్దెకిచ్చినా 5 శాతం పన్ను చెల్లించాలి.
ప్రాంతీయ అనుసంధాన పథకం కింద గుర్తింపు పొందిన విమానాశ్రయాల ద్వారా ప్రయాణిస్తే 5 శాతం పన్ను మాత్రమే ఉంటుంది.
మినహాయింపు పొందిన ప్రధాన సేవలు
విద్యా రంగం వైద్యం పశు వైద్యశాలలు పుణ్యక్షేత్రాల యాత్రలు ధార్మిక సంస్థలు రిజర్వు బ్యాంకు సేవలు *దౌత్య కార్యాలయాల సేవలు కబేళాలు విద్యుత్తు సరఫరా, పంపిణీ టోల్‌ ఆపరేటర్ల సేవలు నివాసం కోసం అద్దెకు ఇచ్చే ఇళ్లు బ్యాంకు డిపాజిట్లు, రుణాలు సీనియర్‌ న్యాయవాదులు.. వ్యాపార సంస్థలకు కాకుండా ఇతరులకు అందించే న్యాయ సేవలపై పన్ను లేదు. (ముందు సంవత్సరంలో రూ.20 లక్షల వరకు టర్నోవర్‌ ఉన్న వ్యాపార సంస్థలకు న్యాయ సలహా ఇచ్చినా పన్ను విధించబోరు.) ప్రజా గ్రంథాలయాలు పుస్తక ప్రచురణ కూరగాయలు, పళ్లను చిల్లర అమ్మకం కోసం ప్యాకింగ్‌ చేయడం, వాటికి ఓ బ్రాండ్‌ పేరు పెట్టడం (అయితే కూరగాయలు, పళ్ల రూపాన్ని మార్చకుండా యథావిధిగా ఉంచాలి) జీఎస్టీ వ్యవహారాలను నిర్వహించే జీఎస్టీ నెట్‌ వర్క్‌ కంపెనీ అందించే సేవలు




















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list