MohanPublications Print Books Online store clik Here Devullu.com

తొలి ఏకాదశి, Akadashi

తొలి ఏకాదశి
Akadashi 


++++++++తొలి ఏకాదశి+++++++
ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.
సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.
పురాణగాథ ప్రకారం- యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.
కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకారపూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో, ‘సింహవతి’ అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ని సంహరించింది. అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకొమ్మన్నాడు. ఆమె- ఏకాదశి తిథిగా, విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.
దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు.
అలాగే ‘సతీ సక్కుబాయి’ తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి, మహావిష్ణువులో ఐక్యం చెందిందట.
దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు.
‘రుక్మాంగదుడు’ స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం.
ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని ‘స్మృతి పురాణం’ చెబుతోంది.
ఈ వర్షరుతువు ఆరంభంలో, సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నదీ పండుగ సంకేతమే.
ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరిస్తుంది. అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది.
ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.
ప్రసన్నత, శాంతి, సాత్విక చింతన, దానధర్మాలు, జ్ఞాన పిపాసలకు తొలి ఏకాదశి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. భగవన్నామస్మరణ ద్వారా మోక్షాసక్తిని పెంపొందింపజేస్తుంది. - చిమ్మపూడి శ్రీరామమూర్తి
------------------------------&--------------------
హిందువులకు అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం.
ఏకాదశినాడు చేసే పూజలు, జపతపాలు, స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్నందిస్తుంది. వ్యాసమహర్షి అందించిన పురాణాలను శౌనకాది మునులందరికీ విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం తెలియజేస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని ‘హరివాసరము’ అని కూడా అంటారు.
పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్ర్తి చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.
మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో దాక్కున్నాడు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపజేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి.
తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి.
ఈ ఆషాడమాసంలోని ఏకాదశే తొలి ఏకాదశి ఎలా అయిందిఅంటే
పూర్వకాలంలో వర్షఋతువే ప్రథమ ఋతువుగా ఆషాఢమాసంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేదట. అలా ఆషాఢంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశినేశయనైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో నిద్రకు ఉపక్రమిస్తాడు. దానివల్ల ఈ ఏకాదశి శయనైకాదశి గా పేర్గాంచింది.
ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు ఆవుల కొట్టాన్ని శుభ్రం చేసి కొట్టం మధ్యలో ముప్ఫైమూడు పద్మాలను వేసి మధ్యలో లక్ష్మీనారాయణులను ఉంచి పూజించాలి. గంధపుష్పాలతో అర్చించాలి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి.
ఓం నమో నారాయణాయ

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list