MohanPublications Print Books Online store clik Here Devullu.com

రుణ త్రయం, Runa Trayam

రుణ త్రయం
Runa Trayam

++++++++++ రుణ త్రయం +++++++++
ఈ సకల చరాచర ప్రపంచంలో మనిషిని మించిన అద్భుతమైన జన్మ మరొకటి లేదు. అందుకే మానవజన్మను సార్థకం చేసుకోవాలి. సంస్కారం, వివేకం, వివేచన వంటి లక్షణాలు కలిగి ఉండటంతో పాటు జీవితాన్ని మరింత చక్కదిద్దుకొనేందుకు తపన పడాలి. మిగిలిన ఇతర జీవుల్లా మనిషి జడత్వంతో ఉండరాదని, యాంత్రికంగా బతుకీడ్చకూడదని భారతీయ వాంగ్మయం చాటుతోంది.
ఔన్నత్యంతో జీవించాలనుకోవడమే మానవజన్మకు సార్థకత ప్రసాదిస్తుంది. ఇతర ప్రాణులతో పోల్చుకుంటే, ఇది అత్యంత దుర్లభమైన జన్మ. అందువల్ల దీన్ని మరపురాని అనుభవాలతో గడపాలి. నిరంతరం గుర్తుండిపోయే అనుభూతుల్ని మనసు నిండా నింపుకోవాలి. చుట్టూ ఉన్నవారికి ఆత్మీయతను, ఆనందాన్ని పంచిపెడుతూ జీవించినప్పుడే ఈ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయి.
మానవతా విలువల ద్వారా సామాజిక, సాంస్కృతిక ఉన్నతికి పాటుపడిన మహనీయులు ఎందరో ఉన్నారు. అంతటి సమున్నత వారసత్వాన్ని సమకూర్చిన ఆ పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ప్రకటించడం మన ప్రాథమిక ధర్మం. లోకంలో అటువంటి కృతజ్ఞతలకు అర్హులైనవారు ముగ్గురు! వారినే ‘రుణత్రయం’ అంటారు పెద్దలు. ఆ రుణాలు వరసగా- దేవ రుణం, రుషి రుణం, పితృరుణం.
మన చుట్టూ నేల, నింగి, అగ్ని, నీరు, గాలి అనే పంచభూతాలు ఉన్నాయి. పచ్చదనం ఇచ్చే ప్రకృతి వనరులున్నాయి. ఇవన్నీ మన జీవితాల్ని సుభిక్షం చేస్తున్నాయి. ప్రాణికోటి జీవించడానికి వెలుగులనిచ్చేది సూర్యచంద్రులు. శక్తినిచ్చే అగ్ని, ప్రాణాధారమైన నీరు, వాయువును ప్రసాదించే దేవతా రూపాలకూ మానవులు చేతులు మోడ్చి కృతజ్ఞత తెలియజేయడాన్ని ‘దేవరుణం’గా భావిస్తారు.
ఎందరో మహర్షులు, జిజ్ఞాసువులు తమ దివ్యజ్ఞానంతో ప్రపంచానికి నిర్దిష్ట ధర్మాల్ని బోధించారు. పలు ఆశ్రమ ధర్మాలు నెలకొల్పడం ద్వారా సచ్ఛీలత వెల్లివిరిసేలా చేశారు. సమాజానికి నిరంతర మార్గదర్శకులయ్యారు. వారు అందజేసిన జ్ఞాన పరంపరతో ఉదాత్తంగా జీవించినవారు, అవే విలువలను తరవాతి తరాలకు అందజేయడానికి పడే తపననే ‘రుషి రుణం’ అని పిలుస్తారు. ఆ రుషి రుణం నుంచి విముక్తి కోసం కఠోర నియమావళిని అనుసరించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమ ధర్మం అంటే అదే!
జీవితానికి అర్థ పరమార్థాలు ప్రసాదించిన తల్లిదండ్రులను సేవించడం, తాతముత్తాతలను స్మరించుకోవడమే ‘పితృరుణం’. ఎంత సేవ చేసినా తీర్చుకోలేని రుణం అది. అందులో కొంతైనా తగ్గించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం వల్ల మానవజన్మ పునీతమవుతుందని భారతీయ సంస్కృతి ప్రబోధిస్తుంది.
రుణత్రయ విముక్తికి అత్యంత కఠిన నియమాలు పాటించగలగడమే- బ్రహ్మచర్యం. అది యువ జీవితానికి పథనిర్దేశం చేస్తుంది. సచ్ఛీలత, సత్ప్రవర్తన, సహనశీలత వంటి ఉత్తమ గుణాలను నేర్పించగలుగుతుంది. అలా విజ్ఞాన సంపదను సంపాదించుకోవడమే నవ్య, భవ్య, దివ్య, సుందరమైన జీవితానికి దారితీస్తుంది.
గృహస్థాశ్రమ ధర్మం గురుతరమైనది. ఆ ధర్మాన్ని స్వీకరించడానికి అనేక మెట్లు ఎక్కాలి. ఆ దశలో మొట్టమొదటిది, కఠినతరమైనది బ్రహ్మచర్యం అనే సోపానం! మానవ జీవితంలోని ఒడుదొడుకులు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలను ఆకళింపు చేసుకోగల బ్రహ్మచారికి అనంతర దశ అయిన గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ కష్టతరం కాదు. గురుకుల విద్యాభ్యాసంతో పాటు సదా విజ్ఞాన సముపార్జన, క్రమశిక్షణ, ఏకాగ్రత వంటి కఠిన నియమాలు- త్వరగా జీవితసారం గ్రహించడానికి అతణ్ని సన్నద్ధం చేస్తాయి. ఆ జీవితం అమృతతుల్యంగా ఉంటుంది. మధురతరంగా మారుతుంది. జీవితం అనే మంధర పర్వతాన్ని చిలకడానికి అకుంఠిత దీక్ష కావాలి. ఆ కృషిలో ఎదురయ్యేవాటిని సహనంతో భరించగలిగితే, మానవుడికి అమృతమయ జీవితం సిద్ధిస్తుంది! - తటవర్తి రామచంద్రరావు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list