MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఏకాంతం, Akantham

ఏకాంతం
Akantham

++++++++++++ఏకాంతం+++++++++
ఒంటరిగా, ఎవరి ఆలోచనల్లో వారు స్వేచ్ఛగా ఉండటమే ‘ఏకాంతం’ అని విజ్ఞులు చెబుతారు. కేవలం కవులు, కళాకారులకే ఏకాంతం అవసరమని చాలామంది భావిస్తారు. నిజానికి ప్రతి మనిషీ ఏకాంతాన్ని కోరుకునే సందర్భాలు అనేకం ఉంటాయి.
ఏకాంతంగా ఉండటం మనకు కొత్త శక్తిని ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు కలిగించి, నూతనోత్తేజాన్ని నింపుతుంది.
బాల్యం నుంచీ కవితలు రాసిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆయన ఒక్కరే అప్పట్లో బెంగాల్‌లోని పద్మా నది ఒడ్డున షెలీదా, షాజద్‌పూర్‌లలో పదేళ్లపాటు గడిపారు. ఒక్కరిగానే దైవదర్శనానికి వెళ్లివచ్చేవారు. ఆ ప్రాంతాల్లో ఆయన సాగించిన ఏకాంత జీవితం రచనా వ్యాసంగానికి ఎంతగానో ఉపయోగపడింది. ఆయనను ‘విశ్వకవి’గా మలచింది.
జిడ్డు కృష్ణమూర్తి, చార్లీ చాప్లిన్‌, అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ వంటి మహనీయులు ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. తమవైన ఆలోచనల ద్వారా వారు ఎన్నో కొత్త విషయాలు కనుగొన్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులయ్యారు.
ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలంటే ఏకాంతం తప్పనిసరి. మనిషి అప్పుడు కొత్తకోణంలో ఆలోచిస్తాడు. అతడి వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. తనమీద తనకు నమ్మకం కలిగి మరింత ఆత్మవిశ్వాసంతో లక్ష్యం దిశగా ప్రయాణిస్తాడు. ప్రతికూల పరిస్థితుల్నీ సానుకూలంగా మార్చుకుని విజేతగా నిలబడతాడు.
‘తనను తనలా ఉండనిచ్చేదే ఏకాంతం’ అంటాడు ఓ జర్మన్‌ తత్వవేత్త.
మనిషి సంఘజీవి. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని పెద్దలంటారు. నిత్యజీవితంలో మనిషికి ఎన్నో రకాల సమస్యలు, చీకాకులు, ఒత్తిళ్లు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి అతడు ఏకాంతాన్ని కోరుకుంటాడు. తద్వారా మానసికమైన ప్రశాంతత పొందుతాడు. వ్యక్తిత్వాన్ని ఏకాంతమే పటిష్ఠం చేస్తుంది. మనిషికి మానసిక బలాన్ని అందిస్తుంది. అతడి నుంచి ఒత్తిడిని తరిమేస్తుంది.
జనసమూహంలో ఉన్న మనిషి తన ఆనందాన్ని, దుఃఖాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేడు. అప్పుడు అతడికి ఏకాంతం అవసరమవుతుంది. అదే అతడి కన్నీళ్లు తుడుస్తుంది. మనసును సేదతీరుస్తుంది. ఆశావహ దృక్పథం కలిగించి, అతడి మనసును స్థిమితంగా ఉంచుతుంది.
ఆత్మపరిశీలనకూ ఏకాంతమే దోహదపడుతుంది. అప్పుడే మనలోకి మనం తొంగిచూస్తాం. లోపలికి ప్రవేశిస్తున్న ఆలోచనల్ని గమనించి మసలుకుంటాం. ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాం. చంచలమైన ఆలోచనల్ని అదుపు చేసుకుంటాం. మనసును నిశ్చలంగా ఉంచుకోగలుగుతాం. స్థిర చిత్తం కలిగి, ఎప్పుడూ స్థితప్రజ్ఞతతోనే వ్యవహరించగలుగుతాం.
రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారు. వారు మౌనంగా ఉంటూ, ఏకాంతంలోనే ఎక్కువసేపు గడిపేవారు. ఆ మౌనంలోనే భగవంతుణ్ని దర్శించి, వారు తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు.
ప్రాపంచిక ఆకర్షణల పైకి మనసు మళ్లకుండా చేసేది ఏకాంతమే! అంతేకాక, పరమాత్మ వైపు మనిషి దృష్టి సారించడానికి అది సహాయకారిగా ఉంటుంది. మనసులోని అంధకారాన్ని తొలగిస్తుంది. మనిషి వెలుగు దారిలో నడిచేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఫలితంగా మనిషి అంతర్ముఖుడవుతాడు. అఖండమైన ఆత్మశక్తి పొందుతాడు. ఆధ్యాత్మికత వైపు ప్రయాణం సాగిస్తాడు.
అప్పుడే మనిషిలో స్వీయ అధ్యయనం మొదలవుతుంది. తానేమిటో, తన పనేమిటో, తన వల్ల ఈ సమాజానికి జరగాల్సిన మేలేమిటో అతడు తెలుసుకుంటాడు. మనసులో మానవత్వం నింపుకొని, మహా మనీషిగా మారతాడు!
- విశ్వనాథ రమ


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---







No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list